Tuesday, December 30, 2014
టెస్ట్ క్రికెట్కు ధోని గుడ్బై...
మెల్ బోర్న్, డిసెంబెర్ 30; భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన తర్వాత ధోనీ ఈ ప్రకటన చేశారు. ధోనీ ఇంత త్వరగా టెస రిటైర్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అలా ఎవరూ ఊహించని విషయాన్ని ప్రకటించి ధోనీ సంచలనం సృష్టించాడు. వచ్చే ప్రపంచ కప్ తర్వాత ధోనీ మొత్తం క్రికెట్ నుంచి తప్పుకునే అవకాశాలున్నాయన్న ఊహాగానాలున్నాయి. ధోనీ టెస్ట్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవచ్చని మాజీ కెప్టెన్ గంగూలీ ప్రకటించాడు. అయితే మహేంద్ర సింగ్ ధోనీ మొత్తానికి టెస్ట్ క్రికెట్ నుంచే తప్పుకున్నాడు. వన్డేలు, టీ20లపై దృష్టి పెట్టేందుకే ధోని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 టెస్టులు ఆడిన ధోనీ 4,876 పరుగులు చేశారు. ఇందులో ఆరు సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2005లో ధోని టెస్టులో అరంగేట్రం చేశారు. ధోని అత్యధిక వ్యక్తిగత స్కోరు 224 పరుగులు కాగా, టెస్టుల్లో 256 క్యాచ్లు, 38 స్టంపింగ్స్ చేశారు. దాదాపు 60 టెస్టుల్లో ధోనీ భారత్కు కెప్టెన్సీగా వ్యవహరించారు. ధోనీ కెప్టెన్సీలో భారత్కు 27 టెస్ట్ విజయాలు వరించాయి. ధోని కెప్టెన్సీలో టెస్టుల్లో భారత్ వరల్డ్ నెం.1గా నిలిచింది. ఆసీస్తో టెస్ట్ సిరీస్ ఓటమి తర్వాత ధోని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. టెస్టులకు దోని రిటైర్డ్ ప్రకటించడంతో ఆసిస్తో చివరి టెస్టుకు కోహ్లీ కెప్టెన్సీగా వ్యవహరించనున్నారు.
Saturday, December 27, 2014
ఎయిర్ ఏషియా విమానం అదృశ్యం .....
జకార్తా, డిసెంబర్ 28; ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం-క్యూజెడ్8501 గగన తలం నుంచి అదృశ్యమైంది. సురబయా నుంచి సింగపూర్ బయలుదేరిన విమానంతో కొద్ది సేపటికే సంబంధాలు తెగిపోయాయని సమాచారం . ఆదివారం ఉదయం 6.15 గంటలకు (స్థానిక కాలమానం) విమానం అదృశ్యమైంది. విమానంలో 162 మంది ఉన్నట్టు తెలిసింది .
చిత్ర పరిశ్రమకు కె.సి. ఆర్. భరోసా ...
హైదరాబాద్,డిసెంబర్ 27; బిగ్బీ అమితాబ్ బచ్చన్ అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు ఈ పురస్కారాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సినీనటుడు నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
కె.సి. ఆర్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు .త్వరలోనే సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
కె.సి. ఆర్ . ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమను మరింత అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. చిత్ర పరిశ్రమను హైదరాబాద్ నుంచి తరలిపోనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు .త్వరలోనే సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి సినీ పరిశ్రమ అభివృద్ధిపై చర్చిస్తామన్నారు.
ధోనీ ప్రపంచ రికార్డు
మెల్బోర్న్ ,డిసెంబర్ 27; భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక స్టంప్ అవుట్లు చేసిన కీపర్ గా ధోనీ (134) సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో రోజు ధోనీ.. మిచెల్ జాన్సన్ను స్టంప్ అవుట్ చేయడం ద్వారా ఈ ఘనత సాధించాడు. దీంతో శ్రీలంక ఆటగాడు సంగక్కర (133) పేరిట ఉన్న రికార్డు చెరిగిపోయింది. . ధోనీ టెస్టుల్లో 38, వన్డేల్లో 85, టి-20ల్లో 11 స్టంప్ అవుట్లు చేశాడు.
Wednesday, December 24, 2014
58 కి పెరగనున్న ఎ.పి. ఎమ్మెల్సీల సంఖ్య...
హైదరాబాద్, డిసెంబర్ 24; ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్య పెరగనుంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుల సంఖ్య 50. అయితే వాస్తవానికి ఉండాల్సిన సభ్యుల సంఖ్య 58. అందువల్ల మండలి సభ్యుల సంఖ్యని 58కి పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసమండలి సభ్యుల విషయంలో మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర శాసనమండలి సభ్యుల సంఖ్య విషయంలో కూడా విభజన చట్టంలో తప్పు వుంది. అలాగే రాజ్యసభ సభ్యుల కేటాయింపు విషయంలో కూడా పొరపాట్లు జరిగాయి. ఆంధ్రప్రదేశ్కి చెందిన కేవీపీ రామచంద్రరావును తెలంగాణకు కేటాయించారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావును ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు. అందువల్ల సదరు సభ్యులు తమ ఎంపీ నిధులను ఎక్కడ ఖర్చు చేయాలో అర్థంకాని పరిస్థితిలో వున్నారు. విభజన బిల్లులో జరిగిన ఇలాంటి అనేక పొరపాట్లను సరిచేయడానికి విభజన చట్టంలో మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
మరో ఇద్దరు భారత రత్నాలు... వాజ్ పేయి,మదన్ మోహన్ మాలవ్య ...
న్యూఢిల్లీ ,డిసెంబర్ 24; మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి , ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు , విద్యావేత్త పండిత్ మదన్ మోహన్ మాలవ్యాకు అత్యున్నత పౌర పురస్కారమైన 'భారత రత్న' ను కేంద్రం ప్రకటించింది . ఇందుకు కేంద్ర కేబినెట్ బుధవారం వీరిద్దరికి ఆమోదం తెలిసింది. గురువారం ఈ ఇద్దరు నేతల పుట్టినరోజు కావటం గమనార్హం. మాలవ్య స్వాతంత్య్ర సమర యోధుడే గాక కాంగ్రెస్ అధ్యక్షుడుగా కూడా వ్యవహరించారు.
Tuesday, December 23, 2014
బాలచందర్ ఇకలేరు...
చెన్నై, డిసెంబర్ 23: ప్రముఖ దక్షిణ భారతదేశ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత.కె.బాలచందర్ ఈ సాయంత్రం చెన్నైలో మరణించారు. ఆయన పూర్తి పేరు కైలాసం బాల చందర్. 84 సంవత్సరాల బాల చందర్ ఎంజీఆర్ కథానాయకుడిగా నటించిన దైవతాయ్ చిత్రానికి సంభాషణల రచయితగా చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో 100కు పైగా చిత్రాలను రూపొందించారు. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ వంటి నటుల్ని చిత్రపరిశ్రమకు పరిచయం చేశారు. ఆయన చిత్రాలలో బొమ్మాబొరుసా, సత్తెకాలపు సత్తెయ్య, .మరో చరిత్ర, అంతులేని కధ, గుప్పెడు మనసు, ఇది కధ కాదు, సింధుభైరవి, రుద్రవీణ,కోకిలమ్మ బహుళ ప్రజాదరణ పొందాయి. భారత ప్రభుత్వం నుంచి దాదా సాహెబ్ ఫల్కే , పద్మశ్రీ తో పాటు మొత్తం 9 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు.
Saturday, December 20, 2014
పెషావర్ దాడి సూత్రధారి హతమ్...!
రెండవ టెస్ట్ కూడా అసీస్ అర్పణం ...
బ్రిస్బేన్,డిసెంబర్ 20: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండవ టెస్ట్లో కూడా భారత్ ఓటమి పాలైంది. నాలుగో రోజే రెండో టెస్ట్ ముగిసింది. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ 408 పరుగులకు, రెండో ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 505 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇవాళ సెకండ్ ఇన్నింగ్స్ నాలుగోరోజు ఆటలో ఆరు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసి విజయం సాధించింది.
Tuesday, December 16, 2014
కె.సి.ఆర్. కొలువులో ఆరుగురు కొత్త మంత్రులు ..తుమ్మల,తలసాని కి చోటు
హైదరాబాద్,డిసెంబర్16; తెలంగాణలో ఆరుగురు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్భవన్లో ఘనంగా జరిగింది. గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులు ... తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్, లక్ష్మారెడ్డి, చందూలాల్, ఇంద్రకరణ్రెడ్డిలతో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రులు రాజయ్య, మహమూద్ అలీ, శాసనసభాపతి మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరై కొత్త మంత్రులకు అభినందనలు తెలిపారు.
Monday, December 15, 2014
ఎ.పి. రాజధాని ప్రధాన రైల్వే టెర్మినల్ పై కసరత్తు
గుంటూరు, డిసెంబర్ 16;ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు దక్షిణ మధ్య రైల్వే పూర్తిస్థాయిలో సి ద్ధంగా ఉందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ ప్రదీప్కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. గుంటూరు, విజయవాడల్లో ఏదో ఒకటి రాజధానికి ప్రధాన టెర్మినల్ అవుతుందని చెప్పారు. మంగళగిరి రైల్వేస్టేషన్ను ప్రధాన టెర్మినల్గా అభివృద్ధి చేసేందుకు అనువైన స్థలం అందుబాటులో లేదన్నారు. విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు ఈ రెండు నగరాల మధ్యన ఉన్న స్టేషన్లన్నింటిని అ ప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. వచ్చే రైల్వేబడ్జెట్లో కేంద్రం తప్పక ఏపీకి ప్రాధాన్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ మృతి
అయ్యో ..చక్రి..
హైదరాబాద్,డిసెంబర్ 15; ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి(40) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చక్రిని ఆయన కుటుంబసభ్యులు అపొలో ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స పొందుతూ చక్రి తుదిశ్వాస విడిచారు. చక్రి పూర్తిపేరు చక్రధర్ గిల్లా. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా మహబూబాబాద్. 85 సినిమాలకు సంగీతం అందించిన చక్రి సత్యం సినిమాకు ఉత్తమ గాయకుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సింహా సినిమాకు నంది అవార్డు వరించింది. 1974 జూన్ 15న జన్మించిన చక్రి.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచి సినిమాతో సంగీత దర్శకుడిగా తన కెరీర్ను ప్రారంభించారు. ఆయన చివరి సినిమా దాసరి నటించిన 'ఎర్రబస్సు'. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు..', 'అమ్మనాన్న ఓ తమిళ అమ్మాయి', 'ఇడియట్', 'దేశముదురు', 'సత్యం', 'గోపి గోపిక గోదావరి', 'సింహా'.. తదితర సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి హిట్ పాటలను అందించారు. గాయకుడిగా కూడా చక్రి మంచి పేరును సంపాదించుకున్నారు. రీసెంట్గా తమన్, రవితేజ కాంబినేషన్లో వచ్చిన పవర్ సినిమాలో కూడా చక్రి ఓ హుషారైన పాటను పాడారు.
Saturday, December 13, 2014
అడిలైడ్ టెస్టు లో ఆస్త్రేలియా విజయం ....
ఆడిలైడ్,డిసెంబర్ 13; యిక్కడ జరిగిన తొలి టెస్ట్లో భారత్పై 48 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 364 పరుగుల భారీ లక్ష్యంతో చివరి రోజు ఆట ప్రారంభించిన భారత్ 315 పరుగులకే ఆలౌట్ అయింది. కోహ్లీ 141, మురళి విజయ్ 99, పుజారా 21, సాహా 13, శిఖర ధావన్ 9 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్ లియాన్ 7 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. జాన్సన్ 2, హర్రీస్ ఒక వికెట్ తీశారు. విరాట్ కోహ్లీ సాధించిన రెండు శతకాలు, రికార్డులు వృథా అయ్యాయి.
