నాడు రాజీవ్...నేడు రాహుల్...
న్యూఢిల్లీ,డిసెంబర్ 28: లోక్పాల్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలన్న రాహుల్ గాంధీ ప్రతిపాదన గతంలో రాజీవ్గాంధీ పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా ప్రతిపాదన మాదిరిగానే పార్లమెంటులో వీగిపోయింది. ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతునిస్తున్న ఎస్పీ, బీఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీలు ప్రతిపక్షంతో జతకలవడంతో తాజాగా లోక్పాల్ ‘రాజ్యాంగ (116వ) సవరణ బిల్లు’ లోక్సభ తిరస్కరణకు గురైంది. దీంతో దాదాపు 22 ఏళ్లక్రితం నాటి పరిస్థితి మళ్లీ చోటు చేసుకుంది. రాహుల్ తండ్రి, నాటి ప్రధాని రాజీవ్గాంధీ కూడా 1989లో పంచాయతీరాజ్ బిల్లుకు రాజ్యాంగ హోదా కల్పించాలని ప్రతిపాదించగా, దానిని పార్లమెంటు తిరస్కరించింది. ప్రభుత్వేతర పార్టీలన్నీ ఒక్కతాటిపై నిలిచి దానిని అడ్డుకున్నాయి. ఆ వెంటనే లోక్సభను రద్దుచేసిన రాజీవ్ ఎన్నికలకు వెళ్లగా కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. అయితే మళ్లీ 1991 లో అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్ప్డు కూడా లోక్పాల్కు రాజ్యాంగ హోదా కల్పించేందుకు తెచ్చిన సవరణ బిల్లు వీగిపోయిన నేపథ్యంలో నైతిక బాధ్యత వహించి యూపీఏ సర్కారు రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. అత్యంత కీలక బిల్లు విషయంలో ప్రభుత్వం సాధారణ మెజారిటీకి అవసరమైన 273 ఓట్లను కూడా పొందలేకపోయిందని, కేవలం 250 ఓట్లను మాత్రమే పొందగలిగిందని బీజేపీ విమర్శించింది.

Comments