తెలంగాణ పై తెలుగుదేశం తటస్థమే:చంద్రబాబు

న్యూఢిల్లీ, నవంబర్ 21:  తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు  చంద్రబాబు నాయుడు మరోసారి చేతులు దులిపేసుకున్నారు. తెలంగాణ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టారు. తెలంగాణపై తాను తటస్థుడినని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు. రైతు సమస్యలపై జాతీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి ఢిల్లీ వచ్చిన ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై తమ పార్టీ తటస్థంగా ఉంటుందని, తాము చాలా కాలం క్రితమే పార్టీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల ప్రజల్లో భావోద్వేగాలున్నాయని, అందుకే తాను తటస్థ వైఖరి తీసుకున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన స్తంభించిందని ఆయన విమర్శించారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పంట విరామం ప్రకటించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. అవినీతి పెచ్చరిల్లిందని, అయినా చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు. రైతు సమస్యలను పట్టించుకోకపోతే శాసనసభ శీతాకాలం సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించాలో ప్రతిపక్ష పార్టీగా తమకు తెలుసునని ఆయన అన్నారు. ప్రభుత్వం రైతు సమస్యలపై దృష్టి పెడితే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే విషయంలో పునరాలోచన చేస్తామని ఆయన చెప్పారు. తన ఆస్తులపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు