విజయవాడ, అక్టోబర్ 30; ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు రైతుల నుంచి భూ సమీకరణకు సంబంధించిన ప్రభుత్వ విధానాన్ని మంత్రివర్గ ఉప సంఘం గురువారం నాడు ప్రకటించింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తుళ్ళూరు మండలాలలోని 17 గ్రామాల్లో భూ సమీకరణ జరపనున్నారు. రైతుల నుంచి భూమిని సమీకరించి ప్రజారాజధాని నిర్మిస్తామని మంత్రులు తెలిపారు. ప్రస్తుతం వున్న వీజీటీఎం స్థానంలో క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
రాజధాని నిర్మాణం కోసం గ్రామాలు, వాటిలోని ఇళ్ళ జోలికి వెళ్ళబోమని , భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఒప్పించడానికి కృషి చేస్తామని, ప్రభుత్వ భూమి వున్న పట్టాదారులకు ప్రత్యేక విధానం అమలు చేస్తామని, 30 వేల ఎకరాలను ఆరు సెక్టార్లుగా అభివృద్ధి పరుస్తామని , లాటరీ విధానం ద్వారా రైతులకు అనుకూలంగా వున్న ప్రాంతంలో భూమి సేకరించి రైతులకు పదేళ్ళపాటు ఎకరానికి 25 వేల రూపాయల అదనపు సాయం అందిస్తామని, ఈసాయం ఏటా ఎకరాకి 1250 పెరుగుతుందని మంత్రులు వివరించారు.
కాగా, తుళ్లూరు మండలం పరిధిలోకి వచ్చే 21 గ్రామాల్లోనే రాజధానిని నిర్మించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది ఇందుకు హరిశ్చంద్రపురం, బోరుపాలెం, లింగయ్యపాలెం, అబ్బరాజుపాలెం, రాయపాడు, దొండపాడు, పిచుకలపాలెం, ఉద్దండరాయుని పాలెం, మోదుగలంక పాలెం, తుళ్లూరు, వడ్డమాను, కొండరాజుపాలెం, మందడం, వెలగపూడి, మల్కాపురం, నేలపాడు, అనంతవరం, వెంకటపాలెం, నెక్కల్లు, శాఖమూరు, అయినవోలు, పెద్దపరిమి గ్రామాలను ఎంపిక చేసినట్టు చెబుతున్నారు దీనిపై ముసాయిదా మ్యాప్ను కూడా సిద్ధం చేసారు. ఈ గ్రామాల్లో 30 వేల ఎకరాల భూమిని సమీకరించాలని నిర్ణయించింది. వీటి పరిధిలోకి వచ్చే ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను స్థానిక రెవెన్యూ అధికారులకు పంపింది. భూ సమీకరణలో ప్రాథమిక విధులను స్థానిక రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించింది. అవసరమైనప్పుడు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం రంగంలోకి దిగుతుంది.
No comments:
Post a Comment