కర్నాటక, మే 11 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కు అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టులో ఊరట లభించింది. కర్నాటక హైకోర్టు జయపై ఉన్న అన్నీ కేసులను రద్దు చేస్తున్నట్లు సోమవారం కర్నాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో జయలలిత మళ్లీ తమిళనాడు సీఎం అయ్యే అవకాశాలు జయలలితకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయంటూ ట్రయల్ కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరీమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై జయ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కూడా మూవ్ చేశారు. తన కేసుపై విచారణ వేగవంతం చేయాలని, తన రాజకీయ భవిషత్తు కూడా దీనిపై ఆధారపడి ఉందని ఆమె సుప్రీంకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం హైకోర్టు జయ కేసును విచారణ జరిపి, వాదనలు విన్న అనంతరం ఆమెపై ఉన్న అన్ని కేసులను రద్దు చేస్తూ హైకోర్ట్ తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో జయతో పాటు ఉన్న మరో ముగ్గురిని కూడా కోర్టు నిర్దోషులుగా విడిచిపెట్టింది. శశికళ, సుధాకరన్, ఇళవరసిలకు కూడా ఈ కేసులో పెద్ద ఊరట లభించినట్లయింది. దీంతో తమిళనాడులో పండుగ వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.పార్లమెంటు హాల్లో కూడా అన్నా డీఎంకే ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు.అక్రమాస్తుల కేసు నుంచి నిర్దోషిగా బయటపడటంతో జయకు రాజకీయంగా కూడా పెద్ద ఊరట లభించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీన జైల్లోకి వెళ్లడంతో పాటే.. తన శాసన సభ్యత్వాన్ని కూడా కోల్పోయి, ముఖ్యమంత్రి పదవికి దూరమైన జయలలిత.. ఇప్పుడు మరోసారి అధికార పీఠాన్ని అధిష్ఠించేందుకు రంగం సిద్ధమైపోయింది. ఆమె అనుంగు అనుచరుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జయలలిత కోసం ఏ క్షణంలోనైనా తన పదవిని వదులుకోడానికి సిద్ధంగా ఉన్నారు.