తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మందిని బలిగొన్న ' థానే '
న్యూఢిల్లీ,డిసెంబర్ 31: తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లను వణికించిన 'థానే' తుఫాను 33 మందిని పొట్టన పెట్టుకుంది. మరో 21 మందిని గల్లంతు చేసింది. ఐదు వేలకుపైగా ఇళ్లను నేలమట్టం చేసింది. మూడు రాష్ట్రాల్లోని తీర ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. ఈ తుఫాను శుక్రవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య పుదుచ్చేరికి ఆగ్నేయ దిశలో తీరం దాటి ప్రస్తుతం బలహీనపడుతోంది. థానే కారణంగా చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, విల్లుపురం, కడలూరు, పుదుక్కోట్టై, నాగపట్నం, తంజావూరు, పుదుచ్చేరిలతోపాటు రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శుక్రవారం కుండపోత వర్షం కురిసింది. తమిళనాడు, పుదుచ్చేరిల్లో 33 మంది మృత్యువాత పడ్డారు. ఒక్క కడలూరులోనే 21 మంది మరణించారు. చేపల వేటకు వెళ్లిన 21 మంది జాలర్లు గల్లంతయ్యారు. రాష్ట్రానికి గండం తప్పిందని మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. తుఫాను తీరం దాటినా సహాయ చర్యలు, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొనసాగుతాయని చెప్పారు.
Comments