డీఎస్ కు అందలం...!
హైదరాబాద్, అక్టోబర్ 25: శాసనమండలి స్థానానికి కాంగ్రస్ అభ్యర్థిగా పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ ఎంపిక రాష్ట్ర పార్టీలో రాజకీయంగా ఉత్కంఠ రేపింది. తెలంగాణకు చెందిన డీఎస్కు మున్ముందు ప్రభుత్వంలో కీలక పదవి అప్పగించే ఉద్దేశంతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని చర్చ జరుగుతోంది. లోతైన కసరత్తు అనంతరం అధ్యక్షురాలు సోనియానే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మూడురోజులు ఢిల్లీలో మకాం వేసిన కిరణ్, పీసీసీ అధ్యక్షుడు బొత్సలకు కనీస సమాచారమైనా ఇవ్వకుండానే డీఎస్ పేరును అధిష్టానం ఖరారు చేసింది. వారిద్దరూ హైదరాబాద్ తిరిగొచ్చాక, అదీ అర్ధరాత్రి సమయంలో డీఎస్ ఎంపికపై అధిష్టానం నుంచి సమాచారం రావడం వారిద్దరికీ మింగుడు పడని విషయం. సోమవారం డీఎస్ నామినేషన్కు వీరిద్దరితో పాటు ఏకంగా 13 మంది మంత్రులు, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఆర్పీ నేతలు తరలిరావడం కూడా చిన్న విషయం ఏమీ కాదేమో. ముఖ్యంగా డీఎస్ అభ్యర్థిత్వాన్ని తొలినుంచీ వ్యతిరేకిస్తున్న కిరణ్కు ఈ నిర్ణయంతో అధిష్టానం పెద్ద షాకే ఇచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. డీఎస్ నామినేషన్ పూర్తయ్యేదాకా ముఖ్యమంత్రి ముభావంగానే కన్పించడం కొసమెరుపు.

Comments