భారత ప్రధానిఫై వార్తాకథనం: సారీ చెప్పేందుకు వాషింగ్టన్ పోస్టు ' నో '..
వాషింగ్టన్,సెప్టెంబర్ 6: భారత ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వాన్ని తప్పు పడుతూ వాషింగ్టన్ పోస్టు ప్రచురించిన వార్తాకథనం తీవ్ర దుమారం రేపుతోంది. తాము ఆ వార్తాకథనానికి కట్టుబడి ఉన్నామని, క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని వాషింగ్టన్ పోస్టు కరస్పాండెంట్ అన్నారు. ప్రధాని కార్యాలయం కమ్యూనికేషన్స్ సలహాదారు పంకజ్ పచౌరి చేసిన ఫిర్యాదుకు వాషింగ్టన్ పోస్టు ఇండియా బ్యూరో చీఫ్, వార్తాకథనం రచయిత సిమోనే డెన్యూర్ జవాబు ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ జర్నలిస్టుకు ఉందని, దాని గురించి తాము అభ్యంతరం చెప్పడం లేదని, అనైతికమైన, వృత్తిపరమైన ప్రవర్తన లోపాన్ని ఎత్తు చూపుతూ మాత్రమే ఈ లేఖ రాస్తున్నామని పచౌరి డెన్యూర్కు రాసిన లేఖలో అన్నారు. కేబినెట్ సహచరులు అవినీతి సొమ్ముతో జేబులు నింపుకుంటున్నా మౌనం వహిస్తున్న కారణంగా మన్మోహన్ ప్రతిష్ట మసకబారిందంటూ వాషింగ్టన్ పోస్ట్ కథనం రాయడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. పీకల్లోతు అవి నీతిలో కూరుకుపోయిన ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న కారణంగా ప్రధాని మన్మోహన్ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోందని తెలిపింది. బొగ్గు కుంభకోణం గురించి కూడా పత్రిక ప్రస్తావించింది.
Comments