ప్రజల మూడ్ మూడో ఫ్రంట్ వైపే...బాబు

 హైదరాబాద్,మార్చి 7: రాబోయే రోజులు మూడో ఫ్రంట్‌వేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలతో ప్రజల మూడ్ అర్ధం అవుతోందని, రాష్ట్రాల్లో బలమైన నాయకత్వం ఇస్తున్న ప్రాంతీయ పార్టీల వైపే ప్రజలు చూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల కూటమి జాతీయ స్ధాయిలో బలపడటానికి తమ వంతు పాత్రను పోషిస్తామని ఆయన చెప్పారు. ''సెమీ ఫైనల్స్‌లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు దెబ్బ తిన్నాయి. ఫైనల్స్‌లో గెలవబోయేది మూడో ఫ్రంటే. అది ఎలా రూపు దిద్దుకోబోయేదీ కొద్ది కాలంలోనే వెల్లడవుతుంది. దేశం మొత్తం ప్రాంతీయ పార్టీలదే హవా. వాటిలోనూ మంచి పాలన ఇవ్వగలరన్న నమ్మకం ఉన్నవారివైపు ప్రజలు చూస్తున్నారు. ప్రజలు సమర్ధ నాయకత్వం కోరుకొంటున్నారు. సోనియా గాంధీ కుటుంబం ఉత్తర ప్రదేశ్‌లో సకల ప్రయత్నాలు చేసినా గెలవలేకపోయింది. బిజెపి కూడా పుంజుకోలేదు. జాతీయ పార్టీల అవసరం లేకుండా ప్రజలు ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఇస్తున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, యుపి, పంజాబ్ వంటి అన్ని రాష్ట్రాల్లో ఇదే తరహా తీర్పు వచ్చింది. ప్రాంతీయ నాయకులు బలోపేతం అవుతున్నారు. మున్ముందు ప్రాంతీయ పార్టీల నాయకత్వంలో సహకార ఫెడరలిజం దేశంలో వర్ధిల్లుతుంది'' అని చంద్రబాబు పేర్కొన్నారు. టిడిపి వామపక్షాలకు దూరం కాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
విభజన కోరుకొన్న బిఎస్‌పి ఉత్తర ప్రదేశ్‌లో ఓడిపోవడానికి...ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధం లేదని, అక్కడి పరిస్ధితులు వేరని ఆయన అన్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు