హైదరాబాద్, నవంబర్ 21; శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డొమెస్టిక్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టడం తెలంగాణ ప్రజలను కించపరచడమేనని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్టీఆర్ పేరు పెట్టడం మీద తమకు అభ్యంతరం లేదని, పక్క రాష్ట్రం వ్యక్తి పేరు పెట్టడమే అభ్యంతరమని అన్నారు. తెలంగాణలో అనేకమంది వీరులు, యోధులు, రాజకీయ దురంధరులు వున్నారని, వారి పేరు పెట్టొచ్చుకదా అని ఆయన అన్నారు. ఏపీలో నాలుగు ఎయిర్పోర్టులున్నాయని, వాటికి ఎన్టీఆర్ పేరుపెట్టుకోవాలని సూచించారు. కేంద్రం ఎయిర్పోర్టు పేరు మార్చితే తమ రాష్ట్రాన్ని సంప్రదించాలని కేసీఆర్ అన్నారు.ఈ అంశం మీద శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే బీజేపీ, తెలుగుదేశం పార్టీలు ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. కాగా తీర్మానాన్ని ఎంఐఎం, వైసీపీ, సీపీఐ, సీపీఎం పార్టీల సభ్యులు స్వాగతించారు. దీంతో తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
అశోక గజపతి వివరణ
న్యూఢిల్లీ; విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టింది తాను కాదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టాలన్నది 1999 నాటి నిర్ణయమని, అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసి తీసుకున్న నిర్ణయమని ఆయన తెలిపారు. అప్పటి కేబినెట్ నిర్ణయాన్నే తమ ప్రభుత్వం అమలుచేస్తోందని ఆయన స్పష్టంచేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
No comments:
Post a Comment