తెలంగాణా ఊహాగానాల వేడిపై నీళ్ళు చల్లిన వాయలార్...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తెలంగాణపై అఖిల పక్ష అభిప్రాయం తర్వాతే నిర్ణయం ఉంటుందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి వాయలార్ రవి అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చర్చలు జరపలేదని చైనా పర్యటన ముగించుకుని ఢిల్లీ వచ్చిన వయలార్ రవి మీడియాకు తెలిపారు. టిఆర్ఎస్ కాంగ్రెస్లోకి విలీనం అవుతున్నట్టు ప్రచారం ఎందుకు జరుగుతుందో తనకు తెలియదని, కెసిఆర్ ఇటీవల రెండు మూడు సార్లు తనను కలిశారని, ఈ సందర్భంగా ఆయన విలీన ప్రస్తావనేమీ తేలేదని రవి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతం వారు ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారని, సీమాంధ్రులు సమైక్యాంధ్ర ఉండాలంటున్నారని, ఇరు ప్రాంతాల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయని, చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అఖిలపక్షంలో పార్టీల వైఖరి తెలుసుకోవాలని, ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. తమ పార్టీలో కూడా కొందరు తెలంగాణ కోరుతుండగా, మరికొందరు వద్దంటున్నారని వాయలార్ రవి చెప్పారు.
Comments