Saturday, March 31, 2012

కళ్యాణం...కమనీయం...

వార్తాప్రపంచం వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు....

తెలంగాణాపై నాలుగు పార్టీల అభిప్రాయం కోరాం; చిదంబరం

న్యూఢిల్లీ,మార్చి 31: తెలంగాణపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాలుగు పార్టీల అభిప్రాయం కోరినట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చెప్పారు. కాంగ్రెసు, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, మజ్లీస్ పార్టీలు తెలంగాణపై అబిప్రాయం చెప్పలేదని ఆయన చెబుతూ వస్తున్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకుని వైఖరి చెప్పాలని కోరినట్లు ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణపై రాష్ట్రానికి చెందిన 8 పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉందని,  నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు నిర్ణయానికి వచ్చి అభిప్రాయం చెప్పిన వెంటనే అఖిల పక్ష సమావేశం జరుగుతుందని ఆయన వివరించారు. తెలంగాణలో ఆత్మహత్యలు జరుగుతున్న విషయం తనకు తెలుసునని, ప్రతి సంఘటనా తన దృష్టికి వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకోవడం సరి కాదని ఆయన అన్నారు. ఆత్మహత్యల వల్ల ఒరిగేదేమీ లేదని, బతికి సాధించాలని, జీవించి పోరాటం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలతో తాను టచ్‌లో ఉన్నానని ఆయన చెప్పారు. నాలుగు ప్రధాన పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చి తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

జగన్ ఆస్తుల కేసులో సిబిఐ చార్జిషీట్

మొదటి నిందితుడిగా జగన్
హైదరాబాద్,మార్చి 31:  కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఆస్తుల కేసులో సిబిఐ శనివారం సాయంత్రం కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని మొదటి నిందితుడిగా చేర్చారు. రెండో నిందితుడిగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయిరెడ్డిని చేర్చింది. సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్‌లో  మొత్తం 13 మంది పేర్లను నిందితులుగా చేర్చింది. ఎమ్మార్ కుంభకోణం కేసులో నిందితుడు బిపి ఆచార్య ను కూడా నిందితుడు గా చేర్చారు. అరవిందో ఫార్మాను 3వ ముద్దాయిగా, నాలుగో ముద్దాయిగా హెటిరో డ్రగ్స్‌ను సిబిఐ చేర్చింది. ఐదో ముద్దాయిగా ట్రిడెంట్‌ను చేర్చింది. ఆరో నిందితుడిగా శ్రీనివాస రెడ్డిని, ఏడో నిందితుడిగా నిత్యానంద రెడ్డిని చేర్చింది. ఎనిమిదో నిందితుడిగా శరత్ చంద్రా రెడ్డి, తొమ్మిది నిందితుడిగా బిపి ఆచార్యను, పదో నిందితురాలిగా ఇద్దనపూడి విజయలక్ష్మిని, 11వ నిందితుడిగా చంద్రమౌళి, 12వ ముద్దాయిగా జగతి పబ్లికేషన్స్, 13వ ముద్దాయిగా జననీ ఇన్‌ఫ్రాలను సిబిఐ చేర్చింది.వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన 26 వివాదాస్పదమైన జీవోలను సిబిఐ పరిశీలించింది. వైయస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన పలువురు వ్యాపారవేత్త వాంగ్మూలాలను నమోదు చేసింది. వైయస్ హయాంలో కీలక బాధ్యతలు నిర్వహించిన పలువురు ఐఎఎస్ అధికారులను విచారించింది. సండూర్ పవర్ నుంచి జగన్ సంస్థల్లోకి నిధులు మళ్లిన వైనాన్ని పరిశీలించింది. 263 డాక్యుమెంట్లతో 68 పేజీల చార్జిషీట్‌ను సిబిఐ ప్రత్యేక కోర్టులో సమర్పించింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన విజయసాయి రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్‌ను ఏప్రిల్ 13వ తేదీ వరకు కోర్టు పొడగించింది. 
అరెస్టు పై పుకార్లు
ప్రత్యేక కోర్టులో సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిన నేపథ్యంలో  వైయస్ జగన్ ఏ క్షణంలోనైనా అరెస్టు కావచ్చుననే పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు పెద్ద యెత్తున హైదరాబాదు చేరుకుంటున్నారు. ప్రస్తుతం వైయస్ జగన్ గుంటూరు జిల్లాలో ఉన్నారు. గుంటూరు జిల్లాలో పోలీసు బందోబస్తును పెంచారు. పెద్ద యెత్తున పోలీసులను మోహరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు పలువురు కూడా హైదరాబాదుకు చేరుకుంటున్నట్లు తెలుస్తోంది. 

Friday, March 30, 2012

కోతలకు తోడు ఇక వాతలు...

హైదరాబాద్,మార్చి 30: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి ఛార్జీలు అమల్లోకి వస్తాయి.   50 యూనిట్ల వరకు యూనిట్ ధర రూ.1.45 పైసలు,100 యూనిట్ల వరకు రూ.2.60 పైసలు, 200 యూనిట్ల వరకు రూ.3.60 పైసలు పెంచారు. పెంపు వల్ల వినియోగదారులపై 3434.89కోట్ల భారం పడుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 28,985.23 కోట్లు  ఆదాయం వస్తుంది. ప్రభుత్వం గృహావసరాలకు  రూ.1736 కోట్లు, వ్యవసాయానికి  రూ.3,620 కోట్లు, ఇరిగేషన్‌కు  రూ.1.56 కోట్లు మొత్తం  రూ.5,358.67 కోట్లు  సబ్సిడీ ఇస్తుంది. 

ఉమెన్ పవర్...

ఢిల్లీలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రూసఫ్ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ను కలసిన చిత్రం...

తెలంగాణా పై ఎలా తేల్చాలి...అజాద్

న్యూఢిల్లీ,మార్చి 30: తెలంగాణ సమస్యను వెంటనే తేల్చలేమని,   హైదరాబాదే విభజనకు అసలు అడ్డంకి అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కుండ బద్దలు కొట్టేశారు.  హైదరాబాద్ నగరం పైనే ఇరు ప్రాంతాల ప్రజలు, నేతలు పట్టుబడుతున్నారని ఆయన తమను కలసిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో అన్నారు.  హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన వారిని ప్రశ్నించారు.  లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన సూచించారు. అయితే ఎంపీలు ఈ రేండూ  ప్రతిపాదనలను  వ్యతిరేకించినట్టు తెలిసింది.  హైదరాబాద్ పైనే అందరూ పట్టుబడుతున్నారని,  కాగా ఆజాద్‌తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఒప్పుకునేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాలని సూచించామన్నారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు కూడా ఆజాద్‌తో విడిగా భేటీ అయ్యారు.ఈ భేటీలో 18 నియోజకవర్గాల ఉపఎన్నికలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.15 రోజుల్లోగా 18 నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ లగడపాటి చేస్తున్న సర్వేలతో పార్టీకి నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి, నెల్లూరు ఎంపీ పనబాకలక్ష్మి ఫిర్యాదు చేశారు. అలాగే ఉపఎన్నికలు జరగబోయే 18 స్థానాలకు అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని సీమాంధ్ర ఎంపీలు ఆజాద్‌ను కోరారు. 
తెలంగాణ కు ఆర్జేడీ మద్దతు
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆలస్యం చేయకుండా కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

Thursday, March 29, 2012

గురువారం ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో బ్రెజిల్,రష్యా,చైనా,దక్షిణాఫ్రికా అధ్యక్షులతో ప్రధాని మన్మోహన్

తెలుగుదేశం పార్టీకి 30 ఏళ్ళు...

తెలుగుదేశం  పార్టీ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి.ఆర్. సమాధి వద్ద నివాళి అర్పిస్తున్న చంద్రబాబు

బామ్మర్ది కి మళ్ళి కోపమొచ్చింది...

హైదరాబాద్,మార్చి 29:   తెలుగుదేశం పార్టీ నాయకత్వంపై ఎన్టీఆర్ తనయుడు, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. నాయకత్వ లోపం వల్లే పార్టీకి సమస్యలు ఏర్పడ్డాయని ఆయన చంద్రబాబు ను పరోక్షంగా విమర్శించారు. కొంతమంది పార్టీ నాయకులతోనే టీడీపీ నాశనం అయిపోతోందని  ఆవేదన వ్యక్తం చేశారు. 30 ఏళ్లు బతికిన టీడీపీ... నాయకుల మూలాన నేడు ఈ స్థితికి వచ్చిందని ఆయన ఒక ఇంటర్వ్యూలోవిమర్శించారు. ప్రజలు, కార్యకర్తలే పార్టీని కాపాడుతూ వచ్చారన్నారు. టీడీపీ ఎన్టీఆర్ మానస పుత్రిక అని, తమకు తోబుట్టువు లాంటిదని అన్నారు. త్వరలోనే నందమూరి కుటుంబానికి మంచి రోజులు వస్తాయని, జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయ అనుభవం ఇంకా అవసరమన్నారు. టీడీపీ తమను బయటకు పంపించేవరకూ పార్టీకి సేవ చేస్తామన్నారు.టీడీపీలో కార్యకర్తల్ని నాయకులు విస్మరిస్తున్నారని, కార్యకర్తలు అధైర్యపడవద్దని, పనిచేయని నాయకత్వాన్ని నిలదీయాలని హరికృష్ణ పిలుపునిచ్చారు. ఓవైపు టీడీపీ 30వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతుండగానే... హరికృష్ణ ఈ వ్యాఖ్యలు చేయటం సంచలం సృష్టించింది. వ్యాపారాల కోసం తమ పార్టీ నాయకులు కాంగ్రెసుతో లాలూచీ పడుతున్నారని  దానివల్ల పార్టీ పరిస్థితి దిగజారిపోతోందని ఆయన అన్నారు. పార్టీ సరిగా అభివృద్ధి చెందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెసుతో తమ పార్టీ నాయకులు కమ్మక్కయ్యే వైఖరిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ముగిసిన అసెంబ్లీ గోల...

హైదరాబాద్,మార్చి 29:  శాసనసభ బడ్జెట్  సమావేశాల తంతు ముగిసింది.  సభ గురువారం నిరవధికంగా వాయిదాపడింది. విపక్షాల రసాభాస మధ్యనే చివరిరోజు సమావేశాలు కూడా మొక్కుబడిగా సాగాయి. సభ్యుల నిరసనల మధ్యనే మూజువాణీ ఓటుతో ద్రవ్య వినిమయ బిల్లును డిప్యుటీ స్పీకర్‌ భట్టీ విక్రమార్క ఆమోదించారు. 28 రోజుల పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో అధిక శాతం సభాసమయం వృధా అయిందే తప్ప ప్రజా సమస్యలపై చర్చలు సరిగా జరగలేదు. చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో పద్దులు ఆమోదం పొందగా మధ్యలో ఉపఎన్నికల హడావిడి, ఆపై మద్యం సిండికేట్‌ వ్యవహారం, తెలంగాణ అంశంపై సభ అట్టుడికింది. కాగా నెల్లూరు జిల్లా కోవూరు నుంచి  ఎన్నికైన వైఎస్ఆర్ పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్  చివరి రోజున సభలో  ప్రమాణ స్వీకారం చేశారు.

రాజకీయ ' చిరు ' నామా ఇక ఢిల్లీ...!

హైదరాబాద్ ,మార్చి 29: తిరుపతి నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైన చిరంజీవి తన సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు. ఆయన రాజ్య సభకు ఎన్నికైన విషయం తెలిసిందే. గురువారం బడ్జెట్ సమావేశాల చివరి రోజున ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు నేరుగా అందచేశారు.  కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీ విలీనమయ్యాక చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం దక్కింది. దీనితో  ఆయన తిరుపతి శాసనసభ్యత్వాన్ని వదులుకోవాల్సి వచ్చింది. రాజ్యసభకు వెళ్లినప్పటికి తిరుపతి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని చిరంజీవి ఈ సందర్భంగా చెప్పారు. కాగా అసెంబ్లీ లాబీల్లో చిరంజీవికి తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి ఎదురు పడ్డారు. ఈ సందర్భంగా  చిరును చూసిన రేవంత్.. రాజ్యసభకు వెళ్తున్నారు.. ఏదైనా రాష్ట్రానికి ఉపయోగపడే మంత్రి పదవి తీసుకోండి అని చెప్పారు. అందుకు చిరంజీవి స్పందిస్తూ.. తన చేతుల్లో ఏమీ లేదని వాళ్లు ఇచ్చింది తీసుకోవాలని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. కాగా గత డిసెంబర్ నెలలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో చిరంజీవి ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. ఆ సమయంలోనే అధిష్టానం చిరుకు కేంద్రమంత్రి పదవి హామీ ఇచ్చింది. ఇప్పుడు  ఆయనను రాజ్యసభకు ఎంపిక చేయడంతో కేంద్రంలో మంత్రి పదవి ఖాయమని వాదన వినిపిస్తోంది. అయితే క్యాబినెట్ మంత్రా లేక సహాయ మంత్రి తో సరిపెడతారా అనేది వేచి చూడాలి. 

హెచ్-1 బీ వీసా ఫీజు యథాతధం

వాషింగ్టన్,మార్చి 29: వచ్చే ఏడాదికి హెచ్-1 బీ వర్క్ వీసా ఫీజుపై పెంపుదల ఉండదని అమెరికా స్పష్టం చేసింది. 2013 సంవత్సరంలో వీసా ఫీజును పెంచుతున్నట్టు వచ్చిన ప్రకటన అవాస్తవమని యూఎస్ సిటిజన్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తెలిపింది. వీసా ఫీజు పెంచడం లేదని వచ్చిన వార్త నిజమేనని నాస్‌కామ్ కూడా ధృవీకరించింది.

Wednesday, March 28, 2012

ఆర్మీ చీఫ్ లేఖపై రాజ్యసభలో దుమారం

న్యూఢిల్లీ,మార్చి 28: ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖపై బుధవారం రాజ్యసభలో దుమారం చెలరేగింది. దానిపై వివరణ ఇవ్వాలని బిజెపి సభ్యుడు ఎం వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారు. రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీ ఇచ్చిన వివరణతో ప్రతిపక్ష సభ్యులు సంతృప్తి చెందలేదు. ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో రాజ్యసభ వాయిదా పడింది. సైన్యంలో ఆయుధాల కొరత ఉందంటూ ఆర్మీ చీఫ్ ఇటీవల ఆర్మీ చీఫ్ వికె సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. యుద్ధ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయని ఆయన అన్నారు. సైన్యం కన్నా వైమానిక దళమే బాగుందని ఆయన అభిప్రాయపడ్డారు. వికె సింగ్ రాసిన లేఖపై దుమారం చెలరేగిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు చిదంబరం, ఆంటోనీ ప్రధానితో సమావేశమయ్యారు. దేశ భద్రత విషయంలో రాజీ పడేది లేదని సమావేశానంతరం ఆంటోనీ అన్నారు. వికె సింగ్‌ను తొలగించాలని ఎస్పీ, జెడియులు డిమాండ్ చేశాయి. అయితే, ఆ డిమాండును బిజెపి వ్యతిరేకించింది. వికె సింగ్ వ్యవహారం క్రమశిక్షణకు సంబంధించిందని, వికె సింగ్‌ను తప్పించాలని, వికె సింగ్‌పై చర్య తీసుకోకపోతే చెడు సంప్రదాయం ఏర్పడుతుందని జెడియు నాయకుడు శివానంద్ తివారీ అన్నారు. వికె సింగ్‌ను తప్పించి, జైలులో పెట్టాలని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ మీడియా ప్రతినిధులతో అన్నారు. లీక్‌పై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వామపక్షాలు డిమాండ్ చేశాయి.

రష్యా, చైనా, బంగ్లాదేశ్‌ ఎంబీబీఎస్ డిగ్రీలు ఇక్కడ చెల్లవ్...

న్యూఢిల్లీ,,మార్చి 28:   భారత సంతతి విద్యార్థులకు అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు జారీచేసిన మెడికల్ ఎండీ డిగ్రీలకు మాత్రమే దేశంలో గుర్తింపు ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాంనబీ ఆజాద్ స్పష్టంచేశారు. అలాగే విదేశీ ఎంబీబీఎస్ డిగ్రీలకు దేశంలో గుర్తింపు లేదని తెలిపారు.  రష్యా, చైనా, బంగ్లాదేశ్‌లలో ఎంబీబీఎస్ కోర్సులను పూర్తిచేసుకున్న భారత విద్యార్థులు వెంటనే ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభించడం కుదరదని ఆజాద్ రాజ్య సభలో తేల్చిచెప్పారు. ముందుగా జాతీయ పరీక్షల నిర్వహణ బోర్డు(ఎన్‌బీఈ) చేపట్టే స్క్రీనింగ్ టెస్త్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. దేశంలో వైద్యుల కొరత ఉందని, మెడికల్ కళాశాలల పెంపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆజాద్ తెలిపారు. కళాశాలల ఏర్పాటు నిబంధనల్లో పలు మార్పులు తెచ్చినట్లు వివరించారు. పట్టణాల్లో కొత్త మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గతంలో 25 ఎకరాల భూమి అవసరంకాగా, ప్రస్తుతం 10 ఎకరాలకు తగ్గించినట్లు చెప్పారు. అలాగే మెడికల్ కాలేజీల్లో పడకల సామర్థ్యాన్ని సైతం కుదించినట్లు వివరించారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 46 కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వైద్య కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు ఆజాద్ తెలిపారు.

నెత్తు రోడిన గడ్చిరోలి...నక్సల్స్ మందుపాతరకు 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు బలి

న్యూఢిల్లీ,,మార్చి 28:   మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్ మళ్లీ భద్రతా బలగాలపై భారీ దాడికి పాల్పడ్డారు. మంగళవారం సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సును మందుపాతరతో పేల్చేశారు. ఈ ఘటనలో 12 మంది జవాన్లు చనిపోగా, మరో 28 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. సీఆర్పీఎఫ్ 192వ బెటాలియన్ డి కంపెనీకి చెందిన 40 మంది జవాన్లు కూంబింగ్‌కు వెళ్లి బస్సులో తిరిగొస్తుండగా ధనోరా తాలూకా పుస్తోలా గ్రామం సమీపంలో ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నక్సల్స్ మందుపాతర పేల్చారు. దీంతో బస్సు కొన్ని మీటర్ల మేర ఎగిరి కిందపడి తునాతునకలైంది. 12 మంది జవాన్లు అక్కడికక్కడే చనిపోయారు. పేలుడు తర్వాత మంటలు చెలరేగాయి. దీంతో కొందరికి కాలిన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని రెండు ప్రత్యేక హెలికాప్టర్లలో నాగ్‌పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 20 మంది క్షతగాత్రులకు గడ్చిరోలి జిల్లా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. సీఆర్పీఎఫ్ చీఫ్ కె.విజయ్‌కుమార్ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా గడ్చిరోలిలో ఉన్న నేపథ్యంలో నక్సల్స్ దాడికి పాల్పడడం గమనార్హం. ఈ దుశ్చర్యకు 40 కేజీల పేలుడు పదార్థాలు వాడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.

నాటా ఆధ్వర్యంలో మే 6న న్యూజెర్సీలో జాబ్‌మేళా,

హైదరాబాద్,మార్చి 28:   నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా) ఆధ్వర్యంలో మే 6వ తేదీన అమెరికాలోని న్యూజెర్సీలో జాబ్‌మేళా, ఇమిగ్రేషన్ అంశంపై సదస్సు జరగనుంది. 2055 లింకన్ హైవే (రూట్ 27) ఎడిసన్‌లోని క్రౌన్ ప్లాజా లో ఉద్యోగ మేళా, సదస్సు ఉంటాయని అసోసియేషన్ ప్రతినిధి  పేర్కొన్నారు. సదస్సును ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు నిర్వహిస్తారు. ఇతర వివరాల కోసం www.nataus.org  వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా అసోసియేషన్ ప్రతినిధి  తెలిపారు. 

Monday, March 26, 2012

అసెంబ్లీ వద్ద తెరాస సభ్యుల హల్ చల్...

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ శాసనసభ్యులు సోమవారం అసెంబ్లీ ద్వారానికి అడ్డుగా పడుకున్నారు. తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను లోనికి వెళ్లనిచ్చేది లేదని హెచ్చరించారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు గేటు ముందు అడ్డంగా సభ్యులు లోనికి వెళ్లకుండా పడుకున్నారు. మిగిలిన వారందరూ అక్కడే బైఠాయించారు. తెలంగాణపై మాట తప్పిన పార్టీలకు అసెంబ్లీలో ప్రవేశం లేదని, తెలంగాణ ద్రోహులను లోనికి వెళ్లనివ్వమని, సమైక్యవాదులకు, వెన్నుపోటు పొడిచిన వారికి ఇక్కడ స్థానం లేదని వారు నినాదాలు చేశారు. అయితే పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన ఆరుగురు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు గంప గోవర్ధన్, జోగు రామన్న, టి.రాజయ్య, జూపల్లి కృష్ణా రావు, నాగం జనార్ధన్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డిలు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సభలో తెరాస బలం 16, బిజెపి బలం 3కు పెరిగింది.నెల్లూరు జిల్లా కొవూరు నుండి గెలిచిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 29న ప్రమాణం స్వీకారం చేయనున్నారు.

రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు

తిరుపతి, మార్చి 25:  ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రమాదకర పరిస్థితిలో ఉంది.. దీన్ని బాగుచేసే దిశగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కానీ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కానీ ఆలోచించటం లేదు. ప్రజారాజ్యం పార్టీ కేడర్ తాము కాంగ్రెస్‌లో ఎందుకు విలీనమయ్యామా? అని బాధపడుతున్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే కాంగ్రెస్ మరింత దిగజారుతుంది. అప్పుడు చిరంజీవిని కూడా నిందించే అవకాశం ఉండదు’’ అని రాష్ట్ర దేవాదాయ మంత్రి సి.రామచంద్రయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ చేసిస సూచనలు, ఆదేశాలు రాష్ట్రంలో అమలు కావటం లేదని ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవికి.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం తిరుపతిలో ఆదివారం సాయంత్రం వీడ్కోలు సభ జరిగింది. చిరంజీవితో పాటు మంత్రి సి.రామచంద్రయ్య కూడా పాల్గొన్నారు. అనంతరం రాత్రి 9 గంటల సమయంలో తాను బస చేసిన పద్మావతి అతిథి గృహానికి ఒక టీవీ చానల్‌ను పిలిపించుకుని సీఆర్ మాట్లాడారు. ''' ఏ నాయకుడైనా గుర్తింపు కోసం, పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తారు. సేవ చేయటానికే అయితే లయన్స్ క్లబ్ లాంటి సంస్థలు చాలా ఉన్నాయి. కేవలం చిరంజీవికో, రామచంద్రయ్యకో, గంటా శ్రీనివాసరావుకో పదవులు ఇచ్చినంత మాత్రాన పీఆర్పీ మొత్తాన్ని సంతృప్తి పరచినట్లు కాదు. అలాగని అందరికీ పదవులు ఇవ్వటం సాధ్యం కాదు. అయితే నియోజకవర్గాల్లో మా వారికి పనులు జరగాలి. వారికి తగిన స్థాయిలో గుర్తింపు ఇవ్వాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దీని గురించి పట్టించుకోవటం లేదు. ఇంకా మా వారిని పరాయి వారిగానే చూస్తున్నారు. సమస్యల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మా వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా బలోపేతం అవుతుంది? కేబినెట్ మంత్రిగా నేను కొన్ని విషయాలు బయటకు చెప్పలేను. సీఎం, పీసీసీ అధ్యక్షుడి స్థాయిలో కూడా పీఆర్పీ విలీనం లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నాలు జరగటం లేదు. అందుకే మా ఎమ్మెల్యేలు, నాయకులు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఈ వలసలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పెద్దలు దీన్ని గుర్తించి మా వారిని ఆదరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అవకాశం ఉంది. మా బాధలు మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అందుకే మేం ప్రతి చిన్న విషయానికీ హైకమాండ్‌తో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ పెద్దలకు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచన ఉందా? అనే అనుమానం కలుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కాంగ్రెస్‌కు జరగబోయే నష్టానికి చిరంజీవిని నిందించే అవకాశం ఉండదు. నేను చిరంజీవికి ఈ విషయం చెప్పాను. చిరంజీవి కూడా ప్రతిసారీ మా నాయకులను బుజ్జగించి ఊరకే ఉంచటం ఎందుకు చేస్తారు? పార్టీలో అసంతృప్తి ఎక్కువయ్యే కొద్దీ కేడర్ ఇతర పార్టీల్లోకి జారుకుంటుంది.’’ అని అన్నారు.
కాంగ్రెస్‌లో కలకలం
చిరంజీవికి అత్యంత సన్నిహితుడు, పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసే రాజకీయం నడిపిన వారిలో ముఖ్యుడైన సి.రామచంద్రయ్య.. కాంగ్రెస్ పరిస్థితి గురించి, ఆ పార్టీ నాయకుల గురించి, పీఆర్పీ ఎమ్మెల్యేల గురించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో కలకలం రేపుతున్నాయి. చిరంజీవికి తెలియకుండానే ఆయనీ మాటలు మాట్లాడి ఉండరని ఉభయ పార్టీల శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ తరఫున రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి.. అందుకు కృతజ్ఞతలు తెలపటం కోసం శనివారం ఢిల్లీలో సోనియాగాంధీని కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. అంతకు ముందు హామీ ఇచ్చినట్లు చిరంజీవికి కేంద్రంలో కేబినెట్ మంత్రి పదవి కాకుండా, సహాయ మంత్రి పదవి ఇస్తామని సోనియా కోటరీ ఆయనకు తెలిపారని సమాచారం. యూపీఏ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నందున అది కూడా ఇప్పటికిప్పుడు ఇచ్చే పరిస్థితి లేదని సోనియాకు అత్యంత సన్నిహితులైన ఏఐసీసీ నేతలు చిరంజీవికి కుండబద్దలు కొట్టినట్లు తెలిసింది. విలీన సమయంలో ఒక మాట, ఆ తర్వాత మరో మాట మాట్లాడుతున్న కాంగ్రెస్ పెద్దల వైఖరిపై చిరంజీవి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

Sunday, March 25, 2012

ఆత్మహత్యలు పరిష్కారం కాదు: సి.ఎం.

హైదరాబాద్,మార్చి 25:  తెలంగాణ సమస్య పరిష్కారానికి ఆత్మహత్యలు పరిష్కారం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  తెలంగాణపై కేంద్రం సరైన సమయంలో సానుకూల నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. యువత ఆవేశానికి, ఉద్వేగానికి లోనై తమ బంగారు భవిష్యత్తును కోల్పోవద్దని సూచించారు. బోజ్యా నాయక్ మృతి పట్ల సిఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బోజ్యా కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నేతల ఇళ్లపై ఆందోళనకారుల దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు కేంద్రానికి తెలుసునని చెప్పారు.
భావోద్వేగాలకు లోను కావొద్దు- చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా బోజ్యా నాయక్ మృతి పట్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. యువకులు భావోద్వేగాలకు లోను కావొద్దని చంద్రబాబు సూచించారు. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ హామీని నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఓటమి

హైదరాబాద్,మార్చి 25:  తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంట్‌లోనే తాడో పేడో తేల్చుకుంటామని తెలంగాణ ప్రాంత ఎంపీలు అన్నారు. మంత్రి జానారెడ్డి నివాసంలో రాష్ట్ర ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశమనంతరం ఎంపీలు మందా జగన్నాథం, ఎస్ రాజయ్య, గుత్తా సుఖేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...సీమాంధ్రుల కుట్రవల్లే తెలంగాణ ఏర్పాటులో ఆలస్యమవుతున్నదని ది అని అన్నారు. తెలంగాణ హామీని నిలబెట్టుకోలేకపోవడం వల్లనే ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని వారు తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చిన అన్ని పార్టీలు భోజ్యానాయక్ మృతికి బాధ్యత వహించాలన్నారు. ఉప ఎన్నికల్లో ఓటమికి బాధ్యత సీనియర్లది కాదని, ముఖ్యమంత్రి మార్పు, పీసీసీ మార్పు అంశాల్ని పార్టీ అధిస్టానం చూసుకుంటుందని వారు తెలిపారు.
భోజ్యానాయక్‌దే చివరి ఆత్మహత్య కావాలి: కేసీఆర్
 తెలంగాణ రాష్ట్ర సాధనలో భోజ్యానాయక్‌దే చివరి ఆత్మహత్య కావాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ కోసం ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని, తెలంగాణ రాష్ట్ర సాధన అనే గమ్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. తెలంగాణ అంశం పై  పార్లమెంట్‌ను స్తంభింప చేస్తామని అసెంబ్లీలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు పోరాటం చేస్తారని అన్నారు.
ముగిసిన భోజ్యానాయక్ అంత్యక్రియలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు ఆర్పించిన భోజ్యానాయక్ అంత్యక్రియలు వ వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం వీరారెడ్డి తండాలో ముగిసాయి. భోజ్యానాయక్ అంత్యక్రియల్లో భారీ ఎత్తున తెలంగాణవాదులు, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని పలువురు తెలంగాణవాదులు ప్రజలకు, విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. 

Saturday, March 24, 2012

అతిత్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ----చిరుకు చోటు...

న్యూఢిల్లీ,మార్చి 24:  రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవిని  కేంద్ర మంత్రి పదవి వరించనున్నది.  ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఏప్రిల్ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. .  రాష్ట్రం నుంచి చిరంజీవితో పాటు మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడానికి వీలుగా రాష్ట్రానికి కేంద్ర మంత్రి వర్గంలో ప్రాధాన్యం లభించవచ్చని చెబుతున్నారు. 2009 ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి వర్గ విస్తరణ చేశారు. అప్పుడు రాష్ట్రానికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. అదే ఫార్ములాను ఇప్పుడు కూడా అనుసరించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి వర్గంలో ఎస్ జైపాల్ రెడ్డి ఒక్కరే తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలో ఉన్నారు.  రాష్ట్రానికి చెందిన మిగతావారంతా సహాయ మంత్రులు కాగా, జైపాల్ రెడ్డి ఒక్కరిదే క్యాబినెట్ హోదా. అయినా , తెలంగాణకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా వచ్చే ఎన్నికలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు ఉన్నట్లు చెబుతున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడిన పార్లమెంటు సభ్యుడు హరీష్ రావత్‌కు కూడా కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పేలవ ఫలితాల నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీని సన్నద్ధం చేయడం లో  భాగంగా  కేంద్ర మంత్రి మండలిలో భారీగా మార్పుచేర్పులు చేయాలని అధిష్టానం భావిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాదిలో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతోపాటు వచ్చే ఏడాది కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలు, 2014లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ చర్య చేపట్టనుంది. మరోవైపు దేశంలోని లోక్‌సభ స్థానాల్లో దాదాపు సగం సీట్లు కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడులలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Friday, March 23, 2012

విడాకులు ఇక సులభతరం

న్యూఢిల్లీ,మార్చి 23: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 7 శాతం డీఏ పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినేట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన డీఏ జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. . భోపాల్ ప్రమాద బాధితులకు 1500 కోట్లు రూపాయల్ని ప్రభుత్వం ఇవ్వనుంది. బాధితల ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలను అందించనున్నారు. అంతేకాక హిందూ వివాహ చట్టంలో కీలక మార్పులు తీసుకువచ్చారు.  వివాహ చట్టంలో విడాకులు ఇక సులభతరం కానున్నాయి. విడాకులు పొందే సమయానికి భర్త సంపాదించిన ఆస్తిలో వాటా భార్యకు దక్కనుంది. దత్తత తీసుకున్న పిల్లలకు కూడా సమానమైన హక్కులు ఉంటాయి. 

రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు

హైదరాబాద్,మార్చి 23: : రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీ నందన నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం పంచాంగ పఠనం చేశారు. వివిధ రంగాలలో విశిష్ట పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని ప్రదర్శించిన పలువురికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉగాది పురస్కారాలు అందజేశారు. మంత్రులు వట్టి వసంత కుమార్, సి.రామచంద్రయ్య, బొత్స సత్యనారాయణ, కన్నా లక్ష్మీనారాయణ  పాల్గొన్నారు.

Thursday, March 22, 2012

నందనం...అభివందనం....

వార్తాప్రపంచం వీక్షకులకు శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... 

కిరణ్ కు బిగుస్తున్న అసమ్మతి ఉచ్చు...?

హైదరాబాద్ ,మార్చి 22:  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. తన రాజీనామా లేఖను ఆయన కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించారు. ఉప ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ  రాజీనామా సమర్పిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు.  ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరిపై ఆయన తన లేఖలో తీవ్రంగా ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మార్పునకు నాంది పలకాలని ఆయన అన్నారు. ఉప ఎన్నికలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్రికెట్‌తో పోల్చడం దురదృష్టకరమని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో అన్నారు. రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు అధికారమే పరమావధి కాకూడదని, దిగజారిపోతున్న పార్టీ ప్రతిష్టను కాపాడుకోవడానికి ఆలోచన చేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నాటి నుంచి ఇదే పరిస్థితి ఉందని, యువ శానసశభ్యులు అంతర్మథనంలో ఉన్నారని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు తాను మంత్రి పదవి ఏనాడూ అడగలేదని, అధిష్ఠానమే అవకాశం కల్పించిందని ఆయన అన్నారు. తాను ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. తాను సోనియా గాంధీ అపాయింట్‌మెంట్ కోరానని, అపాయింట్‌మెంట్ ఇవ్వగానే వెళ్లి కలుస్తానని ఆయన చెప్పారు.
కాగా, ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఆసరా చేసుకుని కాంగ్రెసులోని అసమ్మతి నాయకులు నాయకులు ఒక్కసారిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పై దాడికి దిగుతున్నారు.   వచ్చే 18 స్థానాలకు జరిగే ఉప ఎన్నికలను చూపి కిరణ్ కుమార్ రెడ్డిని దించేలా కాంగ్రెసు అధిష్టానంపై ఒత్తిడి తేవడమే అసమ్మతి నాయకుల ఉద్దేశంగా కనిపిస్తోంది. రానున్న 18 స్థానాల ఉప ఎన్నికలను ఎదుర్కునే సమర్థత కిరణ్ కుమార్ రెడ్డికి లేదనే సంకేతాలను పార్టీ అధిష్టానానికి బలంగా పంపించడమే అసమ్మతి వర్గం ఆలోచనగా చెబుతున్నారు.గురువారం ఉదయం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రిపై విమర్శలు సంధించడంతో ప్రారంభమై కిరణ్ కుమార్ రెడ్డిపై దాడి కొనసాగుతోంది. కాగా, మాజీ మంత్రి పి. శంకరరావు సరేసరి. ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిపైనే కాకుండా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు.  కాంగ్రెసు తెలంగాణ సీనియర్ నేత కె. కేశవరావు వైయస్ రాజశేఖర రెడ్డితో పోలుస్తూ కిరణ్ కుమార్ రెడ్డిపై వాగ్బాణాలు సంధించారు.  ఈ పథకరచనలో భాగంగానే గురువారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ డిఎల్ రవీంద్రా రెడ్డితో సమావేశమైనట్లు చెబుతున్నారు. 

ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం

మీర్పూర్,మార్చి 22:  ఉత్కంఠ భరితంగా సాగిన ఆసియాకప్ ఫైనల్లో పాకిస్తాన్ విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన డై అండ్ నైట్ ఫైనల్లో పాకిస్తాన్ 2 పరుగుల తేడాతో విజయం సాధించి ‘ఆసియా’ విజేతగా నిలిచింది. 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత పాకిస్తాన్‌ను ఆసియా కప్ వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 237 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్ధికి నిర్దేశించింది. విజయ లక్ష్యం తక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ రన్‌రేట్‌ను కాపాడుకుంటూ బ్యాటింగ్‌ను కొనసాగించింది. బంగ్లాదేశ్ కీలక తరుణంలో వికెట్లను కోల్పోవడంతో 234 పరుగులకే పరిమితమై ప్రతిష్టాత్మక ట్రోఫీని కైవసం చేసుకునే అవకాశాన్ని కోల్పోయింది.   

చెదరని భగవద్గీత...

మాస్కో,మార్చి 22 :  రష్యాలో జరిగిన న్యాయపోరాటంలో హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత మరోసారి విజయం సాధించింది. గీత రష్యన్ అనువాద ప్రతి తీవ్రవాదాన్ని ప్రేరేపించేలా ఉందని, దాన్ని నిషేధించాలని దాఖలైన పిటిషన్‌ను రష్యా కోర్టు తోసిపుచ్చింది. దీంతో కోర్టు హాల్లో గీత ఆరాధకులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం( ఇస్కాన్) వ్యవస్థాపకులు ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద అనువదించిన ఆ గీత ప్రతిని నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను గత డిసెంబరులో కింద కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సైబీరియా ప్రాసిక్యూటర్లు తోమ్క్ నగరంలోని కోర్టులో అప్పీలు చేశారు. గీతను నమ్మని వారి పట్ల పూర్తి విద్వేషాలను రగిల్చేలా ఆ అనువాదం ఉందని వారు ఆరోపించారు. అయితే తోమ్క్‌లోని అత్యున్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పునే సమర్థించిందని, అనువాద ప్రతిలో తీవ్రవాద భావజాలం లేదని పేర్కొందని ఇస్కాన్ మాస్కో విభాగానికి చెందిన సాధు ప్రియా దాస్ తెలిపారు. రష్యా న్యాయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపారు. రష్యాలో భారత రాయబారి అజయ్ మల్హోత్ర కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. భారత విదేశాంగ శాఖ కూడా హర్షం వ్యక్తంచేసింది. 

యూపీఏ సర్కార్ కు బొగ్గు మసి...!

న్యూఢిల్లీ,మార్చి 22 : యూపీఏ సర్కార్ కు మెడకు మరో ఉచ్చు పడింది.బొగ్గు గనులు వేలం వేయకపోవటం ద్వారా ప్రభుత్వానికి దాదాపు పది లక్షల కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు కాగ్ తన నివేదికలో తెలిపింది. దీనిపై తక్షణం చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు గురువారం నాడు పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపచేశాయి. ప్రశ్నోత్తరాలను రద్దు చేసి బొగ్గు కుంభకోణంపై చర్చ జరపాలని లోక్ సభలో విపక్షాలన్ని డిమాండ్ చేశాయి. దీంతో స్పీకర్ మీరాకుమార్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చర్చ జరగాల్సిందేనంటూ బీజేపీ సభలో పట్టుబట్టింది. దాంతో సభలో గందరగోళం నెలకొంది. దాంతో చైమన్  సమావేశాలను పదిహేను నిమిషాలు వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభం అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటలవరకూ వాయిదా పడింది. బొగ్గు కుంభకోణం 2జీ స్పెక్ట్రమ్ కంటే పెద్దదని బీజేపీ ఆరోపించింది. ఈ భారీ కుంభకోణంలో ప్రధాని కార్యాలయానికి ప్రమేయముందని మండిపడింది. తక్షణమే మన్మోహన్ సింగ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.

Wednesday, March 21, 2012

రాజీనామా స్థానాలు మళ్ళీ తెరాసాకే... మహబూబ్ నగర్లో మురిసిన భాజపా...కోవూరులో మెరిసిన వైకాపా

హైదరాబాద్,మార్చి 21:  ఉప ఎన్నికల్లో ఊహించినట్లుగానే తెలంగాణ రాష్ట్ర సమితి హవా నడిచింది. ఉద్యమ నేపధ్యంలో రాజినామా చేసిన స్థానాలను కొంచెం మెజారిటీ తగ్గినప్పటికీ విజయవంతంగా దక్కించుకోగలిగింది. ఉప ఎన్నికలు జరిగిన తెలంగాణలోని ఆరు స్థానాల్లో నాలుగు స్థానాలను తెలంగాణ రాష్ట్ర సమితి గెలుచుకోగా,  ఐదవ  స్థానంలో తెరాస బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. తెలంగాణవాదాన్ని బలంగా వినిపించిన బిజెపి అనూహ్యంగా మహబూబ్‌నగర్‌లో  విజయం సాధించింది. ఉప ఎన్నిక జరిగిన మరో స్థానం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఘోర ఓటమి చవి చూశాయి. నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో తెరాస అభ్యర్థి గంప గోవర్ధన్ భారీ ఆధిక్యతతో విజయం సాధించారు. ఆయన కాంగ్రెసు అభ్యర్థిపై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ డిపాజిట్ గల్లంతయింది. వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి టి రాజయ్య 32 వేల భారీ ఆధిక్యతతో తెలుగుదేశం అభ్యర్థి కడియం శ్రీహరిపై విజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెసు అభ్యర్థి డిపాజిట్ కోల్పోయారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి జోగు రామన్న విజయం సాధించారు. తెలంగాణవాదం బలహీనంగా ఉన్న దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో కూడా తెరాస విజయం సాధించింది. కొల్లాపూర్‌లో తెరాస అభ్యర్థి జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. కాంగ్రెసు, తెలుగుదేశం రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి. మంత్రి డికె అరుణ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడినప్పటికీ జూపల్లి కృష్ణారావు విజయాన్ని అడ్డుకోలేకపోయారు. నాగర్ కర్నూలులో నాగం జనార్దన్ రెడ్డి విజయం సాధించారు. ఇక మహబూబ్‌నగర్‌లో తొలుత కాంగ్రెసు అభ్యర్థి ముత్యాల ప్రకాష్ ఆధిక్యంలోకి వచ్చినప్పటికీ చివరి నిమిషంలో  తెరాస అభ్యర్థి ఇబ్రహీం నాలుగో స్థానం నుంచి ఏకంగా మొదటి స్థానానికి ఎగబాకారు. అయితే ఆఖరు రౌండ్‌లో బిజెపి అభ్యర్థి యెన్నం శ్రీనివాస రెడ్డి అనూహ్యంగా స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించారు.   కోవూరులో వైయస్సార్ కాంగ్రెసు అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ మూడవ స్థానానికి పరిమితమైంది.
ముఖ్యమంత్రి నైరాశ్యం
ఉప ఎన్నికల్లో తాము ఆశించిన ఫలితాలు రాలేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిఅన్నార్. రాజకీయంగా సమర్థవంతంగా పని చేయలేక పోయామని  అన్నారు. కాంగ్రెసు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లలేక పోయామన్నారు. అద్భుతాల సృష్టికి తన వద్ద ఎలాంటి అద్భుత దీపం లేదన్నారు. కాంగ్రెసు ఓటమికి అందరిదీ బాధ్యతేనని, ముఖ్యమంత్రిగా తన కూడా బాధ్యత కూడా ఉందని అన్నారు. కోవూరులో మొదటి నుండి కాంగ్రెసు పార్టీ పైన వ్యతిరేకత ఉందన్నారు. ఫలితాలపై ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు.  పని తీరు మెరుగుపర్చుకుంటామని చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యమవుతోందని,  పరిష్కారం  కేంద్రం చేతిలోనే  ఉందని చెప్పారు. ఓటమికి విద్యుత్ కొరత కూడా ఓ కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఫలితాలను సమీక్షిస్తాం: బాబు
 ఎన్నికల ఫలితాలను తాము సమీక్షించుకుని, ముందుకు పోవడానికి ఏం చేయాలో ఆలోచన చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు చెప్పారు. . తెలంగాణ విషయంలో తమది పరిమితమైన పాత్ర అని,  సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెసు పార్టీ,, కేంద్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. అనవసరంగా తమపై తెలంగాణ విషయంలో నిందలు వేస్తున్నారని ప్రజలకు చెప్పామని, తమ వాదనను తెలంగాణ ప్రజలు కొంత మేరకు విశ్వసించారని ఆయన అన్నారు. తెలంగాణకు తాము అన్యాయం చేయలేదని, తమ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరిగిందని చెప్పగలిగామని ఆయన అన్నారు. తమ పార్టీ శాసనసభ్యులను లాక్కుని ఉప ఎన్నికలు తెచ్చారని ఆయన విమర్శించారు.
విశ్వసనీయతకు పట్టం: జగన్
విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోవూరు ఫలితంపై అన్నారు. కోవూరులో తమ పార్టీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విజయం సాధించడంపై ఆయన స్పందించారు నీతిమాలిన రాజకీయాలకు వ్యతిరేకంగానే కోవూరు ఉప ఎన్నిక ఫలితం వచ్చిందని ఆయన అన్నారు. విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 

Tuesday, March 20, 2012

తిరుపతి ఉపఎన్నికకు టి.డి.పి. అభ్యర్ధిగా మోహన్ బాబు ?

హైదరాబాద్,మార్చి 20:   కలెక్షన్ కింగ్ మోహన్ బాబును తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఆహ్వానించారు. సోమవారం మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు చిత్తూరులోని శ్రీ విద్యానికేతన్‌లో జరిగిన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు సూచించారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.  ఆయన రాజకీయాల్లోకి వస్తే తాను స్వాగతిస్తానని చెప్పారు.  మోహన్ బాబు మాట్లాడుతూ.. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించి రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేశారని అన్నారు.  ఐటి రంగంలో ప్రపంచానికి ధీటుగా హైదరాబాదును నిలిపారన్నారు. రాజకీయ ఆరంగేట్రంపై  స్పందించేందుకు ఇది సరైన వేదిక కాదని చెప్పారు. చిరంజీవి కాంగ్రెస్ లో చేరి రజ్యసభకు ఎన్నిక కానుండడ్మ్ తో తిరుపతి అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో టి.డి.పి. అభ్యర్ధి గా  మోహన్ బాబును బరిలో దింపాలన్నది బాబు వ్యూహం గా  కనిపిస్తోంది..
పోటీకి చిరు కుటుంబం దూరం?
కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు చిరంజీవి రాజ్యసభకు వెళ్లనుండటంతో ఖాళీ అవుతున్న తిరుపతి నియోజకవర్గంలో మంత్రి గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్ బరిలో నిలిచే అవకాశముందని అంటున్నారు. రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. తిరుపతిలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరని చెప్పారు. చిరంజీవి రాజ్యసభకు వెళ్లిన పక్షంలో తిరుపతి నుండి చిరంజీవి సోదరుడు నాగబాబు లేదా భార్య సురేఖ పోటీ చేయవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. అయితే చిరు తాజా ప్రకటన తో  గల్లా అరుణ కుమారి తనయుడు గల్లా జయదేవ్  కాంగ్రెస్  అభ్యర్ధి గా బరిలో దిగే అవకాశం ఉంది. అరోవైపు చిరుపై అభిమానులు వత్తిడి తెస్తే ఆయన కుటుంబం నుంచి నాగబాబు లేదా  సురేఖ పోటీ తప్పకపోవచ్చు. 

శారదకు ఎన్టీఆర్,బాలయ్యకు రఘుపతి వెంకయ్య అవార్డులు...

హైదరాబాద్,మార్చి 20:   2010 సంవత్సరానికి సంబంధించి మూడు జాతీయ, ఒక రాష్ట్రీయ చలనచిత్ర అవార్డుల విజేతలను  జి.ఆదిశేషగిరిరావు నేతృత్వంలోని జ్యూరీ  ప్రకటించిందిప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ చలన చిత్ర అవార్డుకు సినీ నటి శారద ఎంపికయ్యారు. ఈ  అవార్డు కింద రూ.5 లక్షల నగదు పారితోషికంతోపాటు ప్రత్యేక జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని ప్రదానం చేస్తారు. బీఎన్ రెడ్డి జాతీయ చలనచిత్ర అవార్డుకు మా భూమి దర్శకుడు బి.నర్సింగరావు ఎంపికయ్యారు. నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డుకు నిర్మాత ఏవీఎం శరవణన్ బాలసుబ్రహ్మణ్యన్ ఎంపికయ్యారు. రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును నటుడు, నిర్మాత, దర్శకుడు ఎం.బాలయ్య కు లభించింది. ఈ అవార్డుల విజేతలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల నగదు బహుమతితోపాటు జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేస్తారు. ప్రత్యేక జ్యూరీ అవార్డుకు నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఎంపికయ్యారు. 

Monday, March 19, 2012

బడ్జెట్ కు త్రివేది బలి...

పదవికి రాజీనామా _ కొత్త రైల్వేమంత్రిగా ముకుల్ రాయ్     
న్యూఢిల్లీ,మార్చి 18: తృణమూల్ కాంగ్రెసులో వివాదం ముగిసింది. రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఎట్టకేలకు రాజీనామా చేశారు. రైల్వే చార్జీలను పెంచుతూ ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్, ఆయన పదవికే ఎసరు తెచ్చింది. ఒకవైపు పార్టీ అధ్యక్షురాలు రాసిస్తే తప్ప రాజీనామా చేయబోనని మొండికేస్తూనే, ఆమెపై తనకు గౌరవం ఉందని చెబుతూ వచ్చిన త్రివేదీ... పార్టీ ఒత్తిడితో తన పదవిని వదులుకోవడం విశేషం. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన త్రివేదీ, ఆదివారం సాయంత్రం పార్టీ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత రాజీనామా సమర్పించారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపించారు. ఆయన స్థానంలో ముకుల్ రాయ్ రైల్వే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
 

చిరుకు చివరకు రాజ్యసభ ...

హైదరాబాద్,మార్చి 18:  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సంచలన  నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్న నలుగురు సిట్టింగులకు  షాకిచ్చింది. వారి స్థానంలో నాలుగు కొత్త ముఖాలకు చోటు కల్పించింది.  ఆంధ్ర ప్రదేశ్ నుంచి తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి, తెలంగాణ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాపోలు ఆనందభాస్కర్‌లను పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేసింది. రాష్ట్రానికి చెందిన ఈ నలుగురు, ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఆరుగురు అభ్యర్థుల పేర్లను కలిపి మొత్తం 10మందితో జాబితాను విడుదల చేశారు. రాష్ట్రానికి సంబంధించి తొలుత చిరంజీవి, రేణుకాచౌదరి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి పేర్లను ప్రకటించిన హైకమాండ్.. ఆ తరువాత కొద్దిసేపటికి నాలుగో అభ్యర్ధిగా అనూహ్యంగా రాపోలు పేరును ప్రకటించింది. నాలుగో సీటును రాష్ట్రేతరులకు కేటాయించడం ఆనవాయితీగా వస్తుండటంతో ఆ సీటు కోసం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్, బీహార్‌కు చెందిన షకీల్ అహ్మద్, కర్ణాటకకు  చెందిన మాజీ రైల్వే మంత్రి జాఫర్ షరీఫ్‌లు తీవ్రంగా ప్రయత్నించినా చివరకు నిరాశే ఎదురైంది. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రేతర సంప్రదాయాన్ని పక్కనపెట్టి నాలుగు సీట్లనూ రాష్ట్రానికే కేటాయించినట్లు హైకమాండ్ పెద్దలు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ నుండి సిఎం రమేష్, దేవేందర్ గౌడ్
ఇక తెలుగుదేశం పార్టీ  సిఎం రమేష్, దేవేందర్ గౌడ్ పేర్లను ఖరారు చేసింది. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో   తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో వీరి  పేర్లను  ఖరారు  చేసింది. .
కె.కె.నిర్వేదం
రాజ్యసభ సీటు రాదని తనకు ముందే తెలుసనని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు చెప్పారు. ఈ విషయంలో తనకు బాధలేదన్నారు. తెలంగాణ గురించి మాట్లాడడం వల్లే పదవి రాలేదనన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. తెలంగాణపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పదవి రాకపోయినా తెలంగాణ ప్రజల ఆకాంక్షను ముందుకు తీసుకెళతానని చెప్పారు. తనకు కావాల్సింది పదవులు కాదు, తెలంగాణ అని అన్నారు. తనపై అధిష్టానానికి ఎటువంటి వ్యతిరేకత లేదన్న నమ్మకాన్ని కేశవరావు వ్యక్తం చేశారు. హైకమాండ్ నిర్ణయాన్నితప్పుబట్టబోనని అన్నారు. 

ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: 21న ఫలితాలు

హైదరాబాద్,మార్చి 18:ఏడు అసెంబ్లీ స్థానాలకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  రికార్డు స్థాయిలో అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 84 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు.  కొల్లాపూర్ నియోజకవర్గంలో 75 శాతం, మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 70 శాతం, నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 70 శాతం, కామారెడ్డి నియోజకవర్గంలో 68 శాతం, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో 64 శాతం, ఆదిలాబాద్ నియోజకవర్గంలో 61 శాతం పోలింగ్ జరిగిందని వివరించారు. ఈ శాతాల్లో మార్పులు చేర్పులు ఉండొచ్చన్నారు. ఏడు చోట్ల ఈవీఎంల్లో సాంకేతిక సమస్యలు తప్ప మిగతా అన్ని చోట్ల పోలింగ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు. కొన్నిచోట్ల జాబితాల్లో పేర్లు లేవనే ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై విచారణ జరిపిస్తామని, ఉద్దేశపూర్వకంగా పేర్లను తొలగిస్తే అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వరంగల్‌లో కాంగ్రెస్ ఎంపీ రాజయ్య నియమావళికి విరుద్ధంగా ప్రచారం చేసినట్లు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై కలెక్టర్ నుంచి పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ట్రిపుల్ ఐటీ విద్యార్థులతోపాటు ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీలు, పోలింగ్ సిబ్బందికి భన్వర్‌లాల్ అభినందనలు తెలియజేశారు. ఉప ఎన్నికలు జరిగిన ఏడు స్థానాల ఓట్ల లెక్కింపు ఈ నెల 21వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని భన్వర్‌లాల్ చెప్పారు. 

విరాట్విజయం....ఫైనల్ ఆశలు సజీవం

ఢాకా,మార్చి 18: బంగ్లాదేశ్ చేతిలో ఓటమితో భంగపడ్డ భారత్... తన ప్రతాపాన్ని పాకిస్థాన్‌పై చూపించింది. ఏకంగా తమ వన్డే చరిత్రలోనే అత్యధిక విజయలక్ష్యానీ లక్ష్యాన్ని (330) ఛేదించింది. విరాట్ కోహ్లి విజృంభణ తో భారత్ ఆరు వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది.  చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో భారత్ తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఓడించి  రేసులో నిలిచింది. ఇక టోర్నీలోని ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై శ్రీలంక గెలిస్తే భారత్ ఫైనల్‌కు చేరుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ గెలిస్తే... పాకిస్థాన్‌ను ఓడించామన్న  తృప్తి మిగులుతుంది. 330 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 47.5 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లి (148 బంతుల్లో 183; 22 ఫోర్లు, 1 సిక్సర్)  ఇన్నింగ్స్కు, సచిన్ (48 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ (83 బంతుల్లో 68; 5 ఫోర్లు, 1 సిక్సర్) ల నిలకడ తోడవడంతో భారీ లక్ష్యాన్ని భారత్  ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 329 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (113 బంతుల్లో 105; 9 ఫోర్లు, 1 సిక్సర్), నాసిర్ జంషేడ్ (104 బంతుల్లో 112; 10 ఫోర్లు, 1 సిక్సర్) సెంచరీలతో చెలరేగి ఆడారు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 224 పరుగులు జోడించారు. యూనిస్‌ఖాన్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు) వేగంగా ఆడి అర్ధసెంచరీ చేశాడు.

Saturday, March 17, 2012

3 రోజులు నగల వ్యాపారం బంద్‌

న్యూఢిల్లీ, మార్చి 17:  బ్రాండెడ్‌ బంగారం ,వెండి దిగుమతులపై కస్టంస్ డ్యూటీ పెంచడంపై దేశవ్యాప్తంగా బంగారం వర్తకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  17,18,19 తేదీలలో 3 రోజులు నగల వ్యాపారం బంద్‌ చేస్తున్నట్లు అఖిల భారతీయ రత్నాలు,ఆభరణాల వాణిజ్య సమాఖ్య ప్రకటించింది. జంటనగరాల్లో బంగారం వర్తకులు ఈ బంద్‌కు  మద్ధతు తెలిపారు. మూడు రోజుల పాటు నగల దుకాణాలు మూసివేయాలని నిర్ణయించారు. 1962-92 మధ్య కాలంలో కూడా ఇలాగే చేయడం వలన పరిశ్రమ కుదేలైందని, దీంతో ఆభరణాల దుకాణాలను మూసివేయాల్సిన పరిస్ధితి ఏర్పడిందని , ఇప్పటికే పెరిగిన బంగారం ధరతో సతమతమౌతున్న తమకు పన్ను పోటునుంచి ఊరట కలిగించాలని జ్యూయెలరీ  అసోసియేషన్ లు విజ్ఞప్తి చేస్తున్నాయి.

Friday, March 16, 2012

భారత్ పై బంగ్లా సంచలన విజయం

మీర్‌పూర్,మార్చి 16:  ఆసియా కప్‌లో బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకా 4 బంతులు మిగిలి వుండగానే ఛేదించి భారత్‌కు షాకిచ్చింది. భారత్‌తో శుక్రవారం షేర్ బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ అద్భుత విజయాన్ని చేజిక్కించుకుని ఫైనల్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. బంగ్లా ఆటగాళ్లలో తమీమ్ ఇక్బాల్ 70 పరుగులతో శుభారంభాన్నివ్వగా, జాహురుల్ ఇస్లామ్(53), నాసిర్ హుస్సేన్ (54) పరుగులతో ఆకట్టుకున్నాడు. చివర్లో హకిబుల్ హసన్ (49), రహీమ్ (45)పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత్ బౌలర్లు సమష్టిగా విఫలమై బంగ్లా విజయానికి బాటలు వేశారు. ఒక్క ప్రవీణ్ కుమార్ మాత్రమే  మూడు వికెట్లు తీశాడు. భారత్  ఫైనల్ కు చేరాలంటే ఈ నెల 18న పాక్ తో జరిగే మ్యాచ్ లో గెలవాల్సి ఉంది. 

శతశతక వీరుడు....

మీర్పూర్ , మార్చి 16 :  ఎట్టకేలకు సచిన్ చరిత్ర సృష్టించాడు. ఏడాదిగా ఎదురు చూస్తున్న వందవ సెంచరీ కొట్టాడు. ఆసియా కప్‌లో భాగంగా భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇక్కడ జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో సచిన్ సెంచరీ చేశాడు.  138 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ తో సెంచరీ పూర్తిచేసి అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్ గా అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టెస్ట్ లో 51వ సెంచరీలు చేసిన సచిన్ వన్డేల్లో 49వ సెంచరీలు చేశాడు.  

సామాన్యులకు ఇది తొక్కలో బడ్జెటే...!

న్యూఢిల్లీ, మార్చి 16 : కేంద్ర ఆర్థిక  మంత్రి ప్రణబ్ ముఖర్జీ  శుక్రవారం పార్లమెంట్ కు సమర్పించిన 2012-2013 బడ్జెట్ లో వ్యక్తిగత ఆదాయం పన్ను పరిమితిని రెండు లక్షల రూపాయలకు పెంచారు.  రెండు లక్షలు దాటి ఐదు లక్షల వరకు గల ఆదాయంపై 10 శాతం పన్ను విధించనున్నారు. అలాగే ఐదు నుంచి పది లక్షల వరకు 20 శాతం, అటుపైన పది లక్షల నుండి ఆ పై ఆదాయంపై 30 శాతం ఆదాయం పన్ను విధిస్తారు.
 బడ్జెట్ ముఖ్యాంశాలు...
ఎన్ జి రంగా విశ్వవిద్యాలయానికి 100 కోట్లు
ప్రకాశం, గుంటూరు జిల్లాలకు మెగా హ్యాండ్ లూమ్ క్లస్టర్స్
చిత్రపరిశ్రమకు  సేవా పన్ను తొలగింపు
వెయ్యి జనాభా గల గ్రామాలకు బిజినెస్ కరస్పాండెంట్ లు
విమాన ఇంధనం నేరుగా విదేశాల నుంచి కొనుగోలు
25 లక్షలలోపు గృహ రుణాలకు ఒక శాతం వడ్డీ రాయితీ
వితంతు, వికలాంగులకు పింఛన్ రూ.200 నుంచి రూ.300లకు పెంపు
10 శాతంగా ఉన్న సర్వీసు ట్యాక్స్ 12 శాతానికి పెంపు- విందు, వినోదం, విహారాలు ఇక ప్రజలకు భారం
పెద్ద కార్లపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంపు
ఎలక్ట్రానిక్‌ వస్తువుల ధరలు పెరిగే అవకాశం
సిగరెట్‌, బీడీలు, పాన్‌ మసాలలు, గుట్కాల పై  పన్ను పెంపు
పెరగనున్న మొబైల్ బిల్లులూ
 బ్రాండెడ్ రిటైల్ గార్మెంట్లపై 10 శాతం పన్ను
ఉప్పు,   అగ్గిపెట్టెలు, సౌర దీపాల ధరలు,   ప్యాకేజి ఆహారం ధరలు తగ్గింపు
తగ్గనున్న ఎల్.సి.డి ., ఎల్.ఇ.డి,, స్వదేశీ మొబైల్ , బ్రాండెడ్ వెండి ఆభరణాలు, క్యాన్సర్, హెచ్,ఐ,వి, మందుల ధరలు 
ప్లాటినం దిగుమతిపై సుంకం 10 శాతం పెంపు
బంగారం దిగుమతిపై సుంకం 5 శాతం పెంపు

అట్టహాసంగా అఖిలేష్ ప్రమాణం...

లక్నో,మార్చి 15:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీని విజయపథంలో నడిపించిన అఖిలేష్ యాదవ్ రాష్ట్ర 33వ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.  ఈ పదవి చేపట్టిన అత్యంత పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. లక్నోలోని లా మార్టినెరె కళాశాల మైదానంలో భారీ జనసందోహం నడుమ అంగరంగ వైభవంగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి పలు పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అఖిలేష్ భార్య డింపుల్, తండ్రి, పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ తదితర కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పంజాబ్ సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, ఐఎన్‌ఎల్డీ అధినేత ఓంప్రకాశ్ చౌతాలా, సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీపీఐ నేత ఎ.బి.బర్ధన్, ఎస్పీ మాజీ ఎంపీ, నటి జయా బచ్చన్, పారిశ్రామికవేత్తలు అనిల్ అంబానీ, సుబ్రతో రాయ్, కాంగ్రెస్ తరఫున కేంద్ర మంత్రి పవన్‌కుమార్ బన్సల్, సీనియర్ నేత మోతీలాల్ వోరా, బీఎస్పీ మాజీ మంత్రులు నసీముద్దీన్ సిద్దిఖీ, స్వామిప్రసాద్ మౌర్య తదితరులు ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఉన్నారు. అఖిలేష్‌తోపాటు కేబినెట్ మంత్రులుగా 28 మంది, సహాయ మంత్రులుగా 19 మంది ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఎం.ఎల్.జోషీ వీరందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.   

మమత తో కటీఫ్ కు కాంగ్రెస్ యోచన ?

సమాజ్‌వాదీపార్టీ వైపు చూపు

న్యూఢిల్లీ,మార్చి 15:  చీటికీ మాటికీ చిక్కులు తెచ్చి పెడుతున్న తృణమూల్ కాంగ్రెసు అధ్యక్షురాలు మమతా బెనర్జీని వదిలించుకుని, సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌తో జత కట్టాలని కాంగ్రెసు నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా, రైల్వే మంత్రి దినేష్ త్రివేది రాజీనామా వ్యవహారాన్ని ఆసరా చేసుకుని తృణమూల్ కాంగ్రెసుతో తెగదెంపులు చేసుకోవాలని  అందుకు బదులుగా  ములాయం సింగ్‌ నేతృత్వం లోని సమాజ్ వాదీ తో జతగట్టాలని  కాంగ్రెసు భావిస్తున్నట్టు సమాచారం. ఎస్పీకి లోకసభలో 22 మంది సభ్యులున్నారు. కేంద్ర మంత్రివర్గంలో చేరాలని కాంగ్రెసు నాయకులు ములాయం సింగ్‌ను ఆహ్వానిస్తున్నారు. తృణమూల్, కాంగ్రెసు మధ్య అవిశ్వాసం నెలకొనడం ఇదే మొదటి సారి కాదు. ఇప్పటికే పలు సార్లు మమతా బెనర్జీ కాంగ్రెసుకు హెచ్చరికలు ఇచ్చారు. త్రివేదిని మంత్రి వర్గం నుంచి తొలగించి, ఆ స్థానంలో ముకుల్ రాయ్‌ని నియమించాలని కోరుతూ మమతా బెనర్జీ బుధవారంనాడు లేఖ రాశారు. మమతా బెనర్జీ విజ్ఞప్తిని అంగీకరించినట్లు మొదట సూచనలు ఇచ్చిన కాంగ్రెసు నాయకత్వం ఆ తర్వాత మొత్తం సీన్‌ను మార్చేసింది. త్రివేది రాజీనామా చేయలేదని ప్రభుత్వం ప్రకటించింది. దినేష్ త్రివేదిని తప్పించుకుండా మమతా బెనర్జీకి షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతో కాంగ్రెసు నాయకత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. అందుకే మమతా బెనర్జీ కాంగ్రెసుపై మండిపడుతున్నారు.  తమ పార్టీ యుపిఎ నుంచి వైదొలగదని, యుపిఎ చెక్కు చెదరదని తృణమూల్ కాంగ్రెసు పార్టీ నాయకుడు సుదీప్ బంధోపాధ్యాయ చెప్పారున. కానీ, మమతా బెనర్జీ తలనొప్పిని వదిలించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెసు నాయకత్వం నాటకాన్ని రక్తి కట్టిస్తోందని అంటున్నారు.  మరో వైపు యుపిఎకు మద్దతిచ్చే విషయంపై ములాయం సింగ్ చూసుకుంటారని ఉత్తరవ్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.

Wednesday, March 14, 2012

మమత మండిపాటు-త్రివేది సర్దుబాటు

న్యూఢిల్లీ,మార్చి 14:  ప్రయాణికుల చార్జీలు పెంచడంపై రైల్వే మంత్రి దినేష్ త్రివేదిపై తృణమూల్ కాంగ్రెసు అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బడ్జెట్‌లో చార్జీలు పెంచుతూ దినేష్ త్రివేది చేసిన ప్రతిపాదనలను  ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ డిమాండ్ చేశారు. బడ్జెట్ ప్రతిపాదనలపై తమ పార్టీ రైల్వే మంత్రి దినేష్ త్రివేదితో చర్చించలేదని కేంద్ర మంత్రి, తృణమూల్ కాంగ్రెసు నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. పేద ప్రజల ప్రయోజనాలను కాపాడాలని తమ నేత మమతా బెనర్జీ తమకు బోధించారని, అందువల్ల చార్జీల పెంపును తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన అన్నారు.
 కాగా, ప్రయాణికుల చార్జీలు పెంచుతున్న విషయం తమ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి తెలియదని, బడ్జెట్‌కు తాను పూర్తి బాధ్యత వహిస్తానని త్రివేది అన్నారు. మమతా బెనర్జీ ఎప్పుడూ తన శాఖలో తలదూర్చలేదని చెప్పారు. బడ్జెట్ కు సంబంధించి ఆమెని తాను సలహాలు గానీ, సూచనలు గానీ అడగలేదన్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టడంలో తన విధిని తను నిర్వర్తించానన్నారు. రైల్వే బడ్జెట్ కు టిఎంసికి సంబంధంలేదని స్పష్టం చేశారు. రైల్వేకు ఎయిరిండియా గతి పట్టకూడదనే చార్జీలు పెంచానని  దినేష్ త్రివేది  వివరణ ఇచ్చారు. ఐసియులో ఉన్న రైల్వే వ్యవస్థని బయటకు తెచ్చానన్నారు. రైల్వేకు ఏది మంచిదో అదే చేశానని చెప్పారు. అందరూ అన్నీ కావాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. పెంచిన చార్జీలు తగ్గించే ప్రసక్తిలేదని తెగేసి చెప్పారు. అవసరమైతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. 

రాష్ట్రంలో అయిదు ఆదర్శ రైల్వే స్టేషన్లు

న్యూఢిల్లీ,మార్చి 14: కొత్త రైల్వే బడ్జెట్ లో మన రాష్ట్రంలో అయిదు రైల్వేస్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా ప్రకటించారు. దువ్వాడ, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, సత్తెనపల్లి రైల్వే స్టేషన్లను ఆదర్శ స్టేషన్లుగా పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంఎంటిసి రెండవదశకు అనుమతించారు..  కోరుకొండ - విజయనగరం డబ్లింగ్ పనులను పూర్తి చేయాలని నిర్ణయించారు. మన రాష్ట్రంలో కొన్ని కొత్త రైలు మార్గాలను ప్రతిపాదించారు. కోటిపల్లి - నర్సాపూర్, కడప - బెంగళూరు, నడికుడి - శ్రీకాళహస్తి, విజయవాడ - గుడివాడ రైలు మార్గాలను ప్రతిపాదించారు. బీబీనగర్ - నల్లపాడు రైలు మార్గాన్ని విద్యుద్దీకరించాలని ప్రతిపాదించారు. కొన్ని మార్గాలను రైల్వే లైన్ సర్వే కోసం ఎంపిక చేశారు.
మణిపూర్ సి.ఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఓక్రామ్ ఇబోబీ సింగ్

పంజాబ్ సి.ఎం గా ఐదవ పర్యాయం ప్రమాణ స్వీకారం చేస్తున్న ప్రకాష్ సింగ్ బాదల్

రైల్వేఛార్జీలు పెంపు:ఫ్లాట్ ఫాం టిక్కెట్ ఇక రు.5

న్యూఢిల్లీ,మార్చి 14:   కొత్త రైల్వే మంత్రి దినేష్ త్రివేది ఛార్జీల పెంపుతో ప్రయాణికులకు షాక్ ఇచ్చారు.  అన్ని తరగతులకు కిలోమీటర్ కు రెండుపైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. అలాగే ఫ్లాట్ ఫాం టిక్కెట్ ధర రూ.3 నుంచి రూ.5 కు పెరిగింది. స్లీపర్ క్లాస్ కు కిలోమీటర్ కు అయిదు పైసలు, ఫస్ట్ క్లాస్ ఏసీకి కిలోమీటర్ కు 30 పైసలు, సెకండ్ ఏసీకి 15 పైసలు, థర్డ్ ఏసీకి పది పైసలు పెంచారు. రైవే చార్జీలు పెంచడం పదేళ్ళ  తరువాత ఇదే మొదటిసారి.  రైల్వే ఉద్యోగులకు  78 రోజుల బోనస్ ను రైల్వే మంత్రి  ప్రకటించారు.  ప్రతి ఏడాది పదిమంది క్రీడాకారులకు రైల్ ఖేల్ రత్న అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. అన్ని రైళ్లకు జీపీఎస్ సౌకర్యం, కొత్త కేటరింగ్ కోసం పైలట్ ప్రాజెక్టు చేపట్టడం, ఢిల్లీ-జోద్ పూర్ మధ్య హైస్పీడ్ రైలుకు ప్రతిపాదన, రాష్ట్రాలు  సహకరించే ప్రాజెక్టులకు పెద్దపీట, ఇండియన్ రైల్వేస్టేషన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, రైల్వేబోర్డు పునర్ వ్యవస్థీకరణ్, రైల్వే బోర్డులో కొత్తగా ఇద్దరు సభ్యులకు చోటు. స్టేషన్లు, రైళ్లలో పరిశుభ్రతకు ప్రత్యేక హౌస్ కీపింగ్ బాడీ ఏర్పాటు, ప్రతి మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో త్వరలోనే వికలాంగులకు ప్రత్యేక బోగీ ఏర్పాటు---  బడ్జెట్ లోని ఇతర ముఖ్యాన్శాలు. కాగా మొబైల్ ఎస్ ఎంఎస్, గుర్తింపు పత్రాన్ని ఈ టిక్కెట్ గా పరిగణిస్తామని మంత్రి తెలిపారు. ఈ ఏడాది 75 ఎక్స్ ప్రెస్, 21 కొత్త ప్యాసింజర్ రైళ్లు, అయిదు డీఎంయూలు, ఎనిమిది ఎంఈఎంయూలు, 2,500 బోగీల్లో గ్రీన్ టాయిలెట్ లు ఏర్పాటు,  వచ్చే ఏడాదికల్లా 1100 కిలోమీటర్ల మేర విద్యుద్దీకరణ ను  బడ్జెట్ లో ప్రతిపాదించారు. రూ.60,100 కోట్ల రైల్వే వార్షిక బడ్జెట్ గత రైల్వే బడ్జెట్ల కంటే  భారీ బడ్జెట్  అని మంత్రి తెలిపారు. వచ్చే అయిదేళ్లలో 19వేల కిలోమీటర్ల ట్రాక్ ల నవీకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. అలాగే దేశంలోని అన్ని మారుమూల ప్రాంతాలకు రైల్వేలను విస్తరిస్తామన్నారు.

రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి షరా మాములే...

న్యూఢిల్లీ,మార్చి 14:  రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం షరా మాములే. హైదరాబాద్ ఎంఎంటిఎస్ రెండో దశకు గత బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామన్న హామి, కాకినాడ - విశాఖ కారిడార్‌లో రైల్వే లైన్ల అభివృద్ధి ప్రతిపాదన మినహా చెప్పుకో  దగ్గ విశేషమేదీ లేదు.  కాకినాడ - విశాఖ తీర ప్రాంత రైల్వే లైన్ల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడతారట. కాకినాడ - పిఠాపురం ప్రాజెక్టును ప్రభుత్వ భాగస్వామ్యంలో చేపట్టడానికి  భూమిని, నిధులను సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని రైల్వే మంత్రి చెప్పారు. మెదక్ - అక్కన్నపేట, భద్రాచలం - కొవ్వూరు మధ్య రైల్వే లైన్లను ఏర్పాటు ను కూడా బడ్జెట్ లో ప్రతిపాదించారు. 

Tuesday, March 13, 2012

ఉత్తరాఖండ్ సి.ఎం. గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న విజయ్ బహుగుణ

ఆసియాకప్‌లో భారత్ శుభారంభం

మీర్‌పూర్,మార్చి 13: ఆసియాకప్‌లో భాగంగా ఇక్కడ శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 50 పరుగుల తేడాతో  విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది.  305 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన లంకేయులు 254 పరుగులకు ఆలవుట్ అయ్యారు.  ఆదిలోనే దిల్షాన్ 7 పరుగులకే అవుటయ్యి అభిమానులను నిరాశ పరిచాడు. అనంతరం జయవర్ధనే సూపర్ ఇన్నింగ్స్, సంగక్కరా అద్భుత ఇన్నింగ్స్ లంకను గెలించలేకపోయాయి. అనంతరం మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో లంక ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ నాలుగు వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించగా, వినయ్ కుమార్, అశ్విన్‌లు తలో మూడు వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. కొహ్లి (108), గంభీర్ (100) సెంచరీలు సాధించారు. సచిన్ 6 పరుగులు చేశాడు. ధోనీ 46, రైనా 30 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. లంక బౌలర్లలో మహరూp 2 వికెట్లు పడగొట్టాడు. లక్మాల్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.

కేంద్రమంత్రి హరీష్ రావత్ నిరసనాస్త్రం...

పదవికి రాజీనామా  
న్యూఢిల్లీ,మార్చి 13:  కేంద్రమంత్రి హరీష్ రావత్  రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించారు. ఉత్తరాఖండ్ సిఎం పదవికి విజయ్ బహుగుణను ఎంపిక చేయటంపై నిరసనగా హరీశ్‌ రావత్‌ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయనకు 11మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపటంతో కొత్తపార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం. 

ఎయిర్ పోర్టు బస్సు దగ్ధం

హైదరాబాద్ ,మార్చి 13: శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రయాణికులతో వెళుతున్న ఏరో  ఎక్స్ ప్రెస్ బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. కిషన్‌గూడా చౌరస్తా వద్ద  బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ 45 మంది ప్రయాణికులను సురక్షితంగా క్రిందికి దించారు. శంషాబాద్ నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపల బస్సు మొత్తం కాలిపోయింది. ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాద కారణాలు తెలియరాలేదు. 

ఉత్తర భారత దేశంలో మళ్ళీ భూప్రకంపనలు

న్యూఢిల్లీ :ఉత్తర భారత దేశంలో మళ్ళీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.37 నిముషాలకు ఉత్తర ప్రదేశ్‌, ఢిల్లీ లలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.5 గా నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ను భూకంప కేంద్రంగా గుర్తించారు. ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. నార్త్‌లో నిన్న కూడా ప్రకంపనలు సంభవించాయి. వరుస ప్రకంపనలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

Monday, March 12, 2012

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ

న్యూఢిల్లీ ,మార్చి 12:  ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా విజయ్ బహుగుణ పేరును  కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.  తెహ్రీ లోక్ సభ సభ్యునిగా ఉన్న విజయ్ బహుగుణ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి హేమావతీ నందన్ బహుగుణ కుమారుడు. ఉత్తర ప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు రీటా బహుగుణకు విజయ్ బహుగుణ సోదరుడు.

ఎర్రబెల్లి అరెస్టు

హైదరాబాద్,మార్చి 12: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావును పోలీసులు సోమవారం  వరంగల్ జిల్లా  జఫర్‌గడ్‌లో  అరెస్టు చేశారు. నాలుగు రోజుల క్రితం ఎర్రబెల్లి దయాకర రావు ఎర్రబెల్లి జఫర్‌గడ్ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. ఆయన్ పై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎర్రబెల్లిపై విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు. ఆ కేసులో  ఆయనను అరెస్టు చేశారు. వరంగల్ కోర్టు ఆయనకు రెండు వారాలు రిమాండ్ విధించింది. . కాగా ఎర్రబెల్లిని కోర్టుకు హాజరు పర్చే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆయనను  లోనికి తీసుకు వెళ్లే సమయంలో తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. దీంతో లాయర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. 

సుప్రీం నోటీసులపై శాసనసభలో గందరగోళం

హైదరాబాద్,మార్చి 12: జగన్ ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు ఆరుగురు రాష్ట్ర మంత్రులకు నోటీసులు జారీచేయడంపై శాసనసభలో గందరగోళం చెలరేగింది. ఆరుగురు మంత్రులు రాజీనామా చేయాలని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీనిపై సభలో చర్చించాలని గట్టిగా పట్టుబట్టారు. దీనిపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తూ మీడియాలో వచ్చిన అంశాలపై సభలో చర్చించడం సరికాదన్నారు. అసత్యాలను సభకు తీసుకొచ్చి చర్చించాలని కోరడం సబబు కాదన్నారు. కోర్టు ఏం చెప్పిందో తనకు తెలియదన్నారు. వాస్తవాలు తెలిశాక అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమన్నారు. అధికార, ప్రతిపక్ష వాదోపవా దాలతో సభ దద్దరిల్లింది. దీంతో స్పీకర్ సభను  వాయిదా వేశారు.

విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాల విడుదల

హైదరాబాద్,మార్చి 12: : విఆర్ ఓ, విఆర్ ఎ పరీక్షా ఫలితాలను మంత్రి రఘువీరా రెడ్డి విడుదల చేశారు. ఉప ఎన్నికల కారణంగా వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, నెల్లూరు, మహబూబ్ నగర్ జిల్లాల ఫలితాలను నిలిపివేశారు.  ఈ ఫలితాలను jntucgg.nic.in వెబ్ సైట్ లో చూడవచ్చు. ఎంపిక విధానం మూడు దశలలో ఉంటుందని అధికారులు తెలిపారు. ఎంపిక, శిక్షణ, నియామక ఉత్తర్వులు అనే మూడు దశలలో జరుగుతుంది. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. సర్టిఫికెట్లు అన్ని సక్రమంగా ఉంటే అదే రోజు ఎంపికైనట్లు ఉత్తర్వులు ఇస్తారు. ప్రస్తుతం జనరల్ మెరిట్ జాబితాని మాత్రమే ప్రకటించారు. 15న అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శిక్షణ ఉంటుందని సిసిఎల్ ఎ కమిషనర్ జె. .సత్యనారాయణ తెలిపారు.  

జగన్ ఆస్తుల కేసులో ఆరుగురు అమాత్యులకు సుప్రిం నోటీసులు

న్యూఢిల్లీ,మార్చి 12:  వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసు లో సుప్రీం కోర్టు సోమవారం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరుగురు మంత్రులు, ఎనిమిది మంది ఐఏఎస్‌లను విచారించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రులు గీతా రెడ్డి, కన్నా లక్ష్మీ నారాయణ, పొన్నాల లక్ష్మయ్య, మోపిదేవి వెంకట రమణ, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలకు , ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి, శామ్యూల్, రత్నప్రభ, ఎస్వీ ప్రసాద్, ఆదిత్యనాథ్, మన్మోహన్ సింగ్, సివిఎస్‌కె శర్మ, శ్యాంబాబు తదితర అధికారులకు  నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని వారిని కోర్టు ఆదేశించింది. మంత్రులను ప్రశ్నించకపోవడంపై వివరణ ఇవ్వాలని సిబిఐని కూడా కోర్టు ఆదేశించింది. జగన్ ఆస్తుల కేసులో జగన్ ఒక్కడినే విచారించడం సరికాదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సుధాకర్ రెడ్డి అనే న్యాయవాది వేసిన ఆయన పిటిషన్‌పై   కోర్టు  మంత్రులు, ఐఏఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. సుధాకర్ రెడ్డి అంతకుముందు ఇదే విషయంపై హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టు ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో అతను సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వైఎస్సార్ హయాంలో 26 వివాదాస్పద జీవోల విడుదల వెనుక మంత్రులు, అధికారుల ప్రమేయముందని పిటిషనర్ ఆరోపించారు.

Sunday, March 11, 2012

ఒబామా కొలువులో మరో ఇద్దరు ఎన్నారైలు

వాషింగ్టన్,మార్చి 11:  ఇద్దరు ప్రముఖ భారతీయ అమెరికన్‌లను ఆ దేశ అధ్యక్షుడు ఒబామా కీలక పదవుల్లో నియమించారు.   ప్రస్తుతం హెన్రీ ఫోర్డ్లో చీఫ్ లెర్నింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న.పౌల్ గంగోపాధ్యాయను  నేషనల్ మ్యూజియం అండ్ లైబ్రరీ సర్వీస్ బోర్డులో సభ్యునిగా నియమించగా,  ఒరిగన్ స్టేట్ యూనివర్శిటీలోని అగ్రికల్చర్ సైన్స్ కళాశాలలో డీన్‌గా, డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న  మరో ఎన్నారై సోనీ రామస్వామిని అమెరికా వ్యవసాయ విభాగమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ (ఎన్‌ఐఎఫ్‌ఏ) డెరైక్టర్‌గా నియమించారు. వీరి నియామకంతో వైట్‌హౌస్‌లో కొత్తగా కీలక పదవులు చేపట్టిన భారతీయుల సంఖ్య ఆరుకు చేరింది. 

Saturday, March 10, 2012

అఖిలేష్ కే యు.పి.పగ్గాలు...

లక్నో,మార్చి 10:  ముఖ్యమంత్రి పీఠాన్ని ములాయం సింగ్ కుమారుడు,సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అధిష్టించనున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపింది. 38 యేళ్ళ అఖిలేష్ యాదవ్ గురువారం  సి.ఎం.గా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం పగ్గాలు అఖిలేష్‌కు కట్టబెట్టే విషయంలో ములాయం తన పార్టీ సీనియర్లు ఆజంఖాన్, శివ్‌పాల్ యాదవ్‌లను ఒప్పించినట్లు వివరించింది. ఇందుకు ప్రతిగా ఆజంఖాన్‌కు అసెంబ్లీ స్పీకర్ పదవి, శివ్‌పాల్‌కు కీలక మంత్రిత్వశాఖ దక్కవచ్చని పేర్కొంది. ములాయం ఆరోగ్యం క్షీణిస్తుండటం కూడా అఖిలేష్‌ను సీఎం చేయాలనేందుకు ఉన్న కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన సంచలన విజయానికి కారణమైన అఖిలేష్‌నే సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతూ వచ్చారు.  పార్టీ ప్రచారంలో భాగంగా 12 వేల కి.మీ. రథయాత్ర చేపట్టడం, 250 బహిరంగ సభల్లో పాల్గొన డం వంటి చర్యల ద్వారా అఖిలేష్ యువతకు దగ్గరయ్యారని ఆయన  మద్దతు దారులు అంటున్నారు.

Friday, March 9, 2012

అలనాటి బాలీవుడ్ నటుడు జాయ్ ముఖర్జీ మృతి

ముంబై,మార్చి 9:  అలనాటి బాలీవుడ్ నటుడు జాయ్ ముఖర్జీ ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 73 సంవత్సరాలు. మూడు రోజుల క్రితం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను ఆస్పత్రిలో చేర్చారు. ప్రముఖ నిర్మాత, ఫిల్మాలయా స్టూడియో అధినేత సశాధర్ ముఖర్జీ కుమారుడు. దేబ్ ముఖర్జీ, షోము ముఖర్జీలు జాయ్ సోదరులు. ప్రముఖ బాలీవుడ్ తారలు కాజోల్, తనిష్ట తల్లి తనూజాను జాయ్ సోదరుడు షోమూ పెళ్లాడారు. 1960 సంవత్సరంలో ప్రముఖ నటి సాధన సరసన లవ్ ఇన్ సిమ్లా అనే చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి జాయ్ అడుగుపెట్టారు. ఆతర్వాత ఫిర్ వోహి దిల్ లాయా హూ, లవ్ ఇన్ టోక్యో, జిద్ది, ఏక్ ముసాఫిర్ ఏక్ హసీనా లాంటి పలు విజయవంతమైన చిత్రాలతో అభిమానుల్ని ఉర్రూతలూగించారు. అంతేకాక లవ్ ఇన్ బాంబే, ఛైలా బాబు, సాంజ్ కీ భేలా, ఉమీద్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. 

ద్రావిడ్ అస్త్రసన్యాసం... క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్

బెంగళూర్,మార్చి 9:  టీమిండియా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ క్రికెట్ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. బెంగళూర్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36 సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. తన 16 ఏళ్ల క్రికెట్ కెరీర్ ఇంత విజయవంతంగా ముగుస్తుందని ఎప్పుడు ఊహించలేదని అన్నారు. తనను అభిమానించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. నేటి కాలమంతా యువకులదే అని, చరిత్ర సృష్టించే సత్తా వీరి సొంతమని ఆయన అన్నారు.తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు. తన నిర్ణయాన్ని సచిన్ స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు. క్రికెట్ జీవితంలో పొగడ్తలూ ఉన్నాయి, విమర్శలూ ఉన్నాయని ఆయన అన్నారు. టీమిండియాలో విభేదాలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

Thursday, March 8, 2012

. ఎంఎంటీఎస్‌ నడిపిన తొలి మహిళా డ్రైవర్

సికింద్రాబాద్,మార్చి 8:  దక్షిణ మధ్య రైల్వేలో మొట్టమొదటి మహిళా రైలు డ్రైవర్‌గా సత్యవతి అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున  బాధ్యతలు చేపట్టారు. హైదారాబాదులోని మాతృభూమి మహిళా స్పెషల్‌ ఎంఎంటీఎస్‌ రైలును ఆమె విజయవంతంగా నడిపారు. లింగంపల్లి నుంచి సికింద్రాబాదు వరకూ ఈ రైలును  సత్యవతి నడిపారు.

అసీస్ కే ముక్కోణపు సిరీస్‌

అడిలైడ్,మార్చి 8:  కామన్‌వెల్త్ బ్యాంక్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడవ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు పోరాడి ఓటమి పాలైంది. విజయానికి కావాల్సిన 232 లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్ చేపట్టిన లంక జట్టులో టాప్ ఆర్డర్  విఫలం కావడం తో   16 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. ముక్కోణపు సిరీస్‌ను 3-2 తేడాతో ఆస్ట్రేలియా గెలుచుకుంది. టాస్ గెలిచి శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా జట్టును బౌలర్లు మహారూఫ్, హెరాత్ లు కట్టడి చేశారు. ఓ దశలో 177 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు ఏడు వికెట్లు కోల్పోయింది. అయితే ఎనిమిదో వికెట్‌కు క్రిస్టియన్‌తో కలిసి బ్రెట్‌లీ 42 పరుగుల్ని జోడించడంతో ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బౌలర్లలో మహారూఫ్, హెరాత్ మూడేసి వికెట్లు, కులశేఖర 2, దిల్షాన్ 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా జట్టులో అత్యధికంగా వేడ్ 49, వార్నర్ 48, బ్రెట్‌లీ 32, మెక్‌కే 28 పరుగులు తప్ప మిగితా ఆటగాళ్ళెవరూ  రాణించలేదు.ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్రను పోషించి 5 వికెట్లు పడగొట్టిన మెక్ కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఉమెన్స్ డే స్పెషల్...

నటి రాధాకుమారి మృతి

హైదరాబాద్,మార్చి 8:   ప్రముఖ నటుడు రావి కొండలరావు సతీమణి, నటి రాధాకుమారి (70) అనారోగ్యంతో  కన్నుమూశారు. నాటక రంగంనుండి చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాధాకుమారి తనదైనా సంభాషణా చాతుర్యంతో పలుచిత్రాలలో అమ్మగా అమ్మమ్మగా నటించి మెప్పించారు.నాలుగు దశాబ్దాలుగా తెలుగులో అనేక చిత్రాల్లో నటించారు. రాధాకుమారి ,రావికొండల రావులు వెండితెరపై కూడా భార్యాభర్తలుగా నటించారు. రాధాకుమారి సుమారు 600 చిత్రాల్లో నటించారు. ఆమె మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర సంతాపం తెలిపింది. చందమామ, ఇట్లు మీ శ్రేయోభిలాషి, నువ్వు లేక నేను లేను , బృందావనం తదితర సినిమాల్లో రాధాకుమారి అద్భుత నటన కనబర్చారు.
 మొదటిసారిగా ఆదుర్తి సుబ్బారావు  దర్శకత్వంలో అందరూ నూతన తారలతో తయారైన తేనె మనసులు (1965) సినిమాలో నటించింది. ఈ చిత్రంలో 20 ఏళ్ళ వయసులో హీరో కృష్ణకు సవతి తల్లిగా నటించి మెప్పించింది.
కొంతకాలం విరామం తర్వాత  తిరిగి   నువ్వులేక నేనులేను తో సినిమాలలో నటించడం ప్రారంభించారు.
 బుల్లితెర సీరియల్ రాధ-మధు లో ప్రముఖ పాత్ర పోషించారు.

Wednesday, March 7, 2012

ఆడదే ఆధారం...మన కథ ఆడనె ఆరంభం...


యు.పి.వేరు...ఎ.పి.వేరు...అజాద్

న్యూఢిల్లీ, మార్చి 7 :  ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై ఉండదని  కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాం నబీ అజాద్ అన్నారు.  యూపీలో సంస్థాగత లోపాల వల్లే ఓడిపోయామని, అక్కడ పార్టీ వ్యవస్థ పటిష్టంగా లేదని ఆజాద్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఆరు నియోజక వర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్ధులనే గెలిపించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉందని, అంచేత ఆ పార్టీ అభ్యర్ధులకే ఓటు వేయాలని ఆజాద్ కోరారు. రాజ్యసభ సీట్ల విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అజాద్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు మరోసారి అవకాశం ఇస్తామని తాము చెప్పలేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందనే వార్తల్లో నిజంలేదని అజాద్ పేర్కొన్నారు.

ప్రజల మూడ్ మూడో ఫ్రంట్ వైపే...బాబు

 హైదరాబాద్,మార్చి 7: రాబోయే రోజులు మూడో ఫ్రంట్‌వేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ప్రజల మూడ్ అర్ధం అవుతోందని, రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం ఇస్తున్న ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్ధాయిలో బలపడటానికి తమ వంతు పాత్రను పోషిస్తామని ఆయన చెప్పారు. ''సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు దెబ్బ తిన్నాయి. ఫైనల్స్‌లో గెలవబోయేది మూడో ఫ్రంటే. అది ఎలా రూపు దిద్దుకోబోయేదీ కొద్ది కాలంలోనే వెల్లడవుతుంది. దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలదే హవా. వాటిలోనూ మంచి పాలన ఇవ్వగలరన్న నమ్మకం ఉన్నవారివైపు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు సమర్ధ నాయకత్వం కోరుకొంటున్నారు. సోనియా గాంధీ కుటుంబం ఉత్తర ప్రదేశ్‌లో సకల ప్రయత్నాలు చేసినా గెలవలేకపోయింది. బిజెపి కూడా పుంజుకోలేదు. జాతీయ పార్టీల అవసరం లేకుండా ప్రజలు ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యుపి, పంజాబ్ వంటి అన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా తీర్పు వచ్చింది. ప్రాంతీయ నాయకులు బలోపేతం అవుతున్నారు. మున్ముందు ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో సహకార ఫెడరలిజం దేశంలో వర్ధిల్లుతుంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి వామపక్షాలకు దూరం కాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విభజన కోరుకొన్న బిఎస్‌పి ఉత్తర ప్రదేశ్‌లో ఓడిపోవడానికి...ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేదని, అక్కడి పరిస్ధితులు వేరని ఆయన అన్నారు.

ఓటర్లదే బాధ్యత...

హైదరాబాద్,మార్చి 7:  రాష్ట్రంలో సైకిల్ కు తుప్పుపట్టిందని, ఇక ముందుకు పోదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. అయిదు రాష్ట్రాల ఫలితాలు తాత్కాలిక విఘాతం  మాత్రమేనని చెప్పారు. యు.పి.లో ఎస్ పి మేనిఫెస్టోలో ఉన్న హామీలు అన్నీ ఇక్కడ అమలు చేస్తున్నవేనని అన్నారు.  ఉప ఎన్నికలు జరుగవలసిన 17 స్థానాల్లో ఇన్ చార్జ్ లను నియమించే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తేనే ఎన్నికలలో గెలుపు సాధ్యం అన్నారు. ఉప ఎన్నికలలో పోటీ గట్టిగానే ఉంటుందని ఆయన చెప్పారు. ఎన్నికలనాటి పరిస్థితులను బట్టే ఫలితాలు ఉంటాయని,  అభివృద్ధి ఒక్కటే ఓటుకు ప్రాతిపదిక కాద వ్యఖ్యానించారు.  ప్రజలలోకి వెళ్లి ఓటు అడగటానికి అభివృద్ధి కావాలని చెప్పారు. తాను అనుకున్నంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ గెలవదని, ప్రజలు కూడా అనుకోవాలని ఆయన అన్నారు. అంతిమ ఫలితాలకు ఓటర్లదే బాధ్యత అని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్ ప్రజలు తప్పు తెలుసుకుంటారు-మాయావతి

గవర్నర్  కు రాజీనామా సమర్పిస్తున్న మాయావతి
లక్నో,మార్చి 7:   ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బి.ఎస్.పి. ఘోర పరాజయంతో   ముఖ్యమంత్రి మాయావతి గవర్నర్ కు తన రాజీనామాను సమర్పించారు. అనంతరం  విలేకరులతో మాట్లాడుతూ సమాజ్ వాదీ పార్టీ బూటకపు వాగ్దానాలతో  ప్రజలను మోసం చేసిందన్నారు.  దళితులు ఇప్పటికీ తనవైపే ఉన్నారని చెప్పారు. యుపికి కేంద్రం చేసింది ఏమీలేదన్నారు.    కేంద్రం సహకరించకపోయినా యూపీ అభివృద్ధికి కృషి చేసానని మాయావతి పేర్కొన్నారు. తాను సీఎంగా అధికారం చేపట్టే సమయంలో యూపీ గందరగోళంగా ఉందని, ఐదేళ్లలో మంచి పాలన అందించామని మాయవతి తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు విధానాలవల్లే బీఎస్పీకి ఓట్లు చీలాయని మాయావతి ఆరోపించారు. రిజర్వేషన్ల అంశాన్ని బీజేపీ,కాంగ్రెస్‌లు స్వార్ధం కోసం వాడుకున్నాయని, ఓబీసీలను బీఎస్పీ నుంచి దూరం దూరం చేశాయని అన్నారు. బీఎస్పీ ప్రవేశపెట్టిన పథకాలను సమాజ్‌వాది పార్టీ కొనసాగిస్తుందన్న నమ్మకం తమకు లేదని మాయావతి పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీఎస్పీ కృషి చేసిందని ఆమె తెలిపారు. ఉత్తరప్రదేశ్ ప్రజలు చేసిన తప్పేమిటో త్వరలోనే తెలుసుకుంటారని మాయావతి అన్నారు.

ధరల పెరుగుదలా కారణమే: సోనియా

న్యూఢిల్లీ,మార్చి 7:  ఐదు రాష్ట్రాల  ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ తెలిపారు. దేశంలో జరిగే ప్రతి ఎన్నికలు తమకొక గుణపాఠమేనని, ఎన్నికల ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకుంటామని అన్నారు. యూపీలో ఆయా ప్రాంతాల్లో అభ్యర్థుల ఎంపిక లో పొరపాట్లు జరిగాయని, ధరల పెరుగుదల కూడా ఓటమికి కారణంగా సోనియా పేర్కొన్నారు.  యూపీలో పార్టీ మూలాలు బలంగా లేకపోవడం, కింది స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా లేకపోవడమే పార్టీ ఓటమికి కారణమని సోనియా గాంధీ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు కాబట్టే సమాజ్‌వాది పార్టీకి పట్టం కట్టారని సోనియా పేర్కొన్నారు. ఈ ఫలితాలు యూపీఏ ప్రభుత్వంపై ప్రభావం చూపవని, ప్రధానమంత్రిని మార్చే ప్రసక్తే లేదని సోనియా స్పష్టం చేశారు. ఉత్తరాఖాండ్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. గోవాలో ప్రభుత్వ వ్యతిరేకత వల్లే ఓడిపోయామన్నారు. పంజాబ్‌లో తిరుగుబాటు అభ్యర్థులు దెబ్బ తీశారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడం వల్ల తాము గెలవలేకపోయామని ఆమె అన్నారు. అవినీతిపై తీవ్రంగా పోరాడింది కాంగ్రెసు పార్టీయేనని ఆమె చెప్పారు.

ఇక అడిలైడ్ లో ఆఖరి పోరాటం

అడిలైడ్ ,మార్చి 6:   ముక్కోణపు వండే సిరీస్ లో శ్రీలంక-ఆస్ట్రేలియా మధ్య నిర్ణయాత్మక మూడో ఫైనల్ గురువారం  అడిలైడ్ లోజరుగుతుంది. ఓవల్‌లో మంగళవారం జరిగిన రెండో ఫైనల్లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై గెలిచి బెస్టాఫ్ త్రీ ఫైనల్స్ సిర్రీస్ ను 1-1 తో సమం చేసింది.  272 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక... 44.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 274 పరుగులు చేసి అలవోకగా నెగ్గింది. ఓపెనర్ దిల్షాన్ (119 బంతుల్లో 106; 10 ఫోర్లు) అద్భుతంగా ఆడి సెంచరీ సాధించాడు. మరో ఓపెనర్, కెప్టెన్ జయవర్దనే (76 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ తో అర్ధసెంచరీ చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 27.1 ఓవర్లలో 179 పరుగులు జోడించి విజయానికి పునాది వేశారు. సంగక్కర (57 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు) సమయోచితంగా ఆడి చివరి వరకూ క్రీజులో ఉండి విజయానికి కావలసిన పరుగులు చేశాడు.  నిలకడగా ఆడిన  చండిమల్ (17 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు) సంగక్కరకు అండగా నిలిచాడు. ఆసీస్ బౌలర్లలో బ్రెట్‌లీ, ప్యాటిన్సన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (140 బంతుల్లో 100; 4 ఫోర్లు, 1 సిక్సర్) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ చేశాడు. కెప్టెన్ మైకేల్ క్లార్క్ (91 బంతుల్లో 117; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) వేగంగా ఆడి శతకం చేశాడు. వార్నర్, క్లార్క్ మూడో వికెట్‌కు 184 పరుగులు జోడించడం విశేషం. లంక బౌలర్లలో మలింగ మూడు వికెట్లు తీసుకోగా... దిల్షాన్ ఒక్క వికెట్ పడగొట్టాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన దిల్షాన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

యు.పి. ని ప్రగతి బాట పట్టిస్తాం: అఖిలేష్ యాదవ్

లక్నో,మార్చి 6:    ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, ములాయం కుమారుడు  అఖిలేష్ యాదవ్ తెలిపారు. ముస్లింల అభ్యున్నతి కోసం సచార్, రంగనాథ్ మిశ్రా కమిటీలు చేసిన సిఫార్సులను కూడా అమలు చేస్తామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఎస్పీకి మద్దతిచ్చారని, తమ పార్టీ ఎన్నికల్లో ప్రస్తావించిన అంశాలను జనం అంగీకరించినట్టు దీన్నిబట్టి స్పష్టమవుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రయోజనమున్న అంశాలపై వీధుల్లోకి వచ్చి పోరాడిన ఏకైక పార్టీ ఎస్పీయేనన్నారు. వెనుకబడిన యూపీని తమ పాలనలో అభివృద్ధి బాట పట్టిస్తామని, రాష్ట్రంలో అవినీతి రహిత వాతావరణాన్ని నెలకొల్పుతామని అఖిలేష్ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక మాయావతి విగ్రహాలను, బీఎ స్పీ చిహ్నమైన ఏనుగు విగ్రహాలను కూల్చబోమని అఖిలేష్ స్పష్టం చేశారు.

Tuesday, March 6, 2012

బాధ్యత నాదే : రాహుల్

న్యూఢిల్లీ,మార్చి 6:  ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయానికి తనదే బాధ్యతని కాంగ్రెస్ యువనేత రాహుల్‌గాంధీ అంగీకరించారు. ఈ ఎన్నికలు  తనకు మంచి పాఠాన్ని నేర్పాయని చెప్పారు.  యూపీలో ప్రజల మూడ్ సమాజ్‌వాదీ పార్టీ వైపు ఉందని, అక్కడ బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పునాదులను బలోపేతం చేసేవరకు పరిస్థితి మారదన్నారు. అయితే 2007తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైనట్టు కనిపిస్తోందన్నారు.  అక్కడ పార్టీ స్థితిగతుల్ని మెరుగుపర్చుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అవును. నేను ప్రచారం చేశాను. దీనికి బాధ్యత నేనే తీసుకుంటున్నా.. మేమందరం పార్టీ కోసం పోరాడాం. కానీ మంచి ఫలితాలు రాలేదు. ప్రచారంలో ప్రజలకిచ్చిన వాగ్దానాల మేరకు నేను ఇకపై కూడా గ్రామాల్లో, పొలాల్లో, పట్టణాల్లో కనిపిస్తాను. యూపీలో పార్టీని నిలబెట్టడానికి నా ప్రయత్నాల్ని సాగిస్తాను. నా పని నేను చేస్తూనే ఉంటాను’’ అని చెప్పారు. ‘‘ఇది నా ఓటముల్లో ఒకటి. దాన్ని నేను స్వీకరిస్తున్నాను. దారి పొడవునా విజయాలు ఉండాలని నేను ఆశిస్తాను. అలాగే ఓటములను కూడా..! వచ్చే ఫలితాలను స్వీకరిస్తాను’’ అని పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని సునిశితంగా ఆలోచించే తనను, ఈ ఫలితాలు కూడా అదే తీరున ఆలోచింపచేస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. కాగా, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవ ప్రదర్శనపై కలత చెందిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తానన్నారు. యూపీ ఫలితాలు తనను ఎంతగానో కలచివేశాయని, నిరుత్సాహపరిచాయని పేర్కొన్నారు. తప్పు చేశానన్న భావన వెంటాడుతోందన్నారు. కానీ తాను కాంగ్రెస్ నమ్మకమైన సిపాయినని...ఎన్నికల ఫలితాలకు పూర్తి బాధ్యత తీసుకుంటానన్నారు. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ సృష్టించిన సానుకూల పవనాలను పేలవమైన రాష్ట్ర నాయకత్వం కారణంగా ఓట్లుగా మలుచుకోలేకపోయామని, న్నారు. ఇదే తమ అతిపెద్ద తప్పిదమని విశ్లేషించారు.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...