Thursday, August 15, 2013

సంకుచిత భావ జాలాలతో సమాజానికి చేటు....ప్రధాని

న్యూఢిల్లీ,ఆగస్టు 15:   భారత్ వంటి ఆధునిక, లౌకిక, ప్రగతిశీల దేశంలో సంకుచిత భావజాలాలకు, విద్వేషపూరిత విధానాలకు తావులేదని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. అటువంటి ధోరణులు సమాజాన్ని విభజించి ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయన్నారు. చారిత్రక ఎర్రకోట నుంచి గురువారం చేసిన 67వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 81 కోట్ల మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఆహార భద్రత పథకం త్వరలో పార్లమెంటు ఆమోదం పొందుతుందని ధీమా వెలిబుచ్చారు. వాయువేగంతో అభివృద్ధి సాధించనిదే పేదరిక నిర్మూలన, అందరికీ నాణ్యమైన విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి లక్ష్యాలను సాధించలేమన్నారు.  ''పొరుగు దేశాలన్నింటితోనూ మేం స్నేహమే కోరుతున్నాం. అయితే పాకిస్థాన్ వైపు నుంచి పెరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడాల్సిందే. అలాంటి కార్యకలాపాలను పాక్ అరికట్టినప్పుడే ఆ దేశంతో సంబంధాలు మెరుగుపడేందుకు ఆస్కారముంటుంది. నియంత్రణ రేఖ వద్ద ఇటీవల భారత జవాన్లను కాల్చి చంపిన వంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటాం'' అని ప్రధాని అన్నారు.  వచ్చే 12 నెలల్లో 10 లక్షల మంది యువతీయువకులకు నైపుణ్య శిక్షణ ఇచ్చే కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభిస్తాం. నూతన నైపుణ్యాలను అలవర్చుకున్న వారికి రూ.10 వేల గ్రాంట్ అందజేస్తాం. త్వరలో మరిన్ని రంగాల్లోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తాం. యూపీఏ పాలనలో దేశం ఎంతో ప్రగతి సాధించింది. వర్తక, వాణిజ్యాలకు అనువైన వాతావరణం కల్పించాం. పారదర్శకతకు పెద్దపీట వేసి, అవినీతిని అరికట్టేందుకు సమాచార హక్కు చట్టం తెచ్చాం.అని చెప్పారు. ఎనిమిది కొత్త విమానాశ్రయాలు, రెండు కొత్త నౌకాశ్రయాలు, పారిశ్రామిక కారిడార్లతో సహా పలు మౌలికాభివృద్ధి ప్రాజెక్టులు అతి త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఇవి దేశ ప్రగతికి తోడ్పడటమే గాక ఎంతోమందికి ఉపాధి కల్పించగలవు.  దేశ ఆర్థిక రంగంలో నెలకొన్న మందగమనం ఎక్కువ కాలం ఉండదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. గత తొమ్మిదేళ్లలో మనం సగటున 7.9 శాతం సాధించిన ఆర్థిక వృద్ధిరేటే మన సామర్థ్యం ఏమిటో తెలియజేస్తోంది. 2012-13లో నమోదైన ఈ దశాబ్దిలోకెల్లా కనిష్ట వృద్ధి రేటు 5 శాతాన్ని మెరుగుపరుచుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు సాధించగలమని ఆశిస్తున్నామని మన్మోహన్ తెలిపారు. కాగా,   మన్మోహన్‌సింగ్ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం   వరుసగా పదోసారి. తద్వారా నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబానికి వెలుపల ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి ప్రధానిగా మన్మోహన్ నిలిచారు. నెహ్రూ, ఇందిరాగాంధీలు ఎర్రకోటపై పదిసార్లకు మించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. నెహ్రూ వరుసగా 17 సార్లు పతాకావిష్కరణ చేయగా, ఇందిరకు ఈ గౌరవం 16 సార్లు దక్కింది.


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...