Thursday, November 24, 2011

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత కిషన్‌జీ ఎన్ కౌంటర్

కోల్‌కతా,నవంబర్ 24:  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీ (56)  పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఖుష్పనీ అడవుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందినట్టు చొరబాటు నిరోధక దళానికి చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. జార్ఖండ్ సరిహద్దులోని జాంబనీ పోలీస్‌స్టేషన్ పరిధిలో బురిసోల్ వద్ద కిషన్‌జీ మృతదేహాన్ని గుర్తించినట్టు తెలిపారు. ఏకే-47 తుపాకీతో పడివున్న కిషన్‌జీ మృతదేహాన్ని కనుగొన్నట్టు వెల్లడించారు. కిషన్‌జీతో పాటు ఉన్న సుచిత్ర, ఇతరులు తప్పించుకున్నట్టు చెప్పారు. సంఘటనా స్థలం నుంచి ల్యాప్‌టాప్ బ్యాగ్, కిషన్‌జీ, సుచిత్రలకు చెందిన కొన్ని లేఖలు, ఇతర కీలక పత్రాలు స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక జరిగిన తొలి ఎన్‌కౌంటర్ ఇది. కిషన్‌జీ కోసం మావోయిస్టు ప్రభావిత జంగల్ మహల్ అడవులలో  సంయుక్త దళాలు గత నాలుగు రోజులుగా విస్తృతంగా గాలించాయి.
మూడు దశాబ్దాలుగా రహస్య జీవితం
నక్సలైట్ ఉద్యమ చరిత్రలో మూడు దశాబ్దాలుగా రహస్య జీవితం గడుపుతున్న కిషన్‌జీ మావోయిస్టు పార్టీ అధినేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తరువాత స్థానం లో ఉన్నారు.  కిషన్‌జీ కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో ఓ మాస్టారు  కుమారుడు. కేజీ సత్యమూర్తి, ముక్కు సుబ్బారెడ్డి, ఐవీ సాంబశివరావు లాంటి అగ్రనేతలను కాదని 1980లో కిషన్‌జీకి రాష్ట్ర పార్టీ బాధ్యతలను కొండపల్లి సీతారామయ్య కట్టబెట్టారు. రాష్ర్టంలో పీపుల్స్‌వార్ పార్టీకి ప్రహ్లాద్‌గా నేతృత్వం వహించిన అనంతరం 1987లో దండకారణ్యానికి మకాం మార్చారు. ఆ తరువాత తూర్పు భారతానికి, ఈశాన్య రాష్ట్రాలకు ఉద్యమాన్ని విస్తరించే బాధ్యతలు స్వీకరించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...