2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై ఏ కమిటీ ముందైనా హాజరవుతా...

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 16: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంపై తాను ఏ కమిటీ ముందైనా హాజరవుతానని, అందుకు తాను భయపడడం లేదని ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ చెప్పారు. తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పిఎసి) ముందు హాజరవుతానని ఇప్పటికే చెప్పానని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెపిసి) ఏర్పాటైతే ఆ కమిటీ ముందు కూడా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. టీవీ చానెళ్ల సంపాదకులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన బుధవారం వివిధ ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 2జి స్పెక్ట్రమ్ కేటాయింపుల బాధ్యత పూర్తిగా టెలికం మాజీ మంత్రి ఏ రాజాదే అని ఆయన చెప్పారు. 2009లో రాజాకు మంత్రి పదవి ఇవ్వడాన్ని వ్యతిరేకించే స్థితిలో తాను లేనని, తాను సంకీర్ణ ధర్మాన్ని పాటించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సంకీర్ణ ధర్మంలో రాజీ పడక తప్పదని ఆయన అన్నారు. ముందొచ్చినవారికి ముందు కేటాయింపులు అనే విధానం తనకు తెలియదని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో అన్ని కోణాల్లో తనకు వివరణ ఇవ్వాలని తాను 2007 నవంబర్‌ 2వ తేదీన తాను రాజాకు లేఖ రాసినట్లు, స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో ఏ విధమైన అవకతవకలు జరగలేదని రాజా జవాబు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ట్రాయ్, టెలికం శాఖ, ఆర్థిక శాఖ అనుమతుల తర్వాతనే 2జి స్పెక్ట్రమ్ వేలాలు జరిగాయని ఆయన చెప్పారు. తాను పిఎసి ముందు హాజరవుతానని ఇప్పటికే బహిరంగంగా చెప్పానని, ఏ కమిటీ ముందైనా హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఎస్ బ్యాండ్ కుంభకోణంపై సమయానుకూలంగా సరైన నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. యాంత్రిక్స్, దేవాస్ ఒప్పందంపై అన్ని ప్రభుత్వ విభాగాల్లో చర్చలు దాదాపుగా పూర్తయ్యాయని, దేశ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు