Thursday, November 24, 2011

టి.కాంగ్రెస్ ఎంపీలపై హైకమాండ్ సీరియస్ !

న్యూఢిల్లీ, నవంబర్ 25: ‘ప్రత్యేక తెలంగాణ నినాదాలతో లోక్‌సభను స్తంభింపజేస్తే మార్షల్స్‌తో బైటికి గెంటిస్తా’నని టి.కాంగ్రెస్ ఎంపీలను  లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ తీవ్రంగా హెచ్చరించారు. పార్లమెంట్ ఆవరణలోని ఆర్థిక మంత్రి ఆఫీసులో గురువారం మధ్యాహ్నం ప్రణబ్ ముఖర్జీ, టి.కాంగ్రెస్ ఎంపీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.  లోక్‌సభను తెలంగాణ నినాదాలతో స్తంభింపజేస్తే సహించేది లేదని ప్రణబ్ ముఖర్జీ అగ్గిమీద గుగ్గిలమైతే, సభా కార్యక్రమాలు అడ్డుకుంటూనే ఉంటాం. ఆపగలిగితే ఆపుకోండని తెలంగాణ ఎంపీలు తెగేసి చెప్పినట్టు సమాచారం. .‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తామని ప్రకటించి మాట తప్పిన మీరు మమ్మల్ని బెదిరిస్తారా? మీరేం చేసుకుంటారో చేసుకోండి. మేం చేసేది చేస్తాం’ అని టి.కాంగ్రెస్ ఎంపీలు ధిక్కార స్వరాన్ని వినిపించారుట. .  తెలంగాణ ఎంపీల చర్య కారణంగా గురువారం మూడోరోజూ లోక్‌సభ పూర్తిగా స్తంభించడం, విపక్ష నేతల ఫిర్యాదు నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ముఖర్జీ  టి.కాంగ్రెస్ ఎంపీలను తన కార్యాలయానికి పిలిపించుకున్నారు. తెలంగాణ ఎంపీలు గదిలోకి ప్రవేశించగానే ప్రణబ్ ముఖర్జీ ఆగ్రహంతో ఊగిపోతూ ‘ఏమనుకుంటున్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా? మీకు బాధ్యత లేదా? ఇష్టానుసారం వ్యవహరిస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలితే మార్షల్స్‌తో సభనుంచి గెంటిస్తా’ అంటూ నిప్పులు కురిపించినట్టు చెబుతున్నారు.  ‘ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నారు? సభలో గొడవ చేయడానికే ఎన్నికయ్యారా? మీ చర్యతో విపక్ష నేతల విమర్శలకు గురి కావాల్సి వస్తోంది. మీవల్ల పార్టీకి చెడ్డపేరు వస్తోంది. మీ వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు’ అంటూ ప్రణబ్ ముఖర్జీ హెచ్చరించారు.  ముఖర్జీ విమర్శలకు పొన్నం ప్రభాకర్ తదితర ఎంపీలు బదులిస్తూ ‘తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్ తొమ్మిదిన ప్రకటించి, తరువాత సీమాంధ్రుల ఒత్తిడితో మనసు మార్చుకోవటం మీకు తగునా? మీ చర్యల వల్లే ఈరోజు పరిస్థితి ఇంతవరకూ వచ్చింది’ అంటూ అంతే ఆవేశంతో సమాధానమిచ్చినట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చేసిన ప్రకటనకు సంబంధించి గంటముందు కూడా మాకు చెప్పలేదు. ప్రజలకు మీరు ఆశ పెట్టి తరువాత తెలంగాణ ఇవ్వకుండా దాటవేస్తే మేమేం చేయాలి? తెలంగాణలో కాంగ్రెస్‌ను బతికించుకోవాలా? వద్దా? ప్రత్యేక రాష్ట్రం కోసం పని చేయకపోతే తెలంగాణలో కాంగ్రెస్‌వాదులకు పుట్టగతులుండవు. పార్టీ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది’ అని తెలంగాణ ఎంపీలు పెద్దస్వరంతో ప్రణబ్ ఎదుట వాదించారని తెలిసింది.
సోనియా ఆగ్రహం
కాగా, ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌తో టి. కాంగ్రెస్ ఎంపీలు గురువారం లోక్‌సభను స్థంభింపచేయడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.  లోక్‌సభ నాయకుడు, ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌ను పిలిపించుకుని పరిస్థితిని సమీక్షించినట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంగించి వ్యవహరించే వారికి శిక్ష తప్పదని ఆమె అన్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా తెలంగాణ ఎంపీలతో తాను చర్చించిన విషయం ప్రణబ్ అధినేత్రికి వివరించినట్టు తెలిసింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...