హైదరాబాద్, అక్టోబర్ 29: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష ప్రాథమిక కీ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కీ తో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటి డిజిటల్ కాపీలను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చింది. మొత్తం 2,85,916 మంది అభ్యర్థుల డిజిటల్ ఓఎంఆర్ పత్రాలను అందుబాటులో ఉంచారు. టీఎస్పీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు పొందుపర్చి డిజిటల్ పత్రాలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు నవంబర్ 29 వరకు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
ప్రాథమిక కీపై నవంబర్ నాలుగో తేదీ వరకు కమిషన్ వెబ్ సైట్ ద్వారా అభ్యంతరాలు స్వీకరిస్తారు.కేవలం వెబ్సైట్లోని ప్రత్యేక లింక్ ద్వారానే అభ్యంతరాలు నమోదు చేయాల్సి ఉంటుందని.. ఈ-మెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలు స్వీకరించేది లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను కూడా లింక్లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని టీఎస్పీఎస్సీ తెలిపింది.
No comments:
Post a Comment