ఎంపీల నిధులు రూ.5 కోట్లకు పెంపు
న్యూఢిల్లీ,మార్చి 12: పార్లమెంటు సభ్యులకు ప్రతీ సంవత్సరం ఇచ్చే ఎంపీల స్థానిక అభివృద్ధి నిధి (ఎంపీల్యాడ్ ఫండ్-ఎంపీఎల్ఏడీఎఫ్) మొత్తాన్ని రూ. 2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచుతున్నట్లు కెంద్ర ఆర్ధిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రకటించారు. ఆస్పత్రులపై సేవాపన్ను భారం సహా బడ్జెట్లో పేర్కొన్న కొన్ని పన్ను ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సూచనలిచ్చారు. మత్స్యకారులకు, చేపల రైతులకు స్వల్పకాలిక రుణాల వడ్డీపై ఇస్తున్న సబ్సిడీని కొనసాగిస్తున్నట్లు ప్రణబ్ తెలిపారు. వారు సకాలంలో రుణాలు చెల్లించినట్లయితే.. వడ్డీశాతాన్ని మరింత తగ్గిస్తామన్నారు. ఆ నిర్ణయాలతో 20 లక్షల మంది మత్స్యకారులు, చేపల రైతులు లబ్ధి పొందుతారన్నారు. రూ. 500 కోట్లతో మహిళల స్వయం సహాయక బృందాల అభివృద్ధి నిధిని నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2011-12 సంవత్సరం బడ్జెట్పై చర్చకు ఆయన శుక్రవారం లోక్సభలో సమాధానం ఇచ్చారు. విద్య, ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు ప్రభుత్వ ప్రాధామ్యమని, ఆ రంగాల్లో మౌలికవసతుల కల్పనను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందువల్ల విద్యాసంస్థలు, ఆసుపత్రుల మూలధన వాటాలను మౌలిక వసతుల ఉపరంగాలుగా పరిగణిస్తామన్నారు.
Comments