అమర్ సింగ్, జయప్రదపై బహిష్కరణ వేటు

లక్నో, ఫిభ్రవరి 2: సమాజ్ వాద్ పార్టీ నేత అమర్ సింగ్, ఎంపీ జయప్రదలపై బహిష్కరణ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకుగాను వీరిపై చర్య తీసుకున్నట్లు పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ ప్రకటించారు. వీరితో పాటు అమర్ సింగ్ అనుచరులుగా ముద్రపడిన మరో నలుగురు ఎమ్మెల్యేలు మదన్ చౌహాన్, సందీప్ అగర్వాల్, అశోక్ చందెల్, సర్వేష్ సింగ్ ల ప్రాథమిక సభ్యత్వాలను కూడా రద్దు చేశారు. ములాయం సింగ్ అధ్యక్షతన మంగళవారం ఇక్కడ సమావేశమైన సమాజ్ వాది పార్టీ పార్లమెంటరీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ మీడియాకు తెలిపారు. కాగా, తమను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ములాయం చేసిన ప్రకటనపై అమర్ సింగ్ స్పందిస్తూ, ములాయం తనకు సోదరుడు వంటి వారని, పార్టీ కోసం తాను ఎంతో శ్రమించానని, అందుకు ప్రతిఫలంగానే తనకు ఇలాంటి గౌరవం దక్కిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనను పార్టీ నుంచి బహిష్కరించినప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి మాత్రం రాజీనామా చేసేది లేదని అమర్ సింగ్ స్పష్టం చేశారు. అమర్ సింగ్ ఇప్పటికే ఎస్పీకి రాజీనామా చేశారు. సుమారు నెల రోజులుగా వీరంతా సమాజ్ వాది పార్టీకి వ్యతిరేకంగా వరుసగా ప్రకటనలు చేస్తుండడంతో పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించిందని ప్రధాన కార్యదర్శి మోహన్ సింగ్ తెలిపారు.
Comments