చెన్నై, సెప్టెంబర్ 29 : తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సోమవారం మధ్యాహ్నం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ రోశయ్య పన్నీర్తో ప్రమాణం చేయించారు. ప్రమాణస్వీకారం సమయంలో భావోద్వేగానికిలోనైన పన్నీర్ సెల్వం కంటతడి పెట్టారు. సీఎంతోపాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. పన్నీర్ సెల్వం తమిళనాడుకు 28వ సీఎం.
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జైలు పాలుకావడంతో ఆమె స్దానంలో ఆమె సన్నిహితుడు, ప్రస్తుత ఆర్ధిక మంత్రి పన్నీర్ సెల్వంను తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా నియమించారు. పన్నీర్ సెల్వం 1951లో తేనీ జిల్లా పెరయకుళంలో జన్మించారు. తండ్రి నడిపిన టీకొట్టును వారసత్వ సంపదగా స్వీకరించి టీ కొట్టుని నడిపారు. గతంలో ఆయన నడిపిన టీ కొట్టుని... ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యలు నడుపుతున్నారు. పన్నీర్ సెల్వం....స్వర్గీయ ఎంజీ రామచంద్రన్, జయలలితలకు వీరాభిమాని.
ఆ వీరాభిమానమే ఆయనను రెండు పర్యాయాలు తమిళనాడు సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. తనకు వీరాభిమానిగా ఉన్న పన్నీర్ సెల్వంను అన్నాడీఎంకే తేని జిల్లా కార్యదర్శిగా నియమించిన జయలలిత 1996లో పెరియకులం మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యేలా చేశారు. ఇక 2001లో పెరియకులం ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్న పన్నీర్ సెల్వం, జయలలిత మంత్రివర్గంలో కీలకమైన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో అరెస్టయినప్పుదు కూడా జయ ఆయననే తాత్కాలిక సి. ఎం. గా నియమించారు.
No comments:
Post a Comment