న్యూఢిల్లీ,జూన్ 30; యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించిన కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావు మంగళవారం ఢిల్లీ లోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు. ఈ కుంభకోణంలో తన ప్రమేయం ఏమీ లేదని.. తాను కేవలం సహాయమంత్రిగానే ఉన్నానని దాసరి స్పష్టం చేశారు. అప్పటి నిర్ణయాలన్నీ ప్రధానమంత్రి మన్మోహన్సింగే తీసుకున్నారని దాసరి తన వాంగ్మూలంలో కోర్టుకు వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పాటించడమే తప్ప తానుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టం చేశారు. దాసరి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న న్యాయస్థానం ఈ కేసు విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా హాజరు కావాలని దాసరిని ఆదేశించింది.
Tuesday, June 30, 2015
ఆర్.కె. నగర్ లో జయభేరి...
చెన్నై, జూన్ 30: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత రికార్డు తిరగరాశారు. ఆర్కె నగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో జయకేతనం ఎగురవేశారు. లక్షా 50వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు .ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిర్దోషిగా తేలడంతో జయలలిత సీఎంగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఆరు నెలలోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉండడంతో ఆమె పోటీ చేసేందుకు వీలుగా స్థానిక అన్నాడీఎంకే శాసనసభ్యుడు రాజీనామా చేశారు. దాంతో ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే ఆమెపై డీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, బీజేపీ సహా ప్రధాన పార్టీల అభ్యర్థులను పోటీలో నిలబెట్టలేదు. దాంతో సీపీఎం అభ్యర్థి మహేంద్రన్ ఆమెకు ప్రధాన పోటీగా నిలిచారు. 28 మంది స్వంత్రులు బరిలో నిలిచారు. పోటీకి దిగినవారిలో దాదాపు అందరి డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.
రేవంత్ రెడ్డికి షరతులతో బెయిల్....
హైదరాబాద్, జున్ 30 : ఓటుకు నోటు కేసులో టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మంగళవారం షరతులతో కూడిన బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. 5 లక్షల రూపాయలు, రెండు షూరిటీలతో కూడిన బెయిల్ న్యాయస్థానం మంజూరు చేసింది. రేవంత్ రెడ్డి బెయిల్ ఫిటిషన్పై ఏసీబీ అధికారులు లిఖితపూర్వక వాదనలతో కోర్టులో కొత్త కౌంటర్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో ఏ-4 నిందితుడుగా పేర్కొన్న మత్తయ్య పరారీలో ఉన్నారని, నోటీసులు అందుకున్న సండ్ర వెంకట వీరయ్య ఇంతవరకు ఏసీబీ ఎదుట హాజరు కాలేదని ఏజీ వాదనలు వినిపించారు. రూ. 50 లక్షలు, రూ. 4.50 కోట్లపై ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందని, రేవంత్ను విడుదల చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఆధారంగా మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉందని ఏజీ పేర్కొన్నారు. ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి చివరికి రేవంత్రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో ఏ-2, ఏ-3 నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయసింహలకు కూడా షరతులతో కూడిన బెయిల్ను కోర్టు మంజూరు చేసింది.
Thursday, June 25, 2015
మూడు ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాన మంత్రి శ్రీకారం
న్యూఢిల్లీ, జూన్ 25 : మూడు ప్రతిష్టాత్మక పథకాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. గురువారం ఢిల్లీ విజ్ఞాన్భవన్లో జరిగిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 100 స్మార్ట్సిటీలను అభివృద్ధి చేసేందుకు 'స్మార్ట్ సిటీస్ మిషన్' పథకం, దేశంలోని 500 నగరాల్లో మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు అటల్ పట్టణ రూపాంతరీకరణ పునరుజ్జీవనం 'అమృత్' పథకం, 2020 నాటికి నగరాల్లో ఉండే అందరికీ ఇళ్లు లక్ష్యంతో ప్రధానమంత్రి 'ఆవాస్యోజన' పథకాన్ని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రూ.48 వేల కోట్లతో 100 స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ. 100 కోట్ల చొప్పున ఐదేళ్ల వరకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. మరోవైపు తెలుగు రాష్ర్టాల్లో 5 స్మార్ట్సిటీలు, 46 అమృత్ పట్టణాలను కేంద్రం ఆధునీకరించనుంది. ఏపీలో 3, తెలంగాణలో 2 స్మార్ట్సిటీలు ఎంపికవగా, ఏపీలో 31, తెలంగాణలో 15 అమృత్ పట్టణాలను ఎంపిక చేశారు. ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, పట్టణ జీవన విధానంలో మార్పు తేవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇలాంటి మార్పుతేవడమే తమ ప్రభుత్వ ప్రయత్నమని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాల్సి ఉందని తెలిపారు. ఈ పథకాల అమలు కోసం ఐదేళ్లలో రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలు, స్థానిక సంస్థలు సమష్టిగా ఈ పథకాలను అమలు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలను కేంద్రం స్మార్ట్ సిటీస్ జాబితాలో చేర్చింది. అమృత్ నగరాల జాబితాలో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, రామగుండం, మహబూబ్నగర్, మంచిర్యాల, నల్లగొండ, ఆదిలాబాద్, కొత్తగూడెం, సిద్దిపేట, సూర్యాపేట, మిర్యాలగూడ, జగిత్యాల పట్టణాలు ఉన్నాయి.
Tuesday, June 23, 2015
సిస్టర్ నిర్మల కన్నుమూత...
కోలకతా ,జూన్ 23;: కోల్కతాలోని మిషన్ ఆఫ్ చారిటీస్ అధ్యక్షురాలిగా పనిచేసిన సిస్టర్ నిర్మల(81) ఈరోజు ఉదయం కన్నుమూశారు. మదర్ థెరిస్సా తర్వాత 1997 నుంచి 2009 వరకు మిషనరీ ఆఫ్ ఛారిటీస్ బాధ్యతలు నిర్వహించారు. సిస్టర్ నిర్మల సేవలను గుర్తించిన కేంద్ర ప్రభత్వం 2009లో పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
గవర్నర్ చేతికి సెక్షన్ 8.......?
న్యూఢిల్లీ, జూన్ 23;ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై గవర్నర్కు ఉన్న ‘అధికారాలు - బాధ్యతల’పై భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్-8 ప్రకారం గవర్నర్కు ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలపై ప్రత్యేక అధికారాలు, బాధ్యతలు ఉంటాయని అటార్నీ జనరల్ స్పష్టం చేశారని చెబుతున్నారు. అటార్నీ జనరల్ సూచన మేరకు కేంద్రం నోటిఫికేషన్ను ఓకే చేస్తే... హైదరాబాద్లో సెక్షన్ 8 అమలులోకి వస్తుంది.. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి, నగరంలో రెండు రాష్ట్రాల పోలీసు బలగాలకు అధికార పరిధి ఉంటుందని , గవర్నర్ రెండు రాష్ట్రాల పోలీసులను పిలిపించుకుని వోట్ కు నోటు సహా ఏ కేసు నివేదికలు అయినా పర్యవేక్షించవచ్చు’నని ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వానికి సూచించినట్తు తెలిసింది..
తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి మంచి స్పందన ....10 రోజుల్లోనే 17 పరిశ్రమలకు అనుమతులు
హైదరాబాద్,జూన్ 23; : తెలంగాణ నూతన పారిశ్రామిక విధానానికి మంచి స్పందన వస్తోంది. పరిశ్రమలు పెడతామంటూ ముందుకొచ్చిన పెట్టుబడిదారుల దరఖాస్తులను పరిశీలించిన అధికారులు.. తొలివిడతగా 17 పరిశ్రమలకు సంబంధించి అనుమతుల ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు. ఈ పరిశ్రమల నుంచి సుమారు రూ.1500 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వీటి ద్వారా 4వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రెండు వారాల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తామని ప్రభుత్వం చెప్పినట్లుగానే.. కేవలం 10 రోజుల్లోనే అధికారులు అనుమతులిచ్చే ప్రక్రియను పూర్తి చేశారు. అనుమతి పత్రాలు అందుకుంటున్న వాటిలో ఐటీసీతో పాటు ప్రముఖ సంస్థలున్నాయి.
Subscribe to:
Posts (Atom)
బాచుపల్లి నాలా లో బాలుని మృతి
హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన బాలుడు మిథున్ (4) మృతి చెందాడు. ప్రగతినగర్...
-
హైదరాబాద్,నవంబర్ 14: రాష్ట్ర మాజీ దేవాదాయ శాఖ మంత్రి దండు శివరామరాజు కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ఆయన పశ్చిమగోదావరి ...
-
విజయవాడ,ఫిబ్రవరి 21 : ప్రముఖ తెలుగు సినీనటుడు మిక్కిలినేని రాధాకృష్ణ (96) కన్నుమూత శారు. 300 పైగా చిత్రాల్లో నటించిన ఆయన 1949వ సంవత్సరంలో ‘ద...
-
కమిటీ చైర్మన్గా కిషోర్ చంద్రదేవ్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24: టెలికాం శాఖలో జరిగిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్పై విచారణకు సంయుక్త పార్లమెంటరీ కమి...