వైభవంగా వేంకటేశ్వరుని చక్రస్నానం
తిరుమల.అక్టోబర్ 7: కోనేటి రాయుని బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టం శుక్రవారం తెల్లవారుజామున శ్రీ వేంకటేశ్వరుని చక్రస్నానం వైభవంగా ముగిసింది. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, లక్షలాది మంది భక్తజన గోవిందన్మామ స్మరణల మధ్య అత్యంత వేడుకగా శ్రీవారి చక్రస్నానం సాగింది. చక్రస్నానానికి ముందుగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ప్రధాన ఆలయం నుండి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగింపుగా వరహా స్వామి ఆలయం వద్దకు చేర్చారు. సుదర్శన చక్రాన్ని స్వామివారి వెంట ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం వరాహాస్వామి పుష్కరిణి వద్ద వున్న నీటిలో సుదర్శన చక్రానికి పుణ్యస్నానం చేయించారు. ఈ దివ్య ముహూర్తం కోసం వేచివున్న భక్తులు పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. ఈ పుణ్యస్నానాల వలన సర్వరోగాలు, పాపాలు, రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు ప్రగాఢ విశ్వాసం. కాగా రాత్రికి జరిగే ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. చక్రస్నానం వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు.

Comments