నిర్లక్ష్యం సంకెళ్ళనుంచి మమకారం ఒడిలోకి...
న్యూఢిల్లీ,ఏప్రిల్ 25: నార్వేలోని శిశు సంరక్షణ కేంద్రంలో దాదాపు ఏడాదిగా ఆశ్రయం పొందుతున్న ఇద్దరు ఎన్ఆర్ఐ బాలలు అభిజ్ఞాన్ (3), ఐశ్వర్య (1) మంగళవారం భారత్ చేరుకున్నారు. ఎన్ఆర్ఐ దంపతులు అనురూప్, సాగరికా భట్టాచార్యలు పిల్లల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంగా నార్వే శిశు సంక్షేమ శాఖ వారిని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించగా, వారిని భారత్కు పంపాలంటూ భారత ప్రభుత్వం దౌత్యపరంగా నార్వేపై ఒత్తిడి తెచ్చింది. ఫలితంగా, నార్వే కోర్టు ఆ బాలల సంరక్షణను భారత్లో ఉంటున్న వారి బాబాయి అరుణభాస్ భట్టాచార్యకు అప్పగిస్తూ తీర్పునిచ్చింది. అభిజ్ఞాన్, ఐశ్వర్యలతో కలసి వారి బాబాయి అరుణభాస్ మంగళవారం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. బాలల తాత, నాయనమ్మ, విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రణీత్ కౌర్ తదితరులు విమానాశ్రయం వద్ద వారికి స్వాగతం పలికారు. కాగా, ఆ బాలలను భారత్కు పంపినందుకు విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ నార్వే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments