హైదరాబాద్, నవంబర్ 29; మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెంలో బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు రాకేశ్ మృతదేహం గా బయటకు వచ్చాడు. రైతుకూలీ బైరు సాయిలు, మొగులమ్మ దంపతుల ఇద్దరు కుమారుల్లో ఒకడు రాకేశ్(3). అన్న బాలేష్(5)తో కలిసి బోరుబావిని తవ్వగా వచ్చిన రాతిపిండితో ఆడుకున్నాడు. అక్కడ తవ్వి ఉన్న బోరు గుంతలోకి తొంగిచూశాడు. ప్రమాదవశాత్తు అమాంతం అందులోకి జారిపోయాడు. తమ్ముడిని పట్టుకునేందుకు పక్కనే ఉన్న అతడి అన్న బాలేశ్ ప్రయత్నించాడు. తమ్ముడి కాలు పట్టుకుని లాగబోయాడు. కానీ అదుపు తప్పడంతో రాకేశ్ తలకిందులుగా లోనికి పడిపోయాడు. ..బోరుబావిలో పడ్డ బాలుడిని ప్రాణాలతో రక్షించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేసినప్పటికి ఫలితం లేకుండా పోయింది. సహాయకచర్యల్లో అధికశక్తిగల మూడు పొక్లెయిన్లను, మూడు జేసీబీలు, రెండు చిన్న హిటాచీలు, మూడు పెద్ద హిటాచీలు పాల్గొన్నాయి.బాలుడిని రక్షించేందుకు అధికారయంత్రాంగం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బోరు బావి లోతు 150 అడుగులు కాగా బాలుడు 31 అడుగుల లోతున చిక్కుకున్నాడు. బండరాళ్లు ఉండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటకం ఏర్పడింది. దీంతో అధికారులు నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఏజెన్సీ, డిజాస్టార్ మేనేజ్మెంట్ బృందాలను రంగంలోకి దించారు. అయినా బాలుడిని రక్షించేందుకు 24 గంటల పాటు శ్రమించిన ఫలితం వృథా అయింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం బాలుడిని ఆదివారం ఉదయం బోరుబావి నుంచి వెలుపలికి తీశారు.
..