విజయవాడ , అక్టోబర్ 18: ఆంధ్రప్రదేశ్లో అన్ని రాజకీయ పార్టీలతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటం చేస్తామని టి డి పి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడలోని నోవాటెల్ హోటల్లో పవన్ కల్యాణ్ను చంద్రబాబు నాయుడు కలిసిన అనంతరం ఇద్దరూ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. విశాఖలో జరిగిన తీరు చూస్తే
బాధేస్తోందని ,పవన్ను కలిసి సంఘీభావం తెలిపేందుకే ఆయనను కలిశానని చెప్పారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వైకాపా లాంటి పార్టీని ఎప్పుడూ చూడలేదని, ప్రజాస్వామ్యరక్షణ కు కలిసి రావాలని పవన్ కల్యాణ్ను
కోరామని తెలిపారు. ఎవరెలా పోటీ చేస్తారో పరిస్థితిని బట్టి ఉంటుంది.. ‘‘ముందుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ముఖ్యం.. ఆ తర్వాత ఎవరెలా పోటీ చేస్తారో అప్పటి పరిస్థితి బట్టి ఉంటుంది‘‘ అన్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సంఘీభావం తెలిపేందుకు వచ్చిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘రాజకీయ పార్టీలు నడిపే వ్యక్తులను నలిపేస్తామంటే ఎలా? ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ప్రజా స్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరముంది. ఎన్నికల గురించి మాట్లాడాల్సిన సమయం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన సమయమిది. ఎన్నికలకు ఎలా వెళ్లాలనే విషయం ఒక్కరోజులో తేలేది కాదు. వైకాపాతో పోరాటం చేసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాం. ముందుగా న్యాయ, రాజకీయ పోరాటం చేస్తాం. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే మా ఉద్దేశం’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
No comments:
Post a Comment