తెలంగాణా పై ఎలా తేల్చాలి...అజాద్

న్యూఢిల్లీ,మార్చి 30: తెలంగాణ సమస్యను వెంటనే తేల్చలేమని,   హైదరాబాదే విభజనకు అసలు అడ్డంకి అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ కుండ బద్దలు కొట్టేశారు.  హైదరాబాద్ నగరం పైనే ఇరు ప్రాంతాల ప్రజలు, నేతలు పట్టుబడుతున్నారని ఆయన తమను కలసిన తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులతో అన్నారు.  హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన వారిని ప్రశ్నించారు.  లేదంటే కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎలా ఉంటుందని ఆయన సూచించారు. అయితే ఎంపీలు ఈ రేండూ  ప్రతిపాదనలను  వ్యతిరేకించినట్టు తెలిసింది.  హైదరాబాద్ పైనే అందరూ పట్టుబడుతున్నారని,  కాగా ఆజాద్‌తో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఒప్పుకునేది లేదని చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు పని చేయాలని సూచించామన్నారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలు కూడా ఆజాద్‌తో విడిగా భేటీ అయ్యారు.ఈ భేటీలో 18 నియోజకవర్గాల ఉపఎన్నికలకు సంబంధించిన విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.15 రోజుల్లోగా 18 నియోజకవర్గాలకు కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ లగడపాటి చేస్తున్న సర్వేలతో పార్టీకి నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి, నెల్లూరు ఎంపీ పనబాకలక్ష్మి ఫిర్యాదు చేశారు. అలాగే ఉపఎన్నికలు జరగబోయే 18 స్థానాలకు అభ్యర్థులను వెంటనే ప్రకటించాలని సీమాంధ్ర ఎంపీలు ఆజాద్‌ను కోరారు. 
తెలంగాణ కు ఆర్జేడీ మద్దతు
చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటుకు ఆర్జేడీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆలస్యం చేయకుండా కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు