Wednesday, August 10, 2011

జగన్ కు కష్ట కాలం...

హైదరాబాద్, ఆగస్టు 10 : జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని హై కోర్టు ఆదేశించింది. జగన్‌పై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని కూడా హైకోర్టు ఆదేశించింది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూసిన  హైకోర్టు  తీర్పు బుధవారం వెలువడింది. జగన్‌పై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో వస్తున్న ఆరోపణలుగా భావించలేమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుక్రు స్పష్టం చేశారు. ఎమార్ అనేక అక్రమాలకు పాల్పడిందన్న విషయాన్ని కూడా కోర్టు స్పష్టంగా పేర్కొన్నది. కార్పొరేట్ ముసుగులో కొన్ని అదృశ్య శక్తులు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని, అవి ప్రయోజనాలు పొందాయనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతూ లెక్కలు చూపని వ్యవహారాలు ఇందులో చాలా ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. పన్నుల కట్టనక్కరలేని దేశాలనుంచి అక్రమ మార్గాలలో పెట్టుబడులు వచ్చాయని కోర్టు పేర్కొన్నది. ఇందులో కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నదని కూడా కోర్టు పేర్కొంది. జగన్ ఎలా అక్రమాలకు పాల్పడిందీ పూర్తి దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. జగన్ కంపెనీలలో గల పెట్టుబడుల దేశ, విదేశీ మూలాల గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉందని కోర్టు భావించింది. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కంపెనీలలో పెట్టుబడులు ఎలా వచ్చాయో తేలాలని కోర్టు పేర్కొన్నది. ఎర్రన్నాయుడు, శంకర్రావు పిటిషన్‌లనే కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
ఎమార్ ప్రాపర్టీస్‌పై కూడా కోర్టు ఆదేశాలు
ఎమార్ ప్రాపర్టీస్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రకటించింది. ఎమార్ అక్రమాలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని సి.బి.ఐ.కి ఆదేశాలు జారీ చేసింది. ఎమార్ కంపెనీ పై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమార్ వ్యవహారాల దరిమిలా  భూముల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని  కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఎమార్ వ్యవహారంలో దాదాపు 4500 కోట్ల రూపాయల ప్రజా ధనం కొల్లగొట్టారని  హైకోర్టు భావించింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఈ వ్యవహారాలలో అధికారులపైన కూడా దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...