తమిళనాడుకూ సకల జనుల సమ్మె సెగ
చెన్నై,అక్టోబర్ 4: తెలంగాణ లో జరుగుతున్న సకల జనుల సమ్మె సెగ తమిళనాడుకు తాకింది. తెలంగాణ నుంచి బొగ్గు, కరెంటు సరఫరా నిలిచిపోవడంతో అక్కడ విద్యుత్ సమస్య తీవ్రమవుతోంది. ఇప్పటికే నగరాల్లో గంటపాటు కరెంటు కోత విధిస్తున్నారు. మరిన్ని కోతలు విధించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో సింగరేణి కార్మికుల సమ్మెతో తమిళనాడులోని నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్కు బొగ్గు సరఫరా కావడం లేదు. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. రామగుండంలోని ఎన్టీపీసీ కేంద్రం నుంచి 1100 మెగా వాట్ల విద్యుత్ తమిళనాడుకు సరఫరా అయ్యేది. సమ్మె నేపథ్యంలో రామగుండం విద్యుత్ కేంద్రానికీ బొగ్గు సరఫరా నిలిచిపోయింది. అక్కడ ఉత్పత్తి తగ్గిపోవడంతో తమిళనాడుకు అందే విద్యుత్ సగానికి సగం తగ్గిపోయింది. మరోవైపు, తెలంగాణ సమ్మె కారణంగా చెన్నై నుంచి హైదరాబాద్కు వెళ్లే బస్సులు కూడా నిలిచిపోయాయి. ప్రైవేట్ బస్సులు ఉన్నా వాటిలో వెళ్లేందుకు ప్రయాణికులు ఇష్టపడడం లేదు. సకల జనుల సమ్మె కారణంగా హైదరాబాద్కు వెళ్లినా రోడ్లపై తిరిగే వీలుండదని భావిస్తున్నారు.
Comments