Wednesday, August 31, 2011

గణపతిపప్పా మోరియా...

వార్తాప్రపంచం వీక్షకులకు ' వినాయకచవితి ' శుభాకాంక్షలు...

ది బాడీగార్డ్స్...

సల్మాన్‌ ఖాన్‌-కరీనాకపూర్‌ జంటగా హిందీలో రీమేకైన  మలయాళ చిత్రం ‘బాడీగార్డ్‌’  బుధవారం నాడు విడుదలైంది. ఎన్నడూ లేనంతగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఏకంగా  120 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్‌ చేయడం ఓ విశేషం. ఒక్క హైదరాబాద్‌లోనే  సల్లూభాయ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని 52 థియేటర్లలో రిలీజ్‌ చేశారు. ఇక తెలుగు రీమేక్‌  ‘గంగ ది బాడీగార్డ్‌’  చిత్రంలో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నారు. త్రిష వెంకీ సరసన రొమాన్స్ చేయనుంది. సల్మాన్ బాడీగార్డు చిత్ర ప్రభావం వెంకీ చిత్రంపై పడే అవకాశాలున్నాయని వ్యాపారవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకే కథ, కథనంతో రూపొందిన చిత్రం కావడం తో ప్రేక్షకులకు ఒకే సినిమా చూశామన్న ఫీలింగ్‌ ఉంటుందేమోననేది క్రిటిక్స్ అభిప్రాయం. ఈ నేపథ్యంలో చాలా కాలంగా ఆశించిన స్థాయి హిట్లు లేక సతమతం అవుతున్న వెంకటేష్ కు సల్మాన్ రూపంలో భయం వెంటాడుతోంది. కొంపతీసి సల్మాన్ ఖాన్ ఏపీలో కలెక్షన్లు కొల్లగొడితే వెంకీకి ఏమీ మిగలవు అనే వాదన వినిపిస్తోంది. 

సకల జనుల సమ్మెమరోసారి వాయిదా?

హైదరాబాద్ ,అగస్ట్  31:  తెలంగాణ ప్రాంతంలో సకల జనుల సమ్మె మరోసారి వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమ్మె వాయిదా పడినప్పటికి వరుసగా ఉద్యమ కార్యాచరణ రూపొందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత నెల 17వ తారీఖు నుండే సకల జనుల సమ్మె ప్రారంభించాలనుకున్నప్పటికీ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరుల అభ్యర్థన మేరకు సమ్మెను విడతల వారీగా విభజిస్తూ సెప్టెంబర్ 6వ తేది నుండి ఉద్యోగులు సమ్మె ఉంటుందని చెప్పారు. అయితే ఇప్పుడు వినాయక చవితి రావడంతో మరోసారి జెఏసికి సమ్మె వాయిదా కోసం పలువురు విజ్ఞప్తి చేశారు. దీంతో మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. అయితే ఉద్యోగుల సమ్మె వాయిదా పడినప్పటికీ వరుస కార్యక్రమాల రూపకల్పనకు జెఏసి పథక రచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 6వ తారీఖుకు బదులు ఉద్యోగులు 13 నుండి సమ్మెకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈలోగా 8, 9, 10వ తేదీల్లో దశల వారిగా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తారు. మరో రెండు మూడు రోజుల్లో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య ప్రమాణ స్వీకారం

చెన్నై: తమిళనాడు గవర్నర్‌గా కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేశారు. రోశయ్య ప్రమాణస్వీకార కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, మంత్రివర్గ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రోశయ్యకు జయలలిత శుభాకాంక్షలు తెలిపారు. రోశయ్య చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్బాల్ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణస్వీకారం అనంతరం ఎంపీ సుబ్బిరామిరెడ్డి, మంత్రి పితాని సత్యనారాయణ, జేడీ శీలం, పీ. సుశీల, విజయకాంత్, ఆనం రామ్‌నారాయణరెడ్డి, శంకర్‌రావు, శశిధర్‌రెడ్డి, కేవీపీ, నన్నపనేని, బొత్స సత్యనారాయణ, చిరంజీవి పుష్పగుచ్ఛాలు అందచేసి శాలువాలతో సన్మానించారు.

Tuesday, August 30, 2011

                    వార్తాప్రపంచం వీక్షకులకు " రంజాన్ " శుభాకాంక్షలు...

రాజీవ్‌ హంతకులకు ఉరిపై ఎనిమిది వారాలు స్టే

చెన్నై,అగస్ట్ 30:  మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసు నిందితులకు స్వల్పంగా ఊరట లభించింది. రాజీవ్ హంతకులకు సెప్టెంబర్9న అమలు చేయనున్న ఉరిశిక్షపై మద్రాస్ హైకోర్టు మంగళవారం స్టే విధించింది. ఎనిమిది వారాల పాటు ఉరిశిక్ష అమలును న్యాయస్థానం నిలిపివేసింది. నిందితుల తరపున ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మాలనీ వాదించారు. కాగా ఉరిశిక్షను రద్దు చేయాలంటూ కోర్టు వెలుపల పలువురు ఆందోళనకు దిగారు. మరోవైపు రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. 

Monday, August 29, 2011

తడిసి ముద్దయిన ముంబై

ముంబై,అగస్ట్ 29:  వర్షంతో ముంబై నగరం సోమవారం తడిసి ముద్దయింది. ప్రజలు కార్యాలయాలకు బయలుదేరే సమయంలో వర్షం అంతరాయం కలిగించింది. సెంట్రల్‌ లైన్‌లోని బైకుల్లా, దాదర్, థానే వంటి ప్రధాన స్టేషన్లను ట్రాక్‌లపై నీరు చేరడంతో మూసివేశారు. రోజుకు 30 లక్షల మంది ప్రయాణించే పశ్చిమ లైన్‌లో రైళ్లు  ఆలస్యంగా నడిచాయి.  సోమవారం ఉదయం 11 గంటలకు బయలుదేరాల్సిన విమానాలు 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరాయి. . నగరంలోని మున్సిపల్ పాఠశాలలను మూసేశారు. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిశోధనా శాఖ అంచనా వేస్తోంది. వర్షాలు వచ్చిన ప్రతిసారీ ముంబై నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.

అన్నాహజారే బాటలో కోదండరామ్

హైదరాబాద్,అగస్ట్ 29: రాష్ట్ర సాధన కోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే బాటలో నడుస్తానని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. అన్నా హజారే లాగా ఉద్యమించి తెలంగాణ సాధిస్తామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సకల జనుల సమ్మెను వాయిదా వేయాలనే మంత్రి శ్రీధర్ బాబు సూచన అర్థరహితమని ఆయన అన్నారు. వచ్చే నెల 6వ తేదీ నుంచి సకల జనుల సమ్మెను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 2011 లోనే తెలంగాణ సాధించేలా కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.

Sunday, August 28, 2011

రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి 150వ చిత్రం

తిరుపతి,అగస్ట్ 28: : శాసనసభ్యుడు చిరంజీవి తన 150వ చిత్రంపై మరోసారి స్పందించారు. తాను 150వ చిత్రంలో తన సోదరుడు, నిర్మాత నాగబాబు కోరిక మేరకే నటిస్తున్నానని చిరంజీవి ఆదివారం తిరుపతిలో చెప్పారు. తన 150వ చిత్రానికి తన తనయుడు రామ్ చరణ్ తేజ నిర్మాతగా వ్యవహరిస్తాడని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం జన్ లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం తెలపడం హర్షణీయం అన్నారు. . గ్రామస్థాయిలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తల మధ్య కొంత గ్యాప్ ఉందని  దానిని పూడ్చేందుకు ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పా రు.

దీక్ష విరమించిన హజారే...

 న్యూఢిల్లీ .అగస్ట్ 28:  అవినీతిని సమర్థవంతంగా అడ్డుకునే జన లోక్‌పాల్ బిల్లు కోసం  12 రోజుల పాటు చేసిన నిరాహార  దీక్షను  అన్నా హజారే  ఆదివారం ఉదయం  విరమించారు.జాతి యావత్తు ఆయన వెంట నిలవడంతో అవినీతి నిరోధక బిల్లు తెచ్చేందుకు యూపీఏ ప్రభుత్వం  ఒప్పుకుంది.  పెద్ద సంఖ్యలో  హజారే మద్దతుదారులు రాంలీలా మైదాన్‌కు చేరుకుని హజారే ను అభినందించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సిటిజన్ చార్టర్లను అమలుచేయాలని,  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వోద్యోగులందరినీ లోక్‌పాల్ కిందకు తేవాలని,  లోక్‌పాల్ తరహాలో రాష్ట్రాల్లో లోకాయుక్తలను ఏర్పాటు చేయాలని  అన్నా హజారే విదించిన మూ డు   షరతులను శనివారం ప్రత్యేకంగా సమావేశమైన పార్లమెంటు ఉభయసభలూ ఆమోదించాయి. లోక్‌పాల్‌పై అన్నాహజారే షరతులకు పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందన్న వార్త తెలియగానే.. హజారే దీక్ష చేస్తున్న రామ్‌లీలా మైదానంలో సంబరాలు మిన్నంటాయి. అన్నా మద్దతుదారులు విజయోత్సవాలు చేసుకున్నారు. త్రివర్ణ పతాకాలు చేతబూని పరస్పరం ఆలింగనాలు చేసుకుంటూ అభినందనలు తెలుపుకున్నారు. పార్లమెంటు తీర్మానం ప్రతిని, ప్రధానమంత్రి రాసిన లేఖను.. కేంద్రమంత్రి, చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ శనివారం రాత్రి తీసుకువచ్చి హజారేకు అందజేశారు. ఈ సందర్భంగా హజారే వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ రోజు జన్‌లోక్‌పాల్‌కు సంబంధించిన మూడు అంశాలు లోక్‌సభ ఆమోదం పొందాయి. సహకరించిన పార్లమెంటు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. జన్‌లోక్‌పాల్‌లో ఇప్పటి వరకు సగం విజయం సాధించాం. మిగిలిన సగం విజయాన్ని సాధించాల్సి ఉంది...అని అన్నారు హజారే.

అమెరికా తూర్పుతీరాన్ని వణికిస్తున్న ఐరిన్ హరికెన్

నలుగురు మృతి  
వాషింగ్టన్.అగస్ట్ 28:  అమెరికా తూర్పుతీరాన్ని ఐరిన్ హరికెన్ వణికిస్తోంది.  పలు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నార్త్ కరోలినాలో నలుగురు మృతి చెందారు. నార్త్ వర్జీనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, నార్త్ కరోలినాలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ కారణంగా ఏడు వేల విమానాలను రద్దు చేశారు. రోడ్లు, సబ్వేలు, రైల్వేలను మూసివేశారు. 9 రాష్ట్రాలలో అత్యవసరప పరిస్థితిని విధించారు. న్యూజెర్సీ, న్యూయార్క్లలో  భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాస్త్రవేత్తలు చెప్పారు. న్యూజెర్సీ తీర ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లమని ఆ రాష్ట్ర గవర్నర్ హెచ్చరించారు.

Monday, August 22, 2011

కాంగ్రెస్ కు జగన్ వర్గం గుడ్ బై

హైదరాబాద్,అగస్ట్ 22: : వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు సోమవారం  తమ పదవులకు రాజీనామా చేశారు. సభాపతి, ఉపసభాపతి అందుబాటులో లేనందున స్పీకర్ ఫార్మాట్‌లో తమ రాజీనామాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. కొండా సురేఖ, కుంజా సత్యవతి, జయసుధ గతంలోనే తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన నేపథ్యంలో వారు మళ్లీ రాజీనామాలు సమర్పించలేదు. రాజీనామాలు సమర్పించిన అనంతరం వారు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.అసెంబ్లీలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పించిన నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు నేను ఎందుకు రాజీనామా చేస్తున్నానను అంటూ ఓ కరపత్రాన్ని పంపిణీ చేశారు. రాజీనామాల అనంతరం మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోసు కరపత్రంలోని అంశాలను చదివి వినిపించారు. పార్టీ నిర్జీవంగా ఉన్న సమయంలో పాదయాత్ర చేసి రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చిన రాజశేఅఖరెడ్డి   ఆశయాలను ఇప్పటి ప్రభుత్వం తుడిచి వేస్తూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రజల గుండెల్లో నుండి వైయస్‌ను తుడిచి వేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. వైయస్‌ను అవినీతిపరుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తోందన్నారు.  వైయస్సాఆర్, జగన్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న కాంగ్రెసులో కొనసాగలేమని అన్నారు. పార్టీకి కూడా రాజీనామాలు చేస్తున్నామని అన్నారు. స్పీకరు రాజీనామాలను ఆమోదించాలని లేదంటే కాంగ్రెసుకు అంతకంటే దౌర్భాగ్యం లేదన్నారు.  కాగా కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వారు గాంధీ భవన్‌కు ఫ్యాక్స్ పంపారు.

ఇక పీఆర్పీ అదృశ్యం

గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ 
హైదరాబాద్,అగస్ట్ 22:  గాంధీభవన్‌లో పీఆర్పీ విలీన సభ సోమవారం జరిగింది.  ఢిల్లీ లో రాహుల్ సమక్షంలో  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని హైదరాబాద్ తిరిగి వచ్చిన  చిరంజీవికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ కండువా వేసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా చిరంజీవికి అభినందనలు తెలిపారు. 16మంది పీఆర్పీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గాంధీభవన్‌లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇచ్చారు. విలీన సభకు పార్టీ సీనియర్లు, మంత్రులు, ఎంపీలు, నేతలు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు.

Saturday, August 20, 2011

నా బిడ్డ పై సిబిఐ సోదాల వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా?

ప్రధానమంత్రి కి లేఖలో విజయమ్మ ఆక్రోశం  
హైదరాబాద్ ,అగస్ట్ 20:  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. తమ కుమారుడు వైఎస్ జగన్మోహన రెడ్డి ఆస్తులకు సంబంధించి సిబిఐ సోదాల వెనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం లేదా? అని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని వదిలివేస్తే అవినీతిపరులవుతారా? నిజాయితీ లేనివాళ్లవుతారా? అని ఆమె అడిగారు. కేంద్ర ప్రభుత్వాన్ని నియంత్రిస్తున్న శక్తుల నుంచి దేశాన్ని కాపాడండని ఆమె ప్రధానికి విజ్ఞప్తి చేశారు. భారమైన హృదయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తాను వ్యక్తిగతంగా ఈ లేఖ రాస్తున్నట్లు ఆమె తెలిపారు. అయిదు పేజీల సుదీర్ఘమైన లేఖను ఆమె రాశారు. వేలాది కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ జగన్ ఆస్తుల వ్యవహారంలో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని ఆమె పేర్కొన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి విధేయుడుగా ఉన్నప్పుడు నిజాయితీపరుడుగా ఉన్న జగన్ ఇప్పుడు అవినీతిపరుడైపోయాడా అని ఆమె ప్రశ్నించారు. జగన్కు లభిస్తున్న ప్రజాధరణను దెబ్బతీయడానికే ఈ దాడులని స్సష్టమవుతోందని ఆమె పేర్కొన్నారు. అన్నా హజారే లాంటి వ్యక్తిపైనే అవినీతి ఆరోపణలు చేస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటే ఏమైనా చేస్తారన్న భావన ప్రజలలో వ్యక్తమవుతోందన్నారు.

రాహుల్ సమక్షంలో కాంగ్రెసు తీర్థం పుచ్చుకు న్న చిరంజీవి

న్యూఢిల్లీ,అగస్ట్ 20:  రాజీవ్ గాంధీ జయంతి రోజు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కాంగ్రెసు నేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. దీంతో మూడేళ్ల ప్రజారాజ్యం ప్రస్థానం ముగిసింది. చిరంజీవికి కాంగ్రెసు కండువా కప్పి కాంగ్రెసు పార్టీలోకి ఆహ్వానించారు. సోనియా నాయకత్వంలోని కాంగ్రెసు పార్టీలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చిరంజీవి చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు నాయకులు పలువురు ఈ కార్యక్రమానికి వచ్చారు.  చిరంజీవి జాతీయ పార్టీలో చేరడం శుభపరిణామమని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ అన్నారు. ఇక చిరంజీవి తమ పార్టీలో అంతర్భాగమని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులో  చేరడం మరుపురాని ఘట్టమని చిరంజీవి అన్నారు. అయితే ఈ సభ లో  రాహుల్ గాంధీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిరంజీవి పార్టీలో చేరడం పూర్తయిన తర్వాత ఆయన వెళ్లిపోయారు.   తాను కాంగ్రెసులో చేరిన సందర్భంలో సోనియా లేకపోవడం అసంతృప్తి కలిగించిందని చిరంజీవి అన్నారు. పార్టీ ఏ బాధ్యతను అప్పగించినా శిరసా వహిస్తానని ఆయన చెప్పారు.  రాహుల్ నాయకత్వం దేశానికి అవసరమని ఆయన అన్నారు.
చిరంజీవి కాంగ్రెసులో చేరిన కార్యక్రమానికి గులాం నబీ ఆజాద్‌తో పాటు జనార్దన్ ద్వివేది, ఎస్ జైపాల్ రెడ్డి, అహ్మద్ పటేల్, కెవిపి రామచంద్ర రావు,  వి హనుమంతరావు, కేంద్ర మంత్రి పళ్ళం రాజు, పలువురు పి.ఆర్.పి. నేతలు హాజరయ్యారు. 

అసలు ఎవరీ అన్నా హజారే...?

అన్నా హజారే (జనవరి 15 ,1940) గా సుప్రసిద్ధుడయిన కిసాన్ బాబూరావ్ హజారే , ఒక భారతీయ సామాజిక కార్యకర్త, భారతదేశం లోని మహారాష్ట్రలో ఉన్న అహ్మద్‌నగర్‌ జిల్లాలో రాలెగాన్ సిద్ధి గ్రామ అభివృద్ధికి చేసిన తోడ్పాటుకు ఈయన ప్రత్యేక గుర్తింపు పొందారు, దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటానికి  చేసిన ప్రయత్నాలకు గుర్తుగా 1990 లొ పద్మశ్రీ అవార్డు తోనూ, 1992లో  పద్మ భూషణ్ అవార్డుతో ను భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై పోరాడేందుకోసం తను చేపట్టిన కృషిలో భాగంగా అన్నా, భారత్‌లో సమాచార హక్కు లక్ష్యం కోసం పాటుపడిన ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిలిచారు. తండ్రి బాబూరావ్ హజారే ఒక  కార్మికుడు, ఆయన  తాత సైన్యంలో పనిచేశారు.  తాత ఉద్యోగ రీత్యా   బాబూరావు, కుటుంబం భింగర్‌కు వెళ్లిపోయింది, ఇక్కడే అన్నా పుట్టాడు. అన్నా తాత 1945లో చనిపోయారు కాని కుటుంబం మాత్రం భింగర్‌లోనే 1952వరకు ఉండిపోయింది, తర్వాత అన్నా తండ్రి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాలేగాన్ సిద్ధికి వెళ్లిపోయారు. అన్నా నాలుగో తరగతి వరకు చదువు పూర్తి చేశాడు, ఆయనకు  ఆరుగురు సోదరులు . కుటుంబం ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. బాబూరావ్ చెల్లెలికి పిల్లలు లేరు, ఈమె అన్నా సంరక్షణ బాధ్యత చేపట్టి  ముంబై తీసుకుపోయింది.  ముంబైలో ఉంటూ 7వ తరగతి పూర్తి చేసిన అన్నా ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. అన్నా ముంబైలోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు.  క్రమంగా తన స్వంత పూల షాపును ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు కూడా  తర్వాత అన్నా వ్యాపారంలో కలిశారు.

క్రమంగా  చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు  వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా తలదూర్చాడు.  ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. అలాంటి ఒక పోరులో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా బాదేశాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960)  సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలోకి ఎంపికయ్యాడు.  మొదటి శిక్షణలో, అతడిని ఔరంగాబాద్ పంపించారు. శిక్షణ తర్వాత  పంజాబ్‌లో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నియమించబడ్డాడు. ఇంటికి చాలా దూరంలో ఉంటూ, నిరాశా నిస్పృహల బారిన పడ్డాడు, జీవితానికి అర్థంలేకుండా పోతోందనే భావంతో ఒక దశలో తన జీవితాన్ని ముగించుకోవాలని కూడా  నిర్ణయించుకుని ఆత్మహత్య పత్రం కూడా రాశాడు. అయితే, మరింత తెలివితో అతడు తన ఆత్మహత్య, చిన్నారి చెల్లెలు వివాహ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని గుర్తించాడు. అందుచేత, తన సోదరి వివాహం పూర్తయేంతవరకు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని  నిర్ణయించుకున్నాడు. ఈలోగా, కొన్ని సంఘటనలు తన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చాయి. 1965 ఇండో-పాక్ యుద్ధకాలంలో, పశ్చిమ ప్రాంతంలో ఒకచోట సైనిక వాహనాన్ని నడుపుతున్నప్పుడు తమ నెత్తిమీద పాకిస్తాన్  విమానం ఎగురుతుండటం చూశాడు. తాను, తన సహోద్యోగులు వెంటనే వాహనం మీదనుంచి దూకి సమీపంలోని పొదలలో దాక్కుని భూమికి సమాతరంగా పడుకుండిపోయారు. ట్రక్కు పేల్చివేయబడి తన స్నేహితులందరూ చంపబడ్డారు కాని అన్నా మాత్రం గాయపడకుండా తప్పించుకున్నాడు.

ప్రజలలో నైతిక బాధ్యతను పెంచడానికి  గాంధీవాద పద్ధతులను అన్నా ఉపయోగించాడు. రాలేగాన్ సిద్ధిలో ఉన్నత పాఠశాల ప్రారంభించినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలకు అనుమతి మంజూరు చేయడానికి సిద్ధపడలేదు. దీంతో అన్నా, జిల్లా పరిషత్ కార్యాలయం వెలుపల నిరాహార దీక్షను ప్ర్రారంబించాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ ప్రజలు వందలాదిగా కదిలి ఆయన చెంత చేరారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్‌కు తలొగ్గవలసి వచ్చింది.  భారతీయ సైన్యంలో  1975లో స్వచ్ఛంద విరమణ చేసి తన స్వంత గ్రామం ఉన్నతి కోసం  తిరిగి వచ్చాడు, తన రూ.20,000 భవిష్యనిధితో అన్నా ఊరిలోని ఆలయ పునరుద్ధరణను ప్రారంభించాడు. రాలేగాన్ సిద్ధిలోని జనాభాలో అత్యధిక భాగం ఇప్పటికీ వ్యవసాయం మీదే ఆధారపడి ఉంటోంది. మంచి సాగునీటి వ్యవస్థను నిర్మించడం ద్వారానే వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం వీలవుతుందని అన్నా గుర్తించాడు. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న రాలెగాన్ భౌగోళిక స్థానాన్ని పరిగణనలోకి తీసుకున్న అన్నా హజారే నీటిని అడ్డగించి మళ్లీ ప్రవహించేలా చేసి భూగర్భ జలాలను పెంచడం కోసం వాటర్‌షెడ్ గట్టును నిర్మించాలని గ్రామస్తులను ఒప్పించాడు. స్వచ్ఛంద కృషి ద్వారా నిర్మించిన తొలి నీటిగట్టుకు చిల్లుపడగా ప్రభుత్వ నిధితో దాన్ని పునర్నర్మించారు. రెండవ పెద్ద సమస్య అయిన నేల కోతను నివారించేందుకోసం కూడా అన్నా చర్యలు చేపట్టాడు. వృధాగా వెళుతున్న నీటిని తనిఖీ చేయడం ద్వారా నేల మరియు నీటిని ఆదా చేయడానికి, కొండవాగుల పొడవునా నిమ్నోన్నత కాలువలను, వాగు గసికలను నిర్మించాడు. కొండవాలు మరియు గ్రామం పొడవునా పచ్చిక, పొదలు మరియు 3 లక్షల చెట్లను నాటించాడు. ఈ ప్రక్రియకు అనుబంధంగా అటవీకరణ, నీటి మడుగులు, భూగర్భ చెక్ డ్యామ్‌లు మరియు సిమెంట్ చప్టాలను కీలక ప్రాంతాల్లో నిర్మించారు. వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాలు భారీ విజయాన్ని సాధించాయి, రాలెగాన్ సిద్ధి గ్రామం ఇవ్వాళ రూ.80 లక్షల విలువైన ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. గ్రామంలోని చాలా మంది వ్యవసాయదారులు గోధుమ ఉత్పత్తిని పెంచినందువల్ల, గ్రామ సభలో ఒక నిర్ణయం తీసుకున్నారు, దీని ప్రకారం అదనపు గోధుమ పంట కలిగిన రైతులు 1983లో ప్రారంభమైన ధాన్య బ్యాంకుకు స్వచ్ఛందంగా ధాన్యం విరాళం ఇవ్వాలి. తగినంత ధాన్యం లేని గ్రామస్తులు ఈ బ్యాంకునుంచి ధాన్యాన్ని "అప్పు"గా తీసుకోవచ్చు. ఆహార అవసరాల కోసం ఏ గ్రామస్తుడూ డబ్బు అప్పుగా తీసుకోకుండా చెయ్యడమే దీని ఉద్దేశం. ధాన్య బ్యాంకు నుంచి ధాన్యాన్ని రుణరూపంలో ఇస్తారు, దీన్ని యువ బృందాలు పర్యవేక్షిస్తాయి. సామాజిక, ఆర్థిక మార్పు వైపుగా తదుపరి దశలో భాగంగా అన్నా హజారే, యువ బృందం మద్యపాన సమస్యను చేపట్టాలని నిర్ణయించారు. దీంతో దాదాపు ముప్పై సారా తయారీ కేంద్రాలను వాటి యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. సామాజిక ఒత్తిడికి తలొగ్గని వారిని తమ వ్యాపారం మూసుకునేలా ఒత్తిడి చేసి, యువ బృందం వారి సారా బట్టీలను కూల్చివేశారు. ప్రత్యామ్నాయ వృత్తిగా, రాలెగాన్‌లో పాల ఉత్పత్తిని ప్రోత్సహించారు.  రాలెగాన్ సిద్ధిలో అన్నా హజారే రాలెగాన్ యువతతో కలిసి అక్షరాస్యతా రేటు, విద్యా స్థాయిలను పెంచడానికి కృషి చేశారు. 1976లో వారు ప్రాధమిక స్కూలుకు ముందటి ప్రీ స్కూల్‌ను ప్రారంభించారు, 1979లో ఉన్నత పాఠశాలను కూడా ప్రారంభించారు.  

ఈరోజు అన్నా ఒక మహర్షి స్థాయిని పొందారు. గ్రామంలోని తన భూమిని ఆయన హాస్టల్ భవంతికి విరాళంగా ఇచ్చారు. తన ఫించన్ డబ్బులను గ్రామ నిధికి ఇచ్చేవారు. ఆజన్మ బ్రహ్మచారి అయిన అన్నా కొద్దిపాటి వ్యక్తిగత వస్తువులతో గ్రామ ఆలయంలో నివసిస్తున్నారు. ఆయన హాస్టల్ అబ్బాయిలకు వండిపెట్టే సాధారణ భోజనాన్ని స్వీకరిస్తుంటారు. ఆయన తల్లిదండ్రులు, సోదరులు కూడా గ్రామంలోనే నివసిస్తుంటారు కాని గ్రామంలోని ఏ ఇతర కుటుంబం కంటే వారు భిన్నంగా ఉండరు. పరమ నిస్వార్థ జీవితం నుంచి పెంపొందుతూ వచ్చిన నైతిక అధికారం ఆయన్ను గ్రామంలో తిరుగులేని నేతగా మార్చింది. ఇప్పుడు రాచ పుండు లాంటి అవినీతిపై ఏకంగా జాతీయ స్థాయి లో ఉద్యమం చేపట్టిన అన్నా ఎంతవరకు సఫలీకృతుడవుతారో చూడాలి. 















.

Friday, August 19, 2011

లారీల సమ్మె

హైదరాబాద్,అగస్ట్ 19 : టోల్ ఫీజులు, మూడో పక్ష బీమా ప్రీమియం, టైర్ల ధరలు తగ్గించాలనే డిమాండ్‌తో దక్షిణ భారత లారీ యజమానుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా లారీల సమ్మె గురువారం అర్థరాత్రి నుంచి ప్రారంభమైంది.  సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అయిదు లక్షల లారీలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లుకు సన్నద్దమైంది.

Thursday, August 18, 2011

జగన్ ఆస్తులపై ఏక బిగిన సోదాలు

సోదాలకు స్వయంగా హాజరైన సిబిఐ ఐజి లక్ష్మినారాయణ
హైదరాబాద్,అగస్ట్ 18:  హైకోర్టు ఆదేశాలపై  కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సిబిఐ) గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్  అధ్యక్షుడు, కడప ఎంపి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీలు, ఆ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు ఇతర కంపెనీలు, ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఏక బిగిన సోదాలు నిర్వహించింది. నాంపల్లి సిబిఐ కోర్టు నుంచి బుధవారం అనుమతి రావడంతో గురువారం ఉదయమే సిబిఐ అధికారులు బృందాలుగా విడిపోయి దేశ వ్యాప్తంగా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై, రాంచీ, కోల్‌కతాలో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి.  అధికారులు దాదాపు 15 బృందాలుగా విడిపోయి సోదాలు చేశారు. ఒక్కో బృందంలో 6 నుంచి 10 మంది ఉన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌కు భారీ ఎత్తున భూములు కట్టబెట్టిన ఎపిఐఐసి అప్పటి మేనేజింగ్ డైరెక్టర్ బి.పి.ఆచార్య నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు. సికిందరాబాద్ మహీంద్రాహిల్స్ లోని ధనలక్ష్మి కాలనీలో ఉన్న ఆచార్య నివాసంలో సోదాలు చేసి విలువైన డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్  డిస్కులు  స్వాధీనం చేసుకున్నట్లు ఈ సోదాలకు నేతృత్వం వహించిన సిబిఐ డిఎస్‌పి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీలు, ఆయా యజమానుల నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగాయి. సైనిక్‌పురిలోని మ్యాట్రిక్స్ కంపెనీ అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ నివాసంలో సోదాలు నిర్వహించారు. నగరంలోని లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ నివాసం, సాగర్ సొసైటీలో ఉన్న జగన్ సోదరి షర్మిళ నివాసంలో సిబిఐ బృందం తనిఖీలు నిర్వహించింది.  బంజారాహిల్స్ రోడ్ నెం.12లో ఉన్న భారతి సిమెంట్స్, సాక్షి పత్రిక, చానెల్ కార్యాలయాలు ఉన్న ప్రధాన కాంప్లెక్స్లలో  విస్తృతంగా సోదాలు నిర్వహించారు. బెంగళూరులోని యలహంక, ముంబయిలో ఉన్న జగన్ నివాసాలను, సుండూరు పవర్ ప్రాజెక్టుల కార్యాలయాలను సోదాచేశారు. కూకట్‌పల్లిలోని మలేషియా టౌన్‌షిప్ వద్ద ఉన్న ఇందు ప్రాజెక్టును, వివేకానందనగర్‌లో ఉన్న దండమూడి వీరభద్రరావు నివాసాన్ని, గాయత్రి హిల్స్ లో ఉన్న హెట్రో గ్రూపు అధిపతి శ్రీనివాసరెడ్డి నివాసాన్ని సోదా చేశారు. సనత్‌నగర్‌లో ఉన్న హెట్రో ఫార్మా, ల్యాబ్స్, కార్యాలయాల్లో సిబిఐ అధికారులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. కడప జిల్లాలో ఉన్న భారతి సిమెంట్స్ కు చెందిన కార్యాలయాన్ని, ఆ కంపెనీకి లీజుకు ఇచ్చిన రెండు వేల ఎకరాల సున్నపురాయి భూముల లీజుల గురించి కూడా సిబిఐ ఆరా తీసింది. ఎమ్మార్ సిఇఓ రఘు, జగన్ కంపెనీల ఆడిటర్ సాయిరెడ్డి నివాసాల్లోనూ సోదాలు జరిగాయి. జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు ఉన్న పయనీర్, సందేశ్ ల్యాబ్స్, దాల్మియా సిమెంట్స్, పివిపి వెంకట్, పెన్నా సిమెంట్స్, జూబ్లీ మీడియా, పులివెందుల ఫార్మా, ఇండియా సిమెంట్స్, కార్మెల్ ఏషియా, గిల్‌క్రిస్ట్ ఇమెంట్స్ తదితర కంపెనీల కార్యాలయాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఇతర సాక్ష్యాలను జాగ్రత్తగా కట్టుదిట్టమైన భద్రత మధ్య దిల్‌కుషా అతిథి గృహానికి చేర్చారు. చెన్నైలో ఉన్న పారిశ్రామిక వేత్త వసంత్ నివాసంలోనూ సోదాలు జరిగాయని తెలిసింది. లోటస్‌పాండ్‌లో ఉన్న జగన్ నివాసంలో జరిగిన సోదాల్లో సిబిఐ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ స్వయంగా పాల్గొన్నారు. జగన్‌ను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ మరో 50 మందితో కలిపి ఒక కేసు, ఎపిఐఐసి మాజీ అధికారి బిపి ఆచార్య, మరో అధికారి పార్థసారథిలను మొదటి, రెండవ నిందితులుగా పేర్కొంటూ మొత్తం 28 మంది ప్రభుత్వ అధికారులపై కేసులు నమోదు చేశారు. ప్రజాధనం దుర్వినియోగం కింద అధికారులు ఇద్దరితో కలిపి మిగిలిన వారిపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13డి ప్రకారం కేసులు నమోదు చేసినట్లు సిబిఐ వర్గాలు పేర్కొన్నాయి. 

Wednesday, August 17, 2011

ఒబామా బస్సు యాత్ర

వాషింగ్టన్అగస్ట్ 18:    అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిరుద్యోగం సహా వివిధ ఆర్థిక అంశాలపై విస్తృత ప్రజాబాహుళ్యానికి తన సందేశాన్ని వినిపించడానికి బస్సు యాత్రను ప్రారంభించారు. కీలకమైన మిన్నెసోట, లోవా, ఇల్లినాయిస్‌లలో ఈ బస్సుయాత్ర సాగుతోంది. 2012లో జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని దీటుగా ఎదుర్కొనేందుకు ఒబామా అప్పుడే రంగంలోకి దిగినట్లు ఈ బస్సుయాత్రను బట్టి అర్థమవుతోంది. ప్రతినిధుల సభలో ఆధిక్యంలో ఉన్న రిపబ్లికన్ పార్టీపై  తన బస్సుయాత్రలో ఒబామా విరుచుకుపడ్డారు. ఆర్థిక సంస్కరణలను, దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. 

న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో శిల్పాషెట్టి సినిమా

వాషింగ్టన్అగస్ట్ 18:   బాలీవుడ్ నటి శిల్పాషెట్టి తొలిసారిగా ఇంగ్లీషులో నటించిన ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమా ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌ లో ప్రదర్శనకు ఎంపికయింది. దోస్తానా హిందీ చిత్రంలో చివరిసారిగా తెరపై కనిపించిన శిల్పాషెట్టి ఈ చిత్రం ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆర్. శరత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైనా స్టార్ జియా యూ సరసన ఆమె నటించింది. సన్యాసినిగా మారిన నృత్యకారిణి పాత్రలో ఆమె కనిపించబోతోంది. ‘ద డిజైర్- జర్నీ ఆఫ్ ఏ వుమన్’ సినిమాను ఈ నెల 22, 24 తేదీల్లో న్యూయార్క్ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారని శిల్పాషెట్టి ట్విట్టర్‌లో పేర్కొంది. 

అమెరికా చదువులపై తగ్గని మోజు...

వాషింగ్టన్,అగస్ట్ 18:  అమెరికా చదువులపై భారతీయ విద్యార్థులకు మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ స్థాయిలో చదువు కోసం అమెరికా వచ్చేందుకు ఇండియా విద్యార్థులు  ఆసక్తి చూపుతున్నట్టు  తాజాగా వెలువడిన గణంకాలు  స్పష్టం చేస్తున్నాయి. గ్రాడ్యుయేట్ స్థాయిలో అడ్మిషన్ల కోసం ఈ ఏడాది పేర్లు నమోదు చేస్తున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 8 శాతం పెరిగింది. 2006 తర్వాత ఇదే అత్యధిక శాతమని కౌన్సిల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ స్కూల్స్ (సీజీఎస్) తాజా సర్వే నివేదికలో పేర్కొంది. గతేడాది కేవలం 3 శాతం మెరుగుదల మాత్రమే కన్పించింది.2010-11 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నమోదు చేసుకున్న విదేశీ విద్యార్థుల సంఖ్యలో 11 శాతం పెరుగుదల నమోదయింది. 23 శాతం వృద్ధితో చైనా అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా ఆరో ఏడాది చైనా రెండంకెల వృద్ధి సాధించిందని సీజీఎస్ వెల్లడించింది. 

Tuesday, August 16, 2011

సుప్రీం కోర్టుకు జగన్...

హైదరాబాద్,అగస్ట్ 16: తన ఆస్తులపై రాష్ట్ర  హైకోర్టు పూర్తిస్థాయి సిబిఐ విచారణకు ఆదేశించడంపై వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై సిబిఐ విచారణను నిలుపుదల చేయాలని ఆయన సుప్రీం కోర్టును కోరారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుప్రీం కోర్టులో తుది విచారణ పూర్తయ్యే వరకు తన కంపెనీలు, ఆస్తులపై జరుగుతున్న దర్యాఫ్తును ఆపాలని ఆయన సుప్రీం కోర్టుకు విన్నవించారు. కాగా ఇటీవల సిబిఐ అధికారులు ప్రాథమిక నివేదిక సమర్పించిన అనంతరం హైకోర్టు జగన్ ఆస్తులపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. జగన్ కంపెనీలపై క్రిమినల్ కేసులు పెట్టి జగన్ కంపెనీలలోకి నిధులు ఎలా వచ్చాయో పూర్తిస్థాయి విచారణ జరగాల్సిందని తీర్పు చెప్పింది. ఎమ్మార్ లోనూ అక్రమాలు జరిగాయని హైకోర్టు అభిప్రాయపడింది. ఎమ్మార్ పైనా క్రిమినల్ కేసు పెట్టి పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.

క్యాబినెట్ భేటీకి తెలంగాణ మంత్రులు హాజరు...

ముగ్గురు మాత్రం డుమ్మా...
హైదరాబాద్,అగస్ట్ 16:  సిఎం క్యాంపు కార్యాలయంలో  మంగళవారం సాయంత్రం జరిగిన మంత్రి మండలి
 సమావేశానికి  తెలంగాణ మంత్రులు సారయ్య,శంకరరావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి మినహా మిగిలినవారందరూ హాజరయ్యారు. మంత్రులు జానారెడ్డి, శ్రీధర్ రెడ్డి, సబిత, సునీత, డికె అరుణ, పొన్నాల లక్ష్మయ్య, సుదర్శన రెడ్డి తదితరులు  హాజరయ్యారు. రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రివర్గ సమావేశానికి వెళ్లడం లేదని, తెలంగాణ మంత్రులు వెళ్లకూడదని కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తన కన్ను సరిగా లేనందున మంత్రి వర్గ సమావేశానికి హాజరు కావడం లేదని పి. శంకరరావు ముఖ్యమంత్రికి సమాచారం అందించారు. సారయ్య ఎందుకు హాజరు కాలేదనేది తెలియడం లేదు.  తెలంగాణ మంత్రులను మంత్రివర్గ సమావేశానికి రప్పించడం ద్వారా ముఖ్యమంత్రి విజయం సాధించారని భావిస్తున్నారు. సచివాలయంలో కాకుండా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేస్తే మంత్రి వర్గ సమావేశానికి వస్తామని తెలంగాణ మంత్రులు చెప్పారు. ఆ మేరకు  సిఎం క్యాంపు కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు.

శ్రీరామరాజ్యం పాటలు రెడీ...


 శ్రీరామరాజ్యం సినిమా ఆడియో ఆవిష్కరణ భద్రాద్రి దివ్య క్షేత్రంలో సోమవారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. హీరో నందమూరి బాలకష్ణ సీడీని ఆవిష్కరించారు. తొలి సీడీని శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయ ఇన్‌చార్జ్ ప్రథానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, అర్చకులు కోట్జకృష్టమా చార్యులకు అందజేశారు. డా.అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ ‘సెక్స్, వయలెన్స్ రాజ్యమేలుతున్న నేటిరోజుల్లో ఇలాంటి సినిమా చూస్తారా? అని నిర్మాతతో సందేహం వెలిబుచ్చాను. నా భార్య అన్నపూర్ణమ్మకు ఆరోగ్యం బాగలేనప్పటికీ,తనని ఒప్పించి మరీ ఈ సినిమాలో వాల్మీకి పాత్ర చేశాను. ఎన్‌టిఆర్ అన్ని రకాల పురాణ పాత్రలను అలవోకగా చేశారు. భారతదేశంలో అలాంటి పాత్రలు ఆయన తర్వాత ఎవరూ చేయలేరు. సింహం కడుపున సింహం పుడుతుంది అన్నట్లు ఈ పాత్రకు బాలకృష్ణ సమరసింహుడిగా సరిపోయాడు. ఇక సీతగా నయనతారను చూసినప్పుడే ఈ సినిమా సక్సెస్ అనుకున్నాను. ’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ ‘రాముడు నడయాడిన ఈ భద్రాద్రిలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం మా అదృష్టం. ఇప్పటి కాల పరిస్థితులకు రామాయణం అత్యవసరం. ఆదర్శ ప్రభుత్వం అంటే ఎవరైనా రామరాజ్యమనే చెబుతారు" అన్నారు. నయనతార మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఇంతమంది లెజెంDsతో కలిసి పనిచేసినందుకు ఎంతో గర్వంగా ఉంది’ అన్నారు.

Monday, August 15, 2011

గృహ నిర్బంధం లో అన్నాహజారే

న్యూఢిల్లీ,అగస్ట్ 16:  : అవినీతికి వ్యతిరేకంగా పటిష్టమైన జన్ లోక్‌పాల్ బిల్లు కోసం కేంద్రంపై అమీతుమీకి సిద్ధమైన సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారేను మంగళవారం ఉదయం ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించక ముందే పోలీసులు హజారేతో పాటు, అరవింద్ కేజ్రీవాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో హజారే మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నారు. హజారేను రహస్య ప్రాంతానికి తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ఈ సందర్భంగా హజారే మాట్లాడుతూ,  అవినీతిభూతం ఏంటనేది నేడు భారతీయులందరికీ తెలిసిందన్నారు. ఇది దేశమార్పు కోసం జరుగుతున్న ఉద్యమమని, మార్పు జరగనంతవరకూ ప్రజాస్వామ్యం, గణతంత్రం రానట్లేనని ఆయన వ్యాఖ్యానించారు. తన నిర్బంధం వల్ల ఉద్యమం ఆగదని, తన తర్వాత ఉద్యమాన్ని నడిపేందుకు క్రేజివాల్, కిరణ్‌బేడీ, హెగ్డే, భూషణ్ ఉన్నారన్నారు. జైలులో కూడా తాను ఉద్యమాన్ని కొనసాగిస్తానని హజారే తెలిపారు. 
     65వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై జెండా ఎగురవేసి ప్రసంగిస్తున్న ప్రధాని మన్మోహన్...

షమ్మీ కపూర్ ఇకలేరు...

ముంబై,అగస్ట్ 15: బాలీవుడ్‌ను దశాబ్దాలపాటు ఏలిన పృథ్వీరాజ్ కపూర్ వంశాంకురం... రాజ్‌కపూర్, శశికపూర్‌ల సోదరుడు...విలక్షణ నటుడు షమ్మీ కపూర్ (79) ఇకలేరు. 1950, 60 దశకాల్లో రొమాంటిక్ హీరోగా, ప్లేబాయ్‌గా నాటి తరం ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన షమ్మీ కపూర్ ఆదివారం తెల్లవారుజామున ముంబైలో కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1931, అక్టోబర్ 21న పృథ్వీరాజ్ కపూర్, రామ్‌సార్నీ దంపతులకు జన్మించిన షమ్మీ కపూర్  అసలు పేరు షంషేర్ రాజ్‌కపూర్. 1948లో జూనియర్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లో ప్రవేశించిన షమ్మీ తొలి చిత్రం జీవన్‌జ్యోతి 1953లో  విడుదలైంది. 1961లో విడుదలైన జంగ్లీ చిత్రంతో స్టార్ ఇమేజ్ ఏర్పరుచుకున్నారు.  తుమ్సే నహీ దేఖా, దిల్ దేకే దేఖో, తీస్రీమంజిల్ తదితర చిత్రాల్లో నటించారు.  1968లో బ్రహ్మచారి చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్‌గా, 1982లో విధాత చిత్రానికి గాను ఫిలిం ఫేర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్‌ అవార్డులు అందుకున్నారు.

Saturday, August 13, 2011

14 (ఎఫ్) ఉఫ్...

న్యూఢిల్లీ, అగస్ట్ 13: ఎడతెగని వివాదానికి కేంద్రబిందువుగా నిలిచిన 14 (ఎఫ్) నిబంధన తెరమరుగైంది. శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ నిబంధన రద్దుకు ఆమోదముద్ర వేశారు. పోలీసు నియామకాలు, పదోన్నతుల విషయంలో ఇప్పటి దాకా ఫ్రీజోన్‌గా కొనసాగిన హైదరాబాద్ ఇక నుంచి ఆరో జోన్‌లో అంతర్భాగంగా మారింది. శని, ఆదివారాల్లో ఎస్‌ఐ రాత పరీక్షలున్న నేపథ్యంలో, వాటికి సరిగ్గా ఒక్క రోజు ముందు కేంద్రప్రభుత్వం హుటాహుటిన ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 1975 నుంచి అమల్లో ఉన్న రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 14 (ఎఫ్)ను తొలగిస్తున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డెరైక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-1975లోని 14 (ఎఫ్) క్లాజును తొలగిస్తూ రాష్ట్రపతి కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. అనంతరం ఫైలు కేంద్ర హోం శాఖకు చేరింది. 14 (ఎఫ్)ను తొలగిస్తున్నట్టు ఆ శాఖ వెంటనే గెజిట్ లో ప్రకటించింది. దాంతో ఎస్‌ఐ రాత పరీక్షలకు అడ్డంకులు దాదాపుగా తొలగిపోయాయి.  హైదరాబాద్ పోలీస్ చట్టం-1348 ప్రకారం 1975 అక్టోబర్ 18వ తేదీకి ముందు జరిపిన నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులలోని నిబంధనలు వర్తించకుండా రక్షణ కల్పించేందుకు 14(ఎఫ్)ను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చారు. వాటి ప్రకారం హైదరాబాద్‌లోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జోన్లతో సంబంధంలేకుండా ఏ ప్రాంతీయులనైనా నియమించుకోవచ్చు. దాంతో రాజధాని ఫ్రీ జోన్‌గా మారింది. పోలీసు నియామకాలకు సంబంధించి హైదరాబాద్ ఫ్రీ జోనంటూ సుప్రీంకోర్టు 2008 అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది. దాంతో నగరాన్ని ఆరో జోన్లోనే ఉంచేలా చూడాలంటూ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ వచ్చాయి.  హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్.జిల్లాలు అరో జోన్ లో వుంటాయి.  

Friday, August 12, 2011

సకలజనుల సమ్మెకు సవరింపు

సెప్టెంబర్ 6 నుంచి అసలు సమ్మె 
హైదరాబాద్, ఆగస్టు 12: ఈ నెల  17న ప్రారంభమవ్వాల్సిన సకలజనుల సమ్మె సెప్టెంబర్ 6 నుంచి మొదలవుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రకటించింది. శ్రావణమాసం పూజలు, రంజాన్ ఉపవాస దీక్షల నేపథ్యంలో ఆయా వర్గాల మనోభావాలను గౌరవిస్తూ కార్యక్రమాల్లో మార్పులు చేసుకున్నట్టు  జేఏసీ చైర్మన్ కోదండరాం గురువారం విలేకరులకు తెలిపారు. ‘‘హిందూ, ముస్లింల విజ్ఞప్తులు, పార్టీలు, ప్రభుత్వ వైఖరులు తదితరాలపై సమగ్రంగా చర్చించి, సమ్మెలో చిన్న మార్పులు చేయాలని నిర్ణయించాం. ఈ 17న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేస్తాం. జిల్లా స్థాయిలో ప్రచార యాత్రలు, బస్సు యాత్రలు, సభలను 17 తర్వాత కూడా చేపడతాం. సెప్టెంబర్ 5న కరీంనగర్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగసభ నిర్వహిస్తాం. వివిధ కార్యక్రమాలతో భారీగా ప్రజాందోళనలు జరుగుతాయి. సెప్టెంబర్ 6 నుంచి సకల జనుల సమ్మెలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు సమ్మె ద్వారా భాగస్వాములవుతారు. లాయర్లు, డాక్టర్లు తదితరులు విధులు బహిష్కరిస్తారు. తర్వాత సమ్మె తీవ్రరూపు దాలుస్తుంది’’ అని వివరించారు. సమ్మెను వాయిదా వేయలేదని, అందులో భాగంగానే అన్ని కార్యక్రమాలూ జరుగుతాయని చెప్పారు. ‘‘ఉద్యమానికి విరామం లేదు, రాష్ట్ర సాధన దాకా నిరంతర పోరాటం సాగుతుంది. రాజధాని నుంచి మారుమూల పల్లెలదాకా ఇంకా ప్రజాచైతన్యం రావాలి. వారంతా వీలైనన్ని రూపాల్లో సమ్మెలో భాగస్వాములయ్యేలా సమాయత్తం చేస్తాం. ఈ నెల 17 నుంచి ‘గ్రామాలకు తరలండి’ అనేలా కార్యక్రమాలుంటాయి’’  అని చెప్పుకొచ్చారు.

Wednesday, August 10, 2011

జగన్ కు కష్ట కాలం...

హైదరాబాద్, ఆగస్టు 10 : జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని హై కోర్టు ఆదేశించింది. జగన్‌పై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన  హైకోర్టు  తీర్పు బుధవారం వెలువడింది. జగన్‌పై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో వస్తున్న ఆరోపణలుగా భావించలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుక్రు స్పష్టం చేశారు. ఎమార్ అనేక అక్రమాలకు పాల్పడిందన్న విషయాన్ని కూడా కోర్టు స్పష్టంగా పేర్కొన్నది. కార్పొరేట్ ముసుగులో కొన్ని అదృశ్య శక్తులు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని, అవి ప్రయోజనాలు పొందాయనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతూ లెక్కలు చూపని వ్యవహారాలు ఇందులో చాలా ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. పన్నుల కట్టనక్కరలేని దేశాలనుంచి అక్రమ మార్గాలలో పెట్టుబడులు వచ్చాయని కోర్టు పేర్కొన్నది. ఇందులో కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నదని కూడా కోర్టు పేర్కొంది. జగన్ ఎలా అక్రమాలకు పాల్పడిందీ పూర్తి దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. జగన్ కంపెనీలలో గల పెట్టుబడుల దేశ, విదేశీ మూలాల గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉందని కోర్టు భావించింది. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కంపెనీలలో పెట్టుబడులు ఎలా వచ్చాయో తేలాలని కోర్టు పేర్కొన్నది. ఎర్రన్నాయుడు, శంకర్రావు పిటిషన్‌లనే కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఎమార్ ప్రాపర్టీస్‌పై కూడా కోర్టు ఆదేశాలు
ఎమార్ ప్రాపర్టీస్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రకటించింది. ఎమార్ అక్రమాలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని సి.బి.ఐ.కి ఆదేశాలు జారీ చేసింది. ఎమార్ కంపెనీ పై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమార్ వ్యవహారాల దరిమిలా  భూముల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని  కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఎమార్ వ్యవహారంలో దాదాపు 4500 కోట్ల రూపాయల ప్రజా ధనం కొల్లగొట్టారని  హైకోర్టు భావించింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ వ్యవహారాలలో అధికారులపైన కూడా దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.  

Monday, August 8, 2011

హ్యాపీ బర్త్ డే మహేష్...

నేడు మహేష్‌బాబు పుట్టిన రోజు.  37లో  అడుగుపెడుతున్నాడు. ‘పోకిరి’గా బాక్సాఫీస్ వసూళ్లకు కొత్త అర్థం చెప్పిన మహేష్... రాబోతున్న ‘దూకుడు’తో ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో అని ఆయన అభిమానులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ‘బిజినెస్‌మ్యాన్’ చిత్రంలో మహేష్‌  నటించనున్నాదు. ఆ తర్వాత మహేష్‌ బోయపాటి శ్రీను, రాజమౌళి, క్రిష్... సినిమాలు  చేస్తారని ఫిలింనగర్ సమాచారం. సో... ఆల్ ది బెస్ట్ మహేష్...

ఆగిన ' అరక్షన్ '

 ‘ఆరక్షణ్’ లో అమితాబ్
బిగ్ బి అమితాబ్, సైఫ్ అలీఖాన్, దీపికా పడుకొనె ప్రధాన పాత్రల్లో రూపొందిన ' అరక్షన్ '  సినిమా విడుదలపై మద్రాస్ హై కోర్టు సోమవారం స్టే విధించింది. ఈ సినిమా నిర్మాత ప్రకాష్ ఝా రూ. 3.75 కోట్ల రూపాయలు బకాయి పడటంతో.... డబ్బు చెల్లించే వరకు సినిమా విడుదల ఆపి వేయాలని ఫిరోజ్ నడియావాలా కోర్టును ఆశ్రయించాడు. దీంతో ఆగస్టు 12న విడుదల కావాల్సిన ఆరక్షణ్ సినిమా విడుదల నిలిచి పోయింది. ఇదిలా ఉంటే సినిమాలో దళితులకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ పలు రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. సినిమాలో ఎస్ సి రిజర్వేషన్లను వ్యతిరేకించే విధంగా సన్నివేశాలు ఉన్నాయనది ఆందోళన కారుల వాదన. అయితే ఇందులో అలాంటి వేమీ లేదని సినిమా దర్శక నిర్మాతలు అంటున్నారు. సినిమాలో రిజర్వేషన్లపై చర్చ ఉన్నప్పటికీ అవి ఎవరీని నొప్పించే విధంగా ఉండవని అంటున్నారు. 

' గాలి ' కొదిలేసిన సదానంద

గాలి జనార్దన్ రెడ్డి
బెంగళూరు,అగస్ట్ 8: యడ్యూరప్ప మంత్రివర్గంలో కీలకంగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డి సోదరులకు కొత్త ముఖ్యమంత్రి సదానంద గౌడ షాక్ ఇచ్చారు. సదానంద గౌడ కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నికైన నేపథ్యంలో  సోమవారం సాయంత్రం కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ మంత్రివర్గంలోకి గాలి సోదరులతో పాటు వారి సన్నిహితుడు శ్రీరాములును  సైతం సదానంద గౌడ తీసుకోలేదు. సదానంద గౌడ 21 మంది మంత్రులతో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప వర్గానికే ప్రాధాన్యం లభించింది. యడ్యూరప్ప వర్గానికి చెందిన 12 మందికి సదానంద మంత్రివర్గంలో చోటు కల్పించారు. ముఖ్యమంత్రి పదవి కోసం తనపై పోటీ పడిన జగదీశ్ షెట్టర్ వర్గానికి చెందిన 9 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

స్టాక్ మార్కెట్లకు అమెరికా దెబ్బ...

ముంబయి,అగస్ట్ 8:  : అమెరికా  క్రెడిట్ రేటింగ్ తగ్గిన  ప్రభావం ఆసియా స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో సోమవారం స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లు పైగా, నిఫ్టీ 100 పాయింట్ల వద్ద నష్టపోయింది. సెన్సెక్స్ 17వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. 

ప్చ్..ఏం లాభం...?

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న  అనుష్క ఇప్పుడు తెగ బాధ పడిపోతోంది.  సహజనటి జయసుధలా బాలీవుడ్‌కు వెళ్లనని శపఢం పట్టిన అనుష్క ఆ మధ్య బాలీవుడ్ నుంచి వచ్చిన  ఆఫర్లను వద్దు పొమ్మంది. తమిళంలో విజయవంతమైన ‘సింగం’ చిత్రాన్ని హిందీలో నిర్మించే సమయంలో హీరోయిన్‌గా ముందు అనుష్కకే ఆఫర్ వచ్చింది.  అయినా సరే తన నిర్ణయంలో మార్పు లేదని కొట్టిపారేసింది.  చివరికి ఏమైంది. సదరు చిత్ర నిర్మాతలు కాజల్‌ని తీసుకున్నారు. ఇప్పుడు తమిళ ‘సింగం’ హిందీలో ‘సింఘం’గా విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. దానికి తోడు కాజల్‌కు  బాలీవుడ్ లో పాపులారిటీ ఊడా పెరిగింది. ఇంకా ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయిట.  ఇదంతా చూస్తున్న అనుష్కకు  బాధ గాక మరేమిటి చెప్పండి. అనవసరంగా ఆ చిత్రాన్ని వదులుకున్నాను. అదే చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినట్టయితే చాలా బాగుండేదని ఇప్పుడు తెగ  పశ్శాత్తాప పడిపోతోంది.  ప్చ్..ఏం లాభం...?    

టీ...సమోసా..బిస్కెట్...!

‘టీ...సమోసా..బిస్కెట్’. ఇది కొత్తగా వచ్చే సినిమా పేరు. దర్శకుడైన బాబ్జీ  పీపుల్స్ థియేటర్ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా మారి తొలి చిత్రంగా ‘టీ..సమోసా..బిస్కెట్’ను అందిస్తున్నారు.  ‘‘పేదవాడికి నగరంలో చోటేలేదన్న, ఇరానీ హోటల్ ఒక్కటే అండగా ఉందన్న’’ అన్న ఒక పాట పంక్తుల సారాంశమే ఈ చిత్రకథ.  శ్రీహరి పాత్ర ఇందులో వెరైటీగా ఉంటుంది. మూడు షెడ్యూల్స్ తో చిత్రం పూర్తవుతుందని దర్శక నిర్మాత బాబ్జీ తెలిపారు.ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ సన్నివేశాన్ని ఆదివారం ఉదయం రామానాయుడు స్ట్టూడియోలో చిత్రీకరించారు.  నరేష్, ధర్మవరపు, ఎవిఎస్, నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), అలీ, షాయాజీ షిండే, తనికెళ్ల భరణి, నాజర్, కొండవలస, బాబూమోహన్, చాణక్య, ధన్‌రాజ్, చిట్టిబాబు, కమల్, మునిచంద్ర, శోభనా నాయుడు, వాహిని, కవిత, సిరివెనె్నల, అనిల్ మధుచక్రవర్తి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: చక్రి, ఎడిటింగ్: మోహన్ రామారావు, కెమెరా: వి.శ్రీనివాసరెడ్డి, రచన, నిర్మాత, దర్శకత్వం: బాబ్జీ.

Sunday, August 7, 2011

తెలంగాణ రాజకీయ జెఎసికి పోటీగా మరో కమిటీ

కె. చంద్రశేఖర రావు ఏకాధిపత్యానికి తెర వేసే ప్రయత్నాలు !
హైదరాబాద్,అగస్ట్ 8:  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఏకాధిపత్యానికి తెర వేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చాయి. తెరాసకు అనుకూలంగా వ్యవహరిస్తుందని భావిస్తున్న కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ రాజకీయ జెఎసికి పోటీగా మరో కమిటీ ఏర్పాటైంది. స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చైర్మన్‌గా ఈ కమిటీ ఏర్పాటైంది. ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వర రావు దీనికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ రాజకీయ జెఎసికి ప్రత్యామ్నాయంగా మరో కమిటీని ఏర్పాటు చేయాలనే తెలుగుదేశం తెలంగాణ ఫోరం ప్రయత్నాలు ఫలించాయని చెప్పాలి. రాష్ట్ర సాధన ఉద్యమ సమన్వయ కమిటీగా దానికి పేరు పెట్టారు. ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ నేతృత్వంలో, ఆ తర్వాత ఎమ్మెల్సీ చుక్కా రామయ్య నాయకత్వంలో తెలంగాణ రాజకీయ జెఎసికి ప్రత్యామ్నాయంగా మరో కమిటీని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు. వారిద్దరు అందుకు అంగీకరించకపోవడంతో కొండా లక్ష్మణ్ బాపూజీతో సమన్వయ కమిటీ ఏర్పాటు ప్రయత్నాలు సాగించి విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఈ సమావేశానికి తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు, తెలుగుదేశం తిరుగుబాటు ఎమ్మెల్యేలు, కాంగ్రెసు మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు హాజరయ్యారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, సమాంతర పాలన సాగించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ ఇటీవల అన్నారు. దాన్నిబట్టి, రాజీనామాల విషయంలో కొంత గందరగోళం ఏర్పడే అవకాశం ఉంది. కాగా, కార్యాచరణను ఖరారు చేయడానికి తిరిగి ఈ నెల 19వ తేదీన సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు.

కండలవీరుని పై శ్రియ కన్ను...!

దాదాపు పదేళ్ల క్రితం  తెరంగ్రేటం చేసిన శ్రియ  దక్షిణాదిన మెగాస్టార్, రజినీకాంత్ తో పాటు అందరు అగ్రహీరోల సరసన నటించి, ఓ వెలుగు వెలుగి... హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది. అయితే సౌత్ లో తనకు క్రేజ్ తగ్గిందన్న వాస్తవాని గుర్తించిన ఈ భామ  బాలీవుడ్ బాట పట్టింది. ఈ మధ్య బాలీవుడ్ లో ఏ కార్య క్రమం జరిగినా అక్కడ దర్శనమిస్తూ దర్శకులు, హీరోల కళ్లలో పడటానికి యథాశక్తి  ప్రయత్నాలు చేస్తోందిట. మరో వైపు హాట్ హాట్ ఫోటో షూట్లతో యువతలో తనపై వేడి తగ్గకుండా జాగ్రత్త పడుతోందని చెబుతున్నారు. అయినా  పెద్దగా చాన్సులు  దక్కడమే లేదు. ఇండస్ట్రీలో ఎవరో ఒక స్టార్ హీరోతో చనువు పెంచుకుని సినిమా అవకాశాలు దక్కించుకునే దిశగా ఇప్పుడు అడుగులు వేస్తోంది.  క్రతినా, సోనాక్షి, ఆసిన్ లాంటి వారికి లైఫ్ ఇచ్చిన సల్మాన్ అయితేనే తనకు కరెక్ట్ అని భావించిందేమో ... ఇప్పుడు శ్రియ అతగాడికి  బాగా దగ్గరయ్యేందుకు  ప్రయత్నాలు మొదలెట్టిందని తాజా సమాచారం. 

ముంబైలో ఆ ఇద్దరూ...!

నేనూ.. నా రాక్షసి చిత్రంలో జంటగా చేసిన రాణా, ఇలియానా ఇప్పుడు నువ్వూ నేనూ అంటూ  ముంబైలో తరుచూ కలుస్తున్నారుట.  వారిద్దరూ ముంబైలో తమ ప్రమోషన్ కోసం ఒకే పీఆర్ ఏజన్సీని నియమించుకున్నారుట.  ఇలియానా ప్రస్తుతం హిందీలో బర్ఫీ అనే చిత్రం చేస్తోంది. రాణా.. వర్మ దర్శకత్వంలో డిపార్టమెంట్ చేస్తున్నారు. వీరిద్దరనీ కలిపిన పూరీ జగన్నాధ్ హిందీలో ది బిజెనెస్ మ్యాన్ చిత్రం చేయడానికి  ప్లానింగ్ లో ఉన్నాడని సమాచారం. నేనూ నా రాక్షసి తర్వాత  ఇలియానాకు తెలుగులో ఏ ఆఫరూ రాలేదు. రాణా మాత్రం ప్రకాష్ తోలేటి దర్శకత్వంలో' నా ఇష్టం ' చేస్తున్నాడు.ఇలియానా కోసం రాణా ..ఆమె చేస్తున్న షూటింగ్ లొకేషన్స్ కు కూడా వెళ్ళి వస్తున్నట్లు తెలుస్తోంది.అయితే ఇద్దరూ బాలీవుడ్ కి కొత్త కావడం తో అక్కడి మీడియా   ఫోకస్ ఇపై ఇంకా పడినట్టు లేదు. వ్ఇక డిపార్టమెంట్ లో చేస్తూండటంతో రాణా కంటిన్యూగా ముంబైలోనే ఉంటున్నాడు.  కాబట్టి వీరిద్దరూ అక్కడ తరుచు కలుసుకోవచ్చు.  రెగ్యులర్ గా పబ్ లకు వెళ్లవచ్చు.  హైదరాబాద్ లో దొరకని స్వేచ్చ తో ఎంచక్కా ఎంజాయ్ చేయొచ్చు...కదా....   

'గబ్బర్‌సింగ్‌' గా పవన్ కళ్యాణ్

సల్మాన్ తో హిందీలో హిట్టయిన 'దబాంగ్‌' చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా  'గబ్బర్‌సింగ్‌' గా రీమేక్ అవుతోంది. పవన్‌కల్యాణ్‌, శ్రుతిహాసన్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కొత్త పోస్టర్ని కూడా విడుదల చేసారు. ఈ చిత్రంలో పొగరు పోలీసు అధికారి గా పవన్ కనిపించనున్నారు. చాలా కేర్ లెస్ గా కనిపించే మాస్ లుక్ తో ఉన్న క్యారెక్టర్ ని ప్రతిబింబించేలా ఈ స్క్రిప్టుని ని రూపొందించారు. ‘మిరపకాయ్’ వంటి మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు హరీష్‌ శంకర్ ‘గబ్బర్‌ సింగ్’ చిత్రాన్ని, పెద్ద హిట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్  'గబ్బర్ సింగ్' లో  సిక్స్ ప్యాక్ తో తన భిమానులు, తెలుగు ప్రేక్షకుల ఎదుటకు రానున్నాడు. కొమరం పులి తర్వాత పద్దతి మార్చుకుని ఫాస్ట్ గా సినిమాలు కంప్లీట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘కాళి’ కూడా  పూర్తి కావచ్చింది. తమిళ డైరెక్టర్ విష్ణు వర్థన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ ఒక డిఫరెంట్ షేడ్ ను  చూపించబోతున్నాడు. ఇండియాలో డిఫరెంట్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ లో హై ఎక్స్ పెక్టేషన్స్ వున్నాయి. 

చిదంబరంపై కె.సి.ఆర్. చిర్రుబుర్రులు...

 హైదరాబాద్,,అగస్ట్ 7:   ‘‘మీ నెత్తిన మీరే చెయ్యి పెట్టుకొమ్మనే విధంగా చిదంబరమనే సన్నాసి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతాడనుకోలేదు. సమస్యను రాష్ట్రంలోనే పరిష్కరించుకుంటే దేశానికి ప్రభుత్వం ఎందుకు? హోంమంత్రి ఎందుకు? రాజ్యాంగమెందుకు? చావటానికా? మైనారిటీ ప్రజలను మెజారిటీ ప్రజలు దోపిడీ చేయకుండా, అణచివేయకుండా ఉండాలనే రాష్ట్రాల విభజన అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా కేంద్ర ప్రభుత్వానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కట్టబెట్టారు. తగిన సమయంలో నిర్ణయమంటూ కాలయాపన చేస్తే.. చిదంబరానికే పవరు, పదవి పోతాయి. పొట్టోని నెత్తి పొడుగోడు కొడితే పొడుగోని నెత్తి పోషమ్మ కొడుతది. చిదంబరం ఎక్కడకి పోతాడు? ఇప్పుడు కాకుంటే 2014లో దొరకడా?’’ అంటూ కేంద్ర హోంమంత్రిపై తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు.  ‘‘సమస్య వచ్చిందని పోతే.. దానిని మీరే పరిష్కరించుకోవాలంటే.. పెద్ద మనిషి ఎందుకు? పెద్దరికం ఎందుకు?’’ అని విమర్శించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. జయశంకర్ జయంతి సభలోనూ, అనంతరం ‘పోరు తెలంగాణ’ సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలోనూ కేసీఆర్ మాట్లాడారు. ‘‘విడిపోవడానికి ఏకాభిప్రాయం ఎందుకు? కలిసి ఉండటానికి ఏకాభిప్రాయం కావాలి. చిదంబరానిది ఏ సిద్ధాంతమో, ఏం ఫిలాసఫీయో అర్థంకావటం లేదు. ధర్మకర్తగా, ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాల్సిన కేంద్ర ప్రభుత్వం దిక్కుమాలిన మాటలు చెప్తోంది. ’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు అనుకూలంగా దేశంలోని 36 పార్టీలను ఏకం చేశామని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్రకు చెందిన కవులు, మేధావులు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉన్నారని చెప్పారు. మంచిమాటలతో తెలంగాణ ఇస్తే మంచిదన్నారు. లేదంటే ‘‘తెలంగాణ శాపం కాంగ్రెస్‌కు, సోనియాగాంధీకి పాపమై చుట్టుకుంటుంది. పామై కాటేస్తుంది’’ అని కేసీఆర్ హెచ్చరించారు.
సోనియాగాంధీ ప్రాణాలు ఎంత ముఖ్యమో తెలంగాణ యువత ప్రాణాలు కూడా అంతే ముఖ్యమన్నారు. సోనియాగాంధీ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు. ‘‘సోనియాగాంధీకి ఆరోగ్యం బాగాలేనందుకు ఆందోళనలను వాయిదా వేయాలని రోశయ్య అంటున్నాడు. సోనియాగాంధీ లేకుంటే పార్లమెంటు నడవటంలేదా? ప్రభుత్వం, ప్రధానమంత్రి లేరా? తెలంగాణ విషయానికి వస్తేనే అన్నీ అడ్డంవస్తాయా? తెలంగాణ ఉద్యమాన్ని ఆపంగాక ఆపం. మా పంథా మాకుంటుంది. తెలంగాణ వచ్చేదాకా ఆగేది లేదు. తుపాను, సునామీ సృష్టించి అయినా తెలంగాణ సాధిస్తా’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘ఓపిక, సహనం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఫలితం వచ్చేదాకా, పట్టుదలతో కొట్లాడదాం. ఇప్పుడు కాకుంటే 2014లో దొరకరా? ఉద్యమంలో తత్తరపాటు బిత్తరపాటు వద్దు. మనకు ఇంకా సహనం పెరగాలి. తెలంగాణ విషయంలో తెలుపు, నలుపు తేలిపోయింది. దొంగలు ఎవరో, దొరలు ఎవరో తెలిసిపోయింది. మనకు కొట్లాడటానికి మార్గం ఇంకా సుగమం అయింది’’ అని చెప్పారు.

భారీగా తగ్గిన అమెరికా క్రెడిట్ రేటింగ్

వాషింగ్టన్,అగస్ట్ 7:  గతంలో ఎన్నడూ లేని విధంగా అమెరికా దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్‌ను అత్యున్నత స్థాయి ‘ఏఏఏ’ నుంచి ‘ఏఏ+’ స్థాయికి కుదిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ స్టాండర్డ్ అండ్ పూర్స్ ప్రకటించింది. దీనికి కూడా నెగటివ్ అంచనాలను జతచేసింది. పరిస్థితులు మెరుగుపడకపోతే మరో రెండేళ్లలో రేటింగ్‌ను ‘ఏఏ’ స్థాయికి కూడా తగ్గించే అవకాశాలున్నాయని పేర్కొంది. రుణ భారాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరమైన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌అండ్‌పీ వెల్లడించింది. ‘ట్రిపుల్ ఎ’ రేటింగ్ గల కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, యూకే వంటి దేశాల రుణాలు సమీప భవిష్యత్తులో తగ్గే అవకాశముం డగా, అమెరికా రుణ భారం మాత్రం మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోందని పేర్కొంది. మరోవైపు, అమెరికా రేటింగ్స్ కు కోతపెట్టినట్టు వార్తలు రాగానే.. ఆ దేశ ఆర్థిక విధానాలను చైనా తప్పుపట్టింది. తమ పెట్టుబడుల పరిరక్షణకు తగు చర్యలు తక్షణమే తీసుకోవాల్సిందిగా సూచించింది. అయితే, మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్, ఫిచ్ రేటింగ్స్ వంటి ఇతర క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు అమెరికా ‘ట్రిపుల్ ఎ’ రేటింగ్‌ను కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. కానీ, రుణ భారం తగ్గించుకునేందుకు అమెరికా తగు చర్యలు తీసుకోలేకపోయినా.. వృద్ధిరేటు మరింత బలహీనపడినా డౌన్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించాయి. తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. ఆర్థిక మంత్రి తిమోతీ గీత్నర్‌తో సమావేశమై సమీక్షించారు. రుణ చెల్లింపు సామర్థ్యాలపై సందేహాలు పెట్టుకోనక్కర్లేదని అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్లకు భరోసా కల్పించే ప్రయత్నం చేసింది. రుణాలు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసే పరిస్థితిలోకి వెళ్లిన అమెరికా ఈ మధ్యే తన రుణ సమీకరణ పరిమితిని పెంచుకుని గట్టెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికా రుణ భారం 14.57 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. బ్యాంకులు, పింఛను ఫండ్స్, విదేశీ ఇన్వెస్టర్లు ఈ రుణం ఇచ్చిన వారిలో ఉన్నారు. అమెరికా డెట్ మార్కెట్‌లో చైనా, జపాన్ అత్యధికంగా పెట్టుబడులు పెట్టాయి. 

Saturday, August 6, 2011

ఉత్తమ నటుడు- బాలకృష్ణ...ఉత్తమనటి -నిత్యామీనన్..ఉత్తమ చిత్రం- ‘వేదం’

2010  నంది అవార్డులు ...
హైదరాబాద్, అగస్ట్ 6: నందమూరి  బాలకృష్ణ కు  ‘సింహా’ చిత్రంలో  నటనకుగాను   2010 నంది అవార్డుకు ఉత్తమ నటుడు గా ఎంపికయ్యారు. ఉత్తమనటి అవార్డు నిత్యామీనన్ (అలా మొదలైంది) కు దక్కింది. ‘వేదం’ సినిమా ఉత్తమ చిత్రంగా అవార్డు సాధించింది. ‘సింహా’ చిత్రం ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును కూడా గెలుచుకుంది. 2010 చలనచిత్ర రంగం నంది అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. విజేతల వివరాలను జ్యూరీ ఛైర్మన్ శంకర్ సభ్యుల సమక్షంలో వెల్లడించారు. వివరాలు...

ఉత్తమ నటుడు- బాలకృష్ణ
ఉత్తమనటి -నిత్యామీనన్
ఉత్తమ చిత్రం-  ‘వేదం’
ఉత్తమ విలన్: వి.నాగినీడు (మర్యాద రామన్న)                  
ఉత్తమ దర్శకుడు: పి.సునీల్‌కుమార్‌రెడ్డి (గంగపుత్రులు)
ఉత్తమ బాలనటుడు: మాస్టర్ భరత్ (బిందాస్)
ఉత్తమ తొలిచిత్ర దర్శకురాలు: నందినీరెడ్డి (అలా మొదలైంది)
ఉత్తమ పాటల రచయిత: నందిని సిధారెడ్డి (వీర తెలంగాణలోని ‘నాగేటిసాళ్లలో నా తెలంగాణ’)
ఉత్తమ పిల్లల చిత్రం: లిటిల్ బుద్ధ
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: ప్రసాద్ మురెల్లా (నమో వెంకటేశా)
ఉత్తమ సంగీత దర్శకుడు: చక్రి (సింహా)
ఉత్తమ కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్ (అదుర్స్)
ద్వితీయ ఉత్తమ చిత్రం: గంగపుత్రులు
తృతీయ ఉత్తమ చిత్రం: ప్రస్థానం
ఉత్తమ నేపథ్య గాయకుడు-  ఎం.ఎం.కీరవాణి..
ఉత్తమ నేపథ్య గాయని: ప్రణవి (సరిగమపదని-స్నేహగీతం)
ప్రత్యేక జ్యూరీ అవార్డులు: సమంతా (ఏమాయ చేశావే), చంద్ర సిద్దార్థ (అందరి బంధువయా), శ్రీరాములు (వేదం), మంచు మనోజ్‌కుమార్ (బిందాస్), సునీల్ (మర్యాద రామన్న)
పిల్లల ఉత్తమ చిత్రాల విభాగంలో ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలుగా ఏవీ ఎంపిక కాలేదు.










Friday, August 5, 2011

బాండ్ గర్ల్ గా ఐష్...!

 శ్యామ్ మెండీస్ దర్శకత్వం వహిస్తున్న  23వ బాండ్ సినిమాలో బాండ్ గర్ల్ గా స్లమ్ డాగ్ పాప ఫ్రిదా పింటోను తీసుకున్నారని వార్తలు వచ్చాయి.  అయితే ఆ తర్వాత ఆ వార్తలు నిజం కడ ?  తాజాగా ఈ సినిమాలో బాండ్ గర్ల్ గా మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నెం.1 హీరోయిన్ అందాల ఐశ్వర్యారాయ్ ను ఎన్నుకున్నారని సమాచారం.  ఈ  బాండ్ సినిమాలో డేనియల్ క్రెగ్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా కథనం ప్రకారం జేమ్స్ బాండ్ తన మిషన్ లో భాగంగా ఈ సారి ఇండియా వస్తాడట. ఈ సినిమా షూటింగ్ చాలా భాగం ఇండియాలోనే జరగనుంది. ఇందుకోసం లొకేషన్ల అన్వేషన కూడా మొదలయింది. దీంతో కథానాయిక కూడా ఇండియన్ అయితే బాగుంటుందని భావించిన శ్యామ్ ఇందుకోసం ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్యారాయ్ అయితే నాయికగా బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. అయితే ఈ విషయమై ఇంకా ఆమె నిర్ణయం తీసుకోలేదంటున్నారు. దట. ఐష్ ఇంతకు ముందు పింక్ ప్యాంథర్ 2, ప్రొవోక్డ్, ది లాస్ట్ లీజియన్ వంటి హాలీవుడ్ సినిమాల్లో నటించింది. కాగా,  ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే వేచి చూడల్సిందే...

కాజల్ బెస్ట్ కో స్టార్....నాగచైతన్య

   ‘దడ’ షూటింగ్‌లో  తనకు కాజల్ కు మధ్య ఏవో మనస్పర్థలు వచ్చాయనే  ప్రచారన్ని  కొట్టి పారేశాడు నాగచైతన్య. కాజల్ బెస్ట్ కో స్టార్ అని తేల్చేసాడు నాగచైతన్య. అలాగే అనూష్క కీ తనకీ వివాహం అయ్యిందంటూ వచ్చిన వార్తలను సైతం ఆయన కొట్టి పారేస్తూ..నేను పెళ్లి చేసుకుంటే  మీడియాని పిలిచి మరీ ఆ సంతోషాన్ని  పంచుకుంటానని  అన్నాడు. స్టార్ హీరో కొడుకుని  కాబట్టి కెరీర్ సజావుగా ఉంటుందనడానికి లేదని,  ఆ ప్రభావం ఒకటి, రెండు సినిమాల వరకే ఉంటుందని,  ఆ తర్వాత నటుడిగా నిరూపించుకుంటేనే కెరీర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. ‘బెజవాడ రౌడీలు’ 45 శాతం పూర్తయిందని, కథ నచ్చింద్నే  చేశానని ఈ టైటిల్ పెట్టాలన్నది రామ్‌గోపాల్‌వర్మ నిర్ణయమని,  ఇదే టైటిల్ ఉన్నా, మార్చినా తన కభ్యంతరం లేదని అంటున్నాడు  నాగచైతన్య. కాగా, ' దడ '  తెలుగు సినిమా రిలీజ్ కాకుండానే, బాక్సాఫీసు వద్ద దాని రిజల్ట్ తెలియకుండానే, దాని హిందీ రీమేక్ రైట్స్ హాట్ కేక్ లా సేల్ అయిపోయాయి.  ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్  సుమారు 80 లక్షలకు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. 

విప్రో నుంచి డెల్‌కు సీనియర్ల వలస

బెంగళూరు,అగస్ట్,5: : ఐటి ఎగుమతుల్లో మూడవ అతిపెద్ద సంస్థ విప్రో నుంచి సీనియర్ల రాజీనామాల పర్వం కొనసాగుతోంది. గడచిన మూడు నెలల్లో నలుగురు ఉన్నతాధికారులు సంస్థకు రాజీనామా చేయగా, వారిలో ముగ్గురు డెల్‌లో చేరారు. జనవరిలో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సురేష్‌ వస్వానీని తొలగిస్తూ, ఆయన స్థానంలో టికె కురియన్‌ను నియమిస్తున్నట్టు విప్రో చీఫ్‌ అజీం ప్రేమ్‌జీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వస్వానీ డెల్‌ ఇండియా హెడ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆపై విప్రోలో సీనియర్ల నుంచి జూనియర్ల వరకూ ఎంతో మంది డెల్‌కు వలస వెళ్ళారు.   గడచిన తొలి త్రైమాసికంలో విప్రో నికర లాభం జనవరి త్రైమాసికంతో పోలిస్తే 3 శాతం తగ్గిన సంగతి తెలిసిందే.

లోక్‌సభలో లోక్‌పాల్ బిల్లు

ప్రధానిని మినహాయించడంపై బీజేపీ  నిరసన
బిల్లు ప్రతులను తగలెట్టిన అన్నా హజారే
న్యూఢిల్లీ,అగస్ట్,5: : విపక్షాల నిరసనల మధ్య  కేంద్ర ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌పాల్ పరిధి నుంచి ప్రధానిని మినహాయించడంపై బీజేపీ సహా ఎన్డీయే పక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. మరోవైపు ఇదే కారణంతో అన్నా హజారే, ఆయన మద్దతుదారులు బిల్లు ప్రతులను తగులబెట్టారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర సిబ్బంది శాఖ మంత్రి నారాయణస్వామి  లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టేందుకు ముందే ఈ అంశంపై మాట్లాడేందుకు విపక్షనేత సుష్మా స్వరాజ్‌కు స్పీకర్ మీరా కుమార్ అనుమతి ఇచ్చారు. క్రిమినల్ చట్టం, అవినీతి నిరోధక చట్టాల నుంచి ప్రధానికి ఎలాంటి మినహాయింపు లేనప్పుడు లోక్‌పాల్ నుంచి ఎందుకు మినహాయించారంటూ సుష్మా ప్రశ్నించారు. రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులేనని, కేంద్ర మంత్రులందరినీ లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చి, ప్రధానిని మాత్రం ఎందుకు మినహాయించారో అర్థం కావడం లేదని అన్నారు. ప్రణబ్ ముఖర్జీ హోంశాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తెచ్చేందుకు అంగీకరించారని గుర్తు చేశారు. అప్పట్లో తాను ప్రధానిని లోక్‌పాల్ పరిధిలోకి తేవడానికి మద్దతు పలికిన మాట నిజమేనని ప్రణబ్ అన్నారు. హోంశాఖ స్థాయీ సంఘం చైర్మన్‌గా ఉన్నప్పుడు 2002 ఫిబ్రవరి 16న లోక్‌పాల్ బిల్లును సభకు సమర్పించానని, ఆ తర్వాత రెండేళ్లు ఎన్డీయే సర్కారే అధికారంలో ఉన్నా, ఎందుకు ఆమోదించలేకపోయారని ఆయన ప్రశ్నించారు.
గురువారం నాడు లోక్  సభ సభ్యుని గా ప్రమాణ స్వీకారం చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి

కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి సదానంద్ గౌడ ను అభినందిస్తూన్న గవర్నర్ భరద్వాజ్

ముంబై తీరంలో మునిగిన భారీ సరుకు రవాణా నౌక

ముంబై,అగస్ట్ 5:  ముంబై తీరానికి సమీపంలో గురువారం మధ్యాహ్నం ఒక భారీ సరుకు రవాణా నౌక మునిగిపోయింది.  పనామాకు చెందిన ఈ నౌకలోని 30 మంది సిబ్బంది తీరరక్షకదళం సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇండోనేషియాలోని టుటుంగ్ రేవునుంచి గుజరాత్‌లోని ధహెజ్ రేవుకు 60 వేల టన్నుల బొగ్గులోడుతో వెళుతున్న ఎంవీ రాక్ అనే ఈ నౌక ముంబై తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైందని తీరరక్షకదళం ఐజీ బస్రా  తెలిపారు.  నౌక అడుగు భాగంలోకి నీరు ప్రవేశించడంతో అది మునిగిపోయిందని ఆయన వివరించారు. నౌక అడుగుభాగంలో కొన్ని రంధ్రాలు పడి ఉంటాయని అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా 225 మీటర్ల పొడవైన ఈ నౌకలో భారీ మొత్తంలో బొగ్గు, ముడి చమురు ఉండడంతో సముద్ర జలాలు తీవ్రంగా కలుషితం అయ్యే అవకాశముందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నౌకలో 290 టన్నుల చమురు, 50 టన్నుల డీజిల్ కూడా ఉందని బస్రా వెల్లడించారు. నౌక మునిగిపోయిన ప్రాంతం రేవు ప్రవేశద్వారం వద్ద ఉండడంతో ఇతర నౌకల రాకపోకలకు ఇబ్బందిలేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

మేడం కు యు.ఎస్. లో రహస్య వైద్యం...!

న్యూఢిల్లీ,అగస్ట్ 5: : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అమెరికాలో గురువారం శస్త్రచికిత్స జరిగింది. అయితే అది ఎందుకన్నది మాత్రం తెలియరాలేదు. సర్వైకల్ క్యాన్సర్ అంటూ పలు చానళ్లలో వార్తలు వచ్చినా, అవేవీ నిర్ధారణ కాలేదు. సోనియా ఆరోగ్యం, ఆమె అమెరికా పర్యటన వివరాలన్నింటినీ కాంగ్రెస్ వర్గాలు మొదటి నుంచీ అతి గోప్యంగా ఉంచడంతో, శస్త్రచికిత్స వార్త తెలియగానే దేశమంతా ఆశ్చర్యంలో మునిగిపోయింది. గురువారం సోనియా న్యూయార్క్ లోని మెమోరియల్ స్లోన్-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ (ఎంఎస్‌కేసీసీ) లో చేరారనిరాష్ట్రానికి చెందిన ప్రపంచ ప్రఖ్యాత ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు  సారథ్యంలో, సోనియా కుటుంబ వైద్యుడు ఘాయ్ భండారీ సమక్షంలో శస్త్రచికిత్స జరిగిందని తెలియవచ్చింది.  కూతురు ప్రియాంక గాంధీ కూడా ప్రసుత్తం తల్లి వెంటే ఉన్నట్టు సమాచారం.
 రాహుల్‌ సారథ్యంలో ...
తన గైర్హాజరీలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను నడిపేందుకు రాహుల్ సారథ్యంలో నలుగురు నేతల గ్రూపును సోనియా ఏర్పాటు చేశారు. అయితే... పార్టీ దిగ్గజాలను కాదని... వివాదరహితుడుగా పేరున్న రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేదీలను మిగతా సభ్యులుగా ఎంపిక చేయడం గమనార్హం. ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో పాటు... కాంగ్రెస్‌లో నంబర్ టూగా ఉన్న  ట్రబుల్ షూటర్ ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి చిదంబరం వంటి ముఖ్య నేతలెవరికీ చోటు దక్కకపోవడంపై రాజకీయ వర్గాల్లో  చర్చ జరుగుతోంది.

Thursday, August 4, 2011

రామలింగరాజుకు బెయిల్ తిరస్కరణ

హైదరాబాద్ ,అగస్ట్ 4:  సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు రామలింగరాజు బెయిల్ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తిరస్కరించింది. రామలింగరాజుతో పాటు మరో ఏడుగురు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఎంపీగా జగన్ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ,అగస్ట్ 4:  కడప ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి గా   గెలుపొందిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఉదయం 11.01 గంటలకు తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. స్పీకర్ మీరాకుమార్, ప్రతిపక్ష, విపక్ష నేతలు వైఎస్ జగన్‌కు అభినందనలు తెలిపారు. ఆయన ప్రమాణం చేస్తున్నప్పుడు విపక్ష ఎంపీలు బలచరుస్తూ స్వాగతం పలికారు. కాగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని జగన్ సతీమణి వైఎస్ భారతీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్‌సభ గ్యాలరీ నుంచి తిలకించారు.

Wednesday, August 3, 2011

భారత్‌-రష్యా వీసా ఒప్పందం

మాస్కో,అగస్ట్ 3:  భారత్, రష్యాల మధ్య బిజినెస్, టూరిస్టు వీసాల జారీపై గత ఏడాది న్యూఢిల్లీలో కుదిరిన ఒప్పందాన్ని మంగళవారం రష్యా ప్రధాని పుతిన్ నేతృత్వంలోని మంత్రి మండలి ఆమోదించింది. ఇరుదేశాల పౌరులకు వీసాల జారీని సరళతరం చేస్తూ కుదిరిన ఒప్పందాన్ని ఆమోదించిన కేబినెట్ దానిని రష్యా పార్లమెంటు దిగువ సభ ఆమోదానికి పంపింది. పౌరులు, విద్యార్థులు, యాత్రికులు మొదలైనవారి పరస్పర ప్రయాణాలను సులభతరం చేసే ఉద్దేశంతో ఈ ఒప్పందం చేసుకున్నట్లు రష్యా విదేశాంగ ఉప మంత్రి ఆండ్రీ డెనిసోవ్ కేబినెట్‌కు తెలిపారు. 

Monday, August 1, 2011

హమ్మయ్య...అమెరికా...

వాషింగ్టన్ ,అగస్ట్ 2:   ‘రుణ పరిమితి సంక్షోభం’ నుంచి అమెరికా తప్పించుకుంది. ఆర్థిక సంక్షోభం అంచు నుంచి, అంతర్జాతీయంగా పరువుపోయే గడ్డుస్థితి నుంచి బయటపడింది. రుణపరిమితి పెంచుకునే, ద్రవ్యలోటును తగ్గించుకునే ప్రతిపాదనలపై అధికార డెమోక్రాట్లు, విపక్ష రిపబ్లికన్లు ఒక అంగీకారానికి వచ్చారు. దాంతో ఒబామా సర్కారు ఆగస్టు 2 తరువాత ప్రభుత్వ ఖర్చులకు చెల్లింపులు జరపలేని నిస్సహాయత నుంచి విజయవంతంగా గట్టెక్కింది. వచ్చే పదేళ్లలో రెండు దశల్లో మరో 2.4 లక్షల కోట్ల రుణపరిమితి పెంపునకు ఇరుపార్టీలు అంగీకరించాయి. అదే కాలంలో అంతే మొత్తంలో లోటును తగ్గించుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. తాజా నిర్ణయాలతో అమెరికా ఆర్థికపరిస్థితిలోని అస్థిరత తొలగుతుందన్న ఆశాభావాన్ని ఒబామా వ్యక్తంచేశారు. ‘ఈ ఒప్పందం ద్వారా.. దివాలా పరిస్థితి నుంచి అమెరికా తప్పించుకోగలుగుతుంది. బిల్లుల చెల్లింపు సాధ్యమవుతుంది. బాధ్యతాయుతమైన పద్ధతుల్లో లోటును తగ్గించుకోగలుగుతాం. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా, వృద్ధి రేటు పెరిగేలా చర్యలు తీసుకోగలుగుతాం’ అని ధీమా వ్యక్తంచేశారు. 

ఒక రోజు ముందే ఓడిన భారత్...!

నాటింగ్‌హాం,అగస్ట్ 2:  రెండో  టెస్టులోను  ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వచ్చింది.
478 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.4 ఓవర్లలో 158 పరుగులకు ఆలౌటయింది. సచిన్ (86 బంతుల్లో 56; 8 ఫోర్లు), హర్భజన్ (44 బంతుల్లో 46; 8 ఫోర్లు, 1 సిక్సర్), ప్రవీణ్ (25 బంతుల్లో 25; 5 ఫోర్లు) మినహా ఒక్కరు కూడా కనీసం రెండంకెల స్కోరును చేరుకోలేదు. ముకుంద్ (3), ద్రవిడ్ (6), లక్ష్మణ్ (4), రైనా (1), యువరాజ్ (8), ధోని (0)... మొత్తం ఆరుగురూ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ సీమర్ బ్రెస్నన్ నిప్పులు చెరిగే బంతులతో భారత్‌ను కుప్పకూల్చాడు. బ్రెస్నన్ ఐదు వికెట్లు తీసుకోగా... అండర్సన్ మూడు, బ్రాడ్ రెండు వికెట్లు పడగొట్టారు.అంతకు ముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120.2 ఓవర్లలో 544 పరుగులకు ఆలౌటయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బ్రెస్నన్ (118 బంతుల్లో 90; 17 ఫోర్లు)తో పాటు స్టువర్ట్ బ్రాడ్ (32 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా పరుగులు చేశారు. ఇంగ్లండ్ 19.2 ఓవర్లలో 103 పరుగులు చేసి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్ లోటును మినహాయిస్తే ఇంగ్లండ్‌కు 477 పరుగుల ఆధిక్యం లభించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపించిన ఇంగ్లండ్ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మూడో టెస్టు ఈ నెల 10 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరుగుతుంది.

పార్లమెంట్‌కు టీ-కాంగ్రెస్ ఎంపీలు గైర్హాజరు

న్యూఢిల్లీ,అగస్ట్ 1:  తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు గైర్హాజరు అయ్యారు. తెలంగాణపై తమకు స్పష్టమైన వైఖరి ప్రకటించేవరకూ సమావేశాలకు హాజరు కాకుడదని ఎంపీలు నిర్ణయించారు. ఆజాద్ తో సమావేశం అయిన తర్వాతే పార్లమెంట్ సమావేశాలకు హాజరుపై నిర్ణయం తీసుకుంటామని కేకే తెలిపారు. కాగాటీడీపీ తెలంగాణ ఎంపీలు కూడా పార్లమెంట్‌కు డుమ్మా కొట్టారు.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి  ప్రారంభం అయ్యాయి.  లోక్‌సభ  ప్రారంభం కాగానే పధానమంత్రి మన్మోహన్‌సింగ్ సభకు కొత్త మంత్రులను పరిచయం చేశారు. అనంతరం మృతి చెందిన మాజీ లోక్‌సభ ఎంపీలకు స్పీకర్ మీరాకుమార్ సంతాపం ప్రకటించారు. తర్వాత సభను స్పీకర్ మంగళవారానికి వాయిదా వేశారు.  రాజ్యసభలో అవినీతిపై బీజేపీ చర్చకు పట్టుబట్టడంతో రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ సభను  మంగళవారానికి  వాయిదా పడింది. వేశారు. అంతకు ముందు ఇటీవలి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం ఖండూ, పుట్టపర్తి సత్యాసాయి బాబాతో పాటు, మాజీ రాజ్యసభ్యుల మృతికి రాజ్యసభ సంతాపం తెలిపింది.

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...