పశ్చిమాన అస్తమించిన మరో తూర్పు కిరణం...
న్యూయార్క్ ,ఏప్రిల్ 25:అమెరికాలో మరో తెలుగు యువకుడు మరణించాడు. విశాఖపట్నానికి చెందిన కరణం నిఖిల్ (28) మృతదేహం డల్లస్ శివార్లలోని ట్రోఫీక్లబ్ సిటీలో అతడి అపార్టుమెంట్లో ఈనెల 21న కనిపించినట్లు తానా వర్గాలు తెలిపాయి. అయితే, నిఖిల్ దాదాపు పది రోజుల క్రితమే మరణించి ఉంటాడని, ఇరుగుపొరుగు వారు అతడి అపార్టుమెంట్ నుంచి దుర్వాసన వస్తున్నట్లు తెలియజేసిన తర్వాత మాత్రమే మృతదేహాన్ని కనుగొన్నామని స్థానిక పోలీసులు తెలిపారు. నిఖిల్ తన అపార్టుమెంట్లో ఒక్కడే నివసిస్తున్నాడు. అతడి మృతదేహం భరించలేని స్థితిలో ఉందని పోలీసులు చెప్పారు. అతడిది హత్య లేదా ఆత్మహత్య అయ్యే అవకాశం లేదని.. బహుశా ఏదైనా మందు రియాక్షన్ వల్ల మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. విశాఖపట్నంలో ఓ స్కూలు ప్రిన్సిపల్గా పనిచేస్తున్న వెంకటేశ్వర్లు, సుధారాణి దంపతుల కుమారుడైన నిఖిల్.. 2006లో ఎన్ఐటీ అలహాబాద్లో ఎంఎస్ (ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్) చేశాడు. తర్వాత నోయిడాలో కొన్నాళ్లు పనిచేశాడు. 2008లో టెక్సాస్లోని ఏ అండ్ ఎం యూనివర్సిటీలో చేరి 2011లో ఎంఎస్ పూర్తిచేశాడు. తర్వాత డల్లస్ లో ఉద్యోగంలో చేరాడు. నిఖిల్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తోంది. శుక్రవారం సాయంత్రానికి నిఖిల్ మృతదేహం విశాఖపట్నానికి చేరుకునే అవకాశం ఉంది.

Comments