అయోధ్య వివాదంపై 30న లక్నో బెంచ్ తీర్పు

లక్నో, సెప్టెంబర్ 28 : అయోధ్య వివాదం తీర్పు ప్రకటనపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్టే కొట్టివేయడంతో, ఆగిపోయిన తీర్పును ఈ నెల 30 వ తేదీన ప్రకటించనున్నట్టు అలహాబాద్ హైకోర్టు లక్నోబెంచ్ మంగళవారంనాడు ప్రకటించింది. గురువారం (30వ తేదీ) సాయంత్రం 3-30 గంటలకు తీర్పు వెలువడనుంది. మంగళవారం అయోధ్య వివాదంపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.హెచ్. కపాడియా నేతృత్వంలో వారం రోజుల క్రితం ఇచ్చిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ సుప్రీమ్ కోర్టు ఆదేశాలు జారీ చేయడం పట్ల అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి.అరవైఏళ్లుగా అపరిష్కతంగా ఉన్న అయోధ్య వివాదంపై తీర్పు వాయిదా వేయడంవల్ల ఒరిగేది ఏమీలేదని హిందూ మహాసభ నేతలు పేర్కొన్నారు. ఎంత త్వరగా తీర్పు వస్తే అంత మంచిదని వారన్నారు. కాగా 30న తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశం అంతటా అప్రమత్తత ప్రకటించింది. తీర్పు ఎలా వచ్చినా అన్ని వర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. అన్ని మతాలవారూ సంయమనం పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను ఇప్పటికే కట్టుదిట్టం చేశారు. ఎవరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా తీవ్రంగా పరిగణిస్తామని కూడా కేంద్రం హెచ్చరించింది. మంగళవారంనాడు అయోధ్యలో బంద్ వాతావరణం నెలకొంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. వ్యాపార సముదాయాలు మూసివేశారు. మరో 48 గంటలు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు