బెంగుళూరు, అక్టోబర్ 7 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు మంగళవారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీంతో అన్నాడిఎంకే కార్యకర్తల ఆశలు అడియాసలయ్యాయి. గత రెండు రోజులుగా అన్నాడిఎంకే నేతలు, కార్యకర్తలు అమ్మకు బెయిల్ రావాలని కోరుతూ పూజలు చేశారు. నాలుగేళ్లు జైలు శిక్ష పడినవారికి కోర్టు ఇప్పటి వరకు బెయిల్ ఇస్తూ వచ్చింది. జయకు కూడా ఈరోజు బెయిల్ వస్తుందని న్యాయనిపుణులు కూడా భావించారు.
సీబీఐ తరఫు ప్రాసిక్యూషన్ లాయర్ కూడా జయలలితకు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడం తమకు అభ్యంతరం లేదని చెప్పారు. అయితే కర్నాటక హైకోర్టు న్యాయమూర్తి బెయిల్ ఇవ్వడానికి తగిన కారణాలు లేవంటూ బెయిల్ నిరాకరించారు.
ప్రాసిక్యూషన్ తరఫున లాయర్ జయకు బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతో ఆమెకు బెయిల్ వచ్చిందని మొదట అందరూ భావించారు. దీంతో తమిళనాడు, కర్నాటకలో అమ్మ అభిమానులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. దేశం మొత్తం మీద టెలివిజన్ ఛానళ్లు కూడా ఇదే విషయాన్ని ప్రసారం చేశాయి. జయ న్యాయవాదులలో ఒకరు హడావుడిగా బయటకు వచ్చి జయకు ఇక బెయిల్ వచ్చేసినట్టేనని చెప్పడంతో అన్ని టీవి ఛానళ్ల ప్రతినిధులు అదే నిజమని నమ్మారు.
No comments:
Post a Comment