సంక్రాంతి తర్వాత మళ్ళీ తెలంగాణా సమరం: కేసీఆర్
హైదరాబాద్,డిసెంబర్ 26: సంక్రాంతి తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖరావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు విశ్రమించేదిలేదని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ లెక్చరర్ల సంఘం క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ , తెలంగాణ ఉద్యమం నిర్ణయాత్మక దశకు చేరుకుందన్నారు. అవసరమయితే మరోసారి దీక్షకు దిగుతానన్నారు. ప్రజా ఉద్యమంలో ప్రజలదే విజయమన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని అన్నారు. తాను మాట్లాడినా, మాట్లాడకపోయినా వార్తేనని కేసీఆర్ చమత్కరించారు. చంద్రబాబు వంచనలకు అంతేలేదని, వచ్చిన తెలంగాణను అడ్డుకున్నది ఆయనేనని అన్నారు. ఆంధ్రా హజారేనని చెప్పుకుంటున్న చంద్రబాబు సీబీఐ దర్యాప్తుపై ఎందుకు స్టే తెచ్చుకున్నారని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు. అవిశ్వాస సందర్భంగా వచ్చిన అవకాశాన్ని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జారవిరుచుకున్నారని అన్నారు. ప్రభుత్వంపై కనీస ఒత్తిడి కూడా తేలేకపోయారని దుయ్యబట్టారు. తెలంగాణ వచ్చే వరకు రాజీలేని పోరాటం చేస్తామని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Comments