యు.పి.వేరు...ఎ.పి.వేరు...అజాద్
న్యూఢిల్లీ, మార్చి 7 : ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ గులాం నబీ అజాద్ అన్నారు. యూపీలో సంస్థాగత లోపాల వల్లే ఓడిపోయామని, అక్కడ పార్టీ వ్యవస్థ పటిష్టంగా లేదని ఆజాద్ వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఆరు నియోజక వర్గాల్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్ధులనే గెలిపించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీయే ఉందని, అంచేత ఆ పార్టీ అభ్యర్ధులకే ఓటు వేయాలని ఆజాద్ కోరారు. రాజ్యసభ సీట్ల విషయంలో ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అజాద్ అన్నారు. రాజ్యసభ సభ్యుడు కే. కేశవరావుకు మరోసారి అవకాశం ఇస్తామని తాము చెప్పలేదని అన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందనే వార్తల్లో నిజంలేదని అజాద్ పేర్కొన్నారు.

Comments