రెండు నెలల తర్వాత బయటకొచ్చిన సోనియా
న్యూఢిల్లీ,అక్టోబర్ 3: : కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ దాదాపు రెండు నెలల విరామం తర్వాత తొలిసారిగా బయటి ప్రపంచానికి కనిపించారు. జాతిపిత మహాత్మాగాంధీ 142వ జయంతి సందర్భంగా ఆదివారం ఆయన సమాధి రాజ్ఘాట్ వద్ద నిర్వహించిన ప్రార్థనకు ఆమె హాజరయ్యారు. సోనియా అమెరికాలో శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత బహిరంగ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి. రాజ్ఘాట్ వద్ద ఆమె దాదాపు 20 నిమిషాలు గడిపారు. గులాబీ రేకులతో జాతిపిత సమాధి వద్ద పుష్పాంజలి అర్పించారు. తర్వాత కాసేపు కూర్చుని భజనలు విన్నారు.ఏ విధమైన అసౌకర్యాన్నీ ప్రదర్శించలేదు. తర్వాత సోనియా పార్లమెంటు భవనంలో మరో బహిరంగ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్లమెంటు సెంట్రల్ హాల్లో మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అద్వానీ, మన్మోహన్, లోక్సభలో విపక్షనేత సుష్మా స్వరాజ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా అద్వాని, సుష్మా సోనియాను పలకరించారు.

Comments