రోడ్డెక్కిన ఆర్.టి.సి.బస్సులు
హైదరాబాద్,అక్టోబర్ 16: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె వాయిదా పడింది. ప్రభుత్వానికి, కార్మిక సంఘాలకు మధ్య ఒప్పందం కుదరడంతో బస్సులు యథాతథంగా తిరగుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ డిమాండ్తో గడచిన 27 రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మెలో పాల్గొంటున్నారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమ్మె విరమిస్తున్నామని ఎన్ఎంయూ కొద్దిరోజుల ముందే ప్రకటించినా కార్మికులు ఎక్కువమంది విధులకు హాజరు కాలేదు. దీంతో రవాణా మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ ఎన్ఎంయూ ఫోరం, ఆర్టీసీ తెలంగాణ జేఏసీ నేతలతో చర్చలు జరిపారు. తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని, కార్మికుల మిగతా డిమాండ్లన్నిటినీ పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. సీమాంధ్ర, తెలంగాణ డిపోల్లో బస్సుల సంఖ్యలో ఉన్న వ్యత్యాసాన్ని సరిదిద్దాలని, బస్భవన్లోఇతర ప్రాంతాల ఉద్యోగుల నిష్పత్తిలో కూడా సమతుల్యత పాటించాలని కార్మిక సంఘాలు చేసిన డిమాం డ్కు రవాణా మంత్రి సానుకూలంగా స్పందించారు. మోటారు వాహన పన్ను మినహాయింపు తదితర డిమాండ్లను పరిశీలించేందుకు అంగీకరించిన మంత్రి సమ్మె విరమణతోనే ఇవన్నీ సాధ్యపడతాయని తేల్చిచెప్పారు. సమ్మెతో తెలంగాణ ప్రాంత ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, సంస్థ కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినందున సమ్మెను విరమించాలని బొత్స కోరారు. చర్చలు సానుకూలంగా జరిగాయని వెల్లడించిన ఆర్టీసీ తెలంగాణ జేఏసీ నేతలు ఆ తరువాతటీఆర్ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాంతో చర్చించి సమ్మె వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. కోదండరాం ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడుతూ సమ్మెనుంచి ఆర్టీసీని మినహాయిస్తున్నట్లు తెలిపారు.
Comments