హైదరాబాద్, ఏప్రిల్ 07 : చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మంగళవారం ఉదయం 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు మట్టుబెట్టారు. ఇటీవల ఎర్రచందనం స్మగ్లింగ్ పెరగడంతో స్మగ్లర్లపై దృష్టిసారించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో శేషాచలం అడవులను ఫారెస్ట్ అధికారులు జల్లెడపడ్డారు. ఈ ఉదయం అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసపడ్డ స్మగ్లర్లను లొంగిపోవాల్సిందిగా పోలీసులు కోరారు. అయితే వారు రాళ్ల వర్షం కురిపిస్తూ పోలీసులపై దాడికి దిగారు. దీంతో ఎదురుకాల్పులు ప్రారంభించిన పోలీసులు 20మంది ఎర్రచందనం స్మగ్లర్లను హతమార్చారు. .
వికారుద్దిన్ సహా ఐదుగురు ఐఎస్ఐ ఉగ్రవాదులు కాల్చివేత
మరోవైపు తెలంగాణ రాష్ట్రం కూడా ఎదురుకాల్పులతో హోరెత్తుతోంది. రెండు రోజుల క్రితం నల్లగొండ జిల్లా అర్వపల్లిలో జరిగిన ఎన్కౌంటర్ను, అంతకుముందు సూర్యాపేటలో పోలీసులపై ఇద్దరు ఉగ్రవాదుల కాల్పుల ఘటనను మర్చిపోకముందే వరంగల్ జిల్లా ఆలేరు వద్ద మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు ఐఎస్ఐ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో మోస్ట్వాంటెడ్ ఉగ్రవాది వికారుద్దీన్ కూడా ఉన్నాడు. పలు కేసులతోపాటు గతేడాది హైదరాబాద్లో ఆరుగురు పోలీసులను హతమార్చిన కేసులో వికారుద్దీన్ నిందితుడు. దోపిడీలతో డబ్బు సంపాదించే వికారుద్దీన్ను ఇటీవలే విశాఖపట్నం జైలు నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కోర్టులో హాజరుపర్చేందుకు హైదరాబాద్ తీసుకొస్తుండగా ఆలేరు దాటి మూడు కిలోమీటర్లు రాగానే టాయిలెట్ వస్తుందని చెప్పి వాహనం ఆపించారు. పోలీసులు వాహనం దిగగానే లోపలున్న నలుగురు ఉగ్రవాదులు కానిస్టేబుల్ వద్దనున్న తుపాకీ లాక్కొని కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఫైర్ ఓపెన్ చేశారు. ఎదురుకాల్పుల తర్వాత వికారుద్దీన్ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
No comments:
Post a Comment