భారీ పంట నష్టం...జనజీవనం అస్తవ్యస్తం
. హైదరాబాద్,అక్టోబర్ 31: ఎన్నడూ లేని విధంగా ఈశాన్య రుతుపవనాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. వీటికి బంగాళాఖాతంలో అల్పపీడనం కూడా తోడవడంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. అనేక జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో కురుస్తున్న వానలు రైతుకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైంది. లక్షలాది ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కుండపోత వర్షాలతో రబీ సాగు కూడా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆదివారం తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు పడ్డాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో గరిష్టంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు తూర్పుగోదావరి జిల్లాలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు, విశాఖలో మరొకరు మరణించారు.
Comments