విభజన బాద్యత సొనియాకు అప్పగిద్దాం: జె.సి. ప్రతిపాదన

హైదరాబాడ్,జనవరి 28: రాష్ట్ర విభజనపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధికి అప్పగిస్తూ ఆమెకు ఒక మెమోరాండం సమర్పించాలని మాజీ మంత్రి జె.సి. దివాకరరెడ్డి చేసిన ప్రతిపాదనను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ తీవ్రంగా పరిశీలిస్తున్నారు. రాష్ట్ర విభజన, ప్రస్తుత రూపంలో రాష్ట్రం కొనసాగింపు, హైదరాబాద్ ప్రతిపత్తి, ఇతర సంబంధిత అంశాలపై వాదనలు, ప్రతిపాదనలు, సూచనల మంచి చెడ్డలను ఈ పత్రంలో పిసిసి అధ్యక్షుడు వివరిస్తారు. సోనియా గాంధి తీసుకునే ఏ నిర్ణయానికైనా తామంతా కట్టుబడి ఉంటామనే వాగ్దానంతో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ సంతకాలు చేయవలసి ఉంటుందని కూడా ఈ పత్రం సూచిస్తుంది. శాంతికి భంగం వాటిల్లకుండా చూసేందుకు కాంగ్రెస్ వాదులందరినీ సమైక్యపరచడం, మామూలు కార్యక్రమాలను కొనసాగించడం ఈ కొత్త మెమోరాండం లక్ష్యం. ‘ఈ వ్యవహారాన్ని ఆమె నిర్ణయానికి వదలివేయండి. అధ్యయనం చేసి నిర్ణయం తీసుకోవడానికి ఆమెకు వ్యవధి ఇవ్వండి. మనం అంతా సంఘటితం అవుదాం. ఉద్యమాలు ఏవీ లేకుండా చూద్దాం’ అని దివాకరరెడ్డి సూచించారు. పిసిసి అధ్యక్షుడు ఈ ప్రతిపాదనకు స్పందిస్తూ, ‘ఇది ఎంతో మంచి ప్రతిపాదన’ అని పేర్కొన్నారు. నాయకులందరినీ సంప్రదించి ముందుకు సాగడానికి తనకు వ్యవధి అవసరమని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేసినట్లు దివాకరరెడ్డి తెలియజేశారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు