అఖిలేష్ కే యు.పి.పగ్గాలు...
లక్నో,మార్చి 10: ముఖ్యమంత్రి పీఠాన్ని ములాయం సింగ్ కుమారుడు,సమాజ్ వాదీ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అధిష్టించనున్నారు. పార్టీ పార్లమెంటరీ బోర్డ్ ఆయన అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపింది. 38 యేళ్ళ అఖిలేష్ యాదవ్ గురువారం సి.ఎం.గా ప్రమాణ స్వీకారం చేస్తారు. సీఎం పగ్గాలు అఖిలేష్కు కట్టబెట్టే విషయంలో ములాయం తన పార్టీ సీనియర్లు ఆజంఖాన్, శివ్పాల్ యాదవ్లను ఒప్పించినట్లు వివరించింది. ఇందుకు ప్రతిగా ఆజంఖాన్కు అసెంబ్లీ స్పీకర్ పదవి, శివ్పాల్కు కీలక మంత్రిత్వశాఖ దక్కవచ్చని పేర్కొంది. ములాయం ఆరోగ్యం క్షీణిస్తుండటం కూడా అఖిలేష్ను సీఎం చేయాలనేందుకు ఉన్న కారణాల్లో ఒకటిగా భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన సంచలన విజయానికి కారణమైన అఖిలేష్నే సీఎం చేయాలని కొందరు ఎమ్మెల్యేలు పట్టుబడుతూ వచ్చారు. పార్టీ ప్రచారంలో భాగంగా 12 వేల కి.మీ. రథయాత్ర చేపట్టడం, 250 బహిరంగ సభల్లో పాల్గొన డం వంటి చర్యల ద్వారా అఖిలేష్ యువతకు దగ్గరయ్యారని ఆయన మద్దతు దారులు అంటున్నారు.

Comments