Sunday, October 31, 2010

వృద్ధులకు రాష్ట్రప్రభుత్వం చేయూత: కొత్త పధకం 'ఆసరా'

హైదరాబాద్,అక్టోబర్ 31:   రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లోని వృద్ధులకు చేయూత నిచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా ‘ఆసరా’ పథకాన్ని నవంబరు 1 నుంచి ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా 7-50 మంది ఒక గ్రూపుగా ఉండేలా 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌లో అమలవుతున్న ఈ ‘ఆసరా’ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారు. రాష్ర్టంలో ఉన్న పట్టణ జనాభాలో 10-15 శాతం వృద్ధులున్నట్లు అధికారులు గుర్తించారు. వీరికి బ్యాంకు లింకేజీలు కల్పించడం, అవసరాన్ని బట్టి రుణాలు ఇప్పించడం వంటివి చేపడతారు. వారి కోసం తరచూ హెల్త్ క్యాంపులు నిర్వహించడం, వ్యాధి తీవ్రతను బట్టి శస్త్ర చికిత్సలు చేయించడం వంటి పనులు చేపడతారు. ఆపదలో ఉన్న వృద్ధులకు పోలీసు రక్షణ , న్యాయ సహాయం అందించడం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తారు. ప్రతి పట్టణంలో 500-600 మంది సీనియర్ సిటిజన్లను ఒక చోటికి చేర్చి, ఈ పథకం గురించి అవగాహన కల్పించాలని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు సూచించింది. వృద్ధులకు ఉండే హక్కులు, బాధ్యత, అవసరాలకు సంబంధించిన అంశాలపై శిక్షణ ఇస్తారు. వీరి కోసం పట్టణ స్థాయిలో భవన నిర్మాణం చేపట్టాలని కూడా నిర్ణయించారు.

భారీ పంట నష్టం...జనజీవనం అస్తవ్యస్తం

. హైదరాబాద్,అక్టోబర్ 31:  ఎన్నడూ లేని విధంగా ఈశాన్య  రుతుపవనాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. వీటికి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా తోడవడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలు రైతుకు ఆందోళన కలిగిస్తున్నాయి.  ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. లక్షలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాలతో రబీ సాగు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గరిష్టంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, విశాఖలో మరొకరు మరణించారు. 
ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా 25వ ఇందిరాగాంధీ జాతీయ సమైక్యతా అవార్డ్ ను    మన్ మోహన్,సోనియా గాంధీ
చేతుల మీదుగా అందుకుంటున్నఎ.ఆర్.రెహ్మాన్ .

రాష్ట్రావతరణ వేళ...రగడ కు సిద్ధమవుతున్న పార్టీలు

Andhra Pradesh Chief Minister K. Rosaiah. File photoహైదరాబాద్,అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం  సందర్భంగా రాష్ట్రంలో పార్టీలన్నీ ప్రాంతాలవారీగా చీలిపోవడంతో ఒక విధమైన వుద్రిక్తత, ఉత్కంఠ  నెలకొన్నాయి.  తెలంగాణలోని వివిధ ప్రజా సంఘాలు వేడుకలను బహిష్కరించేందుకు సిద్ధమవుతుండగా సీమాంధ్ర మాత్రం రాష్ట్రావతరణ వేడుకలకు సర్వ సన్నద్ధమవుతోంది. తెలంగాణవాదుల నుంచి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈసారి నవంబర్ 1ని ఎలాగైనా ఘనంగా నిర్వహించేందుకు కోస్తా, రాయలసీమల్లో పార్టీలకతీతంగా అంతా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నిప్పంటించేందుకు ప్రయత్నించడం, ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, వేడుకల్లో పాల్గొనే మంత్రు లపై దాడులు చేస్తామని తెలంగాణవాదులు హెచ్చరికలు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.హైదరాబాద్ తెలుగు వర్సిటీలోని అమరజీవి విగ్రహానికి నిప్పంటించేందుకు కొందరు ప్రయత్నించడం సీమాంధ్రలో ఆగ్రహావేశాలు రగిల్చింది.  తెలంగాణ జిల్లాల్లో నవంబర్ 1న  విద్యా సంస్థల బంద్‌కు ఉస్మానియా విద్యార్థుల జేఏసీ పిలుపునిచ్చింది. తరగతులు బహిష్కరించాలని విద్యార్థులను కోరింది. నవంబర్ 1ని విద్రోహదినంగా పాటించాలని విజ్ఞప్తి చేసింది.  ఇలావుండగా హైదరాబాద్‌లో వారం రోజుల పాటు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా సభలు, ధర్నాలు, ర్యాలీలు నిర్వహించరాదని నగ ర పోలీసు కమిషనర్ తెలిపారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని  హెచ్చరించారు. కాగా,రాష్ర్ట అవతరణ దినోత్సవాలను అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి కె.రోశయ్య కోరారు. రాష్ట్రం కలిసే ఉండాలా? విభజించాలా? అనే విషయం జస్టిస్ శ్రీకృష్ణ కమిటి పరిశీలనలో ఉందన్నారు. ఆ కమిటీ నివేదిక వచ్చేంతవరకు వేచి ఉందామని ఆయన అన్నారు.  రాష్ట్ర విభజన కోరుకునేవారి చర్యలు రెచ్చగొట్టేవిధంగా ఉండకూడదని హితవు పలికారు.

Saturday, October 30, 2010



rain
నెల్లూరులో వర్షం వరదలో చిక్కుకున్న బస్సు  
 


 

వానల జోరు...రైతన్నల బేజారు...

హైదరాబాద్,అక్టోబర్ 30: రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కూడా ఈ రుతుపవనాలకు తోడవడంతో గత రెండ్రోజులుగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మూడ్రోజుల నుంచి కురుస్తున్న కుండపోత వానతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించింది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. జిల్లాలో గోడ కూలి ఒకరు, చలిగాలులకు తట్టుకోలేక మరొకరు చనిపోయారు. నెల్లూరులో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల విస్తారంగా, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు, తెలంగాణలో కొన్నిచోట్ల మోస్తరు వానలు కురవొచ్చని తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. కోస్తాలో ఆలస్యంగా వేసిన వరినాట్లు ప్రస్తుతం పొట్ట దశలో ఉన్నాయి. ఈ సమయంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో పంట తెగుళ్లబారిన పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల కంకులు కట్టిన వరిచేలు నేలకొరిగాయి. కాయకొచ్చిన పత్తి పంట కూడా ఈ వర్షంతో కుళ్లిపోయే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు. నెల్లూరు, కృష్ణా, చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి

సిలికాన్ వ్యాలీలో సత్యదేవుని వ్రతాలు

శాన్ ఫ్రాన్సిస్కో,అక్టోబర్ 30: అమెరికాలో సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో సత్యదేవుని వ్రతాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత కాలమాన ప్రకారం శనివారం ఉదయం ఏడు గంటలకు(అమెరికాలో శుక్రవారం సాయంత్రం 6.30కు) సాన్‌జోస్ సమీపంలోని మిల్పిటాస్‌లోని సత్యనారాయణస్వామి ఆలయంలో వ్రతాలు ప్రారంభించారు. సత్యదేవుడు, అమ్మవార్ల విగ్రహాలతో సత్యనారాయణ స్వామి ఆలయానికి చేరుకున్న అన్నవరం బృందానికి ఆలయ ప్రధానార్చకుడు మారేపల్లి నాగవెంకటశాస్ర్తి ఆధ్వర్యంలో అక్కడ పండితులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని మండపంలో స్వామి,అమ్మవార్లను ఉంచి అన్నవరం బృందం ప్రత్యేకపూజలు నిర్వహించారు. తర్వాత స్వామివారి వ్రతాలు ప్రారంభమయ్యాయి.

ఆడిటోరియం నిర్మాణం యోచనకు సుబ్బిరామిరెడ్డి స్వస్తి

న్యూఢిల్లీ,అక్టోబర్ 30: హైదరాబాద్‌లోని తెలుగు లలిత కళాతోరణం వద్ద ఆధునిక ఆడిటోరియం కట్టించి ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వాలన్న యోచనను మార్చుకున్నానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి తెలిపారు. లలిత కళాతోరణాన్ని అలాగే ఉంచాలని సమాజంలోని వివిధ వర్గాలవారి నుంచి వ్యక్తమైన అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. తెలుగు లలిత కళాతోరణానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టాలని తాను కోరానంటూ పెద్ద ఎత్తున వివాదం రేగిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు. నగరంలో మరోచోట ఎక్కడైనా సరే స్థలం ఇస్తే ఆడిటోరియం కట్టి ఇవ్వటానికి తాను సిద్ధమేనని చెప్పానని తెలిపారు. ఆడిటోరియం పేరు గురించి చాలా మంది అపార్థం చేసుకున్నారని, అసలు వివాదం పేరు మార్పు గురించి కాదని, ఓపెన్ ఆడిటోరియాన్ని అలాగే ఉంచాలన్నదే అందరి అభిమతమని వ్యాఖ్యానించారు. ‘లలితకళా తోరణానికి రాజీవ్ పేరు పెట్టటాన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు కదా.. మరి పేరు లేకుండా ఆడిటోరియం కట్టించి ఇవ్వటానికి అంగీకరిస్తారా?’ అని అడిగిన ప్రశ్నలకు నేను నా పేరు పెట్టమనలేదు. నాకిష్టమైన నాయకుడు రాజీవ్ పేరు పెట్టాలని కోరాను. అది తప్పెలా అవుతుంది?’’ అని ప్రశ్నించారు.

మహేష్ బాబు తో మణిరత్నం సినిమా?

చెన్నై: ఇటీవలే రావణన్ చిత్రాన్ని కోలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ నటీనటుల సమ్మేళనంతో తెరకెక్కించిన దర్శకుడు మణిరత్నం... తాజాగా మరో చరిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతున్నారట. యంతిరన్(రోబో)ను నిర్మించిన సన్ పిక్చర్స్ సంస్థ ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. తమిళ్, తెలుగు భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రంలో తమిళ్‌లో విక్రమ్, తెలుగులో మహేష్ బాబు హీరోలుగా నటిస్తారని తెలిసింది.
Alexandria Mills of the United States reacts after being crowned as winner of the 2010 Miss World pageant in Sanya, China on Saturday.
మిస్ వరల్డ్-2010 గా ఎన్నికైన అమెరికా సుందరి అలెగ్జాండ్రియా మిల్స్ (18)

ఏఐసీసీ భేటీకి రాష్ట్రం నుంచి 141 మంది: ఆహ్వానం అందని సురేఖ,మారెప్ప

హైదరాబాద్,అక్టోబర్ 30: నవంబర్ 2వ తేదీన ఢిల్లీలో జరిగే ఏఐసీసీ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా రాష్ట్రం నుంచి 141 మంది ఏఐసీసీ సభ్యులకు ఆహ్వానం పంపారు. వాస్తవానికి రాష్ట్రంలో మొత్తం 158 (74 మంది కో-ఆప్టెడ్, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి) ఏఐసీసీ సభ్యులున్నారు. వీరిలో డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి, కోనేరు రంగారావు, పర్వతనేని ఉపేంద్ర, ఎం.లక్ష్మీదేవమ్మ మరణించారు. మిగతా 13 మందిలో కేఎస్సార్ మూర్తి, చేగొండి హరిరామజోగయ్య, బి.వేదవ్యాస్, గొర్లె హరిబాబునాయుడు పార్టీ మారారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న శాసస సభ స్పీకర్ ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, ఏపీపీఎస్సీ సభ్యురాలు జె.మల్లిక వంటి వారికి ఆహ్వానాలు పంపలేదు.
పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలనలో ఉన్న వారికీ కూడా ఆహ్వానాలు పంపలేదు. మాజీ మంత్రి కొండా సురేఖ, మూలింటి మారెప్ప తదితరులు ఏఐసీసీ క్రమశిక్షణా కమిటీ పరిశీలనలో ఉన్నందునే వారిని ఆహ్వానించలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నవంబర్ 2న జరిగే ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుల ఎన్నికే ప్రధాన ఎజెండా. అయితే, సీడబ్ల్యూసీకి ఎన్నికలు జరిగే అవకాశమే లేదని తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సభ్యులను నియమించే విశేషాధికారాలను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి కట్టబెడుతూ సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో ఈ సమావేశాల అనంతరం సోనియా అభీష్టం మేరకు సీడబ్ల్యూసీ సభ్యుల నియామకాన్ని చేపడతారు. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే రాష్ట్రంలోని ఏఐసీసీ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. రాష్ట్రంలో ఏఐసీసీ సభ్యుల ఎన్నిక జరగనందున వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. ఇలావుండగా, పార్టీ మేలుకోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న తనకు ఆహ్వానం అందకపోవడంపై కొండా సురేఖ విస్మయం వ్యక్తం చేశారు. యూపీఏ చైర్‌పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి ఆమె నాలుగు పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ప్రజాబలం లేని వృద్ధనేతలు తప్పుడు సలహాలిస్తున్నారని, వారిని నమ్ముకుంటే రాష్ట్రంలో పార్టీ నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.2014లో రాహుల్‌గాంధీని ప్రధానిగా చూసేందుకు రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీని భ్రష్టుపట్టిస్తున్న కేకే, కాకా, వీహెచ్, లగడపాటి, రాయపాటి, దగ్గుబాటి, కావూరి సాంబశివరావు లాంటి నాయకుల పేర్లు ఉంచి ఒక బీసీ మహిళనైన తనను ఆహ్వానించక పోవడంలోని ఆంతర్యం అర్థంకావడం లేదని ఆమె అన్నారు.

తెలంగాణా వుద్యమాలు--నేపధ్యం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు కోస్తా ఆంధ్ర (లేదా ఆంధ్ర లేదా సర్కారు),  రాయలసీమ.. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతోంది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతం నిజాం తన రాజ్యంలోని ప్రాంతాలను రక రకాల కారణాలతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు వున్నాయి. భౌగోళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. దేశంలోనే పొడవైన 7వ నెంబరు, 9వ నెంబరు జాతీయ రహదారులు ఈ ప్రాంతము మీదుగా వెడుతున్నాయి. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా రైలుమార్గాలు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికఅన్నాయి. తెలంగాణా కు దక్షిణమున ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తరమున గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణాన తెలంగాణా , రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలను వేరుచేయుచండగా, ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు జిల్లాలు వున్నాయి. ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి. ఈశాన్య సరిహద్దులో కరీం నగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలున్నాయి. దక్షిణాన మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయాన నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతితూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ ప్రాంతపు సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు. స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలను వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే వుంది. ఈ ప్రాంతం మూడవ శతాబ్దంలో శాతవాహనులు, తరువాత కాకతీయులు, తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పాదూషాలు, నిజాం సుల్తానులు పరిపాలించారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి ఈ ప్రాంతం నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత తెలంగాణా పోలీసు చర్య ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలిసింది. ఈ పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించింది. తరువాత 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే వారితో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు. తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర వుద్యమం వచ్చింది.

                                                       (ఈ వుద్యమాలపై వ్యాసాలు త్వరలో)

సోనియాతో అశోక్ చవాన్ భేటీ: రాజీనామాకు రెడీ

న్యూఢిల్లీ,అక్టోబర్ 30: ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల’ వివాదంలో  మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామాకు సిద్ధపడ్డారు. శనివారం కాంగ్రెస్ అద్యక్షురాలు సోనియా ను కలసిన అశోక్ చవాన్ తన రాజినామా పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆమెకే అప్పగించారు. కాగా,మొత్తం వ్యవహారం పై నివేదిక సమర్పించవలసిందిగా పార్టీ సీనియర్ నాయకులు ప్రణబ్,ఆంటోనిలను సోనియా ఆదేశించినట్టు ఏ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శి జనార్ధన పూజారి మీడియాకు తెలిపారు. నివేదిక అందిన తరువాత సోనియా నిర్ణయం తీసుకంటారని ఆయన చెప్పారు.  ముంబై వుగ్రవాద దాడుల అనంతరం విలాస్ రావ్ దేశ్ ముఖ్ రాజీనామా చేయడంతో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి గా నియమితులైన విషయం తెలిసిందే.  

Friday, October 29, 2010

మహారాష్ర్ట సీఎంకు పదవీ గండం...

ముంబై, అక్టోబర్ 29న్యూస్‌లైన్: ‘ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ ఫ్లాట్ల’ వివాదంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇది ఆయన పదవికి ఎసరు పెట్టే అవకాశముందని వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నుంచి శనివారం ఢిల్లీలో కలవాల్సిందిగా చవాన్‌కు కబురు కూడా అందింది. ముంబై లోని కొలబా ప్రంతంలో కార్గిల్ మ్రుతులకు వుద్దేశించిన ఫ్లాట్లను కొందరు ప్రివేట్ వ్యక్తులు సొంతం చేసుకున్న కుంభకోణంలొ చవాన్ దగ్గరి బంధువు ల పేర్లు బయటకు వచ్చాయి. చవాన్ తీరుపై పార్టీ అధిష్టానం తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు కనిపిస్తోంది. చవాన్‌ను సీఎం పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించే అవకాశముందని అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మరోవైపు శుక్రవారం సాయంత్రం చవాన్ విలేకరులతో మాట్లాడుతూ.. ఆ ప్రాజెక్టుతో తనకు నేరుగా ఎలాంటి సంబంధం లేదన్నారు. సొసైటీలో తన అత్త భగవతితోపాటు మరో ఇద్దరు బంధువుల పేరిట ఉన్న ఫ్లాట్లను తిరిగి ఇచ్చేసినట్టు తెలిపారు. అలాగే మాజీ సైనికాధికారులు సైతం తమ ఫ్లాట్లను వాపసు ఇచ్చేస్తారని చెప్పారు. ఆరోపణల నేపథ్యంలో రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

విదేశీ కార్గో విమానాలపై నిఘా


న్యూయార్క్,అక్టోబర్ 29: ఎమెన్ నుంచి చికాగో వచ్చే కార్గో విమానంలో ప్రేలుడు పదార్ధాలతో కూడిన అనుమానాస్పద ప్యాకేజీని కనుగొనడంతొ  అమెరికా లోని కొన్ని విమానాశ్రయాలలో ఫెడరల్ దర్యాప్తు అధికారులు కార్గో విమానాల తనిఖీలు చేపట్టారు. కాగా,ఇంగ్లండ్ లోని బర్నింగ్ హాం విమానాశ్రయంలో కనుగొన్న  అనుమానాస్పద   ప్యాకేజ్ లోని వస్తువులు హానికరమైనవి కావని నిర్ధారించారు.  నెవార్క్ లిబర్టీ, ఫిలడల్ఫియా ఇంటర్నేషనల్ విమానాశ్రయాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 

ఆసియా క్రీడలకు హరికృష్ణ, హారిక

న్యూఢిల్లీ, అక్టోబర్ 29: వచ్చే నెలలో జరిగే ఆసియా క్రీడలకు ప్రపంచ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి అందుబాటులో ఉండడంలేదని అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధికారులు ప్రకటించారు. ముందుగా ఖరారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం ఆసియా క్రీడలు జరిగే సమయంలో ఆనంద్, హంపి వేర్వేరు టోర్నమెంట్‌లలో బరిలోకి దిగనున్నారు.  ఆనంద్, హంపి ఆడని కారణంగా... ఇటీవల రష్యాలో జరిగిన చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్న జట్లనే ఆసియా క్రీడల్లోనూ ఆడించాలని భారత చెస్ సమాఖ్య నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పెంటేల హరికృష్ణ, ద్రోణవల్లి హారిక భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. నవంబర్ 12 నుంచి 27 వరకు చైనాలోని గ్వాంగ్‌జూలో జరిగే ఆసియా క్రీడల్లో పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్స్‌తోపాటు ర్యాపిడ్ విభాగంలో పోటీలుంటాయి.

పరువునష్టం కేసులో టీవీ9 చానల్‌

ముంబై,అక్టోబర్ 29: టీవీ9 చానల్‌ను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీ (ఏబీసీ)పై  భారీ పరువునష్టం కేసు దాఖలైంది.  టీవీ9 చానల్ తమ టౌన్‌షిప్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రసారం చేస్తున్న వార్తలు తమ పరువుకు భంగం కలిగించేవిగా ఉన్నాయని, ఏబీసీ తమకు రూ. 304 కోట్ల పరిహారం చెల్లించాలని లావాసా కార్పొరేషన్ లిమిటెడ్ పుణేలోని ఓ కోర్టులో పరువునష్టం దావా వేసింది. దీన్ని పరిశీలించిన కోర్టు ఈ వార్తల ప్రసారాలను తాత్కాలికంగా నిలిపేయాలని ఈ నెల 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఎందుకు అమలు చేయరాదో వివరణ ఇవ్వాలంటూ ఏబీసీకి నోటీసునిచ్చింది. నవంబర్ 16లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.పుణే సమీపంలో తాము నిర్మిస్తున్న టౌన్‌షిప్‌పై టీవీ9 అభ్యంతరకర కథనాలను ప్రసారం చేసిందని లావాసా తన పిటిషన్‌లో ఆరోపించింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 1 వరకు సదరు చానల్ ఐదు కథనాలను ప్రసారం చేసిందని, అవి తమ పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంది. రాజకీయ నేతల వాటాలు ఉండడం వల్లే మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుకు భూమిని మంజూరు చేసిందని ఆ కథనాల్లో తప్పుడుగా ప్రసారం చేసిందని పిటిషన్‌లో పేర్కొంది. ప్రాజెక్టు కోసం తాము 9,500 ఎకరాలను మార్కెట్ రేటు చొప్పున ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేశామని తెలిపింది. ప్రజల ప్రయోజనాల కోసం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పర్యాటక రంగానికి లాభాన్ని చేకూర్చడమేకాకుండా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరిగేందుకు కూడా దోహదపడుతుందని పేర్కొంది. 

వైభవంగా వివేక్ ఒబెరాయ్ వివాహం

బెంగళూరు,అక్టోబర్ : ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ వివాహం కర్ణాటక దివంగత మాజీ మంత్రి జీవరాజ్ ఆళ్వా కూతురు ప్రియాంక ఆళ్వాతో  ఇక్కడ వైభవంగా జరిగింది. 28 ఏళ్ల ప్రియాంక బ్రిటన్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్ పట్టా పుచ్చుకున్నారు. నగర శివార్లలోని నాగవారలో ఆళ్వా కుటుంబానికి చెందిన విలాసవంతమైన ఫాం హౌస్‌లో కర్ణాటక, పంజాబీ శైలిలో వివాహం జరిగింది.
A Pink Umbrella Walkathon to fight Breast Cancer organised by Healthcare Global Enterprises near Kanteerava stadium in Bangalore, Karnataka. Photo: Bhagya Prakash K
రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించడానికి బెంగళూరు కంఠీరవ స్టేడియంలో
 హెల్త్ కేర్ గ్లోబల్ సంస్థ నిర్వహించిన గులాబీ గొడుగుల వాక్ ధాన్

ఎట్టకేలకు కొలిక్కి వచ్చిన అలిపిరి కేసు

తిరుపతి,అక్టోబర్ 29: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై అలిపిరి దాడికేసు నిందితులపై నేరం రుజువైందని అడిషనల్ సెషన్స్ కోర్టు నిర్థారించింది. 2003 సంవత్సరంలో చంద్రబాబుపై జరిగిన బాంబుదాడి కేసు విచారణ ఏడేళ్లపాటు కొనసాగింది. మొత్తం 76మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం  తుది తీర్పు వెల్లడించింది. మావోయిస్టు నేత సాగర్ అలియాస్‌పాండురంగారెడ్డితో సహా మరో ముగ్గురిని కోర్టు నిందితులుగా గుర్తించింది. వీరి ఏడేళ్ల జైలుతో పాటు, రెండువేల రూపాయల జరిమానా విధించింది. ఈకేసులో మొత్తం 33మందిని గుర్తించగా పట్టుబడినవారు మాత్రం నలుగురు. వారిలో మావోయిస్టు నేత సాగర్, నారాయణస్వామి, నాగార్జున, గంగిరెడ్డి ఉన్నారు. 

వరుడు మాట తప్పుతున్నాడా?

హైదరాబాద్‌ : సినిమా తెరపై వరుడుగా కనిపించిన అల్లు అర్జున్‌ ఇపుడు నిజంగా పెళ్ళికొడుకవుతున్నాడు. అమ్మాయి హైదరాబాదీ... పేరు స్నేహారెడ్డి... రంగారెడ్డి జిల్లాలో ఉన్న సెయింట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ యజమాని కుమార్తె స్నేహారెడ్డిని బన్నీ లవ్ మారేజ్ చేసుకుంటున్నట్టు సమాచారం. స్నేహారెడ్డి హైదరాబాద్‌లో బీటెక్‌, అమెరికాలో ఎంఎస్‌ చేసింది. గత కొంత కాలంగా లవ్‌ చేసుకుంటున్న వీరు తమ పెళ్ళికి పెద్దల అంగీకారం తీసుకున్నారట. కాగా, వరుడు ఆడియో విడుదల కార్యక్రమంలో అల్లు అర్జున్‌ చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. తాను లవ్‌లో పడలేదని, తన తండ్రి ఎవరిని చేసుకోమన్నా పెళ్లి చేసుకుంటానని చెప్పిన విషయం తెలిసిందే.

1956 నాటి తెలంగాణా కావాలి: కే.సీ.ఆర్.

హైదరాబాద్‌,అక్టోబర్ 29 : తెలంగాణ నుంచి ఇంచు భూమి పోయినా ఊరుకునేది లేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌, నల్గొండ జిల్లాలను కలిపి కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించబోతున్నట్లుగా ఆంగ్ల పత్రికల్లో కథనాలొస్తున్నాయని, ఎవరి ప్రయోజనాలకోసం ఈ పని చేస్తున్నారని శ్రీకృష్ణ కమిటీని, ప్రధాని మన్మోహన్‌ను కేసీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌ లేని తెలంగాణ తలకాయ లేని మొండెం లాంటిదని, తెలంగాణ ప్రజలను తెలంగాణ ప్రజలను గోల్‌మాల్‌ చేసే ప్రక్రియ ఏదో జరుగుతున్నట్లు అనుమానం కలుగుతోందని, అదే కనక జరిగితే ఆ తరువాత ఏమౌతుందో ఎవరూ ఊహించరని కేసీఆర్‌ హెచ్చరించారు. తమకు 1956 నాటి తెలంగాణ కావాలని ఆయన స్పష్టం ఆయ్చేశారు. ఏ ప్రాతిపధికన హైదరాబాద్'ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు.

Thursday, October 28, 2010

ట్యాంక్ బండ్ పై కొమరంభీం విగ్రహానికి ప్రభుత్వం ఒకే

హైదరాబాద్‌,అక్టోబర్ 28 : ట్యాంక్‌బండ్‌పై కొమరంభీమ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. గత కొద్ది రోజులుగా ట్యాంక్‌బండ్‌ విగ్రహాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. కొమరంభీమ్‌ విగ్రహాన్ని పెట్టకపోతే మిగతా విగ్రహాలను కూల్చివేస్తామని, తెలంగాణ ఊసె త్తని శ్రీశ్రీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం... నిజాం నిరంకుశ పాలనపై పోరాడిన కొమరం భీమ్‌ విగ్రహాన్ని ఎందుకు  పెట్టలేదని తెలంగాణవాదులు ఆందోళనకు దిగడంతో ప్రభుత్వం ఈ  నిర్ణయం తీసుకుంది.

కామన్వెల్త్ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ దాడులు

న్యూఢిల్లీ,అక్టోబర్ 28: కామన్వెల్త్ క్రీడల కుంభకోణం కొత్త మలుపు తిరుగుతోంది. క్రీడల నిర్వహణలో నిధుల దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తును ఆదాయపు పన్నుశాఖ వేగవంతం చేసింది. క్రీడలకు సంబంధించి వివిధ పనులు చేసిన కాంట్రాక్టు కంపెనీలపై గురువారం ఐటీ అధికారులు దాడులు చేశారు. 300 మంది అధికారులు దేశవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు చేసి అనేక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

లోటస్ టెంపుల్‌లో సత్యనారాయణ వ్రతం

వాషింగ్టన్,అక్టోబర్ 28:  అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం తలపెట్టిన ‘ అమెరికా వ్రత మహోత్సవ యాత్ర’ వాషింగ్టన్ చేరుకుంది. ఇక్కడి వర్జీనియా ఫెయిర్‌ఫాక్స్‌లో నెలవై వున్నశ్రీ వెంకటేశ్వర లోటస్ టెంపుల్‌లో కొలువుదీర్చిన మూర్తికి తొలుత సంప్రదాయ పూజాధికాలు నిర్వహించారు. అనంతరం పేర్లు నమోదు చేయించుకున్న తెలుగు వారితో పురోహిత బృందం విడతల వారీగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. మరోవిడత మేరీలాండ్‌లో వ్రత మహోత్సవ నిర్వహణ వుంటుందన్నారు. 

ఒబామా భారత పర్యటన ఖరారు

వాషింగ్టన్,అక్టోబర్ 28: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన ఖరారైంది. నవంబర్ 6 నుంచి 9 వరకు ఒబామా సతీసమేతంగా భారత్‌లో పర్యటించనున్నారు. ఒబామా నవంబర్ 6న ముంబైలోని తాజ్ హోటల్‌లో 26/11 మృతులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ముంబై దాడుల బాధితులను ఉద్దేశించి మాట్లాడతారు. తర్వాత గాంధీ మ్యూజియంను సందర్శిస్తారు. అనంతరం అమెరికా-భారత్ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో జరిగే సదస్సుకు హాజరవుతారు. రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాల బలోపేతానికి వాణిజ్యపరంగా ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో చర్చిస్తారు. ఇందులో ప్రసంగించే ముందు భారత్, అమెరికా వ్యాపారవేత్తలతో ఒకసారి, అమెరికా సీఈఓలతో మరోసారి రౌండ్‌టేబుల్ సమావేశంలో ఒబామా పాల్గొంటారు. ఆ రాత్రికి ముంబై తాజ్ హోటల్‌లోనే బసచేస్తారు. మరుసటి రోజు (నవంబర్ 7) ఉదయం స్థానికంగా ఉన్న ఓ పాఠశాలకు వెళ్లి చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకొంటారు. తర్వాత కొంతమంది విశ్వవిద్యాలయం విద్యార్థులతో ముఖాముఖీలో పాల్గొంటారు. అమెరికా-భారత్ సంబంధాలపై వారితో మాట్లాడతారు. అదేరోజు సాయంత్రం ముంబై నుంచి ఢిల్లీ వెడతారు. అక్కడ హుమయూన్ టూంబ్స్‌ను సందర్శిస్తారు. ఆ రాత్రి ఒబామా, మిషెల్‌లు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ దంపతులతో కలిసి ప్రైవేటు డిన్నర్‌కు హాజరవుతారు. నవంబర్ 8న రాజ్‌ఘాట్‌ను సందర్శించడంతో ఢిల్లీలో ఒబామా అధికారిక పర్యటన ప్రారంభమవుతుంది. తర్వాత ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమవుతారు. అది ముగిసిన తర్వాత విలేకరుల సమావేశంలో పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు భారత పార్లమెంటును ఉద్దేశించి ఒబామా ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి మిషెల్ రాకపోవచ్చని సమాచారం. షెడ్యూల్ ప్రకారం 20 నిమిషాల్లోపే ఆయన తన ప్రసంగాన్ని ముగిస్తారు. అనంతరం రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌తో భేటీ అవుతారు. తర్వాత ఒబామా తన గౌరవార్థం భారత ప్రభుత్వం ఇచ్చే విందుకు హాజరవుతారు. నవంబర్ 9న జకార్తా పర్యటనకు బయలుదేరతారు.

70:30 నిష్పత్తిలో డీఎస్సీ పోస్టులు

హైదరాబాద్,అక్టోబర్ 28: : డీఎస్సీ-08 పోస్టులను 70:30 నిష్పత్తిలో భర్తీ చేయనున్నట్టు మాధ్యమిక శాఖ మంత్రి మాణిక్య వరప్రసాద్ తెలిపారు. అడ్వకేట్ జనరల్‌తో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సుమారు 9 వేల మంది డీఈడీ అభ్యర్థులు లబ్ది పొందనున్నారు.

Sania Mirza with her husband Shoaib Malik during the inauguration of JSCA Tennis Academy in Ranchi.
రాంచీ లో టెన్నిస్ అకాడమీ ప్రారంభోత్సవానికీర భర్త షోయబ్ తో కలసి  హాజరైన సానియా మీర్జా 


బీహార్ మూడో దశ పోలింగ్ ప్రశాంతం

పాట్నా,అక్టోబర్ 28: బీహార్ మూడో విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదపు 55 శాతం పోలింగ్ ఇగింది. మూడో దశ ఎన్నికల్లో 48 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఇగింది.  ఇందులో ఐదు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయి. వైశాలి జిల్లాలోని రాఘపూర్ నియోజవర్గంలో ఓటర్లు పడవలపై వచ్చి ఓట్లు వేశారు. మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఆర్జేడీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేశారు.

Wednesday, October 27, 2010

ఫలించిన రష్యా హిందువుల చిరకాల స్వప్నం

మాస్కో,అక్టోబర్ 27: : కృష్ణాలయం నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న రష్యాలోని హిందువుల చిరకాల వాంఛ ఎట్టకేలకు ఫలించింది. ఆలయం కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయిస్తూ రష్యా అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాజధాని మాస్కో శివారులోనినోవోడెన్‌స్కోయ్ ఉన్న వెరెస్కినో గ్రామంలో ఈ స్థలాన్ని కేటాయించారు. మాస్కో మేయర్ వ్లాదిమిర్ రెసిన్ ఇందుకు సంబంధించిన పత్రాలపై గతవారమే సంతకం చేశారు. మాస్కో సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్(మాస్కాన్) ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

రజనీ-కమల్‌+ శంకర్‌=?

చెన్నై: రజనీతో ‘శివాజీ’, తాజాగా ‘రోబో’ చిత్రాలను,కమల్‌హాసన్‌తో ‘భారతీయుడు’ రూపొందించిన సంచలన దర్శకుడు శంకర్‌ తన తాజా చిత్రాన్ని రజనీ-కమల్‌హాసన్‌ల కాంబినేషన్‌లో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట.అపజయమే ఎరుగని దర్శకుడిగా శంకర్‌కున్న క్రేజ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ల గురించి చెప్పేదేముంది .. ఇద్దరూ జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగినవాళ్లే. ఇద్దరూ ఒకేసారి కెరీర్‌ ప్రారంభించినవాళ్లే. కెరీర్‌ తొలినాళ్లలో వీళ్లిద్దరూ కలిసి ఓ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో రీమేక్‌ చేయబడిన ‘ఇది కథ కాదు’ తమిళ మాతృకలో తెలుగులో చిరంజీవి చేసిన క్యారెక్టర్‌ను రజనీకాంత్‌ చేసారు. రెండు భాషల్లోనూ కమల్‌హాసన్‌ నటించారు. ఆ చిత్రం కాకుండా కమల్‌-రజనీ కలిసి మరో రెండు చిత్రాల్లో నటించారు. అవి.. ‘అందమైన అనుభవం’, ‘వయసు పిలిచింది’. ఆ తర్వాత ఇద్దరూ సూపర్‌స్టార్స్‌గా అవతరించారు. రజనీతో పోల్చితే.. ప్రస్తుతం కమల్‌హాసన్‌కున్న స్టార్‌డమ్‌ కాస్తంత తక్కువే అయినా.. ఒక నటుడిగా కమల్‌కున్న ఫాలోయింగ్‌ చిన్నదేమీ కాదు. దక్షిణాదిలోని అన్ని భాషా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్ ప్లస్ శంకర్ కలయికలో ఓ సినిమా రూపొందడమంటే నిజంగా అది పెద్ద సంచలనమే. 

ముంబై, ఢిల్లీ కి మాత్రమే ఒబామా పర్యటన పరిమితం

వాషింగ్టన్,అక్టోబర్ 27:  అసాధరణ భద్రతా యేర్పాట్ల మధ్య అమెరికా అద్యక్షుడు బరక్ ఒబామా  తొలిసారిగా భారత పర్యటన జరపనున్నారు.  ఆయన వెంట భారీ వ్యాపార ప్రతినిధివర్గం ఈ పర్యటనలో పాల్గొంటోంది. నవంబర్ 6,7, తేదీలలో  ముంబై తాజ్ మహల్ హోటల్ లో బస చేయనున్న ఒబామా  ముంబైతో పాటు ఢిల్లీ మాత్రమే సందర్శిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.  నవంబర్ ఆరవ  తేదీ తెల్లవారుఝామున ముంబై చేరుకోనున్న ఒబామా 26/11 వుగ్రవాద  దాడి  మ్రుతుల స్మారక   కార్యక్రమంలో  పాల్గొనడం తో పాటు రెండు దేశాల సి.ఇ.ఓ.ల సమావేశంలో పాల్గొంటారు.ధిల్లీ పర్యటన లొ ఒబామా భారత పార్లమెంట్ లో 20 నిమిషాల సేపు ప్రసంగిస్తారు. పార్లమెంట్‌ భవనంలో ఒబామా గంట సమయాన్ని కేటాయిస్తారు. దేశ వ్యవహారాల గురించి చర్చలు జరుపుతారు. భార్య మిషెల్‌ ఒబామాతో కలసి పార్లమెంట్‌ భవనాన్ని సందర్శిస్తారు. అనంతరం పార్లమెంట్‌లో ఉన్న బంగారు పుస్తకంలో ( గోల్డెన్‌ బుక్‌) సంతకం చేస్తారు. ఒబామా ప్రసంగించే వేదికపై భారత ఉప రాష్టప్రతి హామీద్‌ అన్సారీ స్వాగతోపన్యాసం ఇస్తారు. లోక్‌సభ స్పీకర్‌ మీరా కుమార్‌ అభినందనలు తెలుపుతారు. ఒబామా పక్కనే భారత ప్రధాని మన్మోహన్‌ ఉంటారు.  కాగా, విదేశాంగ మంత్రి హిల్లరీక్లింటన్ ఈ పర్యటనలో పాల్గొనడం లేదు.  

ఐవీ సుబ్బారావు స్థానంలోబన్వర్‌లాల్‌

హైదరాబాద్‌ ,అక్టోబర్ 27: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా బన్వర్‌లాల్‌ నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో  ఉన్న ఐవీ సుబ్బారావు కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. 

Tuesday, October 26, 2010

అరుంధతీరాయ్ సంజాయిషీ

నూఢిల్లీ,అక్టోబర్ 26: తన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుండటంతో అరుంధతీరాయ్ స్పందించా రు. న్యాయం కోసమే తాను అలా మాట్లాడినట్లు పేర్కొన్నా రు. శ్రీనగర్‌లో ఉన్న ఆమె మంగళవారం ఈ మేరకు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ‘ఇటీవల నేను చేసిన వ్యాఖ్యల కారణంగా నన్ను దేశద్రోహం నేరం కింద అరెస్టు చేసే అవకాశం ఉందని పత్రికల్లో వచ్చింది. ఇక్కడి లక్షలాది మంది ప్రజలు ప్రతిరోజూ అనుకునే విషయాన్నే నేను చెప్పాను. నావి భారత్‌ను విచ్ఛిన్నం చేసేవిధంగా ఉన్న అనుచిత ప్రసంగాలని కొన్ని పత్రికలు పేర్కొన్నాయి. కానీ అది సరికాదు. మతం పేరుతో హత్యలు చేస్తున్నవాళ్లు, కార్పొరేట్ కుంభకోణాలకు పాల్పడే వ్యక్తులు, రేపిస్టులు, పేదలను పీక్కుతినే దోపిడీగాళ్లు స్వేచ్ఛగా తిరుగుతున్న ఈ సమాజంలో... న్యాయం కోసం ఎలుగెత్తుతున్నవారి గొంతు నొక్కి, జైలులో పెట్టాలని చూస్తున్న దేశాన్ని చూసి జాలిపడుతున్నాను’ అని అరుంధతి తన లేఖలో పేర్కొన్నారు. గతవారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో వేర్పాటువాదానికి అనుకూలంగా, దేశవిభజనను ప్రోత్సహించే విధంగా వ్యాఖ్యలు చేశారని వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీ, ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌ పై ఆరోపణలు వచ్చాయి. అనంతరం కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని, ఇది చారిత్రక వాస్తవమని, భారత్ కూడా ఈ విషయాన్ని అంగీకరించిందని రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో గిలానీ, రాయ్‌లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

ఇండోనేసియా భూకంపంలో భారీ ప్రాణ నష్టం

జకార్తా,అక్టోబర్ 26: ఇండోనేసియా పశ్చిమ తీరం మరోసారి సునామీ గుప్పిట్లో విలవిల్లాడింది. సునామీ ధాటికి మారుమూల ద్వీపాల్లో 113 మంది మృతిచెందగా, 500 మందికిపైగా గల్లంతయ్యారు. వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. సుమత్రా దీవులకు పశ్చిమంగా సోమవారం రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం కారణంగా మెంతావై ద్వీపసముదాయంలోని పాగాయ్, సిలాబూ ప్రాంతాల్లో సునామీ సంభవించింది. పదడుగుల ఎత్తులో భారీ అలలు ఎగసిపడ్డాయని, వందలాది ఇళ్లు కొట్టుకుపోయాయని ప్రభుత్వ ప్రతినిధి ముజిహార్తో మంగళవారం తెలిపారు. ప్రాణ, ఆస్తినష్టం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన సునామీకి కారణమైన పెను భూకంప కేంద్రం కూడా పశ్చిమ సుమత్రా తీరంలోనే నమోదైంది. నాటి ప్రకృతి బీభత్సంలో 1.70 లక్షల మంది ఇండోనేసియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇండోనేసియా ఖండాంతర శిలాఫలకాలు క్రియాశీలంగా ఉన్న ప్రాంతంలో ఉండడంతో అక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు సంభవిస్తున్నాయి.

నివేదిక రూపకల్పనలో శ్రీకృష్ణ కమిటీ

న్యూఢిల్లీ,అక్టోబర్  26:  డిసెంబర్ 30 లేదా 31న తమ కమిటీ నివేదిక ఇచ్చి తీరుతుందని శ్రీకృష్ణ కమిటీ చైర్మన్ జస్టిస్ శ్రీకృష్ణ స్పష్టం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో తమ అధికారిక కార్యాలయంలో కమిటీ సభ్యులు భేటీ అయ్యారు. ఈ సందర్బంగా.. నివేదిక ఎప్పుడు ఇస్తారని జస్టిస్ శ్రీకృష్ణను ప్రశ్నించగా.. ‘డిసెంబర్ 30 లేదా 31న ఇస్తామని.. అంతకుమించి మాట్లాడేందుకు ఏమీలేదు’ అని బదులిచ్చారు. ఆ తర్వాత కమిటీలో సామాజిక అంశాలను పరిశీలిస్తోన్న సభ్యురాలు రవీందర్‌కౌర్ విలేకరులతో మాట్లాడుతూ.. నిర్దేశిత గడువులోగానే నివేదికను ఇస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాచార క్రోడీకరణ ప్రక్రియ చివరి దశలో ఉందని, డిసెంబర్ 31న నివేదిక ఇచ్చి తీరుతామని వెల్లడించారు. తమ నివేదికను భారత ప్రభుత్వానికి సమర్పించటంతో తమకు అప్పగించిన పని పూర్తవుతుందన్నారు. కమిటీ సభ్య కార్యదర్శి వి.కె.దుగ్గల్ మీడియాతో మాట్లాడుతూ సంతృప్తికర నివేదికను ఇచ్చేందుకు కమిటీ ప్రయత్నిస్తోందని చెప్పారు. ‘‘సంప్రదింపుల ప్రక్రియ అన్ని స్థాయిల్లో పూర్తిచేశాం. వివిధ అంశాలపై నిపుణులతో చర్చించాం. రాష్ట్ర స్థాయిలో దాదాపు వంద సంప్రదింపులు చేశాం. ఇందులో భాగంగా 17 జిల్లాల్లో, 35 గ్రామాల్లోనూ పూర్తిస్థాయి కమిటీ పర్యటించింది. ఇక మిగతా జిల్లాల్లో కమిటీ సభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. రాష్టవ్య్రాప్తంగా ఉన్న పరిస్థితులను లోతుగా అధ్యయనం చేశామని చెప్పగలం. రాష్ట్ర సామాజిక, ఆర్థిక, రాజకీయ భౌగోళిక రూపాన్ని పూర్తి స్థాయిలో అవగతం చేసుకున్నాం’’ అని దుగ్గల్ వివరించారు.  సామాన్యుడు అర్థం చేసుకొనే పరిభాషలోనే తమ నివేదిక ఉంటుందన్నారు. ఇప్పటివరకు గ్రామాల్లో కలిసిన వారిని మినహాయించి దాదాపు 1,200 మందిని కలిశామని దుగ్గల్ తెలిపారు. కమిటీ సందర్శించిన 35 గ్రామాల్లో.. గ్రామానికి 20 మంది చొప్పున 700 మందితో, 17 జిల్లాల్లో జిల్లాకు 25 మంది చొప్పున 400 మందితో మాట్లాడామని తెలిపారు.  

ముంబై తాజ్‌లో బస చేయనున్న ఒబామా: గది అద్దె రోజుకు రు.10లక్షలు



ముంబై, అక్టోబర్ 26: త్వరలో భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బస కోసం ముంబైలోని తాజ్‌మహల్ హోటల్‌లోని ప్రీమియర్ ప్రెసిడెన్షియల్ సూట్‌ను సిద్ధం చేశారు. ఆ గది అద్దె ఒక రోజుకు అక్షరాలా రూ.పది లక్షలు. ఒబామా నవంబర్ 6, 7 తేదీల్లో ఈ హోటల్లో బస చేయనున్నారు. ముంబై విమానాశ్రయం నుంచి ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో నేరుగా హోటల్ పైభాగంలోని హెలిప్యాడ్ వద్ద దిగి హోటల్ గదికి చేరుకుంటారు. ఆయనతోపాటు వచ్చే భద్రతాధికారులు, ఇతర సిబ్బంది కోసం ఇప్పటికే 560 గదులను బుక్ చేశారు. అలాగే తాజ్ ప్రెసిడెంట్‌లో 120 గదులు, ఒబెరాయ్ హోటల్‌లోని 90 గదులు కూడా అమెరికా అధికారుల పేరిట బుక్ఉ. అయ్యాయి. మరోవైపు తాజ్‌మహల్ పరిసరాల్లో బందోబస్తుకు స్వయంగా రంగంలోకి దిగిన యూఎస్ సీక్రెట్ సర్వీస్ అధికారులు హోటల్‌కు ఐదు కిలోమీటర్ల పరిధిలో చిన్న అలికిడి జరిగినా కనిపెట్టే రాడార్లను ఏర్పాటు చేశారు. ఒబామాకు 24 మంది అంగరక్షకులు సిద్ధం గా వున్నారు.

సాకర్‌ జోస్యం చెప్పిన జర్మనీ ఆక్టోపస్‌ మృతి

article-1289549-0A3283A8000005DC-379_634x392

జర్మనీ,అక్టోబర్ 26 : సాకర్‌ విజేత ఎవరో ముందే జోస్యం చెప్పి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న జర్మన్‌ ఆక్టోపస్‌ మృతి చెందింది. ప్రపంచ ఫుట్‌బాల్‌ కప్‌ పోటీల్లోజర్మనీ ఓడిపోతుందని, ఫైనల్లో స్పెయిన్‌ గెలుస్తుందని చెప్పిన పాల్‌ ఆక్టోపస్‌ జోస్యం నిజమయింది. దీంతో పాల్‌కు కోట్లాడి మంది అభిమానలు తయారయ్యారు. ఇపుడు వారంతా విషాదంలో మునిగిపోయారు. ఒక్క ఫుట్‌బాలే కాదు ఇంకా చాలా ఫలితాలను పాల్‌ ముందే చెప్పేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచేది.పాల్‌ అనే పేరున్న ఈ రెండేళ్ల వయసు గల ఎనిమిదికాళ్ల సముద్రజీవికి అభిమానులతో పాటు శత్రువులూ పెరిగారు. జర్మనీ ఆడే మ్యాచ్‌ల ఫలితాలన్నీ కచ్చితంగా అంచనా వేసి చెప్పిన పాల్‌... ప్రపంచవ్యాప్తంగా పెద్ద సెలబ్రిటీ అయింది. ఫుట్ ‌బాల్‌ ఫలితాలను పాల్‌ (ఆక్టోపస్‌) ఊహించడం ఇదే మొదటిసారి కాదు. అది పుట్టిన తొలి రోజుల్లోనే యూరో 2008 ఫలితాలపై జోస్యం చెప్పింది. ఆ టోర్నీలో జర్మనీ ఆడిన మ్యాచ్‌ ల్లో 80 శాతం ఫలితాలను సరిగ్గా ఊహించింది. అయితే నాటి ఫైనల్లో స్పెయిన్‌పై జర్మనీ గెలుస్తుందని చెప్పింది. కాకపోతే జర్మనీ ఓడిపోయింది. ఈసారి ప్రపంచకప్‌ ఆరంభం నుంచి జర్మనీ ఆడే అన్ని మ్యాచ్‌ల ఫలితాలను కచ్చితంగా చెప్పింది. ఒక్కటి కూడా తప్పు కాలేదు. సెమీస్‌లో స్పెయిన్‌ చేతిలో జర్మనీ ఓడిపోతుందని చెప్పినా... యూరో ఫైనల్‌లో తప్పు జోస్యం చెప్పిందని, కాబట్టి ఏం కాదని అభిమానులు కొంత ధైర్యం చెప్పుకున్నారు. కానీ పాల్‌ చెప్పినట్లే ఫలితం వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఆక్టోపస్‌కు ఎంత క్రేజ్‌ వచ్చిందంటే... మ్యాచ్‌ అయిపోగానే 99 శాతం మంది అభిమానులు దీనినే గుర్తు చేసుకున్నారు. ఇంగ్లండ్‌ లో జన్మించిన ఈ ఆక్టోపస్‌ ప్రస్తుతం జర్మనీలో పెరుగుతోంది.
అమెరికాలో పలుచోట్ల కనువిందు చేస్తున్న ఫాల్ కలర్స్

రామలింగరాజు బెయిల్ రద్దు

న్యూఢిల్లీ,అక్టోబర్ 26:  సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మన్ రామలింగరాజు బెయిల్ని  సుప్రీం కోర్టు రద్దు చేసింది. ఆయనతో పాటు మరో అయిదుగురి బెయిల్'ని కూడా కోర్టు రద్దు చేసింది. నవంబర్ 8వ తేదీ లోపు వారు లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది. రామలింగరాజు సాక్షులను ప్రభావితం చేయవచ్చన్న సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. 2011 జూలై 31 నాటికి విచారణ పూర్తి చేయాలని కూడా సుప్రిం కోర్టు నాంపల్లి కోర్టును  ఆదేశించింది.

Monday, October 25, 2010

బ్రిటన్‌లో భారత్ నిపుణులపై ఆంక్షల ఎత్తివేత

లండన్,అక్టోబర్ 25: ఐరోపాయేతర దేశాల నిపుణులను తమ కంపెనీలు ఉద్యోగాల్లో నియమించుకోవడంపై విధించిన ఆంక్షలను ఎత్తివేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ సూచనప్రాయంగా తెలిపారు. నిపుణుల సంఖ్యపై విధించిన పరిమితి గురించి పునరాలోచిస్తామన్నారు. భారత్‌తో పాటు ఈ దేశాలకు చెందిన నిపుణులను ఏడాదికి 24,100 మందిని మాత్రమే నియమించుకోవాలని బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. దీనిపై కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కామెరాన్ సోమవారం ఈ ఆందోళనపై స్పందించారు. ‘వీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల సేవలను వినియోగించుకోడానికి ఇబ్బంది లేకుండా చూస్తాను’ అని హామీ ఇచ్చారు.

తెలంగాణ బిల్లు కోసం ఢిల్లీ వీధికెక్కిన ‘దేశం’

నూఢిల్లీ,అక్టోబర్ 25; ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట నినాదా లతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలనే ముఖ్య డిమాండ్‌ తో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం నాయకులు ఇక్కడి జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వినతిపత్రం ఇవ్వాలనే ఉద్ద్యేశ్యంతో.. ఆమె నివాసం వైపు చొచ్చుకుపోవాలని చూసిన వీరిని స్థానిక పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకులు నాగం జనార్ధన్‌ రెడ్డి , కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్‌ రావు వంటి నేతల నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ నుండి ప్రత్యేక రైలులో ఉదయమే ఇక్కడకు చేరుకున్న వందలాది మంది పార్టీ కార్యకర్తలు ఏపీ భవన్‌ నుండి జంతర్‌మంతర్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. 

ఏడుకొండల వెంకన్న గెటప్ లో రోశయ్య!

 

హైదరాబాద్,అక్టోబర్ 25; పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే బంగారు ఉషారాణి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చిన్నకూరగాయల మార్కెట్ వద్ద ఆమె అభిమానులు ఏర్పాటుచేసిన బ్యానర్ చర్చనీయాంశమైంది. ఫ్లెక్సీబ్యానర్‌లో ఒక వైపున ఉషారాణి ఫొటో ,మరోవైపు శ్రీవెంకటేశ్వరస్వామిని పోలివుండే విధంగా ముఖ్యమంత్రి కె.రోశయ్య ఫొటో ముద్రించారు. శ్రీవెంకటేశ్వరస్వామి కిరీటం, శంఖుచక్రాలు మధ్యలో రోశయ్య ఫొటోను పొందుపర్చారు. ఈ ఫ్లెక్సీ బ్యానర్ సోమవారం ఎలక్ట్రానిక్ మీడియా కంటబడడంతో రాష్టవ్య్రాప్తంగా చ ర్చనీయాంశమైంది. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఆందోళన వ్యక్తమైంది. టీవీలో ప్రచారం కావడంతో బ్యానర్‌ను తొలగించారు.

"ఆరెంజ్" ఆడియో విడుదల


హైదరాబాద్,అక్టోబర్ 25: రాంచరణ్ తేజ హీరో గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అంజనా ప్రొడక్షన్స్ పతాకం పై కె. నాగబాబు నిర్మించిన "ఆరెంజ్" సినిమా ఆడియో విడుదల కార్యక్రమం శిల్ప కళా వేదిక లో వైభవం గా జరిగింది. చిరంజీవి, రామానాయుడు,  అరవింద్,వి.వి.వినాయక్,అల్లు అర్జున్, దానయ్య,హారిష్ జైరాజ్, పరుచూరి వెంకటేశ్వరరఒ, బోయపాటి శీను, బ్రహ్మానందం తదితతరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియా లో వున్న హీరో,హీరొయిన్లు రాంచరణ్, జెనీలియా ఆన్ లైన్ లో మాట్లాడారు. 

ఇండోనేషియాలో భారీభూకంపం: సునామీ ప్రమాదం లేదన్న అధికారులు

జకార్తా,అక్టోబర్ 25: ఇండోనేసియాలోని సుమత్రా దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. భూకంపం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇండోనేసియా కాలమానం ప్రకారం రాత్రి 9.42 గంటలకు(భారత కాలమానం ప్రకారం రాత్రి 8.12 గంటలు) కెపులావువాన్ మెంటావాయ్ ప్రాంతం లో భూఉపరితలానికి 14.2 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం స్థానికంగా సునామీ హెచ్చరిక జారీ చేసి, ఆ తర్వాత ఉపసంహరించింది. భూకంపం వల్ల ఎలాంటి నష్టం సంభవించినట్లు ఇంతవరకు సమాచారమేదీ వెలుగులోకి రాలేదు. అయితే దీనివల్ల భారత్‌కు, అండమాన్ నికోబార్ దీవులకు సునామీ వచ్చే అవకాశాలేవీ లేవని హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కోసిస్) అధికారులు వెల్లడించారు. సునామీ రానున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని వారు చెప్పారు.





            జపాన్ పర్యటనలో వున్న ప్రధాని మన్మోహన్ సింగ్ ఆ దేశ ప్రధాని నాటో కాన్  తో సమావేశమైన ఫొటో                                                      

MATTERS OF SPIRIT: Jackie Shroff in
'మాలిక్ ఏక్' లో షిర్డీ బాబా గా జాకీ ష్రోఫ్   


పరిటాల ఘాట్ ను సందర్శించిన వివేక్ ఒబెరాయ్

అనంతపురం ,అక్టోబర్ 25: రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించిన బాలీవుడ్ హీరో వివేక్ ఒబేరాయ్ సోమవారం అనంతపురం చేరుకున్నాడు. అభిమానులు భారీ కాన్వాయ్‌తో వివేక్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివేక్ అనంతపురం ప్రజలకు నమస్కారం అంటూ తెలుగులో మాట్లాడాడు. పరిటాల రవి పాత్ర పోషించటం సంతృప్తి ఇచ్చిందన్నారు. రక్తచరిత్ర సినిమా ప్రేక్షకాదరణ పొందటం చాలా ఆనందంగా ఉందన్నాడు. వెంకటాపురం గ్రామంలో పరిటాల ఘాట్ ను  వివేక్ ఒబెరాయ్  సందర్శించారు.  రవి సమాధి వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

నవంబర్ 4 నుంచి భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్

ముంబై,అక్టోబర్ 25: భారత్, న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ నవంబర్ 4 నుంచి మొదలవుతుంది. ఈ టెస్ట్ సిరీస్ కు  భారత్ జట్టుని ఎంపిక చేశారు. ధోనీ (కెప్టెన్), సెహ్వాగ్(వైస్ కెప్టెన్), గంభీర్, మురళీ విజయ్, ద్రవిడ్, సచిన్, లక్ష్మణ్, రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్, ప్రజ్క్షా ఓజా, పూజార, అమిత్ మిశ్రా, ఇషాంత్ శర్మ, జహీర్ ఖాన్  లను ఎంపిక చేశారు.

Sunday, October 24, 2010

ఐటీ రంగంలో జోరందుకున్న. నియామకాలు

న్యూఢిల్లీ,అక్టోబర్ 24: భారత ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో రెండంకెల రాబడుల వృద్ధి నమోదు కావడంతో ఈ రంగాల్లో భారీ నియామకాలకు తెర లేవనున్నది. అమెరికా, ఐరోపా మార్కెట్లలో డిమాండ్ పుంజుకోవడంతో టీసీఎస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలు భారీ హైరింగ్ ప్లాన్లకు సిద్ధం అవుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 30 వేల మంది కొత్త ఉద్యోగులను తీసుకోవాలని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గతంలో లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని సవరించి ఆ సంఖ్యను 50 వేలకు పెంచింది. ఇన్ఫోసిస్ కూడా ఇదే విధంగా తన కొత్త ఉద్యోగుల నియామక లక్ష్యాన్ని సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 36 వేల మంది కొత్త వాళ్లను తీసుకోవాలనుకున్న ఈ కంపెనీ తర్వాత దానిని 40 వేలకు పెంచింది. నాలుగేళ్లలో దేశీయ ఐటీ సర్వీసుల మార్కెట్ 1,360 కోట్ల డాలర్లకు చేరుతుందని ప్రముఖ రీసెర్చ్ గ్రూప్ గార్ట్నర్ తెలిపింది. 2009లో 900 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్ 2014 కల్లా 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుందని వివరించింది. ఈ వృద్ధితో చిన్న, మధ్య తరహా దేశీయ ఐటీ కంపెనీలకు మంచి అవకాశాలు లభిస్తాయని పేర్కొంది.
జపాన్ పర్యటనకు వెళ్ళిన  భారత ప్రధాని మన్మోహన్ కు టోక్యో విమానాశ్రయంలో ఘన స్వాగతం

నిరుడు అరకొర...ఈసారి కుండపోత

విశాఖపట్నం,అక్టోబర్ 24 : గత సంవత్సరం కంటే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు భిన్న ప్రభావం చూపాయి. వీటి ప్రభావంతో నిరుడు అరకొర వానలు పడగా, ఈ ఏడాది కుండపోత వర్షాలు కురిశాయి. రాష్ట్రాన్ని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణాలుగా మూడు డివిజన్లుగా విభజించిన వాతావరణ శాఖ, వాటికి సగటు వర్షపాతాన్ని నిర్దేశించింది. ఇందులో నైరుతి రుతుపవనాల సీజను (జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకూ) మొత్తమ్మీద సగటున 574.46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి.అయితే గత సంవత్సరం రాష్టవ్య్రాప్తంగా 439.23 మి.మీల వానతో సగటున 20 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆరంభం నుంచీ ఆశాజనకంగానే ఉన్నాయి. వీటికి మధ్యలో అల్పపీడనాలు కూడా తోడయ్యాయి.రాష్ట్రంలోని మూడు డివిజన్లలోనూ సాధారణానికి మించి వర్షాలు కురిశాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది.

క్రీడాకారుడు,ఆర్చరీ కోచ్ చెరుకూరి లెనిన్ దుర్మరణం



విజయవాడ,అక్టోబర్ 24: భారత క్రీడారంగం ఓ ఆణిముత్యాన్ని కోల్పోయింది. 27 ఏళ్ల వయసులోనే క్రీడాకారుడిగా, ఆర్చరీ కోచ్‌గా అంతర్జాతీయ ఖ్యాతి సాధించిన తెలుగుతేజం చెరుకూరి లెనిన్... విజయవాడ సమీపంలోని జూపూడి గ్రామం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కామన్వెల్త్ క్రీడల్లో లెనిన్ పర్యవేక్షణలో భారత జట్టు రజత పతకం సాధించింది. ఇందుకు గౌరవంగా శనివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొనేందుకు లెనిన్ హైదరాబాద్ వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని స్వస్థలం విజయవాడకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.వారి కరు ఆటోను ధీకొని బోల్తా పడింది. లెనిన్‌తో పాటు కారులో ఉన్న అతడి శిష్యుడు, కామన్వెల్త్ పతక విజేత రితుల్ చటర్జీ ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ సమయంలో కారులో ఉన్న లెనిన్ తండ్రి సత్యనారాయణ, క్రీడాకారుడు కళ్యాణ్ కూడా స్వల్పగాయాలతో బయటపడ్డారు. రెండేళ్ల క్రితమే లెనిన్‌కు వివాహమైంది.

కలిసొచ్చిన వర్షం...వండే సిరీస్ కైవశం

మార్గోవా,అక్టోబర్ 24: ఊహించినట్టే జరిగింది. భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఆదివారం జరగాల్సిన ఆఖరి వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో మూడు వన్డేల సిరీస్ 1-0తో భారత్ వశమయింది. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం చిత్తడిగా మారింది. రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు... మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదానానికి వచ్చిన 27 వేల మంది ప్రేక్షకులు నిరాశగా ఇంటిముఖం పట్టారు. ఇరు జట్ల కెప్టెన్లు మినహా ఆటగాళ్లెవరూ స్టేడియానికే రాలేదు. పెద్ద ఆటగాళ్లు లేక కళతప్పిన వన్డే సిరీస్‌లో... మూడింటికి రెండు మ్యాచ్‌లు రద్దయ్యాయి. కొచ్చి, గోవా వన్డేలు రద్దుకాగా, విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ గెలిచింది. ఈ విజయంతో... 24 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై భారత్ స్వదేశంలో సిరీస్ సాధించినట్లయింది. ఇదే సమయంలో 30 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా జట్టు... భారత్ నుంచి ఒక్క విజయం కూడా లేకుండా వెనక్కు వెళుతోంది. రెండు టెస్టుల సిరీస్‌లో రెండు మ్యాచ్‌లనూ ఓడిన ఆసీస్... వన్డే సిరీస్‌నూ కోల్పోయింది.

An ITBP jawan jumps through rings of fire to display his martial art skills during the force's 49th Raising Day in Panchukla. Photo: PTI
An Indo-Tibetan border police  jawan jumps through rings of fire to display his martial art skills during the force's 49th Raising Day in Panchukla


వర్మ-చిరు కాంబినేషన్?

హైదరాబాద్‌,అక్టోబర్ 24 : టాలీవుడ్‌లో మరో బంపర్‌ కాంబినేషన్‌తో సినిమా రానుందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. చిరంజీవితో సినిమా తీయడానికి ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌వర్మ రెడీ అయినట్లు సమాచారం. చిరంజీవికోసం టైటిల్‌తో సహా స్టోరీ సిద్ధం చేసినట్లు సెన్షేనల్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు. దొర(ది లార్డ్‌) అనే పేరుతో సినిమా తీయనున్నట్లు వర్మ వెల్లడించారు. కాగా... వర్మ డైరెక్షన్‌కు చిరు గ్రీన్‌ సిగ్నలిస్తారా అన్నదే ఇపుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న.


ఇంతకు ముందు చిరుతో చూడాలనివుంది సినిమాను వర్మ మధ్యలోనే ఆపేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్పర్థలు వచ్చినట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, వర్మతో చిరంజీవికి జోడి కుదరడం చాలా కష్టమని, వర్మ మెంటాల్టి చిరుతో సినిమా తీయడానికి అసలు సరిపోదని పీఆర్‌పీ వర్గాలు అంటున్నాయి. రక్తచరిత్ర వివాదాలను జనం మరిచిపోవడానికి వర్మ ఇలాంటి చీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడనే అనుమానాన్ని పీఆర్‌పీ నేతలు వ్యక్తం చేశారు. నేరుగా చిరంజీవితో చర్చించ కుండా ట్విట్టర్‌లో వెల్లడించి మీడియాద్వారా ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో వింత శబ్దాలు

హైదరాబాద్,అక్టోబర్ 24: వనస్థలిపురంలో వింత శబ్దాలు మళ్ళీ వినవచ్చాయి. సచివాలయ కాలనీలో భూమి నుంచి మరోమారు శబ్దాలు వినవచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. రెండు, మూడు రోజులుగా వనస్థలిపురం పరిధిలో భూమి నుంచి వింత శబ్దాలు వెలువడుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనవుతున్నారు. ఎన్‌జిఆర్‌ఐ అధికారులు పరిశీలించి తీవ్రత స్వల్పమేనని, ప్రస్తుతం ప్రమాదం లేదని రిక్టర్‌ స్కేల్‌పై 2 దాటితే భూకంపంగా గుర్తించవచ్చుని నిపుణలు నిర్థారించారు.

బీహార్ రెండో విడత ఎన్నికల్లో 55 శాతం ఒటింగ్

పాట్నా,అక్టోబర్ 24: బీహార్‌లో 45 అసెంబ్లీ స్థానాలకు జరిగిన రెండో విడత ఎన్నికల పోలింగ్  చెదరు మదురు ఘటనలు మినహా  ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. దాదాపు 55 శాతం పోలింగ్ నమోదయిందని, సాంకేతిక కారణాల వలన కొన్ని ప్రాంతాలలో రీపోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం పేర్కొన్నది. 

Saturday, October 23, 2010

భారతీయునికి అమెరికా ‘వైతాళిక’ పురస్కారం

వాషింగ్టన్,akToebar 23; ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో లోపాల్ని ప్రదర్శించి జైలుపాలైన భారతీయ పరిశోధకుడిని అమెరికా అవార్డు  వరించింది.  శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన పౌర స్వేచ్ఛా సంస్థ ‘ఎలక్ట్రానిక్ ఫ్రంటైర్ ఫౌండేషన్’, ఈవీఎం మిషిన్ల భద్రతపై పరిశోధన చేసిన భారతీయుడు హరికృష్ణ ప్రసాద్‌కు 2010 సంవత్సరానికి గానూ పయనీర్ అవార్డును ప్రకటించింది. అంటే తెలుగులో ‘వైతాళికుడు’ అని అర్థం. కాగితపు రహిత ఈవీఎం మిషిన్ల వాడకంలో నిక్షిప్తమయ్యే ఓటుకు రక్షణ లేదని హరిప్రసాద్ పరిశోధించి నిరూపించారు. దీన్ని ప్రజల ముందు కూడా ప్రదర్శించారు. అయితే ఇందుకోసం కలెక్టరేట్‌లో ఈవీఎం మిషిన్‌ను తస్కరించారనే అభియోగంపై ఆయన అరెస్టయ్యారు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన హరిప్రసాద్ ఈ అవార్డు ప్రకటన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలో వివాదంతో ముడిపడిన తన పరిశోధన అమెరికా సంస్థను మెప్పించడం విశేషమేనన్నారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇంతుకుముందు వరల్డ్‌వైడ్‌వెబ్ (డబ్యుడబ్యుడబ్యు) రూపకర్త టిమ్ బెర్నర్స్-లి, భద్రతా నిపుణుడు బ్రూస్ షినర్, మోజిల్లా సెర్చింజిన్, దాని చైర్మన్ మిచెల్ బేకర్ తదితర ప్రముఖులు అందుకున్నారు. సాంకేతిక రంగంలో విశిష్ట పరిశోధనలు నిర్వహంచిన వారికి 1992 నుంచి ఏటా ఈ అవార్డులను అందజేస్తున్నారు. తాజాగా హరిప్రసాద్ ఈ అవార్డుకు ఎంపికయ్యారు. నవంబర్ 8న జరిగే ఒక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకుంటారు.

న్యూజెర్సీలో ‘సత్య’దేవుని వ్రతం




న్యూజెర్సీ,అక్టోబర్ 23: అన్నవరం దేవుడు అమెరికా చేరుకున్నాడు. చెంతకొచ్చిన స్వామి ముంగిట న్యూజెర్సీ తెలుగువారు నోము నోచుకున్నారు. అమెరికాలోని తొమ్మిది నగరాల్లో అన్నవరం దేవస్థానం తలపెట్టిన సత్యనారాయణ స్వామి సామూహిక వ్రత మహోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి విడతగా న్యూజెర్సీలో వ్రత నిర్వహణ బృందం శాస్త్రోక్తమైన పూజతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.న్యూజెర్సీ గురువాయురప్ప దేవాలయంలో సత్యనారాయణ స్వామికి ‘స్తపన’, ‘అభిషేకం’ నిర్వహించారు. ఈ వ్రతంలో పాల్గొనేందుకు 300 మంది పేర్లు నమోదు చేసుకున్నారని, రానున్న రెండు రోజుల్లో మరో 150 మంది వరకూ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉన్నదన్నారు.అమెరికాలో సత్యనారాయణ స్వామి వ్రత మహోత్సవానికి అవసరమైన పూజాద్రవ్యాలు, ఇతర సామాగ్రితో క్షేమంగా చేరుకున్నట్లు ఇద్దరు అధికారులు, ఆరుగురు పురోహితులతో కూడిన కార్యక్రమ నిర్వహణ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ అధికారి రామచంద్ర మోహన్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

భారతీయులకు ఇక ఆహార భద్రత

న్యూఢిల్లీ,అక్టోబర్ 23:  వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలోని కనీసం 75 శాతం జనాభాకు ఆహార భద్రత చట్టం కింద ఆహార ధాన్యాలు అందించాలని జాతీయ సలహా మండలి (ఎన్‌ఏసీ) కేంద్ర ప్రభుత్వానికి కీలక సిఫారసు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 90% ప్రజలు, పట్టణ ప్రాంతాల్లో 50% ప్రజలు ఆ పరిధిలోకి రావాలని సూచించింది. దారిద్య్ర రేఖకు ఎగువ, దిగువ అన్న తేడాలను పక్కనపెట్టి రెండు ప్రత్యేక కేటగిరీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అందులో ఒకటి ‘ప్రాధాన్య’ విభాగం కాగా రెండోది ‘సాధారణ’ విభాగం. ఈ రెండు విభాగాలకు సబ్సిడీపై చట్టబద్ధంగా ఆహార ధాన్యాలు అందజేయాలని పేర్కొంది. శనివారమిక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలోని జాతీయ సలహా మండలి ఆరో సమావేశం జరిగింది. ఇందులోనే ఈ సిఫారసులను ఖరారు చేశారు. వీటిని త్వరలోనే కేంద్ర కేబినెట్‌లో చర్చకు పెట్టి, పార్లమెంటులో ఆహార భద్రతా చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఎన్‌ఏసీ భేటీ అనంతరం మండలి సభ్యుడు నరేంద్ర జాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ,మార్చి 31, 2014 కల్లా దేశవ్యాప్తంగా చట్టాన్ని అమలు చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామని, . చట్టం మొదటి దశ అమలుకు ఖజానాపై రూ. 15,137 కోట్ల భారం పడుతుందని చెప్పారు.

'రక్తచరిత్ర'పై ఎమ్మెల్యే సునీత అభ్యంతరాలు

అనంతపురం,అక్టోబర్23 : 'రక్తచరిత్ర' సినిమాపై దివంగత తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి భార్య ఎమ్మెల్యే సునీత అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన భర్త ప్రజలను రక్షించారే కానీ, హత్యలు చేయతేదని ఆమె తెలిపారు. పరిటాల రవి, ఎన్టీఆర్'లపై ఉన్న దృశ్యాలను తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు.

వర్మ రక్తచరిత్ర..నేపధ్యం...

పరిటాల రవీంద్ర చౌదరి @ రవన్న ని రాయలసీమ లోని అన్ని జిల్లాలలొ ఒక దేవుడుగా కొలుస్తారంటే అతిశయొక్తి కాదేమో.5 సార్లు అనంతపురం జిల్లా లొని పెనుకొండ నియొజకవర్గానికి ఎం.ఎల్.ఏ. గా ప్రాతినిద్యం వహించారు.రవన్న పెనుకొండ నియోజకవర్గములొని వెంకటాపురం గ్రామములొ 28-5-1957 న జన్మించాడు.రవన్న తండ్రి శ్రీరాములు 300 ఎకరాల భూసామి. తన భూమినంతా కమ్యునిస్ట్ సిద్దంతాల ప్రేరణ తొ పేదలకు(బొయా,కురుబ,ఈడిగ కులస్తులు) పంచిపెట్టారు.పేద ప్రజల భూములను కనగానపల్లి, చెన్నెకొత్తపల్లి భూస్వాములు ఆక్రమించుకొన్నారు.ఆ భూస్వాములే గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నా రెడ్డి.వారి నుంచి 600 ఎకరాలు బడుగు బలహీన వర్గాలకు పొందేటట్టు పొరాటం చేసి వారికి సాధించి పెట్టారు శ్రీరాములు. 1971 లొ సిపీఇ(ఎం.ఎల్) పార్టీ లొ చేరి అనతి కాలంలొనే వుద్యమ నాయకుదుగా గుర్తింపు పొందారు. ఈ భూముల పంపకం వరస హత్యలకు, కుల పొరాటాలకు శ్రీకారం చుట్టింది.29/05/1975 న శ్రీరాములు ను ఆయన అనుంగు సహచరుడుతొ గంగుల నారాయణ రెడ్డి, సానే చెన్నా రెడ్డి చంపించారు.రవన్న అన్న హరన్న(పరిటాల హరింద్ర) తండ్రి అడుగుజాడల లొనే పేదలకు చేరువ అయ్యాడు.ఇది సహించలేని గంగుల నారాయణరెడ్డి,సానే చెన్నారెడ్డి కబీర్ అనే ఇనస్పెక్టర్ తొ హరన్నను ఎన్కౌంటర్ చేయించారు.నక్సలైట్లు 1982-1983 కాలములొ గంగుల నారాయణ రెడ్డి, నరసన్న, యాది రెడ్డి లను చంపేశారు.కాని ప్రత్యర్థులు ప్రతీకారంతొ రవన్న ఈ హత్యలు చేయించాడని అనుకొంటారు.రవన్న తన మేనమామ కొండన్న సాయముతొ 1991 వరకు అజ్ఞాతంలోనే వున్నాడు.నారాయణ రెడ్డి ని నక్సలైట్లు అనతపురం లాడ్గి లొ వుండగా చంపెస్తారు.నారాయణ రెడ్డి చనిపొయిన తేరువాత, 1982, 1985 లొ పెనుకొండ ఎం.ఎల్.ఏ. గా తేలుగుదేశం పార్టి తరుపున రామచంద్రా రెడ్డి గెలిచాడు.1989 ఎలక్షన్లలొ పెనుగొండ నియోజకవర్గం సానే చెన్నారెడ్డి వశమయింది.అప్పుడు కాంగ్రెస్ గవెర్నమెంట్ యేర్పడింది. అప్పుడు సానే చెన్నారెడ్డి కొడుకులు రమణారెడ్డి,ఒబులరెడ్డి , గంగుల నారాయణరెడ్డి కొడుకు గంగుల సూర్య నారాయణరెడ్డి సాగించిన హత్యలతొ అరాచకాలతొ మానభంగాలతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.ఈ గంగుల సూర్యనారాయణరెడ్డి మద్దెలచెర్వు గ్రామములొ ఒక కురుబ( యువతి ని , ఒక ప్రభుత్వొద్యొగి ని వారి తల్లిదండ్రుల ఎదుటే మానభంగం చేసాడంటారు.రవన్న తన తండ్రి,అన్నయ్య ల హత్యలకి బదులు తీర్చుకొవాలనుకొని 1991లొ నక్సలైట్ల సహాయం కోరతాడు.నక్సలైట్లు కూడ తమ నాయకులను(శ్రీరాములు,హరన్న)లను పొగుట్టుకున్నందుకు ప్రతీకారం తీర్చుకొవాలునుకొంటారు.ఆ ప్రయత్నాలలొ భాగం గానే, 1991 లొ సానే చెన్నారెడ్డి ధర్మవరం లొని తన ఇంట్లొ కుర్చీ లొ కూర్చుని పేపర్ చదువుతుండగా నక్సలైట్లు పొలీసు దుస్తుల్లొ వచ్చి చంపి వెళ్ళిపొతారు.తిరిగి కాంగ్రెస్ రమణారెడ్డి(సానే చిన్నారెడ్డి పెద్ద కొదుకు) కి టిక్కెట్ ఇచ్చి భారీ రిగ్గింగులతో గెలిపిస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ ఒబుల రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి ఎన్నో అరాచకాలు సాగించారు. అప్పట్లొ నక్సలైట్ల లొ చీలికలు వచ్చాయి. దాని తరువాత గంగుల సూర్యనారాయణ రెడ్డి ఇంట్లొ నక్సలైట్లు టీ.వీ. లొ బాంబు అమర్చి అతని సోదరులను చంపుతారు. ఈ దాడిలొ ప్రముఖుడుగా నక్సలైట్ల లో ఒక విభజన వర్గానికి ప్రాతినిద్యం వహిస్తున్న పోతుల సురేష్ పాత్ర వుందంటారు.ఈ గ్రూప్ పేరు రీఆర్గనిగింగ్ కమిటీ.రెండో వర్గమైన రెడ్ స్టార్ కి సుదర్శన్ నాయకుడు.అప్పటి నుంచి ఆర్.ఓ.సి. రవన్న కి తోడుగా నిలిస్తె, రెడ్ స్టార్ గంగుల సంతానానికి సహాయము చేస్తూ వచ్చింది.ఈ రెండు గ్రూపుల పొరాటాల మధ్య సుమారు 40 మంది మ్రుత్యువాత పడ్డారు. టీ.వీ. బాంబు పెలుదులొ గంగుల సూర్యనారాయణ రెడ్డి తప్పించుకున్న గంగుల సూర్యనారాయణ రెడ్డి కొన్నాళ్ళు కర్నాటక లొ తల దాచుకొన్నాడు.అక్కదే భానుమతి తో వివాహము జరింగింది.రాజకీయాలతొ పీడిత బడుగు బలహీన వర్గాలకి ప్రయోజనం చేకూర్చాలని జన జీవన స్రవంతి లొ అడుగు పెడతాడు రవన్న.తెలుగుదేశం పార్టి తరపున 1993 ఎలక్షన్లలొ పెనుకొండ నియోజక వర్గానికి రమణారెడ్డి పై ఎటువంటి హింసా లెకుండా అత్యదిక మెజారిటి తొ గెలిచాడు.1994 లొ కార్మిక శాఖా మంత్రిగా పని చేసాడు.తర్వాతి కాలములొ లక్ష్మి పార్వతి అనంతపురం జిల్లా రాజకీయాల పై మితిమీరిన జొక్యం కారణంగా కొన్నాళ్ళు తెలుగుదేశం పార్తి కి దూరంగా వున్నాడు.1995 లొ కూడా రవన్న కే పెనుకొండ టిక్కెట్  ఇచ్చారు.అప్పుడూ పెనుకొండ నియొజక వర్గ ప్రజలు రవన్న కే పట్టం కట్టారు.అప్పుడూ ప్రత్యర్థి రమణారెడ్డే.1996 లొ నందమూరి తారక రామారావు మరణం తర్వాత రవన్న ఎన్.టీ.ఆర్. తెలుగుదేశం పార్టి కి రాజీనామా చేసి తిరిగి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అదే రమణా రెడ్డి పై మరలా విజయ దుందుభి మోగించాడు. 1996 లొ ఆర్.ఓ.సి. ఒబుల రెడ్డి అరాచకాలకు ఒక ముగింపు నివ్వాలన్న వుద్దెశ్యముతొ అతని కొసం వెదుకులాట సాగిస్తుంది.ఒబులరెడ్డి హైదరాబాద్ నగరములొ వున్నట్టు సమాచారం అందుకొని  హైదరాబాద్ లొని ఒక అపార్ట్మెంట్ లో వ్యభిచారం చేస్తుండగా అతని ని,అతని నలుగురు అనుచరులను చంపుతారు. రవన్న పై ప్రతీకారం తీర్చుకోవడానికి అదను కొసం చూస్తున్న సూరి 1997 లొ రవన్న తన తండ్రి పరిటాల శ్రీరాములు మీద సినిమా తీయాలని హైదరాబాదు లొని జుబ్లీ హిల్స్ రామానాయుడు స్టూడియో లొ ముహూర్తం సన్నివెశం షూటింగ్ చే స్తుండగా,శక్తివంతమైన రిమోట్ కంట్రోల్ కారు బాంబు ని పేల్చాడు సూరి. ఆ పేలుడు లొ టీవి నిపుణులతొ సహ 26 మంది మరణించారు.30 మంది గాయపడ్డారు. ఈ కేసు పై పొలీసులు తీవ్రంగా దర్యాప్తు చేసి కర్నాటక లొ తల దాచుకున్న సూరి ని పట్టుకుని చర్లపల్లి జైలుకి పంపారు.1999 లొ ఒబులరెడ్డి అన్న రమణారెడ్డి ని హైదరాబాదులొని అతని స్నేహితుడి ఇంట్లొ పార్టి జరుగుతుండగా ఆర్.ఓ.సి. గ్రూపు కాల్చి చంపారు.రవన్న తిరిగి 1999 ఎలక్షన్స్ లొ ఎటువంటి హింసా,రిగ్గింగులు లేకుండా తెలుగుదేశం పార్టి తరపున గెలుస్తాడు. జైలు నుంచి సూరి ఒకసారి అనతపురం లొని రవన్న ఇంటిని పేల్చివేయటానికి కుట్ర పన్నుతాడు.రవన్న ఈ కుట్ర ని పొలీసులకి చెప్పి సూరి మీద అతనికి సాయపడిన ఒక కాంగ్రెస్ యువ నేత పైన కేసు పెడతాడు. తరువాత రవన్న ఒకసారి పేద అవివాహిత జంటలకు వెంకటాపురం లొ వివాహాలు జరిపిస్తాడు.రవన్న అనుచరులు ముగ్గురు కారు లొ వెంకటాపురం వస్తుండగా సూరి అనుచరులు దారి కాచి చంపుతారు.2004 ఎన్నికలలొ భానుమతి కి కాంగ్రెస్ టిక్కెట్ ఇస్తారు.సుదర్శన్ నాయకత్వంలొని రెడ్ స్టార్ నక్షలైట్లు రవన్న ని ఎలక్షన్ ప్రచారం లొ చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.ఆ ఎలక్షన్స్ లొ 24000 వొట్ల మెజారిటి తొ రవన్న గెలుస్తాడు.అదే ఎలక్షన్స్ లొ తెలుగుదేశం పరాజయం పాలైంది.కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3వ రొజు నుండి తెలుగుదేశం పార్టి కార్యకర్తల,రవన్న అనుచరుల హత్య లతొ అనంతపురం జిల్లా అట్టుడికిపొయింది.అప్పటినుంది పరిటాల రవన్న జీవితం ప్రమాదం లొ పడింది. ప్రతి 15 రొజులకు ఒక సారి అనంతపురం, వెంకటాపురం ఇళ్ళల్లొ సొదాలు జరిపించి మానసికంగా కుంగదీశారు.అదే సమయంలొ సూరి గ్యాంగ్ పరిటాల రవి సన్నిహితుడు కార్పొరేటర్ అయిన భాషా ను జూన్ 2004 లొ ధర్మవరం లొ చంపేసారు. మరో సన్నిహితుడు, సొమందేపల్లి జెడ్.పి.టి.సి. మెంబర్ అయిన ఆది నారాయణ ను చంపేసారు.ఆ తర్వాత తగరకుంట ప్రభాకర్ ని, బళ్ళారి లొ ఆర్.కే. ని సూరి అనుచరులు జూలకంటి శ్రీనివాసరెడ్డి(మొద్దు శీను),దామోదరరెడ్డి,భాస్కరరెడ్డి కలిసి చంపేసారు. సొమందేపల్లి ఉప ఎన్నికలకు రవన్న వస్తే చంపెందుకు పథకం పన్నారు.అనంతపురం డీ.ఎస్.పీ. సాయంతొ రవన్న ముఖ్య అనుచరులైన పావురాల క్రిష్ణ అతని సోదరుడిని చంపేసారు.అప్పట్లొ సూరి కి ఎవరితొ మాట్లాడాలన్న, సెల్ ఫొన్లు అవసరం వచ్చినా,ఎవరినన్నా కలవాలన్నా జైలు అధికారులు బాగా సహకరించేవారు.అనంతరం 2005 జనవరి 24న అనతపురం లొని తెలుగుదేశం పార్టి ఆవరణలొ సూరి అనుచరుల తూటాలకు రవి బలయ్యాడు.ఈ భీతావాహ సంఘటనతొ రవన్న అభిమానులు, తెలుగుదేశం పార్టి కార్యకర్తలు తమ నాయకుడి ని కొల్పొయిన దుఖం తొ ఆవేశం తో 60 కోట్ల నష్టాన్ని కలగచేసారు.

మూడో వన్డేకు వర్షం ముప్పు!

పనాజీ,అక్టోబర్ 23: భారత్, ఆస్ట్రేలియా మధ్య గోవాలో ఆదివారం జరిగే మూడో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో అనేకప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్టల్రో ఆవరించి ఉన్న మేఘాలు సౌత్ కొంకణ్, గోవాల వైపు ప్రయాణం చేసే అవకాశం ఉందని వాతావరణ విభాగ డెరైక్టర్ కేవీ సింగ్ చెప్పారు. గోవాలో అక్టోబర్ నెలలో నిలకడగా వర్షాలు కురుస్తాయన్నారు. భారత్, ఆసీస్‌ల మధ్య జరుగుతున్న ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి వన్డే (కొచ్చి) వర్షం కారణంగా రద్దుకాగా... రెండో వన్డే (విశాఖపట్నం)లో ధోనిసేన విజయం సాధించింది. మూడో వన్డేకు వేదికైన జవ హర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో భారత జట్టు శుక్రవారం మధ్యాహ్నం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొంది. తర్వాత భారీ వర్షం కురిసింది. ఆస్ట్రేలియా జట్టు ఉదయమే ప్రాక్టీస్‌లో పాల్గొంది.

Friday, October 22, 2010


The President, Smt. Pratibha Devisingh Patil presenting the Dada Sahab Phalke Award 2009 to Dr. D. Ramanaidu, at the 57th National Film Awards function, in New Delhi on October 22, 2010.
 <br>The Union Minister for Information and Broadcasting, Smt. Ambika Soni, the Ministers of State for Information and Broadcasting, Shri Choudhury Mohan Jatua and Dr. S. Jagathrakshakan and the Director General (M&C) & Director, DFF, Shri S.M. Khan are also seen.
దాదాఅహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకుంటున్న రామానాయుడు 


‘రక్త చరిత్ర’పై టీడీపీ రగడ

హైదరాబాద్,అక్టోబర్ 22:   రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన రక్తచరిత్ర సినిమాలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఫ్యాక్షన్ హత్యలను ప్రోత్సహించారనే తరహాలో చూపారంటూ రాష్టవ్య్రాప్తంగా టీడీపీ శ్రేణులు ధర్నాలు, అందోళనలు నిర్వహించాయి. పలుచోట్ల సినిమా హాళ్లపై దాడులకు దిగి సినిమా ఫ్లెక్సీలను, వాల్‌పోస్టర్లను చించివేశారు. వర్మ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎన్టీఆర్ పాత్రను కించపరిచేలా ఉన్న సన్నివేశాలను తొలగించకుంటే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామ్‌గోపాల్ వర్మను హెచ్చరించారు. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాకే చిత్రాన్ని ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. కాగా సినిమాలోని సన్నివేశాలు తనను కలచి వేశాయని లక్ష్మీపార్వతి చెప్పారు. దర్శకుడు, నిర్మాత ఎంత బుకాయించినా సహించేది లేదని స్పష్టంచేశారు. చరిత్రను వక్రీకరించేలా సినిమాను నిర్మించారని ఆరోపించారు. 

‘ఫాల్కే’ అందుకున్న మూవీ మొఘల్ డి. రామానాయుడు

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: 57వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. సినీ అతిరథులంతా ఒకేచోట దర్శనమిచ్చిన అరుదైన ఘటనకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికైంది. ఈ కార్యక్రమంలో రాష్టప్రతి ప్రతిభాపాటిల్ పురస్కార గ్రహీతలకు అవార్డులను అందించారు. ప్రతిష్ఠా త్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2009 సంవత్సరానికి ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు అందుకున్నారు. రామానాయుడు ఆ అవార్డును తీసుకొనేందుకు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయన సతీమణి, కుమారులు సురేష్, వెంకటేష్, మనవడు రానా అవార్డు ప్రదానోత్సవాన్ని తిలకించారు. ఇక ఇక జాతీయ స్థాయిలో ఉత్తమనటుడి పురస్కారాన్ని ‘పా’ చిత్రంలో అభినయానికిగానూ అమితాబ్ బచ్చన్ స్వీకరించారు. అమితాబ్ కు రజత కమలాన్ని, 50 వేల నగదును అందించారు. ఆయన అవార్డు అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు ప్రేక్షకులు లేచి నిలబడి కరతాళధ్వనులు చేశారు. తెలుగు సినిమా సత్తా చాటిన ‘మగధీర’లో ధీర..ధీర పాటకు న్రు త్యరీతులు సమకూర్చిన డ్యాన్స్ మాస్టర్ శివశంకర్, అదే సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ అందించిన ఆర్. కమల్ కణ్ణన్ కూడా అవార్డులు అందుకున్నారు.

వార్తాప్రపంచం వీక్షకులకు ఆహ్వానం

రాజకీయ విశ్లేషణలు,సినిమా కబుర్లు,స్టాక్స్,చిన్న కధలు,చిట్టి కవితలు,కొత్త వంటలు,వింతలు-విశేషాలు...ఇలా ఏవైనా ఈ బ్లాగ్ కు పంపండి.పరిశీలించి  మీ పేరు తోనే ప్రచురిస్తాం. తెలుగైనా, ఇంగ్లీష్ అయినా రచనలు పంపవచ్చు. రచనలు jnrao13@gmail.com  కు పంపాలి.  వెల్ కం..ఈ  బ్లాగ్ లో భాగస్వాములు కండి. ..ఎడిటర్

హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి స్వరాజ్ పాల్ సస్పెన్షన్

లండన్,అక్టోబర్ 22: బ్రిటన్ పెద్దల సభ హౌస్ ఆఫ్ లార్డ్స్ నుంచి భారత సంతతికి చెందిన స్వరాజ్ పాల్ సహా ముగ్గురు సభ్యులు సస్పెండయ్యారు. మిగిలిన ఇద్దరూ కూడా ఆసియన్ సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. స్వరాజ్ పాల్ పై  నాలుగు నెలల సస్పెన్షన్ విధించగా, బారోనెస్ మాంజిలా పోలా ఉద్దీన్ పై  పద్దెనిమిది నెలలు, అమీరాలీ అలీభాయ్ భాటియాపై ఎనిమిది నెలలు సస్పెన్షన్ విధిస్తూ హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా తీర్మానం తీసుకుంది. నిధుల దుర్వినియోగం ఆరోపణలపై హౌస్ ఆఫ్ లార్డ్స్ హక్కుల కమిటీ వీరి సస్పెన్షన్ కు  సిఫారసు చేసింది. ఈ సిఫారసును హౌస్ ఆఫ్ లార్డ్స్ ఏకగ్రీవంగా ఆమోదించింది. స్వరాజ్ పాల్ అవినీతికి పాల్పడకపోయినా, నిధుల వినియోగంలో నిర్హేతుకంగా, బాధ్యతారహితంగా వ్యవహరించారని హక్కుల కమిటీ తన దర్యాప్తులో నిర్ధారించింది. 

Thursday, October 21, 2010

ఉస్మానియా విధ్యార్ధులకు కే.సీ.ఆర్. ఎర ?

శ్రీక్రి ష్ణ  కమిటీ నివేదిక  తనకు  అనుకూలంగా రాని పక్షంలో డి సెంబర్ 31 తర్వాత చేపట్టవలసిన ఆందోళనకు తన భాషలో యుద్దానికి  కే.సీ.ఆర్.  వ్యూహరచనలో నిమగ్నమైనట్టు  కనబడుతోంది. తెలంగాణా ప్రజలు  తనకు ఎంతవరకు కలసి వస్తారో అనే అపనమ్మకంతో కాబోలు ఆయన  తెలంగాణా విధ్యార్ధులకు ముఖ్యంగా ఉస్మానియా విధ్యార్ధులకు ఎర వేస్తున్నట్టు సమాచారం. ఈ వ్యూహంలొ భాగంగా ఆయన టీ.ఆర్.ఎస్. విధ్యార్ధి విభాగనికి తమ పార్టీ ఆఫీస్ తెలంగాణా  భవన్ లో  శాశ్వత  కార్యాలయాన్ని సమకూర్చారుట.  టీ.ఆర్.ఎస్.వీ. నాయకుడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ ను పార్టీ పోలిట్ బ్యూరో లొ చేర్చు కోవడంతో పాటు మరో ఉస్మానియా విధ్యార్ధి సుమన్ కు     పర్టీ పదవి కట్టబెట్టారు. అంతే కాదు, కొద్దిమంది విధ్యార్ధి నాయకులు వివిధ ప్రాంతాలలో పర్యటించి ఉద్యమ్మాన్ని ఉద్ధ్రుతం   చేసేందుకు వారికి ఇన్నోవా కార్లను కూడా కే.సీ.ఆర్. కానుకగా ఇస్తునట్టు తాజా సమాచారం. అంతేనా..వుస్మానియా విధ్యార్ధులు రెగ్యులర్ గా తెలంగాణా భవన్ నుంచి ముడుపుల మూటలు అందుకుంటున్నారన్నది కొసమెరుపు.  

మెక్సికో లో భారీ భూకంపం

మెక్సికో,అక్టోబర్ 21;  మెక్సికో లోని గల్ఫ్ ఆఫ్ క్యాలిఫొర్నియా లో గురువారం భూకంపం సంభవించింది.  6.9 తీవ్రతతో సంభవిచిన  ఈ భుకంపంలో భారి ఆస్థి, ప్రాణ నష్టం సంభవించలేదని ప్రాధమిక సమాచారం బట్టి తెలిసింది.

‘జీవన్‌దాన్’ పథకాన్ని ప్రారంభించనున్న ఆంధ్ర

హైదరాబాద్,అక్టోబర్ 21:  రాష్ట్ర ముఖ్యమంత్రి  రోశయ్య  తన అవయవాలను దానం చేశారు. గురువారమిక్కడ జరిగిన ఇండియన్ సోసైటీ ఆఫ్ ఆర్గన్ ట్రాన్స్‌ప్లాంYఏషన్ (అవయవాల మార్పిడి) జాతీయ సదస్సును ప్రారంభించిన ఆయన తన మరణానంతరం అవయావాలను దానమిస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఓ ప్రమాణపత్రంలో ఆయన సంతకం చేశారు. అవయావాల దానం వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యప్రజలకు వివరించేందుకు, అవయవాల మార్పిడి విధానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్‌దాన్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. బ్రైన్ డెత్(మెదడు చచ్బుబడిపోవడం) కేసుల్లో అవయవమార్పిడికి కావాల్సిన ప్రమాణ పత్రం తీసుకోవడం, ఈ విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించడం జీవన్‌ధాన్ పథకం ప్రధాన లక్ష్యమని తెలిపారు. 

మరో వివాదంలో రవితేజ తమ్ముడు

హైదరాబాద్,అక్టోబర్ 21: సినీ హీరో రవితేజ తమ్ముడు భరత్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల కొండపై పొగతాగుతూ కెమెరా కంటికి చిక్కాడు. సోదరుడు రఘుతో కలిసి మాదక ద్రవ్యాల కేసులో హైద రాబాద్‌లో అరెస్టయిన భరత్ ఇటీవలే  బెయిల్‌పై బయటికి వచ్చాడు.  

10 మంది శిశువులను బలిగొన్న కోరింత దగ్గు

కేలిఫోర్నియా,అక్టొబర్ 21: కేలిఫోర్నియా లో గత 60 ఏళ్ళలో లేని విధంగా  వ్యాపించిన కోరింత దగ్గు (వూఫింగ్ కాఫ్- పెర్ట్యూసిస్) వ్యాధి కి 10 మంది చిన్నారులు బలయ్యారు. చనిపోయిన వారంతా 3 నెలల లోపు వయసు  వారే. వ్యాక్సీన్ అందుబాటు లో వున్నందున ఆందోళన చెందనవసరం లేదని ప్రజారోగ్య విభాగం తెలిపింది. 

బీహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రశాంతం

పాట్నా,అక్టోబర్ 21: బీహార్‌ శాసనసభకు గురువారం జరిగిన మొదటి విడత పోలింగ్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 53 శాతం పోలింగ్ జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. మొదటి విడతలో 47 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. బీహార్ శాసనసభలో ఉన్న 243 స్థానాలకు ఆరు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

తీర్పును రిజర్వ్ లో ఉంచిన కర్ణాటక హైకోర్టు

బెంగళూరు,అక్టోబర్ 21: కర్ణాటకలో 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ లో ఉంచింది. యడ్యూరప్ప విశ్వాస పరీక్షకు ముందు 11 మంది బీజేపీ అసమ్మతి ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించగా, వారు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Wednesday, October 20, 2010

సౌదీ యువరాజుకు జీవితఖైదు

లండన్,అక్టోబర్ 20: సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా మనవడు సౌద్ అబ్దులజీజ్ బిన్ నజీర్ అల్‌సౌద్(34)కు బ్రిటన్ న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అల్‌సౌద్, ఈ ఏడాది ఫిబ్రవరి 15న లండన్‌లోని ల్యాండ్‌మార్క్ హోటల్‌లో, తన సేవకుడైన బందూర్ అజీజ్ (32)ను కొట్టి, గొంతు పిసికి చంపేశాడు. లండన్ ఓల్డ్ బెయిలీ కోర్టు జడ్జి అల్‌సౌద్‌కు 20 ఏళ్ల జీవిత ఖైదు విధించారు. రాజు అబ్దుల్లా కుమార్తె కుమారుడైన అల్‌సౌద్, దౌత్యాహోదా ఉన్న తనను విడిచిపెట్టాలని మొదట్లోనే విజ్ఞప్తి చేశాడు. అల్‌సౌద్‌కు ఈ హోదాలేదని బ్రిటన్ విదేశాంగ శాఖ తెలపడంతో పోలీసులు అతణ్ణి కోర్టుకు హాజరు పరిచారు. ‘వాలంటైన్ డే’నాడు రాత్రంతా పార్టీలలో గడిపి అల్‌సౌద్, అజీజ్‌తో కలిసి హోటల్‌కు తిరిగి వచ్చాడు. తాగిన మైకంలోనే హత్యకు పాల్పడ్డాడు. వారిద్దరి మధ్య ఉన్న స్వలింగ సంపర్క సంబంధాలు, లైంగిక హింస, చివరికి హత్యకు దారితీశాయని పోలీసులు నిర్ధారించారు. యువరాజు తాను హత్య చేయలేదని బుకాయించినా, సీసీ టీవీ టేపులు అతని నేరానికి సాక్ష్యంగా నిలిచాయి.

భారత బాలలకు అమెరికా సోయా చిరుతిళ్లు

వాషింగ్టన్,అక్తోబర్ 20: పోషకాహార లోపంతో బాధపడుతున్న భారతీయ బాలలకోసం నోరూరించే రకరకాల సోయా చిరుతిళ్లను అమెరికా శాస్తవ్రేత్తలు సిద్ధం చేస్తున్నారు. కారు చౌకకు శాఖాహార ప్రొటీన్లనుసమృద్ధిగా అందించే ఈ వంటకాలను స్కూలు పిల్లలు మహా ఇష్టంగా తినేలా భారతీయ రుచులలోనే తయారు చేస్తున్నారు. భారతీయులు ఎలాగూ చిరుతిళ్ల ప్రియులుకాబట్టి, పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు ఆ రూపంలోనే దండిగా ప్రొటీన్లను చౌకగా అందించాలనే సదుద్దేశంతో ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయం శాస్తవ్రేత్తలు ఈ పరిశోధనా కార్యక్రమం చేపట్టారు. తొమ్మిది రకాల సోయా వంటకాలు అప్పుడే ల్యాబరేటరీ దాటేసి, పరీక్ష దశకు చేరుకున్నాయి. కరకరలాడుతున్నవీ ఉప్పఉప్పగా లేక ఘాటుఘాటుగా ఉన్నవీ, పులుపు జీలకర్ర రుచులతో ఘమాయిస్తున్నవీ, కారం కారంగా మసా లా ఘాటుతో జమాయిస్తున్నవీ మంచి మార్కులు కొట్టేస్తున్నాయట. కొన్ని వంటకాలకు మాత్రం జీరోలు పడుతున్నాయట. అమెరికాలో రుచుల పరీక్ష ముగిశాక, బెంగళూరులో తుది పరీక్ష జరుగుతుంది.

రోశయ్య వర్సెస్ చంద్రబాబు

హైదరాబాద్,అక్టోబర్ 20: ముఖ్యమంత్రి రోశయ్య, తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. బతికి చెడినవాడివని సహించా అని రోశయ్య,నీలాంటి సీఎం.. ప్రజల దౌర్భాగ్యం అని బాబు అనే స్థాయి వరకు వారి మాటల యుద్ధం సాగింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ రాష్ట్ర పర్యటనవిషయంలో బాబు చేసిన వ్యాఖ్యలపై రోశయ్య బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో తనదైన శైలిలో వ్యంగ్యాస్ర్తాలతో విరుచుకుపడ్డారు. ప్రధానిని కలవాలనే చిత్తశుద్ధి బాబుకు లేనేలేదని, కేవలం పబ్లిక్ కోసం డ్రామా చేయడానికి మాత్రమే శ్రమ పడ్డారని ధ్వజమెత్తారు. ‘‘ప్రధానిని పట్టుకుని శాడిస్ట్ అంటావా? నీ స్థాయి ఏంటి? ఎవరు శాడిస్ట్?’’ అంటూ మండిపడ్డారు. ‘‘ఇంతకాలం బాబు నన్ను పనికి రానివాడన్నా, చేతకాని వాడన్నా... ఏదో నిరాశలో ఉన్నాడు, ఇంటా బయటా సమస్యల్లో చిక్కుకున్నాడు, ఆ బాధతో అంటున్నాడు లెమ్మని అర్థం చేసుకున్నాను. బతికి చెడిన వాడు, పూలమ్మాల్సిన వీధుల్లో కట్టెలమ్ముకునే స్థితిలో ఉన్నాడని సహిస్తూ వస్తున్నా. పాపం అనే భావనతో మాట్లాడకుండా ఉన్నా. నేను ఆయనంత క్వాలిఫైడ్ సీఎంను కాను. పరిస్థితుల వల్ల సీఎం అయ్యాను. నేను నూటికి నూరు శాతం అసమర్థ సీఎంనే. అధికారం కోసం ప్రాణాలు తీయడంలో, నమ్మిన వారిని ముంచడంలో, వెన్నుపోటు పొడవడంలో అసమర్థుడినే. పిల్లనిచ్చిన మామను ఎవరైనా తండ్రి తరువాత తండ్రిగా చూస్తారు. అలాంటి వ్యక్తిని అధికారం కోసం నిర్ధాక్షిణ్యంగా బాబు ఏం చేశాడో దేశ చరిత్రే చెబుతుంది. అసలే ఇబ్బందుల్లో ఉన్నాడు, ఎందుకు లెమ్మని కొద్ది నెలలుగా బాబును ఉపేక్షిస్తూ వస్తున్నా. కానీ ప్రధానినే శాడిస్ట్ అంటే ఊరుకుంటానా?’’ అంటూ నిప్పులు చెరిగారు. ‘‘నువ్వు అధికారంలో ఉండగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ బ్లెయిర్‌లతో కలిసి చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం చేసుకున్నావు. బిల్ క్లింటన్ తనకు ఫోన్ చేసినట్టు, ప్రపంచ రాజకీయాలు ఏమీ బాగా లేవు, మార్పు తేవాలి రమ్మని కోరితే తీరిక లేదని చెప్పినట్ట్టు ఉన్నవీ లేనివి ప్రచారం చేసుకుని, హైటెక్ సీఎం అని ముద్ర వేయించుకున్నావు. అలాంటి హైటెక్ సీఎంకు ఉండాల్సిన స్థాయి ఇదేనా?’’ అని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో బాబు తన స్థాయిని తానే దిగజార్చుకుంటున్నారని సీఎం అభిప్రాయపడ్డారు.ప్రతి ఒక్కరినీ విమర్శిస్తూ పోతుంటే తన ఔన్నత్యం పెరుగుతుందనే భ్రమల్లో ఉండి మాట్లాడుతున్నారని సానుభూతి వ్యక్తం చేశారు.

ఇక బాబు మరో విలేకరుల సమావేశంలో తొమ్మిదేళ్లు సీఎంగా పని చేశా. రోశయ్య సీఎం అయి ఏడాది కాలేదు, ఆయన కూడా నాకు ప్రొటోకాల్ గురించి చెబుతారా?’’ అంటూ మండిపడ్డారు. ‘రోశయ్య రాజకీయాల నుంచి రిటైరయ్యారు. ఆ తర్వాతే వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవినిచ్చారు. ఇప్పుడు సీఎంగా జాక్‌పాట్ వచ్చింది. ప్రధాని మంచి ఆర్థికవేత్తే గానీ ప్రజల మనిషి కాదు. అందుకే ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికలకు పోలేదు. సీఎం కూడా ప్రజల్లోకి వెళ్లడు. ఇలాంటి వారికి ప్రజా సమస్యలెలా తెలుస్తాయి’’ అని ఎద్దేవా చేశారు. ‘గతంలో చాలామంది సీఎంలను చూశాం. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్ వంటివాళ్లనే ఎదుర్కొన్నాం. ఈ ముఖ్యమంత్రి బెదిరింపులు తమనేమీ చేయలేవు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే మాకు పిచ్చి పట్టిందంటున్నారు. వీళ్లు చేసే ఘనకార్యాలకు పొగిడి సన్మానాలు చేయాలా?’ అంటూ ధ్వజమెత్తారు. ‘‘రోశయ్యలా నేనేమీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయలేదు. ఎమ్మెల్యేల సహకారంతోనే సీఎం అయ్యాను. 155 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించినా ఢిల్లీ నుంచి నామినేటై, మూణ్నెల్ల పాటు సీఎల్పీ ఆమోదం కూడా పొందని వ్యక్తి నా గురించి మాట్లాడటమా? మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిల హయాంలో రోశయ్య చేసిన రాజకీయాలు అందరికీ తెలుసు. ‘‘నేను ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నానని సీఎం అంటున్నాడు. విపక్ష నేతగా ఏం చేయాలో నాకో స్పష్టత ఉంది. ఇంటా బయటా ఒత్తిళ్లతో ఆయనే ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నాడు’’ అని బాబు విమర్శించారు.

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్ట్ కోసం ఆరు ఇంజనీరింగ్ కంపెనీల ఎంపిక

హైదరాబాద్,అక్టోబర్ 20;  నగరానికి తలమానికంగా నిలిచే మెట్రోరైలు ప్రాజెక్ట్ పనుల కోసం ఆరు ఇంజనీరింగ్ కంపెనీలను రెండవ రౌండ్ బిడ్ కొరకు ఎంపిక చేశారు. ఈ ప్రాజెక్ట్ పనులను చేయడానికి ప్రతిపాదనలను కోరడంతో ప్రపంచవ్యాప్తంగా 17 కంపెనీలు తమ ప్రతిపాదనలను పంపాయని మెట్రో ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ఏకామ్(హాంకాంగ్)తో కలిసి ఆర్వీ అసోసియేట్స్ (హైదరాబాద్); ఇటాఫేర్ ఎస్‌పీఏ (ఇటలీ)తో కలిసి సాయి కన్‌సల్టింగ్ ఇంజనీర్స్ (ఆహ్మాదాబాద్); లూయిస్ బెర్జర్ (ఇండియన్ అవుట్‌ఫిట్ ఆఫ్ అమెరికా కంపెనీ); మాట్ మెక్‌డొనాల్డ్ (ముంబై, ఇండియన్ అవుట్‌ఫిట్ ఆఫ్ యూకే); పార్సన్స్ బ్రింకర్‌హాఫ్ (ఇండియన్ అవుట్‌ఫిట్ (అమెరికా))ల భాగస్వామ్యంతో యూఎమ్‌టీసీ(న్యూఢిల్లీ); స్కాట్ విల్సన్ (యూకే), స్కాట్ విల్సన్ ఇండియా(న్యూఢిల్లీ) కంపెనీలను ప్రతిపాదిత విజ్ఞప్తుల రౌండ్‌లో ఎంపిక చేశారు. కన్‌సల్టెన్సీ సంస్థల నైపుణ్యం, అనుభవాన్ని పరిశీలించనున్నట్టు ఆధికారులు తెలిపారు. రెండవ రౌండ్‌లో సంస్థల ఆర్ధిక పరిస్థితిని అంచనావేస్తామన్నారు.

విశాఖ వన్ డే లో భారత్ గెలుపు

Kohli takes India to victoryవిశాఖపట్నం,అక్టోబర్ 20: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్లు తేడాతో గెలిచింది. 290 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ ఇంకా ఓవర్ మిగిలి వుండగానే విజయం సాధించింది. భారత్ ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళీ విజయ్ నిరాశ పరిచినప్పటికీ విరాట్ కోహ్లి ,రైనా,యువరాజ్ సింగ్ జట్టు విజయంలో కీలక బాధ్యత పోషించారు. విరాట్ కోహ్లి (110) పరుగులతో ఆసీస్‌ను బెంబేలెత్తించగా , ఫామ్‌తో తంటాలు పడుతున్న యువరాజ్ ఆఫ్ సెంచరీ చేసి తన సత్తాను నిరూపించుకున్నాడు.యువరాజ్ నిష్ర్కమించిన అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన రైనా స్ట్రోక్ ప్లేతో మరింత రెచ్చిపోయాడు. కోహ్లి-రైనా జంట ఆసీస్ బౌలర్లను ఊచకోత కోశారు. రైనా కేవలం 47బంతుల్లోనే 71 పరుగులు చేసి జట్టును విజయం ముంగిట నిలిపాడు. దీంతో భారత్ 1-0 ఆధ్యిక్యం సాధించి సిరీస్‌పై కన్నేసింది.ఆసీస్ బౌలర్లలో మెక్‌కే మూడు, హాస్ట్రింగ్స్ రెండు వికెట్లు తీశారు.

కరాచీలో మరోసారి హింస; 12 మంది మృతి

కరాచీ, అక్టోబర్ 20: పాకిస్థాన్‌లోని కరాచీలో మరోసారి హింస ప్రజ్వరిల్లింది. మంగళవారం రాత్రి ఇక్కడి ర ద్దీ మార్కెట్‌లోకి మోటారుసైకిళ్లపై వచ్చిన సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 12 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గత ఐదు రోజుల్లో జరిగిన వివిధ హింసాత్మక సంఘటనల్లో చనిపోయినవారి సంఖ్య 55కి చేరింది. ఎంక్యూంకి చెందిన చట్టసభ సభ్యుడు రజా హైదర్ హత్యతో కరాచీలో ఘర్షణలు చెలరేగాయి. 

విదేశీ విద్యార్థుల కోసం ఆసీస్ వెబ్‌సైట్

మెల్‌బోర్న్,అక్టోబర్ 20: తమ దేశంలో విద్యనభ్య సించాలనుకునే విదేశీ విద్యార్థులకు ఆన్‌లైన్ సేవలు అందించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యాభ్యాసానికి సంబంధించి అన్ని వివరాలతో వెబ్‌సైట్ ప్రారంభించింది. ఎక్కడ చదవాలి, పేర్లు ఎలా నమోదు చేసుకోవాలి, ఏ యూనివర్సిటీలో చేరాలి, ప్రయాణ వివరాలు, యూనివర్సిటీల రేటింగ్ గురించి సమస్త సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు. యూని ఆస్ట్రేలియా అనే కంపెనీ ఈ వెబ్‌సైట్ ప్రారంభించింది. ఆసీస్‌లోని అన్ని యూనివర్సిటీలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉందని యూని ఆస్ట్రేలియా సీఈవో రొవాన్ కుంజ్ తెలిపారు. తమ దేశంలో ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు తమ వెబ్‌సైట్ http://www.uniaustralia.com.au/  ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ఎన్నారైలకు ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’

దుబాయ్,అక్టోబర్ 20: గల్ఫ్ లోని ప్రవాస భారతీయుల కోసం ఐసీఐసీఐ బ్యాంక్ ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’ పేరుతో నూతన సేవలు ప్రారంభించింది. దీని ద్వారా ఎన్నారైలు సులభంగా స్వదేశానికి డబ్బులు పంపొచ్చు. గల్ఫ్ దేశాల్లో ఎంపిక చేసిన భాగస్వాముల ద్వారా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ‘ఐ-ఎక్స్ ప్రెస్ ’  ద్వారా ఎన్నారైలు స్వదేశంలోని తమ ఖతాల్లోకి నగదు బదిలీ చేసుకోవచ్చని, లబ్దిదారులు వెంటనే డబ్బు తీసుకోవచ్చని పేర్కొంది. భారత దేశంలో ఉన్న తమ శాఖలు, ఏటీఎం కేంద్రాల ద్వారా నగదు డ్రా చేసుకోవచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే లబ్దిదారులు తమ బ్యాంక్‌లో ఖాతా కలిగివుండాలన్నారు. ఇండియన్ రిమిటెన్స్ మార్కెట్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ అగ్రస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఈ సేవలు అందిస్తోంది.

విశాఖ వన్ డేలో భారత్ విజయ లక్ష్యం 290 పరుగులు

విశాఖపట్నం,అక్టోబర్ 20: ఇక్కడ జరుగుతున్న రెండవ వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 289 పరుగులు చేసింది. భారత్ 290 పరుగుల విజయ లక్ష్యం తో పోఆడుతోంది.హుస్సే 69 పరుగులు, పెయిన్ 9 పరుగులు చేసి అవుటయ్యారు. మార్ష్ పరుగులు ఏమీ చేయకుండానే అవుటయ్యాడు. ఎంజె క్లార్క్ 111 పరుగులు, కామెరాన్ వైట్ ఆరు సిక్సర్లు, 89 పరుగులతో నాటౌట్'గా నిలిచారు. పి. కుమార్, నెహ్రా, వినయ్ కుమార్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.

Tuesday, October 19, 2010

చంద్రబాబు సహా నేతల అరెస్టు


హైదరాబాద్,అక్టోబర్ 19: సూక్ష్మ రుణ సంస్థల మోసాలతో పాటు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్ సమయం కేటాయించనందుకు నిరసనగా మంగళవారం తెలుగుదేశం, మిత్రపక్షాల నేతలు సికింద్రాబాద్ రసూల్‌పురా చౌరస్తాలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో ధర్నా చేస్తున్న చంద్రబాబు సహా ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేసి అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో ప్రధాని ఢిల్లీ బయలుదేరే సమయం వరకు మూడున్నర గంటలపాటు వారక్కడ ధర్నా కొనసాగించారు. తరువాత సొంత పూచీకత్తుపై వారిని విడిచిపెట్టారు. ధర్నాలో టీడీపీ, పీఆర్‌పీ, ఆర్‌ఎస్‌పీ, ఫార్వర్డ్‌బ్లాక్ నేతలు పాల్గొన్నారు. ఈ ధర్నాకు కాంగ్రెస్, బీజేపీతో పాటు సీపీఎం కూడా దూరంగా ఉండటం గమనార్హం.

గాయకుడు జేసుదాసు ప్రత్యేక పాత్రలో ‘క్లియోపాత్ర’

ప్రముఖ గాయకుడు జేసుదాసు తొలిసారిగా వెండితెర మీదకు వస్తున్నారు. ఆయన ప్రత్యేక పాత్రలో రాజన్ శంఖరాడి దర్శకత్వంలో ‘క్లియోపాత్ర’ పేరుతో ఓ చిత్రం రూపొందబోతోంది. సందేశాత్మక కథాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో టి.కె.నాయర్ నిర్మించనున్నారు. నవంబర్ మొదటివారంలో చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రం ‘‘స్ర్తీ లోని అత్యద్భుతమైన అందాన్ని, భారతదేశంలో ఆమెకు వున్న గొప్ప స్థానాన్ని చాటి చెప్పే ఈ చిత్రం ద్వారా స్త్రీలోని ఏడు అందాలను తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నామని, ముగ్గురు నాయికలు నటిస్తున్న ఈ చిత్రంలో ‘క్లియోపాత్ర’ ఎవరనేది సస్పెన్స్‌గా వుంటుందని, హైదరాబాద్, పాలకోడ్, ఊటి, యూరప్‌లలో చిత్రీకరణ చేస్తామని నిర్మాత తెలిపారు.




చెచెన్యా పార్లమెంటుపై మిలిటెంట్ల దాడి

మాస్కో,అక్టోబర్ 19: చెచెన్యా పార్లమెంటు పై మంగళవారం నలుగురు మిలిటెంట్లు దాడి చేసి బీభత్సం సృష్టించారు. వారి దాడిలో ముగ్గురు పోలీసులు మృతిచెందగా, 17 మంది పోలీసులు గాయపడ్డారు. భద్రతా బలగాలు ఇద్దరు మిలిటెంట్లను కాల్చి చంపాయి. మిగతా ఇద్దరు దుండగులు తమను తాము పేల్చేసుకున్నారు. ఆత్మాహతి జాకెట్లు ధరించిన మిలిటెంట్లు తొలుత తమ వాహనంలో పార్లమెంటులోకి ప్రవేశించారు. అక్కడి పోలీసులపై కాల్పులు జరిపారు. కొంత మంది ఎంపీలను, అధికారులను నిర్బం ధించారు. దీంతో భద్రతా బలగాలు వారిపై దాడికి దిగాయి. ఇరు పక్షాల మధ్య 20 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. రష్యాలో భాగంగా ఉన్న చెచెన్యా రిపబ్లిక్‌లో తరచూ ఉగ్రవాద దాడులు జరుగుతుండడం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో చెచెన్యాలో అధ్యక్షుడి అంగరక్షకులకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన దాడిలో 19 మంది మృతిచెందారు.

అమెరికన్ సైన్స్ ఫౌండేషన్ డెరైక్టర్‌గా భారతీయుడు

వాషింగ్టన్,అక్టోబర్ 19: అమెరికన్ జాతీయ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) డెరైక్టర్‌గా భారత సంతతికి చెందిన శాస్తవ్రేత్త సుబ్రా సురేశ్ బాధ్యతలు స్వీకరించారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనను ఈ పదవికి నామినేట్ చేశారు. శాస్త్ర సాంకేతిక, విద్యా పరిశోధన రంగాలలో పనిచేస్తున్న రెండువేల సంస్థలను పర్యవేక్షించే ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా సుబ్రా సురేశ్ కొత్త బాధ్యతలను స్వీకరించడంపై ఒబామా హర్షం వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లో ఏర్పాటైన శాస్త్ర ప్రదర్శనలో జరిగిన ఒక కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా కొనసాగిన జాన్ హోల్డ్రన్ నుంచి సురేశ్ బాధ్యతలు స్వీకరించారు. మద్రాసు ఐఐటీలో చదువుకున్న సుబ్రా సురేశ్, ఇంతవరకు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని (ఎంఐటీ) ఇంజనీరింగ్ స్కూల్ డీన్‌గా సేవలందించారు.

భారీ నష్టాల్లో అమెరికా స్టాక్‌మార్కెట్

న్యూయార్క్,అక్టోబర్ 19: అమెరికా స్టాక్‌మార్కెట్‌లో ప్రధాన సూచీలు భారీగా పతనమయ్యాయి.. ప్రధాన సూచీలు డోజోన్స్ 165 పాయింట్లు, నాస్‌డాక్ 43, ఎస్ అండ్ పీ 19 పాయింట్లు నష్టాన్ని చవిచూశాయి. దాంతో సూచీలన్ని ఆగస్ట్ 11 నాటి కనిష్ట స్థాయికి దిగువన ముగిశాయి. డోజోన్స్ 11139 పాయింట్ల వద్ద ప్రారంభమై, ఓదశలో 10920 పాయింట్ల కనిష్టస్థాయిని నమోదు చేసుకుంది. చివరికి డోజోన్స్ 10978 పాయింట్ల, నాస్‌డాక్ 2435, ఎస్ అండ్ పీ 1165 పాయింట్ల వద్ద క్లోజైంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఆపిల్, ఐబీఎం కంపెనీల ఆర్ధిక ఫలితాలు నిరాశ పరచడంతో సూచీలన్ని భారీగా నష్టపోయాయి.

31 స్థానాలు పడిపోయిన సానియా ర్యాంకింగ్

న్యూఢిల్లీఅక్టోబర్ 19: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబ్ల్యూటీఏ సింగిల్స్ తాజా ర్యాంకింగ్స్ లో ఏకంగా 31 స్థానాలు పడిపోయింది. గతవారం 136వ స్థానంలో నిలిచిన ఈ హైదరాబాదీ తాజా ర్యాంకింగ్స్ లో 167వ ర్యాంక్‌కు దిగజారింది. డబుల్స్‌లో 65 నుంచి 67వ స్థానానికి చేరుకుంది. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) సింగిల్స్ ర్యాంకింగ్స్ లో సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఒక స్థానం పడిపోయి 96వ ర్యాంక్‌లో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విష్ణువర్ధన్ 377వ ర్యాంక్‌లో ఉన్నాడు. సోమ్‌దేవ్ తర్వాత భారత్ తరఫున అత్యుత్తమ ర్యాంక్ విష్ణుదే కావడం గమనార్హం. పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్ లో లియాండర్ పేస్ మూడు స్థానాలు ఎగబాకాడు. ఆదివారం ముగిసిన షాంఘై మాస్టర్స్ టోర్నీలో మెల్జర్‌తో కలిసి టైటిల్ నెగ్గిన పేస్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో స్థానానికి చేరాడు.

విశాఖలో భారత్, ఆస్ట్రేలియా రెండో వన్డే కు సర్వం సిద్ధం

విశాఖpaTnam,అక్టోబర్ 19:   విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే (డే-నైట్) జరుగనుంది. తొలి వన్డే వర్షం కారణంగా రద్దవడంతో ఈ మ్యాచ్‌కి ప్రాధాన్యం ఏర్పడింది. భారత్-ఆసీస్‌ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు బ్లాక్ టికెట్ల విక్రయం జోరుగా కొనసాగుతోంది. దీనిలో భాగంగానే బ్లాక్ టికెట్లు విక్రయిస్తుండగా ముగ్గురు పోలీసులుకు పట్టుబడిన ఘటన మంగళవారం వైఎస్‌ఆర్ స్టేడియం వద్ద చోటు చేసుకుంది. ప్రతి ఒక్కరిలోనూ విశాఖలో జరిగే మ్యాచ్‌పై ఆసక్తి ఉండటంతో బ్లాక్ టికెట్లు అమ్మేవారికి వరంగా మారింది. టికెట్లు అమ్మకం జోరుగా సాగుtoeదని సమాచారం అందుకున్న పోలీసులు టికెట్లు విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు.

అమెరికాలో కరీంనగర్ యువకుని మృతి

డాలస్,అక్టోబర్ 19: అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాచర్ల రాజేంద్రప్రసాద్(28) అనే తెలుగు యువకుడు అనారోగ్యంతో మృతి చెందాడు. టెక్సాస్ రాష్ర్టలోని ఆస్టిన్ నగరంలో అక్టోబర్ 17న అతడు మరణించాడు. శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో త్రి అతడిని సెయింట్ డేవిడ్ నార్త్ ఆస్టిన్ ఆస్పత్రికి తరలించారు. మెదడు నాళాలు వాచాయని వైద్యులు గుర్తించారు. కోమాలోని వెళ్లిపోయిన రాజేంద్రప్రసాద్ బెయిన్‌డెడ్ అయ్యాడు. ఆ తర్వాత అతడు చనిపోయాడు. ట్రవీస్ కౌంటీ మెడికల్ సెంటర్ చీఫ్ మెడికల్ ఎగ్జామినర్ రిపోర్ట్ వస్తే గానీ అతడికి మృతి గల కారణాలు స్పష్టంగా తెలియవు.కరీంనగర్ జిల్లా చొప్పదండి గ్రామానికి చెందిన రాజేంద్రప్రసాద్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పూర్తి చేశాడు. మూడున్నరేళ్లుగా అమెరికాలో ఉంటున్నాడు. ఆస్టిన్‌లోని చార్లెస్ షకవాబ్ ఫైనాన్షియల్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే అతడికి వివాహమయింది. అతడి భార్య ర జని (25) మూడు నెలల క్రితమే ఇక్కడకి వచ్చింది.

Monday, October 18, 2010

హైదరాబాద్ కు మన్మోహన్

హైదరాబాద్,అక్టోబర్ 19: ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కరోజు పర్యటనకై మంగళవారం హైదరాబాద్ వచ్చారు. హెచ్‌ఐసీసీ (హైటెక్స్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్)లో అకాడమీ ఆఫ్ సెన్సైస్ ఫర్ ద డెవలపింగ్ వరల్డ్ (టీడబ్ల్యూఎఎస్) వార్షిక సమావేశంలో పాల్గొంనారు. ఈ నెల 22 వరకు జరిగే ఈ సదస్సులో 50 దేశాలకు చెందిన 350మంది శాస్తవ్రేత్తలు హాజరు పల్గొంటున్నారు. ప్రధాని ప్రసంగిస్తూ సాంస్కృతిక భిన్నత్వం కలిగిన హైదరాబాద్ ఆధునీక భారతదేశానికి ప్రతీక అని ప్రశంసించారు.ఆధునిక వ్యవసాయ పద్ధతులు చేపట్టకపోవటం కూడా వర్ధమాన దేశాల అభివృద్ధికి ఆటంకంగా మారిందని ప్రధాని అన్నారు. వర్థమాన దేశాలు ఈ సమస్యలను ఐకమత్యంగా ఎదుర్కొంటే విజయం సాధించగలమన్నారు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో సాధించివలసింది ఇంకా ఎంతో ఉందని మన్మోహన్ పేర్కొన్నారు.మారుతున్న కాలంలో ఒక్కరో, ఒక్కదేశమో అన్ని పరిశోధనలు చేయలేదన్నారు. అందరం కలిసి నడిస్తేనే త్వరితగతిన అభివృద్ధి చెందుతామన్నారు. శాస్త్ర పరిశోధనల్లో యువత కొత్త దారులు వెతకాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే అభివృద్ధి పర్యావరణానికి చేటు కాకుడదన్నారు. అనంతరం గచ్చిబౌలిలోని సెంట్రల్ యుూనివర్సిటీలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్‌ఆర్) కేంద్రానికి జరిగే భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీ తిరిగి వెళ్ళారు.

కర్ణాటకంలో కొత్త మలుపు:కేసు కొత్త ధర్మాసనానికి బదిలీ

బెంగళూరు,అక్టోబర్ 18: కర్ణాటకం మరో మలుపు తిరిగింది. 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతపై సోమవారం కర్ణాటక హైకోర్టు విభిన్నమైన తీర్పును వెలువరించింది. ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో విచారణను ఏకసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై బుధవారం విచారణ జరగనుంది. ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల అనర్హత కేసును కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. దానిపై నవంబర్ 2న విచారణ జరుగుతుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్‌సింగ్, న్యాయమూర్తి ఎన్.కుమార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ బీజేపీ ఎమ్మెల్యేల కేసులో ప్రధానంగా నాలుగు అంశాలపై విచారణ జరిపింది. స్పీకర్ నియమాలను పాటించారా, పిటిషనర్లకు సహజ న్యాయం లభించిందా, స్పీకర్ ఆదేశాల్లో దురుద్దేశాలేమైనా ఉన్నాయా అనే అంశాల్లో న్యాయమూర్తులు ఏకాభిప్రాయానికి వచ్చారు. స్పీకర్ అన్ని నియమాలూ పాటించారని అభిప్రాయపడ్డారు. నాలుగో అంశమైన ఎమ్మెల్యేల అనర్హతపై మాత్రం చెరో అభిప్రాయం వ్యక్తం చేశారు. జస్టిస్ ఖేహర్ స్పీకర్ ఆదేశాలను విస్పష్టంగా సమర్థించారు. ఎమ్మెల్యేల ప్రవర్తన ఫిరాయింపుల నిరోధక చట్టం కిందకు వస్తుందన్నారు. కనుక వారిని అనర్హులను చేయడం సబబేనని తేల్చి చెప్పారు. దీంతో జస్టిస్ కుమార్ విభేదించారు. ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించారే తప్ప పార్టీపై కాదని అభిప్రాయపడ్డారు. కనుక స్పీకర్ ఆదేశాలను కొట్టేస్తూ తీర్పు వెలువరించారు. 1-1తో తీర్పు వెలువడినందున, కేసు విచారణను మూడో న్యాయమూర్తికి బదిలీ చేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ప్రకటించారు. బుధవారం ఏకసభ్య ధర్మాసనం ముందు నాలుగో అంశంపై మాత్రమే విచారణ జరుగుతుంది. అనర్హత వేటుపడ్డ ఎమ్మెల్యేల రాజకీయ భవితవ్యం ఆ తీర్పుపై ఆధారపడి ఉంటుంది.బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతపై తమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనందున ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల అనర్హత కేసును కూడా మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని న్యాయమూర్తులు ఖేహర్‌సింగ్, కుమార్ నిర్ణయించారు. దాన్ని ద్విసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు. ముఖ్యమంత్రి యడ్యూరప్ప నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్టు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు గవర్నర్ హెచ్‌ఆర్ భరద్వాజ్‌కు ఈ నెల 6న లేఖ రాయడం, దాని ఆధారంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్ కేజీ బోపయ్య 10న వారిపై అనర్హత వేటు వేయడం, దాన్ని సవాలు చేస్తూ వారంతా హైకోర్టును ఆశ్రయించడం, అక్టోబర్ 11, 14 తేదీల్లో ప్రభుత్వం రెండుసార్లు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గడం తెలిసిందే.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...