Saturday, July 13, 2013

నటదిగ్గజం ప్రాణ్ కన్నుమూత.. .

ముంబై,జులై 13: దాదాపు అర్ధ శతాబ్దికి పైగా బాలీవుడ్ చిత్రసీమను ఏలిన నటదిగ్గజం ప్రాణ్ (93)  ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి  తుదిశ్వాస విడిచారు. కరడుకట్టిన  ప్రతినాయక పాత్రలతో పాటు కరుణ రసాత్మకమైన పాత్రల్లోనూ ప్రాణ్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు చలన చిత్ర రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2012 సంవత్సరానికి లభించింది. దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన ప్రాణ్, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. కాశ్మీర్ కీ కలీ, ఖాందాన్, ఔరత్, బడీ బెహన్, జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై, హాఫ్ టికెట్, మధుమతి, పూరబ్ ఔర్ పశ్చిమ్, జంజీర్, బాబీ, డాన్, రామ్ ఔర్ శ్యామ్ వంటి చిత్రాల్లో శక్తిమంతమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను మెప్పించారు. పాత ఢిల్లీలో 1920 ఫిబ్రవరి 12న జన్మించిన ప్రాణ్ అసలు పేరు ప్రాణ్ కేవల్ సికంద్. కపుర్తలా, ఉన్నావో, మీరట్, డెహ్రాడూన్, రామ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగించారు. తొలుత ఫొటోగ్రాఫర్‌గా రాణించాలనుకున్న ప్రాణ్, అనుకోకుండా నటుడిగా మారారు. ‘యమ్లా జాట్’ అనే పంజాబీ చిత్రం ద్వారా 1940లో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత చౌదరి (1941), ఖాందాన్ (1942), కైసే కహూ (1945), బద్నామీ (1946) వంటి చిత్రాల్లో నటించారు. దేశ విభజన తర్వాత భార్య శుక్లా, కుమారులు అరవింద్, సునీల్‌లతో కలసి లాహోర్ నుంచి ముంబైకి మకాం మార్చారు. ముంబైకి వచ్చిన తొలినాళ్లలో వేషాలు దొరుకుతాయనే ఆశలు దాదాపు వదిలేసుకున్న దశలో ప్రముఖ రచయిత సాదత్ హసన్ మాంటో సాయంతో దేవానంద్ కథానాయకుడిగా నటించిన ‘జిద్దీ’ (1948) చిత్రంలో వేషం దక్కించుకున్నారు. అప్పటి నుంచి ప్రాణ్ కెరీర్ పుంజుకుంది. 1969-82 కాలంలో ప్రాణ్ బాలీవుడ్‌ను దాదాపు మకుటంలేని మహారాజులా ఏలారు. ఒకవైపు విలన్‌గా రాణిస్తున్న కాలంలోనే ‘ఉపకార్’లో మంగల్ చాచా, ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్‌కు సహచరునిగా షేర్‌ఖాన్, ‘పరిచయ్’లో తాతయ్య వంటి సున్నితమైన పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. తాండ్ర పాపారాయుడు, కొదమసింహం చిత్రాల ద్వారా ప్రాణ్ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. విలన్ వేషాలతో గుర్తింపు పొందిన ప్రాణ్, నిజ జీవితంలో మాత్రం చాలా ఉదారుడు, సున్నిత హృదయుడు. పాకిస్థాన్‌తో యుద్ధం ముగిశాక, బంగ్లా శరణార్థుల కోసం 1971లో చారిటీ షో నిర్వహించారు. పేదలు, వికలాంగులను ఆదుకునేందుకు కూడా పలుసార్లు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి, వాటి ద్వారా సమకూరిన నిధులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ‘అండ్ ప్రాణ్’ పేరిట ఆయన రాసిన ఆత్మకథకు అమితాబ్ బచ్చన్ ముందుమాట రాశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...