హైదరాబాద్, సెప్టెంబర్ 26 : వచ్చే మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి అవుతుందని ఏపీ మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లెరఘునాథ్రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాయంలో రాజధాని భూసేకరణపై కేబినెట్ సబ్కమిటీ సమావేశమైంది.
అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడుతూ తొలిదశలో సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ, ఉద్యోగుల ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు. రాజధాని కోసం నాలుగు దశల్లో లక్ష ఎకరాల భూమి సేకరిస్తామని, ఆరునెలల్లో భూసేకరణను పూర్తిచేస్తామని తెలిపారు. వి. జి. టి. ఎం. పరిధిలోనే రాజధాని ఉంటుందని మంత్రులు స్పష్టం చేశారు. ఒక ఎకరా అభివృద్ధికి రూ. కోటి ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
భూములు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ఉన్నారన్నారు. భూయాజమానులకు అభివృద్ధి చేసిన భూమిలో 40 శాతం ఇస్తామని, భూములు ఇచ్చేవారికి ఎకరాకు ప్రతి ఏటా రూ.20 వేలు ఇస్తామని మంత్రులు తెలిపారు. వచ్చే నెల 6న మరోసారి రాజధాని కమిటీ భేటీ కానున్నట్లు చెప్పారు. ఆగిరిపల్లి, నూజివీడు రాజధానికి అనువైనదిగా భావించడం లేదని మంత్రులుఅభిప్రాయపడ్డారు.
No comments:
Post a Comment