పార్టీ మారి సీటు నిలబెట్టుకున్న పోచారం...
హైదరాబాద్,అక్టోబర్ 18: బాన్సువాడ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి సంగెం శ్రీనివాసగౌడ్పై 49,889 ఓట్ల ఆధిక్యం సాధించారు. తెలంగాణ ఎజెండాగా సాగిన ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కు భారీ మెజారిటీ లభిస్తుందని, ఎన్నిక ఏకపక్షంగా జరుగుతుందని భావించినా.. శ్రీనివాసగౌడ్ అంచనాలకు మించి ఓట్లు పొందగలిగారు. ఈ నెల 13న పోలింగ్ జరగ్గా సోమవారం కౌంటింగ్ జరిగింది. నియోజకవర్గంలో లక్షా 59 వేల పైచిలుకు ఓట్లుండగా, లక్షా 22 వేల 871 ఓట్లు పోలయ్యాయి. ఇందులో పోచారం శ్రీనివాసరెడ్డికి 83,245 ఓట్లు రాగా, శ్రీనివాసగౌడ్ 33,356 ఓట్లు పొందారు. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు 6,270 ఓట్లు పొందారు. 2009 ఎన్నికల్లో తెలగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరికి నిరసనగా పార్టీ వీడారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరడంతో ఉప ఎన్నిక జరిగింది.
Comments