అట్టుడికిన విజయనగరం

విజయనగరం,ఏప్రిల్ 23:  మద్యం సిండికేట్లకు వ్యతిరేకంగా టి.డి.పి., ఆ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోటాపోటీ ధర్నాలతో విజయనగరం సోమవారం అట్టుడికింది. ఉద్రిక్తత పరిస్థితుల మధ్య కాంగ్రెస్‌, టిడిపిలు కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించాయి. తొలుత టిడిపికి అనుమతి నిరాకరించిన పోలీసులు చివరకు అనుమతి ఇచ్చారు. కలెక్టరేట్‌ దగ్గర ఉదయం నుంచే పోలీసులను పెద్ద ఎత్తున మొహరించారు. కలెక్టరేట్‌ చుట్టూ ఇనుప కంచె వేశారు. ఒకవైపు టిడిపి, మరోవైపు కాంగ్రెస్‌ ర్యాలీగా బయల్దేరాయి. అయితే ధర్నా సెంటర్‌ వైపు వెళ్లకుండా పోలీస్‌ బ్యారక్‌ వద్ద చంద్రబాబును పోలీసులు నిలువరించారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కార్యకర్తలను పోలీసులు వెనక్కి నెట్టేశారు. మరోవైపు కాంగ్రెస్‌ నేతలు కలెక్టరేట్‌ దగ్గర ధర్నా నిర్వహించారు. తర్వాత టిడిపికి పోలీసులు అనుమతి ఇచ్చారు. దీంతో కలెక్టరేట్‌ సమీపంలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి చంద్రబాబు పూలమాల వేశారు. తర్వాత ధర్నా చేట్టారు. 

Comments