తెలంగాణ హుళక్కేనా...!
న్యూఢిల్లీ,డిసెంబర్ 26: తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ కొత్త సంవత్సరంలో కచ్చితమైన ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే తెలంగాణాకు అనుకూలంగా కాదని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఏకాభిప్రాయ సాధన కుదరలేదని, అందువల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు సాధ్యం కాదని తేల్చి చెప్పేందుకు కాంగ్రెసు అధిష్టానం సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. జనవరిలో జరిపే కోర్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆహ్వానించి తుది అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం వల్ల తలెత్తే పరిణామాలను ఎదుర్కోవడానికి ఏ విధమైన ఏర్పాట్లు చేశారనే విషయాన్ని కూడా వారి నుంచి రాబట్టి ప్రకటన చేస్తారని అంటున్నారు. తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయడం ద్వారా గత రెండేళ్లుగా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించాలని కాంగ్రెసు అధిష్టానం యోచిస్తున్నట్లు చెబుతున్నారు. యుపిఎ భాగస్వామ్య పక్షాల నాయకులు శరద్ పవార్, మమతా బెనర్జీ, కరుణానిధి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ కాంగ్రెసు నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
Comments