స్కోరు వివరాలు; ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 517/7, రెండో ఇన్నింగ్స్ 290/5 (డిక్లేర్డ్). భారత్ తొలి ఇన్నింగ్స్ 444, రెండో ఇన్నింగ్స్ 315 ఆలౌట్.విదేశీ గడ్డపై భారత్కు ఇది వరుసగా నాలుగో పరాజయం.
Friday, December 12, 2014
విడి విడిగా ఇంటర్... కలిపి ఎంసెట్
న్యూఢిల్లీ, డిసెంబర్ 12 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్త్రాల లోని పరిస్థితులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వివరించానని గవర్నర్ నరసింహన్ తెలిపారు. శుక్రవారం ఉదయం ప్రధానితో భేటీ అనంతరం నరసింహన్ మాట్లాడుతూ , రెండు రాష్త్రాల ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని అన్నారు. ఇరు రాష్త్రాలలో ఇంటర్ పరీక్షలు విడివిడిగా జరిగినా ఎంసెట్ను ఉమ్మడిగా నిర్వహిస్తామని గవర్నర్ వెల్లడించారు. ఉద్యోగుల విభజనలో జాప్యం వల్ల సమస్యలు లేవన్నారు. విభజన చట్టం అమలులో ఎలాంటి అడ్డంకులు లేవన్న గవర్నర్ నరసింహన్ శాంతిభద్రతలకు ఢోకా లేదని స్పష్టం చేశారు.
Tuesday, December 9, 2014
గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభం
న్యూఢిల్లీ,డిసెంబర్ 10; గూగుల్ గ్రేట్ ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్ (జీఓఎస్ఎఫ్) మొదలైంది . 2012 నుంచి ఏటా గూగుల్ నిర్వహిస్తోన్న.. ఈ ఆన్లైన్ కొనుగోళ్ళ పండగ 12 వరకు జరగనుంది. ఇంతకుముందు ప్రకటించనట్లుగానే. నెక్సస్ 6 అమ్మకాలను కూడా ఈ రోజు నుంచే కంపెనీ మొదలు పెట్టింది .. ప్రత్యేకంగా ఫ్లిప్కార్ట్లో మాత్రమే లభ్యం కానున్న ఈ ఖరీదైన స్మార్ట్ఫోను.. 32 జీబీ, 64 జీబీ రకాల్లో లభ్యంకానుంది. వీటి ధరలు వరుసగా రూ.43,999, రూ.48,999. జీఓఎస్ఎఫ్లో భాగంగా.. నెక్సెస్ 6, క్రోమ్కాస్ట్ (ధర రూ.2,999)తో పాటు లెనోవో, ఏషియన్ పెయింట్స్, టాటా హౌసింగ్, వ్యాన్ హ్యూసెన్ తదితర కంపెనీలకు చెందిన కొన్ని ఉత్పత్తులను మంగళవారం గూగుల్ విడుదల చేసింది. '2012లో మొట్టమొదటసారిగా నిర్వహించిన జీఓఎస్ఎఫ్లో 90 విక్రయ కంపెనీలు పాలుపంచుకున్నాయి. ఈసారి ఆ సంఖ్య 450కు చేరింది. ఆన్లైన్ కొనుగోళ్ళ విషయంలో భారత వినియోగదారుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోంది. గత కొద్ది వారాల్లో 50 లక్షల మందికి పైగా జీఓఎస్ఎఫ్.ఇన్ వెబ్సైట్ను సందర్శించార'ని గూగుల్ ఇండియా ఎండీ రాజన్ ఆనందన్ తెలిపారు. ఈ సారి జీఓఎస్ఎఫ్లో తాము కూడా పాల్గొంటున్నామని టాటా హౌసింగ్ తెలిపింది. బెంగళూరుతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఏడు ఇతర ప్రాజెక్టులకు చెందిన గృహాలను ఈ ఆన్లైన్ కొనుగోళ్ళ పండగలో విక్రయించనున్నట్లు పేర్కొంది.
Monday, December 8, 2014
మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలు
హైదరాబాద్,డిసెంబర్ 8; మార్చి 11 నుంచి ఏపీ ఇంటర్మీడియేట్ పరీక్షలను నిర్వహించనున్నట్టు ఆ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు చెప్పారు. .. ఎంసెట్పై తాము తమిళనాడులో అనుసరిస్తున్న విధానాన్ని అనుసరించాలని యోచిస్తున్నామన్నారు. ఉమ్మడి పరీక్షల నిర్వహణ కోసం తాము తెలంగాణ సర్కారుతో ఎన్నిసార్లు సంప్రదింపులు జరిపినా లాభం లేకపోయిందని పేర్కొన్నారు. వారి పరీక్షలు వారు నిర్వహించుకుంటామని తెలంగాణ మంత్రి జగదీశ్వర్రెడ్డి పలుమార్లు పునరుద్ఘాటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఎన్డీఏ సర్కారు నుంచి వైదొలగిన ఎండీఎంకే
చెన్నై,డిసెంబర్ 8; వైగో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగింది. శ్రీలంకకు అనుకూలంగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో కేరళ, కర్ణాటక జలవివాదాల్లో కేంద్రం వైఖరిపైనా ఎండీఎంకే ఆగ్రహంతో ఉంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలసి ఎండీఎంకే పయనం సాగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీతో జత కట్టిన తొలిపార్టీ ఎండీఎంకే కావడం గమనార్హం. ఎండీఎంకే వైదొలగడం సంతోషించదగ్గ పరిణామం కాదని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ వ్యాఖ్యనించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
సత్యం రాజుకు జైలు,జరిమానా..
న్యూఢిల్లీ, డిసెంబర్ 8; ఐదేళ్ల క్రితం నాటి సత్యం కేసులో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఎట్టకేలకు తీర్పును వెలువరించింది. మొత్తం ఆరు కేసులకు సంబంధించి ఈ కోర్టు తన తీర్పును సోమవారం వెల్లడించింది. సత్యం రామలింగరాజు, రామరాజుకు మూడు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. అలాగే వారితో పాటు రామ్ మైనంపాటికి కూడా రూ. 10 లక్షల జరిమానా విధించారు. మరో రెండు కేసుల్లో రూ. 10 లక్షల జరిమానా విధించారు. రామలింగరాజు, రామరాజులకు ఒక్కో కేసులో ఆరునెలల పాటు నాలుగు కేసుల్లో జైలుశిక్ష కూడా విధించారు. ఎస్ఎఫ్ఐఓ మొత్తం ఏడు కేసులు నమోదు చేయగా, వాటిలో ఒక కేసును కోర్టు కొట్టేసింది. తీర్పుపై అప్పీలు చేసుకునేందుకు ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు నెల రోజుల పాటు గడువు ఇచ్చింది. వడ్లమాని శ్రీనివాస్ కు మూడు కేసుల్లో రూ. 20 వేల జరిమానా, మూడు కేసుల్లో 6 నెలల జైలుశిక్ష విధించారు. సంస్థ మాజీ డైరెక్టర్లు కృష్ణ జి.పాలెపు, ఎన్.శ్రీనివాస్, వినోద్ కె. దామ్, టి.ఆర్. ప్రసాద్లకు రూ. 20 వేల వంతున జరిమానాలు విధించారు.
ఎ.పి. రాజధాని భూ సమీకరణ కు రంగం సిద్ధం
హైదరాబాద్,డిసెంబర్ 8; ఎ.పి. రాజధాని భూ సమీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలవుతుందని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజధాని భూసమీకరణపై ఆయన విధాన ప్రకటన చేశారు. రైతులు, రైతు కూలీలు అందరికీ పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా విధానం చేపట్టినట్లు తెలిపారు.మెట్ట రైతులకు ఎకరాకు నివాసయోగ్య ప్రాంతంలో వెయ్యి గజాలు, వాణిజ్య ప్రాంతంలో 200 గజాలు ఇస్తామని, జరీబు భూములకు నివాస యోగ్యం వెయ్యి, వాణిజ్యం 300 గజాలు ఇస్తామని, అసైన్డ్ భూములకు నివాసయోగ్యం 800 గజాలు, వాణిజ్యం 200 గజాలు ఇస్తామని చెప్పారు. ఏటా మెట్టలో ఎకరాకు రూ.30వేలు, జరీబుకు రూ.50వేల పరిహారం ఇస్తామని, భూ సమీకరణ ప్రాంతం రైతులందరికీ ఒకేసారి రుణమాఫీ ఎక్కడ భూమి తీసుకుంటే అదే జోన్లో భూమి కేటాయిస్తామని, మెట్ట ప్రాంతంలో ఉండే రైతుకు మెట్టలో, జరీబు రైతుకు అదే భూమి ఇస్తామని, మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేసి భూమి అప్పగిస్తామని వివరించారు . ఇళ్లులేని వారు, రహదారుల విస్తరణలో ఇళ్లు కోల్పోయే వారికి ఇళ్లు కట్టిస్తాం. గ్రామకంఠంలో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇస్తాం. భూ సమీకరణ ప్రాంతంలో అందరికీ ఉచిత విద్య, వైద్య సౌకర్యం కల్పిస్తాము . ప్రస్తుతం భూముల్లో ఉన్న పంటలు రైతులకే చెందుతాయి. భూముల రిజిస్ట్రేషన్లను ఆపం. నిమ్మ, సపోటా, జామ తోటల రైతులకు ఎకరాలకు రూ. 50వేల అదనపు సాయం ఇస్తాము. దేవాదాయ శాఖ భూములు ఉంటే దేవాలయాలకే భూమి ఇస్తాం. దేవాలయాలకు అన్యాయం జరగకుండా రైతుల తరహాలోనే పరిహారం. శ్మశానాలు, ప్రార్థనాస్థలాలకు ప్రాధాన్యమిస్తాం డబ్బు ఉన్న రైతులకు పారిశ్రామికవేత్తలుగా శిక్షణ ఇస్తాము. భూములిచ్చేందుకు రైతులు అంగీకార పత్రం ఇవ్వాలి. రాజధాని ప్రాంతాన్ని మూడు భాగాలుగా తీసుకున్నాం. ఇన్నర్ రింగ్ 75 కి.మీ. లోపు. మిడిల్ రింగ్ 125 కి.మీ. లోపు అవుటర్ రింగ్ 200 కి.మీ.లోపు గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల సమీకరణ జరుగుతుందని చంద్ర బాబు వివరించారు .
కర్నాటక సంగీత విద్వాంసుడు నేదునూరి కన్నుమూత
విశాఖపట్నం, డిసెంబర్ 8; ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు, ‘సంగీత కళానిధి’ నేదునూరి కృష్ణమూర్తి (87) సోమవారం విశాఖలో కన్నమూశారు. 1927 అక్టోబర్ 10వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి గ్రామంలో నేదునూరి జన్మించారు. ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం, కంచి కామకోటి పీఠం ఆస్థాన సంగీత విద్వాంసుడిగా కూడా పనిచేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమయ్య ప్రాజెక్టులో ఆయన అన్నమయ్య కృతులకు స్వరాలను సమకూర్చారు. పలు అవార్డులు, గౌరవ పురస్కరాలు అందుకున్నారు. మద్రాసు సంగీత అకాడమీ ఆయనను ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నేదునూరి కృష్ణమూర్తి 1995లో కళానీరాజనం పురస్కారం అందుకున్నారు. నేదునూరి కృష్ణమూర్తి అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి అయ్యన్నపాత్రుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, డిప్యూటీ ఛైర్మన్ సతీశ్కుమార్ రెడ్డి కృష్ణమూర్తి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్రంలోని పలు సంగీత కళాశాలలు, అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా నేదునూరి అందించిన సేవలను కొనియాడారు.
Wednesday, December 3, 2014
సీబీఐ కొత్త డైరెక్టర్ అనిల్కుమార్ సిన్హా
న్యూఢిల్లీ, డిసెంబర్ 3; కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా 1979 బ్యాచ్ ఐ.పి.ఎస్. అధికారి అనిల్కుమార్ సిన్హా బుధవారం బాధ్యతలు చేపట్టారు. 58 ఏళ్ల సిన్హా- గత 21 నెలలుగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్గా ఉన్నారు. శారదా గ్రూపు సంస్థల కుంభకోణ దర్యాప్తును ఆయనే పర్యవేక్షించారు. సీబీఐ అధిపతిగా వరసగా మూడోసారి బిహార్కు చెందిన అధికారే బాధ్యతలు చేపట్టడం విశేషం. ఇదివరకు డైరెక్టర్లుగా వ్యవహరించిన రంజిత్ సిన్హా, ఎ.పి.సింగ్ కూడా బీహార్ కు చెందినవారే. ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అనిల్కుమార్ సిన్హా విలేకరులతో మాట్లాడుతూ , ప్రతిష్ఠాత్మకమైన దర్యాప్తు సంస్థకు అధిపతిగా వ్యవహరించే బాధ్యతను వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు చెప్పారు. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు తనకు తెలుసుననీ, తన బృందంతో కలిసి విలువల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
Monday, December 1, 2014
మావోయిస్టుల దాడిలో 14మంది జవాన్ల మృతి
చింతూరు, డిసెంబర్ 1 : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దాడికి తెగబడ్డారు. దారి కాచి జవాన్లపై విరుచకుపడ్డారు. ఈ నెల రెండు నుంచి ఎనిమిది వరకు పీఎల్జీఏ ( పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ) వారోత్సవాలను ఘనంగా నిర్వహిద్దామంటూ పిలుపు నిచ్చిన మావోయిస్టులు.. వాటికి ఒకరోజు ముందే దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో 14 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. మృతుల్లో 223 బెటాలియన్కు చెందిన డిప్యూటీ కమాండెంట్ వర్మ, అసిస్టెంట్ కమాండెంట్ రాజేష్కపూరియాలు ఉన్నారు. గడిచిన 10 రోజుల్లో ఇది రెండో దాడి. నవంబర్ 21న జరిగిన దాడిలో ఎవరూ మరణించలేదు. కాగా తాజా దాడిలో మాత్రం పోలీసులను నక్సల్స్ బలిగొన్నారు.
సబ్సిడీలేని వంటగ్యాస్ ధర తగ్గింపు
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: సబ్సిడీలేని వంటగ్యాస్ ధర ఒక్కసారిగా రూ.119 తగ్గింది. సబ్సిడీ కోటా (12) ముగిసిన తర్వాత తీసుకునే సిలిండర్లకు వర్తించే ఈ తగ్గింపు పన్నుతో కలిపి రూ. 119.50 తగ్గింది. దీంతో హైదరాబాద్లో రూ.952గా ఉన్న సిలిండర్ ధర రూ.832.50కి చేరింది. అలాగే వాణిజ్య సిలిండర్ ధర రూ.190 తగ్గి, రూ.1652 నుంచి రూ.1462కు దిగివచ్చింది. వీటితోపాటు విమాన ఇంధనం కూడా కిలో లీటరుకు రూ.2.594.93 (4.1శాతం) మేర తగ్గిం ది.
