తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో ప్రణబ్ చర్చలు

న్యూఢిల్లీ,నవంబర్ 16: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చలను ప్రారంభించింది.  కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మిత్రపక్షాల నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే ఆయన కరుణానిధి నాయకత్వంలోని డిఎంకె నేత టీఆర్ బాలుతో చర్చలు జరిపినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఎన్సీపి నేత శరద్ పవార్‌తో ఆయన చర్చలు జరిపే అవకాశాలున్నాయి. తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీతో కూడా ఆయన చర్చలు జరుపుతారని అంటున్నారు. పార్టీపరంగా రాష్ట్రానికి చెందిన మూడు ప్రాంతాల నాయకులతో ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ఇప్పటికే చర్చలు పూర్తి చేశారు. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ మిత్ర పక్షాలతోనూ జాతీయ పార్టీలతోనూ చర్చలు జరిపే బాధ్యతను నిర్వహిస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా, రాష్ట్రానికి చెందిన పార్టీలతో చర్చలు జరుపుతారా లేదా అనేది ఇంకా తెలియలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి  అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష నేపథ్యంలో మిత్రపక్షాలను సంప్రదించుకుండానే 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించారు. కాంగ్రెసు ఏకపక్షంగా ప్రకటన చేసిందనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. దాంతో ఇప్పుడు తదుపరి ప్రకటనపై అభ్యంతరాలు రాకుండా మిత్రపక్షాలతో కూడా ప్రణబ్ ముఖర్జీ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు