తెలంగాణలో మొదలైన చంద్రబాబు పాదయాత్ర...
హైదరాబాద్, అక్టోబర్ 22: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టిన వస్తున్నా... మీకోసం పాదయాత్ర సోమవారం తెలంగాణలోకి అడుగుపెట్టింది. జిల్లాలోని రాజోలీలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తమ పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. తమ పార్టీ పాలనలోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని, ఈ విషయంపై తాము ఎవరితోనైనా చర్చకు సిద్ధమని అన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది తమ పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావేనని చంద్రబాబు చెప్పారు. తెలంగాణకు కేంద్రమే పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. సామాజిక న్యాయానికి తాను కట్టుబడి ఉన్నానని, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో మాదిగలకు అండగా ఉంటానని చెప్పారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ, మలి సంతకం మద్యం గొలుసు దుకాణాల రద్దు ఫైళ్ల మీదనే అని చెప్పారు. సబ్సిడీపై 10 వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని చెపూకొచ్చారు.
Comments