తెలంగాణాలో మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం వచ్చే మార్చి 31 వరకు పొడిగింపు
హైదరాబాద్, డిసెంబర్ 1 : ప్రస్తుతం అమలులో ఉన్న ‘మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీము’ ను తెలంగాణ ప్రభుత్వం మరో నాలుగు నెలల పాటు పొడిగించింది. మెడికల్ రీయింబర్స్మెంట్ పథకం వచ్చే మార్చి 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ రీయింబర్స్మెంట్ స్కీమును కొనసాగిస్తూనే.. దానికి సమాంతరంగా ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సల పథకం కూడా కొనసాగుతుందంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంటే హెల్త్ కార్డులు అందిన ఉద్యోగులు, పెన్షనర్లు.. నగదు రహిత వైద్య చికిత్సల పథకాన్ని కూడా వినియోగించుకోవచ్చు. కాగా ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల నగదు రహిత వైద్య చికిత్సల పథకం(ఈహెచ్ఎస్) కింద హృద్రోగుల సంబంధిత స్టెంట్ల ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. సాధారణంగా గుండె రక్త నాళాల్లో బ్లాక్లు ఏర్పడినప్పుడు రోగులకు వేసే స్టెంట్ల ధరలు బయటి మార్కెట్లో వాటి రకాలను బట్టి వేర్వేరుగా ఉన్నాయి. అందుకే సాధారణ ప్రజలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ స్టెంట్ల ధరల్లో మార్పులు చేస్తుంటారు. ఈసారి ఆరోగ్యశ్రీ ధరలతో పాటే ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్) కింద కూడా ధరలను ఖరారు చేశారు. రెండు స్కీముల కింద ఒకే రకమైన ధరలను నిర్ధారించారు. అంటే హృద్రోగులకు అందించే చికిత్సతో పాటు స్టెంట్ల ధరలను కలిపి ప్యాకేజీలను నిర్ణయించారు. ఇక మీదట ఒక రోగికి ‘పెర్కుటేనియస్ ట్రాన్స్లుమినల్ కరొనరీ యాంజియోప్లాస్టీ(పీటీసీఏ)’ ప్రొసీజర్ను నిర్వహించి, ‘బేర్ మెటల్ స్టెంట్’ను వేసినట్లయితే... రూ.55 వేల ప్యాకేజీని వర్తింపజేస్తారు. అదే రోగికి అదనంగా మరో బేర్ మెటల్ స్టెంట్ను వేయాల్సి వస్తే... దానికి రూ.10 వేల అదనపు చార్జీని చెల్లిస్తారు. లేదా... ఒక రోగికి పీటీసీఏ నిర్వహించి ‘డ్రగ్ ఎలూటింగ్ స్టెంట్ను వేసినట్లయితే... రూ.65 వేల ప్యాకేజీని వర్తింపజేస్తారు.
పోస్టాఫీసులలో తిరుమల దర్శనం టిక్కెట్లు
తిరుపతి,డిసెంబర్ 1; ఇకనుంచి పోస్టాఫీసులలో కూడా తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం టిక్కెట్లు లభించనున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్త్రాలలో కొన్ని ఎంపిక చేసిన తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు లభిస్తాయి. శ్రీవారి దర్శనానికి 3 వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ల బుకింగ్ ను సోమవారం నుంచి ప్రారంభించారు . పైలెట్ ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోని ఐదు జిల్లాల్లోని తొమ్మిది తపాలా కార్యాలయాల్లో ఈ టిక్కెట్లు అందుబాటులో వుంటాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె పోస్టాఫీసు, అక్కడి బజారు వీధిలోని సబ్ పోస్ట్ ఆఫీసు, విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, కర్నూలు జిల్లాలోని నంద్యాల, ఆదోని, వరంగల్ జిల్లాలోని జనగాం పోస్టాఫీస్, నర్సంపేట సబ్ ఆఫీస్, కృష్ణాజిల్లాలో గుడివాడ, నందిగామ హెడ్ పోస్టాఫీసుల్లో ఈ స్పెషల్ దర్శనం టిక్కెట్లను పొందవచ్చు. ఈ టిక్కెట్లను ప్రతి రోజూ టికెట్లను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జారీ చేస్తారు.
Subscribe to:
Posts (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
కమిటీ చైర్మన్గా కిషోర్ చంద్రదేవ్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: టెలికాం శాఖలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమి...