తెలంగాణాపై బాబు కప్పదాటు లేఖ...
హైదరాబాద్,సెప్టెంబర్ 26: తెలంగాణ అంశంపై ఒక స్పష్టతను ఇస్తానని చెప్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు చివరకు తుస్సుమనిపించారు. తెలంగాణ అంశాన్ని తేల్చటానికి తక్షణం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్కు రాసిన లేఖలో కోరారు. తెలంగాణ విషయంలో రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ తన బాధ్యత నుంచి తప్పించుకుంటున్నదని, 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో చేతులు కలిపి తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేయటానికి పథక రచన చేస్తున్నారని చంద్రబాబు ప్రధానమంత్రికి రాసిన లేఖలో విమర్శించారు. డిసెంబర్ 2009లో కేంద్ర హోంమంత్రి ప్రకటన అనంతర పరిణామాల్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ను వేయగా, డిసెంబర్ 2010లో నివేదిక సమర్పించిందన్న విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. అయితే ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోగా.. కేంద్ర హోంమంత్రి మళ్లీ అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారని పేర్కొన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీయే ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదన్న విషయాన్ని ఇటీవలి కాలంలో స్వయంగా కేంద్ర హోంమంత్రి పార్లమెంట్లో అంగీకరించారని గుర్తుచేశారు.
Comments