ముంబై తీరంలో మునిగిన భారీ సరుకు రవాణా నౌక

ముంబై,అగస్ట్ 5:  ముంబై తీరానికి సమీపంలో గురువారం మధ్యాహ్నం ఒక భారీ సరుకు రవాణా నౌక మునిగిపోయింది.  పనామాకు చెందిన ఈ నౌకలోని 30 మంది సిబ్బంది తీరరక్షకదళం సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ఇండోనేషియాలోని టుటుంగ్ రేవునుంచి గుజరాత్‌లోని ధహెజ్ రేవుకు 60 వేల టన్నుల బొగ్గులోడుతో వెళుతున్న ఎంవీ రాక్ అనే ఈ నౌక ముంబై తీరానికి సుమారు 20 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైందని తీరరక్షకదళం ఐజీ బస్రా  తెలిపారు.  నౌక అడుగు భాగంలోకి నీరు ప్రవేశించడంతో అది మునిగిపోయిందని ఆయన వివరించారు. నౌక అడుగుభాగంలో కొన్ని రంధ్రాలు పడి ఉంటాయని అనుమానిస్తున్నట్టు చెప్పారు. ఇదిలా ఉండగా 225 మీటర్ల పొడవైన ఈ నౌకలో భారీ మొత్తంలో బొగ్గు, ముడి చమురు ఉండడంతో సముద్ర జలాలు తీవ్రంగా కలుషితం అయ్యే అవకాశముందని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నౌకలో 290 టన్నుల చమురు, 50 టన్నుల డీజిల్ కూడా ఉందని బస్రా వెల్లడించారు. నౌక మునిగిపోయిన ప్రాంతం రేవు ప్రవేశద్వారం వద్ద ఉండడంతో ఇతర నౌకల రాకపోకలకు ఇబ్బందిలేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలిపారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు